Wednesday, November 30, 2011

Chapter 8 Part 1

అధ్యాయము 8 
దత్తావతారముల వర్ణనము - భాగము 1 
బ్రహ్మజ్ఞానము కొరకు తపించువారు బ్రాహ్మణులే

ఆ మరునాడు తిరుమలదాసు అనుష్ఠానము పూర్తీ చేసుకొనిన తదుపరి యిట్లు చెప్పనారంభించెను. "నాయనా! శంకరభట్టూ! ఆత్మ సాక్షాత్కారమగునపుడు పదహారు కళలూ తమతమ భూతములలోనికి చేరిపోవును. ఆయా దేవతాశక్తులు మూలభూతమైన తమ చైతన్యములోనికి ప్రవేశించును. ఆత్మజ్ఞానము, కర్మలు అన్నియునూ బ్రహ్మస్వరూపములో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించువాడు ఎవరైననూ బ్రాహ్మణుడే యగును. 'ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములు, లోకములలోని నానావిధమైన నామములు' అనువాటిని పదహారు కళలని అందురు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశకళా పరిపూర్ణ పరబ్రహ్మావతారము.

ఆహారమే మనస్సగును. సాత్విక ఆహారము వలన మనోనైర్మల్యము ఏర్పడును.

విధాత ముందుగా ప్రాణమును సృష్టించెను. ప్రాణమనునది విశ్వములోని సమస్తప్రాణము. సూక్షాత్మ, హిరణ్యగర్భ నామములతో యిది పిలువబడుచున్నది. సృష్టికర్తకు కూడా హిరణ్యగర్భయను నామమున్నది. మానవునియోక్క భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధములైన మూర్తిత్వములలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరమునకే శక్తిశరీరమని పేరు. ప్రాణమయచైతన్యమును సరి చేయుట ద్వారా భౌతికసంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమగును. ఆ తదుపరి మాత్రమె స్థూలదేహము రోగగ్రస్తమగును. సృష్టి ప్రేరణలో విశ్వాసము ఏర్పడిన తరువాత పంచభూతములేర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములేర్పడినవి. వీటిని సంధానపరిచి ఏకకాలములో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయములో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారము యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది. మనస్సు ఆహారముచే బలోపేతమైన యెడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచనాస్రవంతి క్రమబద్ధము చేసి, నియంత్రణలో ఉంచినయెడల ఆలోచనా ప్రతిబింబరూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. యజ్ఞ యాగాది క్రతువులను యధావిధి నాచారించుచూ, ఆయా కర్మకలాపములలో పధ్ధతి ప్రకారము మంత్రములను ఆలాపించిన యెడల అది కర్మ అని పిలువబడును. కర్మలను బట్టియే ప్రపంచ నిర్మాణము జరిగినది. నామరూపములు లేకుండగా ప్రపంచముండజాలదు. ఈ విధముగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంకెల పదహారు రంగులతో ఏర్పడినది. మనలోని ఒక్కొక్క యింద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితమౌతుంది. సమాధి స్థితిలో ఉన్నయోగికి ఆత్మా సాక్షాత్కారమైనపుడు పదహారు కళలూ తమ తమ భూతములలో లీనమౌతాయి. యోగి యొక్క భౌతిక శరీరమండలి యింద్రియములలోని శక్తులు విశ్వాంతరాళం లోని భూతములలో లీనమౌతాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలనాచరించకుండా ఉండలేరు.

అహం నశించనిదే మోక్షం కలుగదు

మనిషిలోని అహం యొక్క ప్రేరణ వలననే కర్మలు ఆచరించబడతాయి. అహం అనునది మనస్సు బుద్ధి అను వాటియొక్క నియమ నిబంధనలచేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి. ఆత్మసాక్షాతారం పొందిన యోగికి పూర్వ జన్మలలోని కర్మఫలములు ఏమీ మిగలవు. అహం యొక్క ఏర్పాటి ధోరణి పూర్తిగా నశించనిదే ఆత్మసాక్షాత్కారము జరుగదు. అందువలన యోగికి ఆత్మసాక్షాత్కారమైనపుడు శ్రుతికర్మలు, వాటి ప్రతిఫలములు, అహం యొక్క కేంద్రము, దానియొక్క మాయాజాలములన్నియునూ శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడగుచున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు, వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుచున్నాడు. అతని స్థూలదేహము కర్మఫలములను అనుభవించుచున్నను యోగికి స్థూలదేహ స్పృహ లేనపుడు ముక్తావస్థలోనే యుండును. పరమాత్మ సిద్దావస్థలోనున్న యోగి ద్వారా కూడా తన దివ్య లీలను ప్రకటించవచ్చును. యోగికి యీ శక్తి సామర్థ్యములు తనకే ఉన్నవని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగము చేయును. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు, యోగి యొక్క అహంకారము పరమాత్మలో లయమయిపోవలెను. 

శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రములోని శ్రీ మల్లిఖార్జునలింగములోనికి, గోకర్ణములోని మహాబలేశ్వర లింగములోనికి, మరికొన్ని దివ్య స్థలములలోనికి, సూర్యమండలము నుండి శక్తి పాతమును చేసియున్నారు. స్వయంభూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతము జరిగినది. అగ్ని సంబంధమైన యీ శక్తికి శాంతి జరుపవలెను. లేనియెడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా, అర్చనలు జరుపువారు అందరునూ శిక్షింపబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తుని లోనికి సూర్యమండలము నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతర జ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలమునందు శక్తిపాతము శ్రీబాపనార్యుల ఆధ్వర్యములో వేలాది మంది ప్రజలసమక్షములో జరిగినది. సూర్యమండలము నుండి తేజస్సు వెలువడి అందరూ చూచుచుండగానే మల్లిఖార్జునలింగమునందు లీనమైనది. అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు యీ శక్తిపాతమునకునూ అత్యంత గోపనీయమైన దైవరహస్యము కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయము, తెలుసుకొనదగిన విషయము. శ్రీశైలములో శాంతి జరిగినది. వేలాదిమందికి అన్నదానము జరుగుట వలన జఠరాగ్ని శాంతింపబడినది. శక్తి ఉగ్రతత్వమును వీడి శాంత తత్వములో నిలచినపుడు సర్వశుభములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును.

అయితే పీఠికాపురములోని శ్రీ స్వయంభూదత్తునిలో జరిగిన శక్తిపాతమునకు కంటికి కనిపించే నిదర్శనములు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు. శ్రీ బాపనార్యులు శాంతి జరుగవలెనని అన్నదానము జరుగవలెనని సూచించిననూ, అచ్చటి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను త్రోసిపుచ్చిరి.

(ఇంకా ఉంది..)         



అధ్యాయము 7 భాగము 5

అధ్యాయము 7 
ఖగోళముల వర్ణనము - భాగము 5 


లోకనివాసులు, లోకాధిపతులు, ఖండముల వివరణ 

వితలమునందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి, యితడే బ్రహ్మాండమునకు కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తరదిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలము నందలి అలకాపురమునందు యితడుండును.

అదే వితలమునందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినీపురమున మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసురులకు ఆకాశములో చాల ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు.

సుతలములోని వైవస్వతపురమును యమధర్మరాజు పరిపాలించుచుండును. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరణి అని అందురు. పున్యవంతులకు సులభముగా దాట వీలు కలుగును. పాపాత్ములకు కడుంగడు కష్టతరము. 

రాసాతలమునందు పుణ్యనగరమనునది కలదు. దానికి నిఋతి అను దైత్యుడు అధిపతి. ఇతడు నైఋతి దిక్కునకు అధిపతి. తలాతలము నందలి ధనిష్ఠాన పురమున పిశాచ గణములతో కూడి భేతాళుడుండును. మహాతలములో కైలాస నగరములో సర్వభూత గణములతో కాత్యాయనీ పతియైన ఈశానుడు కలదు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. 

పాతాళమునందు వైకుంఠనగరము కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళాసురులతోను, వాసుకి మొదలయిన సర్పశ్రేష్ఠులతోనూ, శేషశాయియై విరాజిల్లుతున్నాడు. దీనినే శ్వేతద్వీపగతమైన కార్యవైకుంఠము అని అందురు.

ఆఖరిదైన పాతాళ లోకము నందు త్రిఖండ సోపానము కలదు. ప్రథమ ఖండమందు అనంగ జీవులుందురు. ద్వితీయ ఖండము నందు ప్రేత గణములుందురు. తృతీయఖండము నందు యాతనా దేహమును పొందియున్న జీవులు దుఃఖాక్రాంతులై ఉందురు.

సప్తసముద్రములును, సప్తద్వీపములును, మహాభూమి యందు కలవు. దాని మధ్య నుండునది జంబూద్వీపము. ఇది తొమ్మిది ఖండములుగా విభజించబడియున్నది. దక్షిణము నందున్న దానికి భారత ఖండమని పేరు. దీనిలో భరతపురము నందు స్వాయంభువమనువు ఉండును. అనేకులైన పుణ్య జీవులు, ఋషులు స్వాయంభువమనువు పరిపాలనలో ఉందురు. వారు లోకములను పరిపాలించుచు ధర్మాధర్మములను పాలించుచుందురు. మహాభూమి మీద నుండు సప్తద్వీపములను చుట్టుకొని చరాచర, చక్రవాళ, లోకాలోక పర్వతములనునవి స్వర్గలోకము వరకు వ్యాపించి యుండును. ఇవి ఎంత మాత్రము వెలుతురును తన గుండా ప్రసరింపనీయని పొరలు.

మహాభూమికి దిగువన ఏడు అధోలోకములు కలవు. వీటినే సప్తపాతాళములని అందురు. అతలలోకమనునది పిశాచాములకు నివాసము. వితలలోకము నందలి అలకాపురిలో కుబేరుడుండును. వితలలోకమునండలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతలమునందు బలి చక్రవర్తి తన పరిజనులయిన రాక్షసులతో నివసించును. వైవస్వతపురము నందు యమధర్మరాజుండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలను పొందుదురు. రాసాతలములోని పుణ్యపురమనునది నైఋతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలమునందలి ధనిష్ఠాపురములో భేతాళుడుండును. తలాతలము నందలి కైలాసపురములో రుద్రుడుండును. మహాతలమనునది పితృదేవతలకు నివాసము. పాతాళము నందు శ్వేతద్వీపవైకుంఠము కలదు. దీనిలో నారాయణుడుండును. మేరువునంటి పెట్టుకొన్న అధోభాగమందు అనంగజీవులు, ప్రేత గణములు, యాతనాదేహములు ఉందురు. నిరాలంబ సూచ్య గ్రహ స్తానమను దానిలో మహాపాతకులుందురు. భోజనానంతరము 'రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్దినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్ఠతి' అని ఉత్తరాపోశనలోఉదాకప్రదానము వీరికే చేయబడుచున్నది. 

లోకముల పేర్లు, వాటి విస్తీర్ణతల వివరణ 

భూలోకమునందు గల భూగోళము, మహాభూమి వేరువేరు అని చక్కగా గ్రహింపుము. భూగోళ బిందువుకి ఉపరి ప్రదేశమున ఊర్ధ్వ ధ్రువ స్థానము వరకు గల ప్రదేశములో మేరురేఖయందు ప్రకాశించునది సూర్యలోకము. ఇది సూర్యదేవత ఉండులోకము. సూర్యగ్రహమండలము ఎంతమాత్రమూ కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారకలోకము, బుధ లోకము, గురులోకము, శుక్రలోకము, శనైశ్చరలోకము, రాశ్యధిదేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్త ఋషి లోకము, ఊర్ధ్వ ధ్రువ లోకము అనునవి కలవు. ఇవేకాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు.

భూమధ్య బిందువు నుండి సూర్యలోకము లక్ష బ్రహ్మాండ యోజనములలో కలదు. ఇది సూర్యగ్రహాది దేవతయయిన సూర్యుడుండు లోకము. భూమధ్య బిందువు నుండి చంద్రలోకము రెండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, అంగారక గ్రహము మూడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, బుధలోకము అయిదు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, గురులోకము ఏడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శుక్రలోకము తొమ్మిది లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శనిలోకము పదకొండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, రాశ్యధిదేవతా లోకము పన్నెండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, నక్షత్ర దేవతా లోకము పదమూడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, సప్తర్షి లోకము పదునాల్గు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, ద్రువలోకము పదునైదు బ్రహ్మాండ యోజనములలోను కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములయిన దూరములలో స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్యబిందువు నుండి బ్రహ్మాండమును చుట్టిన గోడ అనగా అండభిత్తి వరకు 24 కోట్ల 50 లక్షల బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25 కోట్ల 50 లక్షల బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూలోక, భువర్లోక, సువర్లోకములు ప్రళయకాలమందు నశించును. సువర్లోకమునకు పైన మహర్లోకము కొంత నశించి కొంత నిలచియుండును. ఆ పైన నుండు జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమున గాని నశింపవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములును మరియు అండభిత్తి వరకు.

దత్తుడు అనగా ఎవరు?

నరసావధానులు తాతా! నీకు అనుభవములోనికి రావలెనన్న కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటానుకోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించి యుండి దానిని అతిక్రమించియున్న ఏకైక తేజోమహారాశియే దత్తుడని తెలియుము. ఆ దత్త ప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియుము.

శ్రీచరణుల హితబోధను విన్న నరసావధానులును, అతని భార్యయును నిర్ఘాంతపోయిరి. ఏడాది వయస్సు ఉన్న ఈ పసికందు యింతటి మహత్తర విషయములను సాధికారముగా చెప్పుటయునూ, తానే సాక్షాత్తు దత్తుడనని తెలియజేయుటచే నరసావధానులును, అతని భార్యయు వెక్కి వెక్కి ఏడువసాగిరి. కనీసము ఆ దివ్య శిశువు శ్రీచరణములు స్ప్రుశించగోరిరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానులు దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయిరి.

శ్రీపాదుల వారు "నేను దత్తుడను. కోటానుకోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించియున్న ఏకైక తత్త్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడను. దిగంబరుడను. ఎవరయితే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబరా! శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా! నరసింహ సరస్వతి దిగంబరా! అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మ రూపములో సదా ఉందును. మా మాతామహులయిన శ్రీ బాపనార్యులు పరదేశము నుండివచ్చి పాదగయా క్షేత్రము నందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించు కొనువారికి ఉచితముగా భోజన, వసతి సౌకర్యములు కలిగించు చుండగా, నీ స్వయంభూదత్తుడేడి? అదృశ్యమాయెనుగా? అని ఆక్షేపించితివి. ఆ దత్తుడను నేనే! నేను జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయువారు తప్పక పవిత్రులగుదురు. వారి పితృదేవతలకు పుణ్య లోకములు ప్రాప్తించును. బ్రతికి యుండిన జీవులనే కాక చచ్చిన జీవులయొక్క యోగక్షేమములను చూడవలసిన ప్రభువును నేను. నాకు చావుపుట్టుకలు రెండునూ సమానమే! అయిననూ నీవు స్వయంభూదత్తుని ఆరాధించిన దానికి ఫలితము ఇదా? అని వ్యధ చెందుచున్నావు. నీ మీద పడిన అపవాదు పోవునటుల స్వయంభూదత్తుడు త్వరలోనే కన్పించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్దాయమిచ్చితిని. దత్త ధ్యానములో నుండుము. మరుజన్మమున కటాక్షించెదనని అభయమిచ్చుచున్నాను. ఈ జన్మమున నా పాదుకలను స్పర్శచేసేంతటి మహాపుణ్యము నీకు లేనేలేదు. కోటానుకోట్ల బ్రహ్మాండమును సృజించి, రక్షించి, లయము చేయు ఏకైక ప్రభువునైన నేను నా వరద హస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను." అని పలికిరి. మహాభాయంకర శబ్దముతో శ్రీ చరణుల శరీరమునందలి అణుపరమాణువులు విఘటనము చెంది, శ్రీపాదులు అదృశ్యులయిరి.

నాయనా! శంకరభట్టూ! శ్రీపాదులు స్వయముగా తమ నామము చివర దిగంబర నామమును చేర్చి జపించుటలోని మర్మమును యీ రకముగా తెలియజేసిరి. వారు సర్వ వ్యాపకతత్త్వము. నిరాకారమైన ఆ తత్త్వము సాకారముగా ఎట్లు ఆవిర్భవించునో మన ఊహకందని విషయము. పసిబాలకరూపమున కపట వేషమును ధరించి వచ్చిన ఆ జగత్ప్రభువు పసితనము నుండియూ చేయు లీలలకు అంతమెక్కడ ?

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము-7 సమాప్తం) 

Tuesday, November 29, 2011

అధ్యాయము 7 భాగము 4

అధ్యాయము 7 
ఖగోళముల వర్ణనము - భాగము 4 

సృష్ట్యాది యందు సమస్తమునూ జలములో నిండి యుండెను. ప్రజాపతి సృష్టి చేయదలచి తపమొనరించగా నీటి మీద  పుష్కరపర్ణము దర్శనీయమాయెను. ప్రజాపతి వరాహరూపమును పొందినవాడై పుష్కర పర్ణ సమీపమున మునగగా దిగువన ఉన్న మహాభూమిని పొండినవాడాయెను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కోరలచే కొట్టి వేరుచేసి నీటి పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తును పుష్కరపర్ణము నందుంచగా తదుపరి అది పృథివీ నామము పొందెను. తాతా! దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళము మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరము కలదు. మహాభూమి అనునది 50 కోట్ల యోజన విస్తీర్ణము కలిగి యున్నది. జంబూ ద్వీపమనునది మహాభూమియందే కలదు. దానిలో నవఖండములు ఉన్నవి. దైవఖండము నందు దేవతలు నివసిన్చేదారు. గాభాస్త్య ఖండము నందు భూతములుండెదరు. పురుషఖండము నందు కిన్నెరులు, భరతఖండము నందు మానవులు, శరభఖండము నందు సిద్ధులు, గాంధర్వ ఖండము నందు గంధర్వులు, తామర ఖండము నందు రాక్షసులు, శేరుఖండము నందు యక్షులు, ఇందు ఖండము నందు పన్నగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూద్వీపమునకు దక్షిణముగా నున్న భరత ఖండములోని భరతపురమున వైవస్వతమనువు, భూ ఋషులతోడను, మానవుల తోడను కొలువుదీరి యుండును. మహాభూమి మీద జంబూద్వీపమున్నటులనే భూగోళము మీద కూడా జంబూ ద్వీపము కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీ పీఠికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమి మీద వచ్చినది. మహాభూమి మీద నున్న జంబూ ద్వీపము లక్ష బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణము కలిగియున్నది. జంబూద్వీపమునందలి భారత ఖండమున మాత్రమీ వైవస్వతమనువు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులయిన వారు ఉన్నారు. మహాభూమి యందలి జంబూద్వీపమున శీతోష్ణాదులు హెచ్చుగానుండక ఆహ్లాదకరముగా నుండును. నీరెండ వంటి సదా వెల్తురుండును గాని పగలురాత్రి అను భేదము లేకుండా ఉందును. మహాభూమి యందలి జంబూద్వీపము లక్ష యోజన విస్తీర్ణము కలదు. లవణ సముద్రము లక్ష యోజనములు, ప్లక్ష ద్వీపము రెండు లక్షల యోజనములు, ఇక్షుర సముద్రము రెండు లక్షల యోజనములు, కుశ ద్వీపము నాలుగు లక్షల యోజనములు, సురాస సముద్రము నాలుగు లక్షల యోజనములు, క్రౌంచ ద్వీపము ఎనిమిది లక్షల యోజనములు, సర్పిస సముద్రము ఎనిమిది లక్షల యోజనములు, శాక ద్వీపము పదహారు లక్షల యోజనములు, దధిస సముద్రము పదహారు లక్షల యోజనములు, శాల్మలీ ద్వీపము ముప్పదిరెండు లక్షల యోజనములు, క్షీర సముద్రము 32 లక్షల యోజనములు, పుష్కర ద్వీపము 64 లక్షల యోజనములు, శుద్ధ జల సముద్రము 64 లక్షల యోజనములు, చాలాచాల పర్వతము 128 లక్షల యోజనములు, చక్రవాళ పర్వతము 256 లక్షల యోజనములు, లోకాలోక పర్వతము 512 లక్షల యోజనములు, తమోభూమి 1250 లక్షల యోజనములు విస్తీర్ణము కలిగి యుండును. లోకాలోక పర్వతమును దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలులేదు. అందువలన లోకాలోక పర్వతమునకును అండభిత్తికిని నడుమనుండేది ప్రదేశము ఎల్లప్పుడునూ చీకటితో కూడి యుండును. అండభిత్తి అనునది కోటి యోజనముల మందము కలిగి యుండును. వరాహావతారము గాని, నరసింహావతారము గాని భూమి పట్టేంతటి అవతారములు కావు. వరాహమనగా సూకరము కాదు. ఖడ్గ మృగము. ఒకే కోర కలిగినది.

ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాధిదేవతల వివరణ 

మహాభూమి యందలి జంబూ ద్వీపమును స్వాయంభువ మనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతని ఏడుగురు కుమారులు ఏడు ద్వీపములకు అధిపతులయిరి. ప్లక్ష ద్వీపమును మేధాతిధి, శాల్మల ద్వీపమును వపుష్మంతుడు, కుశాద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచ ద్వీపమును ద్యుతిమంతుడు, శాకద్వీపమును హవ్యుడు, పుష్కర ద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్ష ద్వీపమునందలి చాతుర్వర్ణములు ఆర్యక, కురర, విందక, భావిన అనునవి. వారికి చంద్రాకృతిలో నుండు విష్ణువు ఆరాధ్యదైవము. శాల్మల ద్వీపమునందు కపిలవర్ణ, చారణక వర్ణ , పీతవర్ణ, కృష్ణవర్ణ అను నాలుగు వర్ణములు వారుందురు. వారు విష్ణు ఆరాధకులు, కుశ ద్వీపమునందు దమి, శుష్మిణ, స్నేహ, మందేహ, అను నాలుగు వర్ణముల వారుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచ ద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణముల వారుందురు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాక ద్వీపము నందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందురు. వారు సూర్య భగవానుని ఆరాధించెదరు. పుష్కర ద్వీపమునందు మాత్రము చాతుర్వర్ణములు లేవు. అందరును దేవతల వలె రోగములు గాని, శోకములు గాని లేకుండా ఆనందముగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళము నందలి జంబూ ద్వీపములో భారతవర్షము, కింపురుష వర్షము, హరివర్శము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, భద్రాశ్వ వర్షము, రమ్యక వర్షము, హిరణ్యాక వర్షము, కురువర్శము అనునవి కలవు. తాతా! మహాభూమియందు ఖండవిభాగములు గల జంబూ ద్వీపమున్నటులనే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూ ద్వీపము కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకువలె మిర్రుగా నుండును. దీనినే భూమండలమని పిలచెదరు. భూగోళము మాత్రము నిమ్మపండు వలె నుండును. మహాభూమి మేరు రేఖను చుట్టి బ్రహ్మాండము యొక్క అండభిత్తి వరకు వ్యాపించి యుండును. భూగోళము మాత్రము జ్యోతిశ్చక్ర సమమధ్యమందు నిలచియున్నది. మహాభూమియందు నడిమధ్యన గల మేరురేఖను చుట్టుకొని జంబూ ద్వీపమున్నది. దానిని చుట్టి సప్త సముద్ర ద్వీపాదులున్నవి. భూగోళము నందలి ఉత్తరార్ధ గోళము దేవభాగమని, దక్షిణార్ధ గోళమును అసురభాగమని అందురు. మహాభూమి యందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యముగా ప్రకాశించుచున్నది. జీవులను పరిపాలించెడి మనువులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులయిన జీవులకు స్థానము. మహాభూమి యందు చుట్టూ చేరియుండే చక్రవాళ పర్వతాగ్రము  నందు జ్యోతిశ్చక్రము అమర్చబడి యున్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగా నున్నది. సప్తకక్ష్యావృతమైన జ్యోతిశ్చక్రము దీనికి ప్రతి దినమును ఒక ప్రదక్షిణము చేయుచున్నది. మహాభూమి యందు శీత, వాతాతపములు అల్పములు. సదా పగలుగా నుండి చీకటి అనునది లేక కాలవ్యత్యాసము లేక యుండును. భూగోళము నందు దీనికి వ్యతిరిక్తముగా నున్నవి. మహాభూమి అనునది పుణ్య ఫలానుభవమున మాత్రమీ పొందదగినది. స్థూల శరీరములో పొందరానిది, భూగోళము పుణ్యము సంపాదించుకొనుటకు తగిన కర్మభూమి. స్థూల శరీరులు ఉండవలసిన భూమి. మహాభూమి మీద మను ప్రళయము తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళము మీద యుగ ప్రళయములు, మహా యుగ ప్రళయములు, మను ప్రళయములు జరుగుచుండును.

మహాభూమిని ధాత్రి, విధాత్రి అను పేర్లతో పిలిచెదరు. భూగోళమును మహీ, ఉర్వి, క్షితి, పృథ్వి, భూమి అని పిలిచెదరు. తాతా! పాతాళలోకముల గురించి చెప్పుచున్నాను వినుము. అతలము నందు పిశాచ గణములు, వితలమునందు గుహ్యకులు, సుతలమునందు రాక్షసులు, రసాతలము నందు భూతములు, తలాతలము నందు యక్షులు, మహాతలము నందు పితృదేవతలు, పాతాళము నందు పన్నగులు ఉందురు.


(ఇంకా ఉంది..)    

Friday, November 25, 2011

అధ్యాయము 7 భాగము 3

అధ్యాయము 7
ఖగోళముల వర్ణనము - భాగము 3
శ్రీపాదుల వారు భక్తులకు యిచ్చు అభయము

నా విషయమునకే వచ్చినచో, పెద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు నాకు యీయలేకపోతివి. నన్ను భుజింపచేసిన యెడల లక్షమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినంత పుణ్యము నీకు లభించి యుండెడిది. నీవు ఎంతో అదృష్టము పోగొట్టుకున్నావు. ఏది ధర్మమూ, ఏది అధర్మము అనునది చర్చనీయాంశమైనపుడు శాస్త్రము నాశ్రయించవలసినదే! అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా? లేదా? అను మీమాంస వచ్చినపుడు నిర్మలాంతః కరుణులు నిర్ణయించినదియే శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మసమ్మతమగును. వారు అధర్మమున తీర్పు చెబుదామనుకొన్నను ధర్మదేవత వారిని చెడు మార్గము లోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చెప్పించును. హింస చేయుట పాపమని నీ శాస్త్రము చెప్పుచున్నది. శ్రీ కృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మ యుద్ధమైనదని, కౌరవపాండవ సంగ్రామము ధర్మ యుద్ధమని అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతి గాంచినది కదా! యజ్ఞము పుణ్య ఫలప్రదమే! కాని, పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది. వానికి మేక తల అమర్చ బడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ, ఉసిరికాయ అనువాటితో వైద్యము చేయును. శరీరభాగము కుళ్ళినపుడు కత్తిపుచ్చుకుని నరికి వైద్యము చేయును. నేను కూడా అంతే! నాలో దేవతల అంశలే కాక రాక్షసాంశలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా, పిశాచాముగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించెదను. అయితే నాలో అంతర్గతముగా జీవుల యెడల ప్రేమ పొంగి ప్రవహించుచుండును. మీ స్వభావములను బట్టి, మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉందును. సర్వశ్య శరణాగతి చెందినా భక్తులను నేను చేయి విడువను. దూరతీరముల నున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనను రప్పించెదను. ఋషుల యొక్క మూలమును, నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్యపరాశక్తి కన్యకాపరమేశ్వరిగా వైశ్యకులములో ఆవిర్భవించలేదా? సిద్ధమునులలో వైశ్యమునులు లేరా ? బ్రహ్మ, క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్ఠలను పాటించునెడల వేదోక్త ఉపనయనమునకు అర్హులే! ఉపనయనము వలన మూడోకన్ను విచ్చుకోవలెను. అంతః కరణము పరిశుద్ధమై బ్రహ్మ జ్ఞానమునందు మనస్సు లగ్నమవవలెను. నీ మనస్సు శాక జ్ఞానమందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమనునది అంగట్లో దొరికే వస్తువనుకొంతివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరుజన్మమున ఛండాలుడుగా పుట్టవచ్చును. ఈ జన్మమున ఛండాలుడుగా ఉన్నవాడు మరుజన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మపదార్థము కులమతములకు, దేశకాలములకు అతీతమను రహస్యమును గుర్తెరుగుము. దైవము భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు మాత్రము కాదు. నీ భావమును బట్టి దైవము పని చేయుచుండును. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను. దర్బారు చేయుచూ భక్తుల యోగక్షేమములు విచారించుచూ, వారిని అనుగ్రహించునపుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికీ, ఆ జీవి చేయు పాప పుణ్య కర్మములను బట్టి, వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమునూ నా వద్ద యున్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత యివ్వవలసినది లెక్క చూసుకొనునపుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను, కష్టములను నా శరీరము మీదకి ఆకర్షించుకొని వారికి సుఖ శాంతులను కలుగజేయుట వలన సేవాధర్మము నెరపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయునపుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది.

ప్రశ్న : శ్రీపాదా! క్షమించవలసినది. నేను అజ్ఞానిని. నీవు దత్త ప్రభువువే! సర్వజీవులకు ఆశ్రయము నీవే! అసలు యీ సృష్టి ఏ విధముగా ఏర్పదినదో తెలియజేసి నన్ను కృతార్ధుడిని  చేయవలసినది.

లోకాలోక వర్ణన

ఉత్తరం : తాతా! స్వర్గము నందు 88 వేల మంది గృహస్థమునులు కలరు. వారు పునరావృత్తి ధర్మమూ కలవారు. ధర్మమును తిరిగి ప్రచారము చేయు నిమిత్తము బీజ భూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తము గా ఉండెను. పరమాత్మ తేజమువలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములేర్పడెను. ఆ అండములలో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండియుండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వము నొంది అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయెను. ఆ అండమును తన తెజోమహిమచే ప్రకాశింప జేసినందున హిరణ్యగర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని, అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడెను. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవితృకాఠక చాయనమును భరద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండముల నిండియున్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవితృకాఠక చయనము చేయబడినది. సత్యలోకముననువైన నిరామయ స్తానమను యుక్త స్థానమున్నది. త్రిఖండ సోపానములో వసురుద్రాదిత్యులని పిలువబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందురు. కారణ బ్రహ్మలోకము అనునది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియూ మూలప్రకృతి స్థానమనియూ పేరుగాంచిన శ్రీనగరము ఆపైన నున్నది. దానికి పైభాగమున మహాకైలాసమును, ఆపైన కారణ వైకుంఠమును కలవు. సత్యలోకములో పురాణపురమనునది విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతీపురము నందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతీపురము నందు సనకసనందనాది ఋషులు ఉందురు. మహర్లోకములోజ్యోతిష్మతీ పురము నందు సిద్ధాదులుందురు. సువర్లోకమని పిలువబడు స్వర్గలోకములో అమరావతీ పురమునందు దేవేంద్రాది దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో రధంతర పురమందు విశ్వకర్మ అను దేవశిల్పి గలదు. తాతా! భూలోకమందు రెండు భాగములు కలవు. మానవులు నివసించు దానిని భూగోళమని అందురు. ఇది గాక మహాభూమి అనునది మరియొకటి కలదు. ఇది భూగోళమునాకు అయిదు కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణముగా నున్నది. మర్త్యలోకమనగా భూలోక, భువర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియే యున్నది. పాతాళమనగా అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళములనునవి. స్థూలముగా వీటిని స్వర్గ మర్త్య పాతాళములని అందురు.

మనము నివసించెడి ఈ భూగోళమునకు దిగువనున్న మహాభూమి అనునది మధ్య భాగము నందు మిర్రుగా నుండి చక్రాకారముగా నున్నది. అందువలన ఉపరిభాగమునందు సూర్య చంద్రుల ప్రకాశము నిరంతరము ప్రకాశించుచున్నది. సదా వెలుతురూ ఉండుటచే అచ్చట కాల నిర్ణయము లేదు. ఈ మహాభూమి మీదనే సప్త సముద్రములును, సప్తద్వీపములును కలవు. జమ్బూద్వీపమనునది దీనియందే కలదు. భూలోకము, భువర్లోకము రెండును చేరి మర్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకము నందు మహాభూమి అనియు, భూగోళమనియు రెండు విధములు కలవు.

(ఇంకా ఉంది..)  

అధ్యాయము 7 భాగము 2

అధ్యాయము 7 
ఖగోళముల వర్ణనము - భాగము 2 
నరసావధానులకు, వారి పూజామందిరమందున్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ - నరసావధానులకు శ్రీపాదుల వారి ఉపదేశములు.

ప్రశ్న : నీవెవరవు? దేవతవా? యక్షుడవా? మాంత్రికుడవా? 

ఉత్తరం : నేను నేనే! పంచభూతాత్మకమైన యీ సృష్టిలోని ప్రతీ అణువణువునందునూ అంతర్లీనముగా నున్న ఆద్యశక్తిని నేనే!పశుపక్ష్యాదులు లగాయితూ సమస్త ప్రాణికోటి యండుననూ మాతృస్వరూపముగాను, పితృస్వరూపముగానూ ఉన్నది కూడా నేనే! సమస్త సృష్టికిని గురుస్వరూపము కూడా నేనే!

ప్రశ్న : అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా?

ఉత్తరం : నిస్సంశయముగా నేను దత్తుడనే! మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించటానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడనై వచ్చితిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణుడను. 

ప్రశ్న : అయితే నీకు ఆకారమూ లేదు, గునములూ లేవు. అంతేకదా!

ఉత్తరం : ఆకారము లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే! గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే! సాకార, నిరాకారములకు, సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను, వాటికి అతీతుడను కూడా!

ప్రశ్న : అన్నీ నీవే అయినపుడు జీవులకు కష్ట సుఖములు ఎందుకు?

ఉత్తరం : నీలో, నీవూ నేనూ కూడ ఉన్నాము. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు. నీలో ఉన్న నేను మాత్రము పరమాత్మను. నీకు కర్తృత్వ భావన ఉన్నంతవరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖదుఃఖములు, పాప పుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలోవున్న 'నీవు' క్షీణదశకు వచ్చి నీలో ఉన్న 'నేను' ఉచ్ఛ దశను అందుకొన్నప్పుడు మాత్రమే నీవు దగ్గరయ్యెదవు. నాకు దగ్గరయ్యే కొలదీ నీ బాధ్యతా తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు. 

ప్రశ్న : జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితమన వచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజాము?

ఉత్తరం : నీవు వేరుగాను, నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమి లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరమూ ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును. సమస్తమునూ, నా అనుగ్రహము వలననే కలుగుచున్నదనియూ, నీవు కేవలము నిమిత్తమాత్రమైన తత్త్వమని తెలుసుకొనిన యెడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహము క్షయము నోన్డుతయే మోక్షము గనుక నీవు ద్వైతస్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచున్నపుడు, నీలోని అహంకారము నశిన్చినపుడు, నీలోని మోహము క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీకు ఆనందము సిద్ధించును. మొహములేదు గనుక ఇది కూడ మోక్షమే. నీలోని అహంకారము పూర్తిగా నశించి, కర్తృత్వ భావన సంపూర్తిగా దహింపబడినపుడు 'నీవు' అనునది మిగులక 'నేను' అనునది మాత్రమే ఉందును గనుక మనస్సుచేత ఎంతమాత్రమూ తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నుందువు. కావున అద్వైతస్థితి లో నున్ననూ నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతములో నున్ననూ, విశిష్టాద్వైతములో నున్ననూ, అద్వైతములో నున్ననూ బ్రహ్మానంద స్థితి మాత్రము ఒక్కటే! అది మనస్సునకు వాక్కునకు అందరానిది. కేవలము అనుభవైకవేద్యము మాత్రమే.

ప్రశ్న : అవధూత స్థితిలో నున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచున్డురు గదా! మరి నీవు కూడా అవధూతవా?

ఉత్తరం : కాదు. నేను అవధూతను కాదు. నేను బ్రహ్మము, మరియు బ్రహ్మమే సర్వస్వమూ అనునది అవధూత అనుభవము. కాని నేను బ్రహ్మము. నేనే సర్వస్వమూ అనియెడి స్థితి నాది.

ప్రశ్న : అయిన యీ స్వల్పభేదములోని రహస్యము నాకు అవగతము కాలేదు.

ఉత్తరం : సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగుచు, బ్రహ్మానంద స్థితి ననుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము లేనపుడు సంకల్పము లేదు. యీ సృష్టి యొక్క మహాసంకల్పములో, మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులనియెడి మాయాశక్తి రూపములో కూడా నేనున్నాను. నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించినయెడల జన్మకు రావలసినదే! సంకల్పముతో కూడిన సత్య జ్ఞానానందరూపము నాది, సంకల్పము నశించిన సత్య జ్ఞానానందరూపము వారిది.

ప్రశ్న : విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా! బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానయినపుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము?

ఉత్తరం : వేయించిన విత్తనములు మొలకెత్తక పోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములనే మొలకెత్తింపజేయుట సృష్టి కర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతరణమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్యనిరూపణ చేయుటకు గదా గతములో ఏర్పడినది.

ప్రశ్న : దత్తప్రభూ! శ్రీపాదా! వివరించవలసినది.

ఉత్తరం:  భూత, భవిష్యవర్తమానములు, అవస్థాత్రయము, సృష్టి స్థితి లయము మొదలయిన త్రయములనన్నింటిని అతిక్రమించి నాన్నగారు అత్రి మహర్షిగా ప్రఖ్యాతులయిరి. సృష్టి యందలి ఏ జీవియండును, ఏ పదార్తమునండునూ అసూయాద్వేషములు లేశమాత్రమూ లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతి గడించినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారముగాను, అతీతముగాను ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపమును దర్శించవలెనని అత్రిమహర్షి ఘోర తపస్సు చేసిరి. ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి యందలి ప్రతీ ప్రాణినీ, ప్రతీ పదార్ధమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించ వలసినదిగా అనసూయా మాత తపమాచరించినది. కర్మ సూత్రముననుసారించి జీవులకు సుఖదుఃఖములు కలుగుచుండును గనుక మహాపాపముల ఫలితములు స్వల్పముగా కలుగునట్లునూ, స్వల్ప పుణ్యములకు మహా ఫలితములు కలుగవలెననెడి సత్సంకల్పములో అనసూయామాత ప్రార్థన చేసెడిది. కఠినమైన లోహముచే చేయబడిన శనగల ఆకారమున నున్న లోహపు ముక్కలను తన తపోబలముచే జీవంతములైన, తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజము సంపూర్ణ నిద్రా స్థితిలోనున్న చైతన్యము. వృక్షములు, వృక్ష సంబంధ పదార్థములు అర్ధ నిద్రా స్థితిలోనున్న చైతన్యము, జంతువులూ పూర్ణ చైతన్యములో నున్న స్థితి. ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి, తరువాత తరుగుల్మాదులుగా జనించి, ఆ తదుపరి జంతుజన్మలనెత్తి, ఆఖరున మానవజన్మ నెత్తిన మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలోని నిద్రాణ స్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొలిపి మోక్షమునొందవలెను. ప్రకృతిలోనున్న పరిణామక్రమము యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయ వచ్చుననునది అమ్మ నిరూపించినది. త్రిమూర్తుల రూపములో నున్న చైతన్యము జాగృతావస్థలో నున్నది. గనుక దానిని నిద్రావస్థ లోనికి మార్చి ఆ ఆకారములను పసిబిడ్డల రూపములోనికి మార్చివేసినది. త్రిమాతల శక్తులు ఏకమై అనఘాదేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడుగా జనించి అనఘాదేవిని అర్ధాంగిగా స్వీకరించుట జరిగినది. శ్రీపాద శ్రీవల్లభ అవతారమునందు నా వామభాగమున అనఘాదేవియు, కుడి భాగమున దత్తాత్రేయుడు గలిగిన అర్ధనారీశ్వర రూపమున జనిన్చితిని. ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారముగా సృజించిన ప్రభువునకు సృష్టి ధర్మములను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్ధ్యములుండునని నీవు గ్రహించవలెను.

ప్రశ్న : శ్రీపాదా! సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యమును పోగొట్టలేవా?

ఉత్తరం : తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరుజన్మకు వాయిదా వేయుచున్నాను. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్య బాధను పొందిన తరువాత మాత్రమే! తోటకూర విషయము చాలా చిన్న విషయము. అయిననూ నీవు దానియందు ఎంత మోహమును పెంచుకొన్నావు? అమ్మగాని, నాన్నగారుగాని, తాతగారు గాని ఎవరినీ ఏమియూ యాచించి అడుగరు. పసిపిల్లవాడినయిన నేను ఎంతటి ఆహారమును తీసుకొందును? నేను మనసుపదినపుడు నీవు తోటకూరను వెంటనే యిచ్చి ఉండవలసినది. ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనస్సులోని మాలిన్యములు హరించుటకు ఈ జీవితకాలము చాలదు. ప్రతీ మానవునికిని పుణ్యఫల రూపముగా ఆయువు, ఐశ్వర్యం, అందము, ప్రఖ్యాతి మొదలయినవి సిద్ధించును. పాపఫలరూపముగా అల్పాయువు, దారిద్ర్యము, అనాకారితనము, కుఖ్యాతి మొదలయినవి సిద్ధించును. నీ పుణ్యఫలములో ఎక్కువ భాగము తీసి నీకు ఆయుర్దాయమును పోసితిని. నీ పుణ్యభాగము చాలా ఖర్చయినది. పాపభాగము ఎక్కువ మిగిలినది. నీవు దరిద్రమును అనుభవించియే తీరవలెను. అయినను, నీవు స్వయంభూదత్తుని ఆరాధించితివి గనుక నీకు ఐశ్వర్యము లేకపోయినను, అవస్థ పడకుండా రెండుపూటలా అన్నము లభించునట్లు అనుగ్రహించుచున్నాను.

ప్రశ్న : శ్రీపాదా! వర్ణ వ్యవస్థ ప్రకారము నడచుకొనవలెనని శాస్త్రము చెప్పుచున్నది గదా! మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తముగా ఉపనయనము చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పుకాదా?

ఉత్తరం : సత్యఋషీశ్వరుల నిర్నయములో దోషము నెంచుట వలన నీ నాలుకను కోసి పారవేయవలెను. తాతగారు ఎవరనుకొంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యులవారు. విష్ణుదత్తుడు, సుశీల అను దంపతులు స్వార్థమనునది ఏమిటో ఎరుగని పరమపవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింప జేయవలసినదని కాల కర్మ దేవతలను నేను ఆదేశించితిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నృశింహ స్వామికి పరమభాక్తులు. సింహాచలంబునందు జరిగిన యజ్ఞయాగాదులలో విశేషమైన అన్నదానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమపద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఆ మూడు కుటుంబములతోను నాకు గల ఋణానుబంధము ఒక జన్మలో తీరెడిది కాదు. ఒక అవతారములో పరిసమాప్తమగునది కూడకాదు. నా వరద హస్తము తరతరములవరకు వారి మీద నుండును. నా యొక్క ఛత్రఛాయలో వారు నిశ్చింతగా నుందురు. 

(ఇంకా ఉంది.. )         

Tuesday, November 22, 2011

అధ్యాయము 7 భాగము 1

అధ్యాయము 7 
ఖగోళముల వర్ణనము - భాగము 1 
శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ

ఉదయముననే తిరుమలదాసు తన అనుష్ఠానమును ముగించుకుని యిట్లు చెప్పసాగెను. "నాయనా! శంకరభట్టూ! శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రము అమృతము. అశృతము. అపూర్వము. అతర్క్యము. నీ యందు శ్రీపాద శ్రీవల్లభుల వారికి అపారమైన అనుగ్రహము ఉన్నందువలననే వారి చరితమును గ్రంథస్థము చేయు భాగ్యము నీకు కలిగినది. మహా పండితులకు కూడా అలభ్యమైన ఈ మహా భాగ్యము నీకు లభ్యమగుట కేవలము శ్రీవారి సంకల్పమే."

శ్రీపాదులు ఒకే సమయములో అనేక స్థలములందు దర్శనమొసంగుట

నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తదుపరి అతనిలోని ఆకర్షణశక్తి క్షీణించెను. అతడు గతములో ధ్యానములో కూర్చొని ఏ మనుష్యుని అయిననూ ధ్యానించినచో ఆ మనుష్యుడు ఎంత దూరములో నున్నను అచ్చటనుండి బయలుదేరి నరసావదానుల కడకు వచ్చితీరేవాడు. ఆ శక్తి యిపుడు క్షీణించెను. గతములో అతనిని చూచి భయపడినవారు, ప్రశంసలతో ముంచెత్తినవారు యిపుడు అతనికి ఏ మాత్రము భయపడుటలేదు. అవసరమని తోచిన యెడల విమర్శలతో అతనిని బాధించుచుండిరి. అతని ఆర్ధిక స్థితి కూడా క్షీణించ సాగెను. రెండు పూటలా భోజనము లభించు వనరులు కూడా క్షీణించసాగెను. తన దుస్థితికి విలపించుచు అతడు వీధిలోనికి వచ్చెను. శ్రీ బాపన్నావధానులు గారు, తమ మనుమని ఎత్తుకుని తమ గృహమునకు పోవుచుండిరి. రాజశర్మగారింటి నుండి ఒక వీధి మలుపు తిరిగిన బాపనార్యుల యింటికి పోవు వీధి వచ్చును. శ్రీచరణులు తమ యింటివద్ద కంటే తాత గారి యింతివద్దనే ఎక్కువ కాలక్షేపము చేయుచుండెడివారు. శ్రీ నరసింహవర్మ గారింతికిని, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠిగారింటికిని, యథేచ్చగా పోవుచుండెడివారు. నరసావధానులు శ్రీపాడులవారితో మాట్లాడవలెనని తలచెను. ముద్దుల మూటగట్టు ఆ దివ్య శిశువును ఒక్కసారి ఎత్తుకుని ముద్దాడ వలెనని వానికి తోచెను. నరసావధానులు బాపనార్యులతో పాటు అటు పోవుచున్న శ్రీవల్లభుల వారిని చూచెను. నరసావదానుల వంక శ్రీవల్లభులు చూచి చిరునవ్వు నవ్విరి.ఆ చిరునవ్వు సమ్మోహకముగా నుండెను. తదుపరి నరసావధానులు వెచ్చములు తీసుకొనదలచి శ్రేష్ఠి యింటికి పోయెను. అచ్చట శ్రీపాదవల్లభులు శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి ఒడిలో నుండెను. శ్రీపాదులు నరసావధనులు వంక దృష్టి సారించి విలాసముగా నవ్విరి. నరసావధానుల వెచ్చములు తీసుకొని యింటికి వచ్చి, అచ్చటనుండి నరసింహవర్మ గారింటికి పోయెను. ఆ సమయమున శ్రీ వర్మగారింట్లో శ్రీవల్లభులు వర్మగారి భుజములపై నెక్కి కూర్చొని యుండుటను చూచిరి. శ్రీవల్లభులు నరసావధానులను చూచి విలాసముగా నవ్విరి. ఈ విధముగా ఒకే సమయములో శ్రీ వల్లభులు మాతామహుల యింటను, వర్మగారింటను, శ్రేష్ఠిగారింటను ఉండుటను గమనించిరి. ఇది కలయా? వైష్ణవమాయయా? అని నరసావధానులు మీమాంసలో పడెను.

ఊరిలోని జనులు తనను పరిపరి విధములుగా ఆడిపోసుకొనుచుండిరి. పాదగయా క్షేత్రములోని స్వయంభూ దత్తుని విగ్రహము మాయమగుటకు తానే కారణమని నిందించుచుండిరి. గంయములేని యాత్రికుని వలె నరసావధానులు వీధుల వెంట తిరుగాడెను. పిచ్చివాని వలె యింటికి చేరెను. నరసావధానులు భార్య పిచ్చివాని వలె నున్న తన భర్తను చూచి మిగుల దుఃఖించెను. తన బాధను వెళ్ల గ్రక్కుకొనుటకు పూజా మందిరమునకు వెళ్ళెను. ఆమె చూచిన దృశ్యము ఆశ్చర్యకరము. వారి పూజామందిరములో శ్రీపాద శ్రీవల్లభులుండిరి. ఆ భార్యాభర్తల ఆనందమునకు అంతు లేకుండెను. తోటకూర వండి అన్నము పెట్టేదామని శ్రీపాదుల వారిని వారు ఎన్తూ బ్రతిమలాడిరి. అందులకు శ్రీపాదుల వారు ఒప్పుకొనలేదు. కాల కర్మ కారణములు ఒకేసారి కలసివచ్చినపుడు అలభ్యయోగము కలుగుచుండును. వివేకి అయినవాడు దానిని గుర్తించి లబ్ధి పొందును. అవివేకి దానిని గుర్తించక నష్టపోవును. ఎట్టకేలకు శ్రీపాదులు వారి యింట భోజనము చేయుటకు అంగీకరించిరి. అయితే అది ఈ జన్మమున మాత్రము కాదు. మరుజన్మములో వారు శ్రీ నృసింహసరస్వతి నామమున పుణ్యభూమి  మహారాష్ట్రము లో జన్మిన్చేదమనియూ, అప్పుడు తప్పక వారింటికి వచ్చి తోటకూరతో వండిన భోజనమును స్వీకరిన్చేదననియూ వాగ్దానము చేసెను. శ్రీ గణేశ చతుర్థిన అవతరించిన తనలోని గణేశ అంశతో గజానన నామమున ఒకానొక మహాత్ముడు కొన్ని శతాబ్దముల తదుపరి తన జన్మస్థానమునకు దగ్గరలోనే జన్మించునని వారు తెలిపిరి. సూర్య చంద్రాదుల గతులను మార్చుట అయిననూ సాధ్యము కావచ్చునేమో గాని, ఎత్తి పరిస్థితులలోనూ శ్రీపాదుల వారి వాగ్దానములను మార్చుట ఎవరికినీ సాధ్యము కాదు. వారి ఆదేశములను అనుసరించియే పంచభూతములతోసహా సృష్టియండలి సమస్త జీవులునూ వ్యవహరించవలసి యుండును. వాగ్దానా పరిపాలనము నందు వారు ధృడవ్రతులు, సత్యవ్రతులు, జగములు కదలిననూ, యుగములు మారిననూ వారి లీలలు మాత్రము నిత్య సత్యములుగను, అత్యంత నవీనముగాను యుండును. ఆ పూజా మందిరములో నున్న శ్రీపాదులు వారు నరసావదానులకును, అతని ధర్మపత్నికిని హితోపదేషములు చేసిరి. ఈ హితోపదేషములు దత్త భక్తులన్దరకునూ ఎంతో ప్రయోజనకరమైనవి. నరసావధానులకును, శ్రీవల్లభుల వారికిని ఈ ప్రకారముగా సంభాషణ జరిగినది.

(ఇంకా ఉంది..)            

Monday, November 21, 2011

అధ్యాయము-6 భాగము-8

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 8 

పీఠికాపురము నందలి జనులు యీ సంఘటనను రకరకములుగా వ్యాఖ్యానించిరి. నరసావదాన్లు యింట చేయబడిన గారెలలో విషము పొరబాటున చేరినదనియూ, భోక్తల అదృష్టము వలన వారు రక్షించ బడిరనియూ, అయితే గోవు మాత్రము విష ప్రభావమున మరణించెననియూ, నరసావదానులకు గోహత్యా పాతకము కూడా చుట్టుకొనుననియూ వ్యాఖ్యానించసాగిరి. ఇటువంటి వ్యాఖ్యలు నరసావదానులకు చాలా బాధను కలిగించుచుండెను. గోవు శ్రీపాదునికి ప్రదక్షిణము చేసి మరణించుట వలన శ్రీచరణులు అసాధారణమైన దైవాంశ కలవారని చాలా మంది భావించసాగిరి. రాజశర్మకు కొంత ఆయుర్వేద వైద్యములో ప్రవేశముండుట వలన నరసావధానులు కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యము చేయుచుండెను. రాజశర్మ నరసావధానులు యింటికి పోవునపుడల్లా శ్రీపాదులు కూడా తన తండ్రితో వెళ్ళుచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడయిననూ నరసావధానులు ఆరోగ్యము కుదుట పడలేదు సరిగదా మరింత క్షీణించెను. ఒక రోజున నరసావధానులు మరణించెను. 

పీఠికాపురములో వదంతులు, పుకార్లు, వక్రభాష్యములు, అసత్యమును సత్యముగాను, సత్యమును అసత్యముగాను నిరూపించు ప్రయత్నములు మెండుగానుండెడివి. రాజశర్మ సదుద్దేశ్యముతో వైద్యము చేసెను. అయితే అతని ప్రయత్నము సఫలము కాలేదు. జనన మరణములు దైవాధీనములు గదా! నరసావధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్ర ప్రయోగమున మరణించెనని కొందరు తలపోసిరి. మరి కొందరు నరసావధానులు వారియండున్న ద్వేషము కొలది రాజశర్మ అతనికి సరి అయిన వైద్యము చేయలేదనియూ, మరియొక వైద్యునిచే వైద్యము చేయించిన బ్రతికి యుండెడి వాడనియూ తలపోసిరి. మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారమని భావించుట అవివేకమనియూ, ప్రతీరోజూ శ్రీవల్లభులు నరసావధానుల యింటికి వెళ్ళుచున్ననూ వారు మరణించుట వలన శ్రీపాదుడు కూడా సాధారణ బాలకుడే అనియూ భావించిరి. విషప్రయోగమున గోవు మరణించుట వలన నరసావధానులు కూడా గోహత్యా మహాపాతకము వలన మరణించెననియూ, ఆ యింటిలో మరికొన్ని శవములు శ్మశానమునకు చేరవలసి యుండుననియూ, గోహత్యా పాతక నివారనమునకు బ్రాహ్మణులకు భూరి దానధర్మములను చేయించవలెననియూ, బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానమీయవలెననియూ, ఒక మండలము మహా శాంతి హోమములు జరిపి ప్రతిరోజూ ఆ మండల కాలమంతయునూ బ్రాహ్మణ సమారాధానము చేయవలెననియూ తీర్మానించిరి. పైన చెప్పిన కార్యక్రమములను జరిపించుటకు నరసావధానుల యావదాస్థిని తెగనమ్మవలసివచ్చును. ఇది కూడా కుటుంబ సభ్యులకు ఆశనిపాతము వంటి విషయము.

నరసావధానుల శవమును దహన క్రియల కొరకు శ్మశానమునకు కొంపోవసాగిరి. రాజశర్మ శ్రీపాదులు, బాపనార్యులు అందరునూ నరసావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించిరి. నరసావధానుల భార్య శ్రీపాదుల వారి చేతులను పట్టుకొని, "నాయనా! చిటికెడు పసుపుకుంకుమల కోసం ఎంత దూరమయిననూ పేరంటమునకు వెళ్ళెడి దానను. నీవు దత్తుడవే అయినచో, మీ నరసన్న తాతను బ్రతికించుట అసాధ్యమా?" అని విలపించెను. అమృత హృదయులైన శ్రీపాదులు తమ దివ్య హస్తములతో ఆమె కన్నీరును తుడిచి మౌనముగా నుండిరి. శవయాత్ర ప్రారంభమాయెను. రాజశర్మ, శ్రీపాదులు, బాపనార్యులు అందరూ శవయాత్రలో పాల్గొనిరి. నరసావధానుల పెద్ద కొడుకు చితికి నిప్పు అంటించు ప్రయత్నములో నుండెను. శ్రీపాదుల వారి కండ్ల నుండి రెండు కన్నీటి బొట్లు రాలెను. మేఘ గర్జన స్వరముతో శ్రీపాదులు యిట్లనిరి. "ఆహా! చచ్చిన తండ్రికి కొరివి పెట్టు కొడుకును చూచితిని గాని బ్రతికియున్న తండ్రికి కొరివి పెట్టు కొడుకును చూడలేదు." అంతట అందరునూ నిశ్చేష్టులయి చూచుచుండిరి. శ్రీపాదులు మెల్లగా చితిపై నున్న నరసావధానుల భ్రూమధ్యమును తన బొటన వ్రేలితో తాకి తిరిగి తమ భ్రూ మధ్యమును తాకిరి. నరసావధానులుకు చైతన్యము రాసాగెను. శవయాత్రకు తన శవముతో కలిసివచ్చిన  వారందరితోటి నరసావధానులు శోభాయాత్రగా యింటికి తిరిగివచ్చెను. శ్రీపాదులు అతని భ్రూమధ్యమును తాకుట వలన అతనికి కర్మసూత్రము యొక్క సూక్ష్మంశము అవగతము కాసాగెను. తన యింటనున్న గొడ్డుఆవు తన తల్లియని వారికి బోధపడెను. తన యింట్లో పడియున్న ముసలి ఎద్దు తన తండ్రియని తెలిసెను. వారిద్దరూ తన నాయనమ్మను తాతను ముసలితనములో సరిగా చూడని కారణమున యీ రకమైన హీనజన్మ నొంది తనకు ఊడిగము చేసిన విషయము బోధపడెను. మరణావస్థ లో నున్న గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరమును గ్రోలవలసినందని ప్రార్థించినట్లును మరు జన్మములో గొడ్డు ఆవుగా జన్మించినపుడు నీ క్షీరము గ్రోలెదనని శ్రీపాదులు అభయమిచ్చినట్లును అతనికి స్పష్టముగా గోచరమాయెను. తనకు తాంత్రిక ప్రయోగము చేసిన తాంత్రికుడు కొలది కాలములోనే మరణించు నట్లును, మరు జన్మమున అతడు బ్రహ్మరాక్షసుడు కాగా సన్యాసి వేషమున నున్న శ్రీచరణులు అతనిని అనుగ్రహించినట్లును, సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించ సాగెను. తను కూడా మరుజన్మమున సన్యాసి వేషముననున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహించాబడి విశేష ఐశ్వర్యముతో కూడియున్నట్లును, తన యింట శ్రీచరణులు తోటకూరతో వండిన వంటకములను భుజించి, తన స్వహస్తాములతో తోటకూరను పీకిపారవేసి బంగారు నాణెములతో నిండిన బిందెలను ప్రసాదిన్చినట్లును అతడు భవిష్యత్తును స్పష్టముగా చూచెను.

శ్రీచరణుల లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలతో పోల్చదగినవి వేరొకటి కానరావు.

శ్రీవల్లభుల వారు నరసావదానులకు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశమును, వారిని అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియజేసెదను. ఈ రోజున మనము శ్రీపాద శ్రీవల్లభ స్మరణ చేయుచూ కొంతసేపు భజన కార్యక్రమములలో గడిపేదము గాక. వారి నామస్మరణ జరుగుచోట శ్రీచరణులు సూక్ష్మరూపమున సంచరించెదరు. ఇది అక్షర సత్యము.

తిరుమలదాసు వంటి సద్భాక్తునితో సాంగత్యము లభించినందులకు నేను అమందానందముతో పరవశించితిని.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము-6 సమాప్తం)      
    

Thursday, November 17, 2011

అధ్యాయము-6 భాగము-7

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 7 

శ్రీపాదుల వారి జన్మదినమైన గణేశ చతుర్థినాడు రాజశర్మ సతీసమేతముగా శ్రీ చరణులను తీసుకొని బాపనార్యుల యింటికి వెళ్ళెను. శ్రీ బాపనార్యులు శ్రీ వల్లభుల వారి పాదపద్మములను పరిశీలించి శుభ లక్షణములను దర్శించ యత్నించునపుడెల్ల వారి కండ్లకు మిరుమిట్లు గొలుపు కాంతులు మాత్రమే దర్శనము యిచ్చుచుండెను. శ్రీ మహావిష్ణువునాకున్న శుభ లక్షణములను వారు దర్శించలేక పోఎదివారు. యిది వారికి ఆశ్చర్యకరముగా నుండెను. ఆ రోజు ఉషఃకాలమున బియ్యమును దంచిన తవుడునందు దివ్య పాదముద్రలను చూచి బాపనార్యులు తన కుమార్తె అయిన సుమతిని పిలిచి, "అమ్మా! ఈ మార్గమున ఎవ్వరు వెళ్లినారని అడిగెను." అంతట సుమతి "ఇంకెవరు? మీ ముద్దుల మనుమడే యిటు వెళ్ళినాడు." అని సమాధానము చెప్పెను. ఆ కాలిముద్రలు సుమారు 16 సంవత్సరములు బాలుని కాలిముద్రలుగా తోచెను. తాతగారు శ్రీ వల్లభుని తన ఒడిలోనికి తీసుకొని వారి శ్రీ చరణములను పరిశీలించిరి. ఇదివరకు కనులకు మిరుమిట్లుగొలుపు కాంతులు యిప్పుడు కానరాలేదు. సుస్పష్టముగా తను స్వయముగా దత్తావతారమని సూచించు శుభ లక్షణములు వారికి దర్శనీయమాఎను. వారు శ్రీపాదుల వారి దివ్య శ్రీ చరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్త  ప్రభువని నిర్ణయించుకొనెను. అపుడు బాపనార్యుల వారి నోటివెంట అప్రయత్నముగా కొన్ని పదములు ఉచ్ఛరించబడినవి. వాటికి చందోబద్ధత గాని, వ్యాకరణ దోషరాహిత్యము గాని ఉండనవసరము లేదు.

తాతగారి కనుల వెంట కారు కన్నీరును శ్రీపాదులు మౌనముగా తుడిచెను. కొంతసేపటికి శ్రీపాడులవారు యిట్లనిరి. "తాతా! నీవు శ్రీశైలము నందు సూర్యమండలము నుండి శక్తిపాతము చేసి మల్లిఖార్జున శివలింగాములోనికి ఆకర్షించితివి. అదే సమయమున సూర్యమండలము నుండి శక్తి గోకర్ణము నందలి మహాబలేశ్వరుని లోనికిని, పాదగయా క్షేత్రములోని స్వయంభూ దత్తునిలోనికిని ఆకర్షించబడినది. నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతము చేయదలచితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని (పరమేశ్వరుని ఆత్మా లింగము) లోనికి లయము చేసికొని, శుభ స్పందనలను ఆశ్రితులకు అందింపచేయుట నా సంకల్పము. అదే విధముగా దర్శనమాత్రముననే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లిఖార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలచితిని. నీవు సత్యఋషివి. యతిరూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయుటవలన నేను అల్పాయుష్కుడను కాజాలనని తీర్మానించితివి. శ్రీపాద శ్రీవల్లభ రూపమున నున్న నాకు అమ్మ పాదనమస్కారము చేయుటవలన నేను అల్పాయుష్కుడనయ్యెదనని నేను వక్కాణించితిని. మన యిద్దరి వాక్కులకును వ్యాఘాతము కలుగకుండా నేను 16 సంవత్సరముల పర్యంతము మాత్రమే మీ యింత నుండదలచితిని. సంసార బంధములనుండి విముక్తిని పొందగోరు ముముక్షువులను అనుగ్రహించవలెను. నేను చిరంజీవిగా నుండవలెనన్నది నీ సంకల్పము గనుక దానిని తప్పక తీర్చెదను. శ్రీపాద శ్రీవల్లభ నామమున వ్యవహరించు యీ దివ్య మంగళ స్వరూపము గుప్తము గావించబడును. నృసింహ సరస్వతిగా అవతరించిననూ, శ్రీపాద శ్రీవల్లభ రూపమున మాత్రము నిత్య సత్యరూపముగా నిలిచి యుండును. నృసింహ సరస్వతినై అవతరించి, శ్రీశైలమున కదళీ వనమందు 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనై అచ్చటనున్న వటవృక్షములో నాయొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లిఖార్జున శివలింగాము నందు విలీనమయ్యెదను."

బాపనార్యులకు యిదంతయునూ ఆశ్చర్యముగను, అద్భుతముగను తోచెను. తాతగారి యింట గణేశ చతుర్థినాడు శ్రీపాదుల ప్రథమ జన్మదినోత్సవము మహావైభవముగా జరిగెను.

పీఠికాపురములో ఆరోజు మరియొక వింత జరిగెను. ఉషః కాలమున నరసావధానులుగారును, పూజారియును, మరికొందరును శ్రీ కుక్కుటేశ్వరాలయ సందర్శనమునకు వెళ్ళినపుడు అచట స్వయంభూ దత్తుని విగ్రహము లేదు. విగ్రహము మాయమయిన విషయము ఊరంతయునూ దావానలము వలె వ్యాపించెను. నరసావధానుల యందు ఈర్ష్య కలిగిన తాంత్రికుడొకడు విగ్రహము మాయమగుట నరసావధానులు పనియేననియూ, నరసావధానులు క్షుద్ర విద్యలను ఉపాసించుచుండెననియూ, అతడే ఈ విగ్రహమును మాయము చేసెననియూ ప్రచారము చేయదొడగెను. అంతట పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసావధానులు యింటిని క్షుణ్ణముగా పరిశీలన చేయవలెనని తీర్మానించిరి, బాపనార్యులను యీ విషయమై ప్రశ్నించగా నిజము నిలకడ మీద గాని తేలదనియూ, ప్రస్తుతము మౌనముగా నుండుట భావ్యమని తాను తలచుచున్నాననియూ, సమయము వచ్చినపుడు మాట్లాడెదననియూ తెలియజేసెను. నరసావధానులు ఇంటిలో తవ్వకములను జరుపగా మానవ కపాలములు, క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయల్పడెను. నరసావధానులు నిర్దోషి అయిననూ, అతడు క్షుద్ర విద్యా ఉపాసకుడని ముద్ర పడెను. రోజు రోజుకు అతని ఆరోగ్యము క్షీనించు చుండెను. అతని యింటిలో ఒక గొడ్డుమోతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలె భావించి వ్యవసాయం పనులకు వాడుచుండిరి. నరసావధానులు దానికి మేత సరిగా పెట్టడాయెను. తాంత్రికుడు ఆ గోవు నందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టెను. అది ఒకనాడు కట్లు తెంచుకుని భీకరాకారముగా యింటిలోని వారిని పొడిచి తన యజమాని ఎన్తూ ప్రేమగా పెంచుకొను తోటకూర తోటను ధ్వంసం చేసెను. దానిని తాడుతో బంధించుట ఎవరి తరమూ కాదాయెను. ఆ రోజున నరసావధానులు తల్లి యొక్క అబ్దీకము. ఇంటిలో గారెలు, మరి కొన్ని భక్ష్యములు సమృద్ధిగా చేయబడెను. నరసావధానులు యింటిలో వంటపాకలో నున్న భక్ష్యములను, గారెలను ఆ ఆవు తినివేసెను. అప్పటికే భోక్తల భోజనములు పూర్తీ అయినవి. అయితే యింటిలోని వారు యింకను భోజనము చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశార్మతో మనము నరసన్న తాత గారి యింటికి పోవలెనని మారాము చేయసాగెను. శ్రీపాదుల వారిని తీసుకొని రాజశర్మ నరసావధానులు యింటికి ఎదురుగా నిల్చొనెను. ఇంతలో అవధాన్లు వారి గోవు బయటకు వచ్చెను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను క్రిందకు దింపమనిరి. ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ మూడు ప్రదక్షిణములు చేసి, తదుపరి శ్రీచరణములకు ప్రణమిల్లి ప్రాణములు విడిచెను.


(ఇంకా ఉంది..)                   

అధ్యాయము-6 భాగము-6

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము -భాగము 6 


నరసావధానులు తన యింటిలో తోటకూరను పెంచుచుండెడివారు. వారి ఇంతనుండేది తోటకూర అత్యంత రుచికరమైనది గా ప్రతీతి. ఎంత అరచి గీపెట్టిననూ ఎవ్వరికినీ వారు తోటకూర యిచ్చేదివారు కారు. ఎవరినుండి అయిననూ తనకు విశేష ప్రతిఫలము ఉన్నాడని తోచిన యెడల మాత్రమే వారికి తోటకూరను యిచ్చెడివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండిపెట్టమని కోరెను. అదికూడా నరసావధానులు గారింటి నుండి తెమ్మనేను. ఇది అసంభవమైన విషయముగా కనపడ సాగెను. తాతగారైన శ్రీ బాపనార్యులిట్లనిరి."నాయనా! శ్రీపాదా! రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావదాన్లు తాతగారిని తోటకూర యిమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకుని వారింటి వద్దకు  వెళ్ళెదను. ఒకవేళ నరసావధాన్లు తోటకూర యివ్వని పక్షమున యింక నీవు ఆ విషయమై పట్టు పట్టరాదు." దానికి శ్రీపాదులు అంగీకరించిరి. ఉదయముననే బాపనార్యులు వారు శ్రీపదుని ఎత్తుకుని నరసావధాన్లు యింతివద్దకు వచ్చుచుండిరి. పెద్దలను గౌరవించ వలెననియూ వారి ఆశీస్సులను పిల్లలు కోరుకో వలయుననియూ బాపనార్యులు చెప్పిరి. శ్రీపాదులు వల్లెయనిరి. నరసావధానులు వీధి అరుగు పైనుండెను. వారికి చాల పొడవైన శిఖ (పిలక) ఉండెడిది. అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నములో నుండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు, నరసావధాన్లుగారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించెను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధాన్లు నివ్వేరపోయిరి. శ్రీపాదుల తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నముగా నరసావదానుల వారి శిఖ ఊది క్రింద పడిపోయెను. శిఖ దానంతట అది ఎట్లు ఊడిపోయినదో అర్థము గాక వారు అయోమయస్థితిలో నుండిరి. అపుడు శ్రీ చరణులు తన తాతగారితో "తాతా! నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతట అదే ఊడిపోయెను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమ పాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏమి బాగుండును? అసలే మహా దుఃఖముతో ఉన్న నరసన్న తాత ను నేను యింకా ఎందుకు బాధపెట్టవలెను? మనము మన యింటికి పోవుదము." అనిరి. ఆ తరువాత శ్రీపాదులు తనకు తోటకూర కావలెనని ఎన్నడు అడుగలేదు.

శ్రీపాదులు తనకు నమస్కరించుటలో జరిగిన మోసము నరసావధానులకు తెలియవచ్చెను. వారు ధ్యానములో కూర్చున్నప్పుడే వారినే పోలిన వర్చస్వి అయిన ఒకానొక వ్యక్తీ వారిలో నుండి బయల్వెడలెను. నీవెవ్వరివి? ఎక్కడకు పోవుచున్నావని నరసావధానులు అతనిని అడిగెను. అంతట ఆ వర్చస్వి, "నేను నీలో ఉన్న పున్యశారీరమును. నీవు యింతదాక ఎన్నోమార్లు వేదములు పఠించితివి. స్వయంభూ దత్తుని ఆరాదిన్చిటివి. సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీ వల్లభునిగా అవతరించినపుడు అవమానించితివి. నీవు నీ శిఖ మీదను, నీ తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములలో లక్షాంశమైనను శ్రీ వల్లభుని యందు ఉన్న యెడల నీ జన్మ కడతేరి ఉందును. మోహము క్షయిన్చుతయే మోక్షము. నీవు మొహపాశములచే బద్ధుడవయి ఉన్నావు. నీకు ఆనతి కాలములో దరిద్రాదశ రాబోవుచున్నది. దానిని నివారించుటకే శ్రీపాదులు నీ నుండి శాకదానమును కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను సమర్పించి ఉన్న యెడల నీకు రాబోవు దారిద్ర్యదశ నిర్వీర్యము చేయబడటమే గాక ఐశ్వర్యము కూడా అనుగ్రహింపబడి ఉండెడిది. అటువంటి అవకాశమును నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు. అయిననూ శ్రీపాదులు కరుణా సముద్రులు. వారు ఈ అవతారమును గుప్తపరచి మరియొక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దారిద్ర్య బ్రాహ్మణుడిగా జన్మించేడవు. అప్పుడు కూడా నీవు నీ యింటిలో తోటకూరను పండించెదవు. సరి అయిన సమయము ఆసన్నమయినపుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరములోనికి ప్రవేశించేడను. తదుపరి శ్రీచరణులు నీ యింటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు. నీలోని పుణ్య స్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావున యిప్పుడు మాత్రము నేను నిన్ను వదిలి వెళ్ళిపోవుచున్నాను. శ్రీపాదుల చేత నమస్కరింప బడుట వలన నీలోని పుణ్య రూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలినది నీలోని పాపపురుషుడు మాత్రమే." అని పలికి అతనిలోని పుణ్య పురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయెను.

అప్పటినుండి నరసావధాన్లు జీవన పరిస్థితులు క్షీణించ సాగెను. అతని మాటను లేక్కచేయువారు లేకపోయిరి. పూర్వము అతనిలో ఉన్న వర్చస్సు యిప్పుడు మరుగాయెను. పీఠికాపురం గ్రామములో విషూచి(కలరా) ప్రబలెను. అనేకమంది జనులు మరణించసాగిరి. జలదోశము వలన క్రిములవ్యాప్తి జరుగుచుండెననియూ, ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండెననియూ వైద్యులు తెల్చిరి. భయవిహ్వలులైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించ వలసినదనియూ, జనహితార్థము శాస్త్రములలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొన వలసినదనియూ బాపనార్యులను ప్రార్థించిరి.

బాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి యిది జలదోశము వలన కాదనియూ, వాయుమండలము నందలి కాలుష్యమువలన అనియూ తెలిసికొనిరి. శ్రీ బాపనార్యులు చెప్పుండి వైద్య శాస్త్ర విషయములకు వ్యతిరిక్తమనియూ, అందువలన ఆమోద యోగ్యము కాదనియూ వైద్యులు నిర్మొహమాటముగా తెల్పిరి.

జనులు గ్రామదేవతకు రకరకముల జంతుబలులు, వివిధములయిన పూజలను చేయసాగిరి. తాంత్రికులు జంతుబలులను విశ్వసించెదరు.  జంతుబలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును. మంత్రోచ్ఛాటనము వలన ఆ ప్రాణశక్తి బలియిచ్చు వ్యక్తికి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగప్రక్రియలున్నవనియు, సాత్వికారాధనా పద్ధతులు అనేకములున్నవనియూ, గ్రామదేవతను ప్రసన్నము చేసుకొనుటకు సాత్విక పద్ధతులను అవలంబించా వచ్చుననియూ బాపనార్యులు సెలవిచ్చిరి. అయిననూ జనులు జంతుబలిని యిచ్చుట మానరైరి. శ్రీపాదవల్లభులయందు, వారి దివ్యలీలల యందు విశ్వాసము గల కొందరు శ్రీ చరణుల వారిని ఈ విషయమై అడిగిరి. అంతట శ్రీ చరణులు గ్రామదేవతను బలిని కోరవద్దని తాను ఆదేశించినట్లును, ఆ గ్రామదేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానము చేయుటకు వెళ్ళెననియూ, కేవలము పాలపొంగళ్ళు సమర్పించిన, రక్షా కాలికారూపము శాంతిన్చునని ఈ విషయమును గ్రామ ప్రజలకును, పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారునొకని పిలిచి చర్మవాయిద్యముతో దండోరా వేయమని చెప్పవలసినదియూ తెలియజేసిరి. దండోరా ఎవరిచేత వేయించమందురని అడుగగా విషూచి సోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పిరి.

శ్రీ వల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయిరి. వెంకయ్య మరణాసన్న స్థితిలో ఉండెను. శ్రీ చరణుల వారి ఆజ్ఞను తెలుపగా అతడు మూర్ఛిల్లెను. ఒక గడియసేపటికి ప్రక్రుతిస్థుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యెను. ఈ వార్తా పీఠికాపురములో బహుధాచర్చనీయాంశమయ్యెను. వెంకయ్య చేత దండోరా వేయించాబడెను.

శ్రీ బాపనార్యులు జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిలో ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రములను ఉచ్ఛరించిరి.ఆ విషక్రిములు తపతపమని శబ్దము చేయుచూ వాయుమండలము నుండి వచ్చి జలపాత్రలో పడినవి. వాయుమండలము నందలి కాలుష్యము హరించబడెను. విషూచి మహమ్మారి పీఠికాపురమును వీడిపొయెను.

(ఇంకా ఉంది..)

Wednesday, November 16, 2011

అధ్యాయము-6 భాగము-5

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 5
శ్రీపాద జన్మసమయమున గోచరించిన అద్భుత దృశ్యములు 

అంతట నేనిట్లంటిని. "అయ్యా! మీరు కనులారా గాంచిన శ్రీపాదుల వారి లీలలను మరికొన్నింటిని తెలిపి నన్ను ధన్యులజేయుడు." అప్పుడు తిరుమలదాసు "అయ్యా! శంకరభట్టూ! నరసావధానులు గార్కి బాపనార్యులపై కోపము వచ్చెను. ఏదో ఒకరీతిన వారిని అవమానింపదలచెను. తనకు భగళాముఖీ దేవత అనుగ్రహము లేకుండా పోవుటకు బాపనార్యులే కారణము అని అతడు తలపోసెను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనార్యులు తన మంత్రసిద్ధిని హరించెనని ప్రచారము చేయసాగెను. నాడీ గ్రంధములు శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గూర్చిన వివరములు అతనిని మరింత బాధింపసాగెను. నాడీగ్రంధములు విశ్వసనీయములు కావనియూ, మత్స్యభుక్కు అయిన బంగాళీ బ్రాహ్మణునకు బాపనార్యులు అన్నము పెట్టుట అనాచారమనియూ వాదింపసాగెను. మనుష్యమాత్రుడు ఎవ్వడునూ పూర్ణబ్రహ్మము యొక్క అవతారము కాజాలడనియూ, పసిబాలుడైన శ్రీపాదుడు సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభువు కాజాలడనియూ వాదించసాగెను. శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయము నుండియూ ప్రణవమును ఉచ్ఛరించుటయూ, ఉయ్యాలలో పసిబాలుడుగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగము చేయగలుగుటయూ, వయస్సునకు తగని అసాధారణ ప్రజ్ఞాపాటవములు ప్రదర్శించుటయూ, ఎవరైనా వేదపండితుడైన బ్రాహ్మణుడు ఆశరీరిగా ఉండి యీ బాలుని శరీరమును ఆసరాగా చేసుకొని మాట్లాడుచుండెననియూ ప్రచారము చేయదొడగెను. శ్రీ కుక్కుటేశ్వరాలయము  స్వయంభూ దత్తుడే నియమైన వరప్రదాట అనియూ, బాలుని దత్తస్వరూపముగా భావించుట తప్పనియూ ప్రచారము చేయదొడగెను. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినపుడు మూడుతలల నాగుబాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టిననూ పడగ పట్టుచుండెడిది. వారు మాత్రు గర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెలువడిరి. పుట్టిన ఉత్తర క్షణముననే సుమతీ మహారాణి సొమ్మసిల్లిపోయెను. పురుటిగదిలో నుండి మంగళ వాయిద్యములు వినబడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్య వాణి అందరినీ పురుటిగది నుండి బయటకు పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధికి నాల్గువేదములు, 18 పురాణములు, మహాపురుషులు, జ్యోతిస్వరూపులై ఏతెంచిరి. పవిత్ర వేదమంత్రములు బయటకు వినబడుచుండెను. కోతసేపతి తరువాత నిశ్శబ్ద మావరించెను. ఈ అద్భుత సంఘటన బాపనార్యులకు కూడా అగమ్యగోచరముగను అయోమయముగను ఉండెను.

శ్రీపాదుని బాల్యలీలలు

శ్రీపాదుల వారు జన్మించి ఒక సంవత్సరము పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్తు సమావేశములకు హాజరగుచుండెడివారు. 

శ్రీచరణులు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడచి వెళ్ళుటయూ, శాస్త్రప్రసంగములను చేయుటయూ, చిత్రవిచిత్రములైన లీలలను చేయుటయూ జరుగుచుండెడిది. ఎవరో మహా పండితుడు మరణించిన తదుపరి యీ బాలునిలో ప్రవేశించి యీ రకములయిన పనులను చేయుచుండెననియూ, బాలునికి తగిన వైద్యము చేయించక బాపనార్యులు మరియు రాజశర్మయు  వానిని దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియూ, యిది అంగీకార యోగ్యము కాని విషయమనియూ పీఠికాపురవాసులు తలపోయుచుండిరి. పీఠికాపురము పాదగయాక్షేత్రాముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రముగనుకనూ, పీఠికాపురములో విగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలననూ యీ రకములైన వాదములకు బలము చేకూరుచుండెను. నేను మాల్యాద్రిపురము నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి యింట్లోని దుస్తులను నేను ఉతుకుచుండెడి వాడను. నరసావధానులు గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనదమని పిలువబడు వాయసపుర అగ్రహారము (కాకినాడ) నకు వలసపోయెను. అందువలన నరసావధానులు గారింటి బట్టలను ఉతుకుతకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండియూ బాపనార్యుల కుటుంబముతో సాన్నిహిత్యము వలన నేను కొంత శుభేచ్ఛ కలిగినవాడుగా మార్పునోన్దితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగసాగెను. నరసావధానులు గారి బట్టలను నేను స్వయముగా ఉతుకక నా పెద్ద కుమారుడైన రావిదాసును ఉతకమని చెప్పితిని. ఏ రోజయిననూ నేను నరసావధానులు గారిని చూచినా యెడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమె ఉతకగలుగుచుంటిని. 

తిరుమలదాసుపై శ్రీపాదుల వారి దివ్యానుగ్రహము 

రావిదాసు నా పెద్ద కుమారుడు. నా మొదటి భార్య కొడుకు. నరసావధాన్లు గారి బట్టలను నేను ఉతుకకుండ రావిదాసు చేత ఉతికించేవాడను. ఈ విషయము ఎట్లో నరసావధాన్లు గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నీ ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యము కదా! నేను శ్రీపాద నామస్మరణము చేయుచూ వారి బట్టలను ఉతికితిని. రావిదాసు వాటిని వారి యింటికి తీసుకొని వెళ్ళెను. అదేమీ చిత్రమో గాని, ఆ యింటిలోని వారికి ఎవ్వరికినీ ఏమీ కాలేదు కాని నరసావధాన్లు గార్కి మాత్రమూ నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్లంతయూ, తేళ్ళు, జెర్రెలు పాకినట్లుండెను. ఆయన శరీరము నిప్పులమీద పెట్టినంత బాధ కలిగించు చుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్నివస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఎదియో క్షుద్రవిద్యతో మంత్రశక్తిని తమ వస్త్రముల లోనికి ప్రవేశపెట్టినాననియు యిటువంటి నీచమైన పనికి శిక్ష విధింప బడుననియు తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చెను. నాయనా! శంకరభట్టూ! శ్రీపాదుల లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్దనుండి యింటికి వచ్చిన తరువాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరముల నవయవ్వన రూపమున వచ్చిరి. శ్రీపాదులు పుట్టినప్పటినుండియూ తనకు యిష్టమొచ్చిన వయసులో భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీ చరణుల లీలలతో ప్రత్యెక సంబంధము కలవారాలకు యిది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాశ్చర్యములతో "అయ్యా! మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించినవారు. రజకులు ఉండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు." అని అంటిని. దానికి శ్రీపాదులు "ఓయీ! నరసావధానులు ఎవరనుకొంటివి. వారు చాకలి మూట అంత పాపమును నిట్టిన పెట్టుకొని జీవన యాత్ర చేయుచున్న రజకుడు. రాజకుడవైన నీవు బ్రహ్మజ్ఞానము కొరకు తపించే ఉత్తమ బ్రాహ్మణుడవు. అందుచే నేను ఇక్కడకు వచ్చుట అసంగతము కాదు కదా!" అనిరి. అంతట నేను శ్రీ చరణుల పాదములపై బడి వెక్కి వెక్కి ఎద్చితిని. శ్రీ చరణులు అమృత దృష్టితో చూచుచూ నన్ను తమ దివ్య హస్తములతో లేవనేట్టిరి. వారి దివ్య హస్తములను నాపైనుంచిరి. అంతట నాకు నా గత జన్మనంతయునూ గుర్తుకు వచ్చినది. నాలోని యోగాశాక్తులు చలనావస్థను పొందినవి. కుండలినీ శక్తి జాగృతమవ సాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసికోనుచూ అంతర్ధానమయిరి.

(ఇంకా ఉంది..)                     

Monday, November 14, 2011

అధ్యాయము-6 భాగము-4

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము - భాగము 4 
శ్రీపాద శ్రీవల్లభ రూపమున దత్తుని దర్శనానంతరము సుమతీ మహారాణికి కలిగిన సంకల్పం

ఆ దివ్య మంగళ విగ్రహమును చూచి సుమతీ మహారాణి వాని పాదములపై బడి నమస్కరించెను. శ్రీపాద శ్రీవల్లభులు సుమతీ మహారాణిని లేవనెత్తి "అమ్మా! బిడ్డ కాళ్లపై తల్లిపడుట అసంబద్ధమైన విషయము. బిడ్డకు ఆయు:క్షీణము కూడాను. " అనెను. అంతట సుమతి, "శ్రీపాద శ్రీవల్లభ ప్రభూ! నీవు నన్ను అమ్మా అని పిలచితివి. కావున నేను తల్లిననియూ, నీవు బిడ్డవనియూ అంగీకరించితివి. నీది సిద్ధ వాక్కు గనుక ఆ మాటనే నిజము చేయుము. నీవు మాకు పుత్రునిగా జన్మించవలసినది." అనెను. అంతట శ్రీచరణులిట్లనిరి. "తధాస్తు! ఇపుడు నీవు దర్శించిన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే నేను నీకు జన్మించెదను. తల్లి బిడ్డ పాదములపై బడుట బిడ్డకు ఆయు:క్షీణము. నేను ధర్మకర్మ సూత్రములకు వ్యతిరేకముగా నడువను గనుక 16 సంవత్సరముల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించెదను." అనెను. అందులకు సుమతి, "అయ్యో! ఎంతటి అపచారము కలిగినది. 16 సంవత్సరముల వరకు మాత్రమేనా ఆయుష్షు!" అని విలపించదొడగెను. అందులకు శ్రీచరణులిట్లనిరి. "అమ్మా! 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడచుకొందును. 'వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవదాచరేత్' అని ఉన్నది. 16 సంవత్సరముల వయస్సు వచ్చిన పుత్రుని మిత్రుని వలె భావించవలెను గాని ఆంక్షలను విధింపరాదు. నన్ను వివాహము చెసుకొనవలసినదని నిర్భంధించరాదు. నేను యతినై యథేచ్ఛగా విహరిన్చుటకు అనుజ్ఞ నీయవలెను. నా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు నిర్భంధించిన నేను మీ యింటనుండువాడను గాను. " అని పలికి వెంటనే వడివడిగా పయనమై వెడలిపోయెను.

సుమతీ మహారాణి నోట మాటరాక కొంతసేపు అట్లే యుండెను. జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించెను. అంతట అప్పలరాజశర్మ, "సుమతీ! విచారింపకుము. శ్రీ దత్తుడు యీ ప్రకారముగా మనయింటికి బిక్షకువచ్చునను విషయమును మీ నాయన సూచన ప్రాయముగా యింతకు ముందే తెలిపియుండెను. శ్రీ దత్తుడు కరుణాసముద్రుడు. శ్రీపాద శ్రీవల్లభ జననము కానిమ్ము. తదుపరి మనము ఆలోచించుకొనవచ్చును." అని పలికెను. అప్పలరాజు యింటికి అవధూత వచ్చెనను వార్త ఊరంతయునూ ప్రాకెను. పితృదేవతలకు అత్యంత ప్రముఖమైన యీ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులు భోజనము చేయుటకు ముందే అవదూతకు భిక్ష యివ్వబడెనను విషయము చర్చించబడుచుండెను. శ్రీ బాపన్నావధానులు గారిట్లనిరి. "శ్రీపాద శ్రీవల్లభ జననము అందరూ అనుకొనుచున్నదే! అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే! అందువలన సుమతి యొక్క దోషము ఏమీలేదు. బిడ్డగా జన్మించినపుడు సాష్టాంగము పడుట ఆయు:క్షీణకరము  గాని, అవధూత వేషమున ఉన్నప్పుడు సాష్టాంగము చేయుట తప్పు విషయము కాదు." ఈ విషయమై పీఠికాపుర బ్రాహ్మణ్యము ఈర్ష్య వహించి యుండెను. అందులో నరసావధానులు అను పండితుడు చాల ఈర్ష్యను కలిగియుండెను. అమావాస్య రోజున అందరునూ పితృ కార్యమున నిమగ్నమై యుందురు. భోక్తల యొక్క విషయము గడ్డు సమస్య అయ్యెను. శ్రీ బాపనార్యులు మాత్రము అప్పలరాజు యింట ఎట్టి ఆటంకమును కలుగదని సెలవిచ్చెను. శ్రీ రాజశర్మ కాలాగ్ని శమనుని ధ్యానమున నుండెను. ఇంతలో భోక్తలుగా నుండుటకు మువ్వురు అతిథులు వచ్చిరి. పితృ కార్యము నిరాటంకముగా సాగిపోయెను.

నాయనా! శంకరభట్టు! ఆ రోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనమునకు అధికారమున్నదా? లేదా? అను విషయము ప్రధాన చర్చనీయాంశమైనది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. బంగాళ దేశము నందలి నవద్వీపము నుండి ఆశుతోషుడను పండితుడు పాదగయా క్షేత్రమునకు వచ్చెను. అతనివద్ద అత్యంత ప్రాచీనమైన నాడీగ్రంథములుండెను. అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానింపబడెను. శ్రీ బాపనార్యులు యిట్లు సెలవిచ్చిరి. నియమనిష్ఠలతో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానముగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనము ధర్మవిహితమే! తక్కువగల వర్ణముల వారెవరైన ఉపనయనము కోరిన యెడల పురాణోక్తముగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయస్సు అనునవి ఆటంకములు కాదు. సిద్ధ పురుషులలో వైష్యమునులు కూడా కలరనియూ, లాభాదుడను వైశ్యమహర్షి దత్తానుగ్రహము వలన సిద్ధుడయ్యెననియు, లాభాదమహర్షి దయ ఉన్న యెడల మానవుడు చేయు ప్రతి పనియండును లాభాదులు కలగుననియూ వక్కాణించెను.

ఈ విధమున నిర్ణయము నరసావధానులు అను పండితునికి బాధాకరమయ్యెను, నరసావధానులు పిడివాదము చేయుటలో నేర్పరి. అతనికి భగళాముఖీ దేవతా ఉపాసన కలదు. ఆ దేవతను అతడు ప్రతీరోజు అర్చిన్చును. వాడమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళనము చేసుకొని, భగళాముఖీ మంత్రమును చదువుకొనును. తదుపరి వాదమునకు దిగును. ఆ సమయమునందు అతనిని నిర్జించుట అసాధ్యము. శ్రీ బాపనార్యులు అనేక కోట్ల గాయత్రీ మంత్రమును జపించిన పుణ్యాత్ములు. వారిరువురును ఘర్షనోపేతమైన వాదములకు ఏనాడునూ దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళనము చేసికొని మంత్రమును జపించుకొనెను. శ్రీపాద శ్రీవల్లభులు బహు చిన్న వయస్సు నుండియు మాతామహులతో అత్యంత సాన్నిహిత్యము కలవారు. అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశాములప్పుడు కూడా వారు తాతగారితో వచ్చుచుండిరి. ముద్దులొలుకు ఆ పసిబాలుని ఎవ్వరునూ ఆటంకా పరచువారు కారు. ఈ రోజున నరసావదానులకు శ్రీ వల్లభులు సభలో నుండుట అయిష్టముగా నుండెను. మహా పండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచెను. భగళామంత్రమును చదువుకొని వాదమునకు ఉపక్రమింపబోవుచూ శ్రీపాదులనుద్దేశించి నీవేళ వచ్చితివని అడిగెను. అందులకు శ్రీపాదులు "తాతా! నీవు పోమ్మనిన యెడల పోయెదను. నాకేమి? నేను స్వేచ్ఛాజీవిని! బాలకుడను." అనెను. నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి. శ్రీ రాజశర్మ తన కుమారుని తీసుకొని వెడలిపోయెను. వాదమునాకు ఉపక్రమింపబోయిన నరసావధానులకు వాక్కు రాదాయెను. అతడు నోరెంత పెకలించినను నోటమాట రాలేదు. ఇదంతయును గమనించుచున్న ఆశుతోషుడు సంబరముగా నవ్వెను. సభలో శ్రీ బాపనార్యుల మాట చెల్లెను. వైశ్యులకు వేదోక్త ఉపనయనము నిర్ణయింపబడెను. 

ఆశుతోషుని వద్దనున్న నాడీగ్రంధముల గురించి చర్చ జరిగెను. నాదీగ్రంధము నందు సాంద్రసింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీ వల్లభుల జననము నిర్ణయింపబడవలెనని సూచించబడెను. శ్రీపాదులు గణేశ చతుర్థి నాడు ఉషఃకాలములో సింహలగ్నము నందు చిట్టా నక్షత్రమున తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడినది. శ్రీపాడులవారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీదత్తావతారులనియూ, వారి చరణములయందు సర్వ శుభ లక్షణములు కలిగి యుండుటచే శ్రీపాద శ్రీవల్లభ నామము వారికి సార్థక నామధేయమనియూ, వారి జన్మకుండలిని ఎవ్వరికినీ యీయరాదనియూ, అది కాలవశమున త్రిపురదేశము నందలి అక్షయకుమారుడు అను జైనమతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురమునకు చేరుననియూ, అదంతయునూ దైవలీల ప్రకారము జరుగుననియూ తెలుపబడెను.

ఆశుతోషుడు శ్రీపాదవల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయెను. శ్రీవల్లభులిట్లనిరి. "ఈ రోజు చిత్తా నక్షత్రము. నా జన్మ నక్షత్రమునాడు ఎవ్వరైననూ నన్ను ఆరాధించిన యెడల నేను మిక్కిలి సంప్రీతుడనయ్యెదను. నీవు నిష్కల్మష భక్తితో వచ్చితివి గనుక నిన్ను అనుగ్రహించుచున్నాను. నీకేమి కావలయునో కోరుకొమ్మనెను." అంతట ఆశుతోషుడు "ప్రభూ! నరసావధానులు భగళాముఖీ ఆరాధకులనీ తెలిసినది. వారినాశ్రయించి అంబికను దర్శింపవలెనని తలంచితిని. నా కోరిక అడియాస అయ్యెను. వారియందు అంబిక కినుక వహించినదని నెను గ్రహించితిని." అనునంతలో శ్రీపాదులిట్లనిరి. "అతడు ఆరాధించు అంబికను నేనే! నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటివరకు నరసావధానులు సూక్ష్మ శరీరమును అంటిపెట్టుకొని యున్న అంబిక నాలో లీనమయినది. నేను సర్వదేవీ దేవతాస్వరూపుడను. అంబిక దర్శన భాగ్యము పొందుము." అని వారు ఆశుతోషునకు శ్రీ భగళాంబికగా దర్శనమిచ్చెను. సంతుష్టుడైన ఆశుతోషుడు శ్రీచరణుల ఆదేశము మేరకు పెనుశిలకోన (పెంచలకోన - నెల్లూరు జిల్లా ) అరణ్యము నందలి కణ్వమహర్షి తపోభూమికి పయనమయ్యెను. కణ్వమహర్షికి సంబంధించిన వాజసనేయి శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించెదనని తెలిపెను. తిరిగి నేను అవతరించినపుడు నిన్ను అనుగ్రహించెదను. నా ముఖ్య శిష్యులలో నొకడుగా నీవుందువు. నాయొక్క అద్భుతలీలలను కనులారా గాంచెదవు. వెనువెంటనే ప్రయాణము కమ్మని హెచ్చరించెను. 

(ఇంకా ఉంది..)                

అధ్యాయము-6 భాగము-3

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము -భాగము 3 
దత్తప్రభువు నిత్య వైభవ విభూతి 

ఈ విషయమును సుమతీ మహారాణి రాజశర్మతో చెప్పెను. అంతట రాజశర్మ పూజాసమయములో కాలాగ్నిశమన దత్తునే అడిగెదననెను. కాలాగ్ని శమనుని పూజించు సందర్భమున నరులెవ్వరును చూడరాదు. పూజానంతరము దత్తుడు మానవరూపములో ఎదురుగా కూర్చొని మాట్లాడును. తదుపరి ఆ విగ్రహములోనికి లయమయిపోవును. ఇది నిత్యమూ జరుగు వ్యవహారము. రాజశర్మ అల్పవిషయములను, స్వార్థపూరిత సమస్యలను దత్తునకు నివేదింపడు. ఆ రోజు పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడుగా తోచెను. పూజానంతరము దత్తుడు ఎదురుగా కూర్చొనెను. శ్రీధరా రా! అని పిలిచెను. దత్తునినుండి ఒక రూపము బయల్వేడలి తన ఎదురుగా ధ్యాననిష్ఠమయ్యెను. తిరిగి తన వ్రేలితో సైగ చేయుచూ శ్రీధరా రా! అని పిలిచెను. వెంటనే ఆ రూపము దత్తునిలో లీనమయ్యెను. రాజశర్మకు యిదంతయునూ ఆశ్చర్యముగా నుండెను. శ్రీదత్త ప్రభువు రాజశర్మకు, "నీవు యిప్పుడు చూచినా రూపము రాబోయే శతాబ్దములలో వచ్చు ఒకానొక అంశావతారము. నాలో లీనమయిన జీవన్ముక్తులు సహితము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలెను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణము తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలము భూమికి మాత్రమే పరిమితము కాదు. ఈ బ్రహ్మాండములన్నియూ నా చేతిలోని ఆటబంతులు, నేను ఒక్క తాపు తన్నిన యెడల కోటానుకోట్ల యోజనములలో పడవలసినదే! నేను జనన మరణములకు అతీతుడను. ఇట్లనుచూ రాజశర్మ భ్రూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు తను ఒకానొక యుగములో విష్ణుదత్తుడను పేరుతో జన్మించినట్లునూ, తన భార్య సుశీల అను నామాంతరముగల సోమదేవమ్మగా జన్మించినట్లునూ జ్ఞాతమయ్యెను. గతమంతయూ స్ఫురణకు వచ్చినది. శ్రీ దత్తుడిట్లనెను. నెను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగములో మిమ్ములను ఏదయినా కోరిక కోరుకోమంటిని. మీరు సరి అయిన కోరికను కోరుకొనలేకపోయిరి. మీ యింత పితృ శ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచిరి. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనము చేసి, మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చితిని. నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారమును ధరించదలచితిని. గత 100 సంవత్సరముల నుండి యీ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకును, మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. త్రేతాయుగములో భరద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృకాఠక చాయనమును చేసినాడు. ఆనాటి హోమభాస్మము మహాపర్వతములవలె పేరుకొని పోయినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్గ, మర్త్య, పాతాళములకు కొంపోయెను. మర్త్యలోకమునందు హిమాలయ పర్వత ప్రాంతముల ద్రోనగిరి యందును, మరికొన్ని ప్రాంతములందును వెదజల్లబడెను. హనుమంతుడు పర్వత ఖండములను గొంపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వనగరము (గాణగాపురము) నందు పడినది. గంధర్వనగరము, భీమా, అమరజా పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరచిన తదుపరి మీన అంశ, మీన లగ్నములందు నృసింహసరస్వతిగా జన్మించి, గంధర్వనగరము నందు అనేక లీలలను చూపి, శ్రీశైలము నందలి కదళీవనమున 300 సంవత్సరములు తపోసమాధినందు ఉంది ఆ తర్వాత స్వామి సమర్థ అను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మీనములోనికి ప్రవేశించినపుడు శరీరమును త్యజించెదను." అని తెల్పిరి.

దత్తప్రభువు యొక్క యీ వచనములను తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్య ఋషీశ్వరులయిన బాపనార్యులు యిట్లనిరి. "నాయనా! రాజశర్మా! నీవు పూర్వ యుగములలోని జన్మమునందు శ్రీదత్త ప్రభువునకు, సూర్యునకు, అగ్నికి శ్రాద్ధ భోజనము పెట్టిన పుణ్యాత్ముడవు. ఈ జన్మము నందు ఏ రూపములో నయిననూ దత్తుడు భోజనము పెట్టమని అడుగవచ్చును. ఆనాడు పితృశ్రాద్ధ దినమయిననూ సరే భోక్తలు భోజనము చేయుటకు ముందేయైననూ దత్తుడు భోజనమడిగిన యెడల నిరభ్యంతరముగా పెట్టవలసినది. అమ్మా! సుమతీ! ఈ విషయములను నీవును గుర్తుంచుకొనుము." నాయనా! శంకరభట్టు! దత్త ప్రభువు యొక్క లీలలు అపూర్వములు. అచింత్యములు. ఇదివరకెన్నడును విననివి. 

శ్రీపాద శ్రీవల్లభుల ఆవిర్భావము

ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను. అంతట వీధి ముంగిట "భవతీ! భిక్షాందేహీ!" అని వినబడెను. అవదూతకు సుమతీ మహారాణి భిక్షనిచ్చెను. ఏదైన కోరికను కోరుకొమ్మనిన ఆ అవధూతతో సుమతి "అయ్యా! తమరు అవధూతలు. మీ వాక్కులు సిద్ధ వాక్కులు. శ్రీపాద శ్రీవల్లభావతారము అతి త్వరలోనే యీ భూమిమీదకి ఆకర్షించబడునని పెద్దలు సెలవిచ్చుచున్నారు. శ్రీదత్త ప్రభువు యిప్పుడు ఏ రూపములో సంచరించుచున్నారు? ఇప్పటికి వంద సంవత్సరముల ముందు నుండి ఈ భూమి మీద శ్రీదత్త ప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున తిరుగుచున్నారని వినవచ్చుచున్నది. మీరు నన్ను కోరికనేదయినా కోరుకొమ్మనిరి. నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడవలెనని కోరికగానున్నది." అని అడిగెను. 

ఈ మాటలను వినిన అవధూత భువనములు కంపించునంతగా వికటాట్టహాసము చేసిరి. సుమతీ మహారాణికి తన చుట్టుప్రక్కలనున్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరముల వయస్సుగల సుందరబాలుడు యతి రూపమున ప్రత్యక్షమై "అమ్మా! నేనే శ్రీపాద శ్రీవల్లభుడను. నేనే దత్తుడను. అవధూత రూపమున ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోర్కెను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని. శ్రీవల్లభ రూపముననున్న నన్ను నీవు ఏదయినా కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నమును పెట్టితివి. ప్రతిగా ఏదయినా వరమీయవలెనని కోరికగా ఉన్నది. లోకమునందలి జనులు సంకల్పరూపముగా పాపకర్మలను చేయునప్పుడు పాపఫలితములను పొందుదురు. సంకల్ప పూర్వకముగా పుణ్య కర్మలను ఆచరించిన పుణ్యఫలితములు సిద్ధించును. ఏ రకమయిన కామ్యములు లేకుండ పుణ్య కర్మలనాచరించుట ఆకారమ అనబడును. ఇది సుకర్మ దుష్కర్మ కాదు. అకర్మవలన పుణ్యము పాపము అనునవి లేని మరియొక ఫలితము యీయవలసి వచ్చుచున్నది. అది భగవదధీనమై ఉందును. అర్జునుడు అకర్మ చేయుట వలననే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుట వలన పాపము రాదనీ భావము. కౌరవ సంహారము భగవన్నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి. అందువలన లోక హితార్థమైన ఫలితమును ఏదో ఒకటి కలుగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలవయి కోరికను తెలుపుకొనుము. తప్పక అనుగ్రహించెదను." అని పలికెను.

(ఇంకా ఉంది..) 

అధ్యాయము-6 భాగము-2

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 2 
శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి నుండి వెలువడిన వాణి - సుమతిఅప్పలరాజుల వివాహము

ఒక పర్యాయము శని ప్రదోష సమయమున శివారాధానము చేసిన తదుపరి శ్రీ కుక్కుటేశ్వర శివలింగము నుండి విద్యుత్కాంతులు వెలువడసాగెను. ఒకానొక గంభీరమైన వాణి "నాయనా! బాపనార్యా! నిస్సందేహముగా నీ కుమార్తె అయిన సుమతీ మహారాణిని అప్పలరాజు శర్మ కిచ్చి వివాహమోనరింపుము. లోక కళ్యాణము సిద్ధించును. ఇది దత్త ప్రభువుల వారి నిర్ణయము. ఈ మహా నిర్ణయమును మీరుటకు యీ చరాచర సృష్టి యందలి ఈ వ్యక్తికినీ అధికారము లేదు." అని పలికెను.

ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్ఠికిని, నరసింహవర్మకును అక్కడున్న అందరికిని కూడా వినిపించెను. అందరునూ ఆశ్చర్యచకితులయిరి.

అయినవిల్లి గ్రామము నందున్న రాజశర్మ యొక్క జ్ఞాతులకును, బంధువులకును వర్తమానము పంపబడినది. రాజశర్మకు సుమతి మహారాణితో వివాహము నిర్ణయమాయెను. రాజశర్మకు కనీసము గృహమయినా లేకపోవుట విచారించదగిన విషయముగా నుండెను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియూ అందొకదానిని రాజశర్మకు యిచ్చెదననెను. రాజశర్మ దానము తీసుకొనుటకు అంగీకరింపడాయెను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితముగా లభించు గృహభాగమును వెల కట్టించెను. అది ఒక వరహాగా నిర్ణయించబడెను. శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసము పండ్రెండు వరహాలని నిర్ణయించబడెను. తక్కువగా నున్న పదకొండు వరహాల సొమ్ము యిచ్చుటకు తనవద్ద పైకములేదని రాజశర్మ చెప్పెను. అట్లయిన నేను నా గృహమును ఒక వరహాకు మాత్రమే అమ్ముచున్నానని శ్రేష్ఠి చెప్పెను. "దానముగా తీసుకొనుట మీ కభ్యంతరకరమయిన యెడల ఒక వరహాను మాత్రము ఇచ్చి నా గృహమును తీసికొనుడు" అని శ్రేష్ఠి చెప్పెను. శ్రేష్ఠి చెప్పునది ధర్మ సమ్మతమేనని అందరునూ అంగీకరించిరి. శ్రీ సుమతీ మహారాణికిని, శ్రీ అప్పల లక్ష్మినరసింహ రాజశర్మకును మహాపండితుల వేదఘోష నడుమ మంగళ వాయిద్యములతో వైభవోపేతముగా వివాహము జరిగెను. శ్రీపాద శ్రీవల్లభుల అవతారము అజ్ఞానమనెడి అంధకారమును రూపుమాపుటకు వచ్చినది. ఆధ్యాత్మిక, భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చినది. అందువలన శ్రీదత్త ప్రభువులు కాలదేవతను, కర్మదేవతను శాసించిరి. వారి శాసనముననుసరించి అజ్ఞానాంధకారమునకు ప్రతిగా గ్రుడ్డిబాలుడును, ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటి తనమునకు ప్రతిగా కుంటిబాలుడును రాజశర్మకు సంతానముగా కలిగిరి. తమ యిద్దరు బిడ్డలు యీ రకము వారయినందులకు సుమతీ, రాజశర్మలు ఎంతగానో ఖేదమునొందిరి. అయినవిల్లిలో ప్రసిద్ధమైన విఘ్నేశ్వరాలయము కలదు. ఒక పర్యాయము వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదమును పీఠికాపురమునకు తీసుకొని వచ్చిరి. సుమతీ, రాజశర్మలు ఆ ప్రసాదమును గైకొనిరి. ఆ రోజు రాత్రి సుమతీ మహారాణికి స్వప్నమునందు ఐరావతము దర్శనమయినది. తదుపరి రోజులలో శంఖము, చక్రము, గద, కమలము, త్రిశూలము, వివిధములయిన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలయినవారు స్వప్నములో దర్శనమీయసాగిరి. మరికొన్ని రోజులయిన తదుపరి జాగ్రదవస్థలోనే దివ్య దర్శనములు కాజొచ్చెను. కండ్లు మూసినయెడల తెరమీద బొమ్మలవలె దివ్యవర్చస్సులతో, రకరకాల కాంతులతో తపస్సమాధులలో ఉన్న యోగులు, మునులు, మొదలగువారు దర్శనమిచ్చుచుండిరి. 

ఈ విషయమై సుమతీ మహారాణి తన తండ్రియైన బాపనార్యుని సంప్రదించగా వారు, "ఇవన్నియును సర్వశుభ లక్షణములతో కూడిన మహాపురుష జననమును సూచించుచున్నవి." అనిరి. సుమతీ మహారాణికి మేనమామ అయిన శ్రీధర పండితులు "అమ్మా! సుమతీ! రవి యొక్క జన్మనక్షత్రమైన విశాఖకును శ్రీరామావతారమునకును సంబంధము కలదు. చంద్రుని జన్మనక్షత్రమైన కృత్తికానక్షత్రమునకును శ్రీకృష్ణావతారమునకును సంబంధము కలదు. పూర్వాషాఢలో జన్మించిన అంగారకునికిని శ్రీలక్ష్మీనరసింహావతారమునకును సంబంధము కలదు. శ్రవణం నక్షత్రములో జన్మించిన బుధునకును, బుద్ధావతారమునకును సంబంధము కలదు. పూర్వఫల్గునీ నక్షత్రములో జన్మించిన గురుడునకును, విష్ణ్వుంశకును సంబంధము కలదు. పుష్యమీ నక్షత్రములో జన్మించిన శుక్రునకును భార్గావరామునికిని సంబంధము కలదు. రేవతీ నక్షత్రములో జన్మించిన శనికిని, కూర్మావతారమునకును సంబంధము కలదు. భరణీ నక్షత్రములో జన్మించిన రాహువునకును, వరాహావతారమునకు సంబంధము కలదు. ఆశ్లేష నక్షత్రములో జన్మించిన కేతువునకును, మత్స్యావతారమునకును సంబంధము కలదు. నీవు నన్ను ప్రశ్నించిన సమయము దైవరహస్యమునకు సంబంధించిన సమయము. అందువలన కోటానుకోట్ల గ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండముల యొక్క స్థితి, గతులను నిర్దేశించు దత్తప్రభువే జన్మించునా అని అనుమానముగా నున్నది." అని అనిరి.

(ఇంకా ఉంది...)           

Sunday, November 13, 2011

అధ్యాయము-6 భాగము-1


అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 1 

ఆ మరునాడు ఉదయమున జపధ్యానాదులు పూర్తి అయిన తదుపరి తిరుమలదాసు యిట్లు చెప్పనారంభించెను. "అయ్యా! శ్రీపాద శ్రీవల్లభుల వారు యీ చరాచర సృష్టికంతటికినీ మూలము. వారు వటవృక్షము వంటివారు. వారి అంశావతారములన్నియూ ఆ వృక్షము యొక్క ఊడలవంటివి. ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్త్వము గలవిగా కనిపించిననూ, వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానవులు లగాయితూ సమస్త ప్రాణులకునూ వారే ఆధారము, ఆశ్రయము. వారి నుండియే సమస్త శక్తులును సంప్రాప్తమగుచుండును, తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును. పర్వత శిఖరమున చేరిన వ్యక్తికి అన్ని దారులునూ ఒకటిగానే ఉందును. అదే విధముగా అన్ని రకముల సాంప్రదాయముల వారునూ దత్త తట్ట్వములో సమన్వయము పొందుదురు. సమస్త ప్రాణులకునూ కాంతి పరివేష్టమై ఉందును. నేను పీఠికాపురము నందున్న రోజులలో అచ్చటకు ఒక యోగి వచ్చెను. అతడు ఫలానా విగ్రహము యొక్క కాంతి పరివేష్టము యీ విధముగా ఉన్నది, ఈ మనుష్యుని యొక్క కాన్తివిశేశము యీ రంగులో యింతవరకు వ్యాపించి యున్నది, అని చెప్పుచుండెను. అతడు శ్రీ కుక్కుటేశ్వరాలయమునకు వచ్చి స్వయంభూదత్తుని సూక్ష్మ కాంతి ఎంతమేరకు వ్యాపించినది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలచెను. వారికి స్వయంభూదత్తుని స్థానములో శ్రీపాద శ్రీవల్లభులు వారు దర్శనమిచ్చిరి. వారి శిరము చుట్టూ విద్యుల్లతలను పోలిన ధవళకాంతి అమెయముగా వ్యాపించియుండెను. ఆ ధవళకాంతిని చుట్టి దిగంతములకు వ్యాపించుచూ నీలపురంగు కాంతి దర్శనమిచ్చెను. ఆ మూర్తి ఆ యోగిని చూచి, నాయనా! ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంతమేరకు వ్యాపించియున్నవో తెలుసుకోవలయుననే పిచ్చి ప్రయత్నములతో విలువయిన కాలమును వ్యర్థము చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకొనుము. కొలది దినములలో నీకు మృత్యువు పొంచియున్నది. కావున సద్గతిని పొందు యోచనలను చేయుము. సర్వ సత్యములకును, సర్వ తత్త్వములకునూ మూలమైన దత్తుడను నేనే! మహా సిద్ధి పురుషులు, మహా యోగులు, మహా భక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగములో పాదగయా క్షేత్రములో అవతరించితిని.

స్వామివారి ఉపదేశములకు ఆ యోగిలోని పూర్వ వాసనలన్నియు నశించిపోయెను. సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకొనగలుగు అతని శక్తి అంతయునూ శ్రీవల్లభుల వారిలో లీనమైపోయెను. తదుపరి అతడు శ్రీవల్లభులవారిని, వారి స్వగృహమున దర్శనము చేసుకొని ధన్యుదాఎను. "శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించియున్న ఆ స్వచ్ఛమైన ధవళకాంతి శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైనవారనియూ సంపూర్ణ యోగావతారులనియూ, నీలపురంగు కాంతి వారు అనంతప్రేమతోను కరుణ తోను నిండియున్నవారనియూ, యీ వర్ణములు వివరించుచున్నవని, " ఆ యోగి చెప్పెను.

ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను. చాతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించవలెనా? లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలెనా? ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనము చేయవలెను? ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలెను? ఉపనయనమనగా భ్రూమధ్యమునందున్న మూడవ కన్నునకు సంబంధించినదా? లేక మరేదయినా విశేషమా? మేదాజనమనగా నేమి? ఇటువంటి చర్చ చాల వేడివేడిగా జరిగెను. పండితులు ఏకాభిప్రాయమునకురారయిరి.

సత్య ఋషీశ్వరులని పేరు గాంచిన మల్లాది బాపన్నావధానులు గారు పీఠికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా యుండిరి. వారిని బాపనార్యులని పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యముగా సూర్యుని, అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురమునందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు ఆధ్వర్యము వహించుటకు వారు ఆహ్వానింపబడిరి. యజ్ఞాంతమున కుంభవృష్టిగా వర్షము కురిసినది. అందరునూ సంతోషించిరి. శ్రీ బాపన్నావధానులు గారిని తమ గ్రామములో నివసించవలసినదని క్షత్రియులైన శ్రీ వత్సవాయి నరసింహవర్మ గారు కోరిరి. శ్రీ వర్మగారి ఆహ్వానమును వారు తిరస్కరించిరి.యజ్ఞయాగములలో లభించు సంభావనలను మాత్రమె శ్రీ బాపనార్యులు తీసుకొనెడివారు. ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించెడివారు కారు. శ్రీ వర్మగార్కి అత్యంత ప్రీతిపాత్రమైన కపిలగోవు ఒకటి వుండెడిది. దాని పేరు గాయత్రి. ఆ ధేనువు సమృద్ధిగా పాలనిచ్చెడిది. మిక్కిలి సాదు స్వభావము కలిగినది. అదే సమయమున గాయత్రి కనిపించుటలేదనియూ, ఎచ్చటనో తప్పిపోయినదనియూ శ్రీ వర్మగార్కి వర్తమానము అందినది. శ్రీ బాపనార్యులు జ్యోతిష పండితులు కూడా అగుటచే వర్మగారు వారిని ఏ విషయమై ప్రశ్నించిరి. ఆ గోవు శ్యామలాంబాపురమున (సామర్లకోట) ఖాన్ సాహెబ్ అను కసాయి వాని వద్ద ఉన్నదనియూ వెంటనే వెళ్లకపోయిన యెడల గాయత్రి వధించబడుననియూ బాపనార్యులు తెలిపిరి. వర్మగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించు ప్రయత్నమున బాపనార్యులకు ఒక షరతు విధించిరి. బాపనార్యుల వచనానుసారము గాయత్రి లభించునెడల వర్మగారిచ్చు 3 పుటల భూమిని, నివాసయోగ్యమయిన యింటిని బాపనార్యులు పండిత బహుమానముగా స్వీకరించవలెను. బాపనార్యులు సంకటస్థితిలో పడిరి. తాను దానమును స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చెదరు. అపుడు వారికి గోహత్యాపాతకము చుట్టుకొనును. గోహత్యా పాతకము కంటే పండిత బహుమానము స్వీకరించుట మంచిదని వారు తలపోసిరి. గాయత్రి రక్షింపబడెను. పీఠికాపురవాసుల అదృష్టము పండెను. శ్రీ బాపన్నావధానులు  గారు 3 పుట్ల భూమికి యజమానులయిరి. వారికి నివసించుటకు గృహవసతి కలిగెను. శ్రీ బాపనార్యులకు వెంకావధానులు అను కుమారుడును, సుమతి యను బాలికయును కలరు. సుమతి జాతకము నందు సర్వవిధములయిన శుభ లక్షణములుండుట చేతను ఆమె నడుచునప్పుడు మహారాణిని తలపించు నడక వయ్యారములు ఉండుటచేతను ఆమెకు సుమతీ మహారాణియని నామకరణము చేసెను. శ్రీ బాపనార్యుల కీర్తి ప్రతిష్ఠలు ఆనతి కాలములోనే దశదిశల వ్యాపింపదొడగెను.

గోదావరీ మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామము నుండి ఘండికోట గృహనామమును కలిగిన అప్పల లక్ష్మీనరసింహ రాజశర్మ అను బ్రాహ్మణ బాలకుడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు భారద్వాజ గోత్రీకుడు, ఆపస్తంబసూత్రుడు, వెలనాటి వైదిక శాఖకు చెందినవాడు. వాని యింట కాలాగ్నిశమన దత్తుడను విగ్రహము కలదు. పూజాసమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టముగా మాట్లాడుటయూ, వానికి ఆదేశములిచ్చుటయూ జరుగుచుండును. చిన్నతనముననే అప్పలరాజుశర్మ తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. ఒకనాడు పూజాసమయమున కాలాగ్నిశమనుడు రాజశర్మను పీఠికాపురమునకు పోయి హరితస గోత్రీకుడును, ఆపస్తంబ సూత్రుడును, వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నావధానుల గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప అతడు పీఠికాపురమునకు వచ్చెను. శ్రీ బాపనార్యులు దత్తుని ఆదేశానుసారము తనవద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయవారములు చేసుకొననీయక, తన యింటినందే భోజన సదుపాయమును ఏర్పాటుచేసెను. శ్రీ బాపనార్యులు శనిప్రదోష సమయమున శివారాధానము చేసెడివారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునకు సంబంధించిన వ్రతములు చేసెడివారు. పూర్వకాలమున నందయశోదలు శనిప్రదోష సమయమున శివారాధానము చేసినందువలన సాక్షాత్తూ శ్రీ కృష్ణుని పెంచుకొను అదృష్టమునకు నోచుకొనియున్నారు. శ్రీ బాపనార్యులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయును, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియును, మరికొందరు వైశ్య ప్రముఖులును శివారాధానమునందు పాల్గొనెడివారు.

(ఇంకా ఉంది..)  

అధ్యాయము-5 భాగము-5

అధ్యాయము-5 
శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. -భాగము 5 
కాణీపుర వినాయకుని మహిమ

"నాయనా! వారు ముగ్గురునూ యీ కాణిపురమున సోదరులుగా జన్మించిరి. త్రిమూర్తులను దూషించిననూ, త్రిమూర్త్యాత్మకుడయిన దత్తుని దూషించిననూ లెక్కకు మిక్కుటమయిన అనర్థములు దాపురించును. సోదరులయిన యీ ముగ్గురును ఒక "కాణి" భూమిని యీ గ్రామమునందే సాగుచేసికొనుచుండిరి. ఆ పొలములో ఒక దిగుడుబావి కలదు. దీనినుండి ఏతము సహాయమున నీరు పెట్టుకొనెడివారు. ఒకానొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరు అడుగంటినది. ఒకానొక రోజున నీరంతయూ ఖర్చుకాగా, పారతో యిసుకను తోడు ప్రయత్నములోనుండిరి. ఆ నీటి అడుగుననున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది. ఆ రక్తము చేతికి తగులగానే వారిలోనున్న మూగవానికి మాట వచ్చెను. నీరు యధావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శవలన చెవిటివానికి వాని దోషము హరించినది. మూడవవాడైన గ్రుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే అతని గ్రుద్దితనము పోయినది. ఆ రాయి స్వయంభూవినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తలమీద పార తగిలి పెచ్చు విరుగుటచే అక్కడ నుండి రక్తము స్రవించనారంభించినది.

ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్యఋషీశ్వరులైన బాపన్నావధానులును, వారి బావమరిది అయిన శ్రీధరావధానులును ఈ గ్రామమునకు విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో "మహాభూమి నుండి ఈ లోకములోనికి వచ్చినాను. పృథ్వీ తత్త్వములో అవతరించితిని. ఈ తత్త్వము కాలచక్రమున అనేక మార్పులను చెందును. జల తత్త్వములోను, అగ్ని తత్త్వములోను, వాయుతత్త్వములోను, ఆకాశ తత్త్వములోను, నా అవతరణ యిదివరకే జరిగినది. అయినవిల్లిలో మీరోనరించిన మహాయజ్ఞములోని ఆ హోమ భస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను. శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్య మండలాంతర్గతమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలములో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణము నందును, కాశీయండును, బదరీ యందును, కేదారము నందును కూడా ఏక కాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతరణమునకు సమయము ఆసన్నమగుచున్నది. శ్రీధరా! మీ యింటిపేరును శ్రీపాద నామముగా మార్చుచున్నాను. కౌశికస గోత్రీకులయిన మీ వంశస్థులు ఇకనుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదరు గాక!" అనెను.

రాజకుడైన తిరుమలదాసు శంకరభట్టు తో "నాయనా! శంకరా! మాల్యాద్రిపురము నుండి బాపన్నావధానులును, శ్రీధరావధానులును పీఠికాపురమునందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్య లీలలను ఎన్నింటినో చూచితిని. రేపు నీకు అవన్నియూ సవిస్తారముగా వివరించగలను. నా మొదటి భార్య వలన నాకు ఒక మగ పిల్లవాడు కలదు. అతడు రావిదాసు అను పేరిట కురువపురం గ్రామమునందే నివసించుచు, అచట శ్రీపాదులవారికి యధోచితమైన సేవలు చేయుచున్నాడు. నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణిపురములోనే ఉండిపోయి నా రెండవ భార్యతోనూ నా సంతానముతోనూ కులవృత్తి ననుసరించి జీవించుచున్నాను.

నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలిసికొందువు. వైశ్య శ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి  అనువానిని కలుసుకొనిన యెడల ఎన్నో మహత్తర విషయములు నీకు తెలియగలవు. శ్రేష్ఠి గారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారుపేరుతో పిలిచెడివారు. శ్రేష్ఠి గారి వంశము మీద శ్రీపాదుల వారి అభయహస్తమున్నది. వత్సవాయి గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొనుము. వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధమున్నది. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గ్రంథము తప్ప మరేదియును శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రముగా తెలుపగలవి రానేరావు. ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ." అని తెలిపెను.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము-5 సమాప్తం)     

అధ్యాయము-5 భాగము-4


అధ్యాయము-5 
శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. -భాగము 4 

శంకరభట్టుకు తిరుమలదాసుకు జరిగిన సంవాదము

పూజారి ఆదేశానుసారము నేను రజకుడు నివసించు చోటుకు వెళ్ళితిని. తిరుమలదాసు అను పేరుగల ఆ రజకుడు 70 సంవత్సరముల వయస్సుగల వృద్ధుడు. అతడు తన గుడిశె నుండి బయటకు వచ్చి, ఆదరముగా నన్నొక మంచముపై కూర్చొండబెట్టెను. బ్రాహ్మణ జన్మాహంకారము నాలో చాల భాగము నశించెను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరయిననూ నాకు చాల ఆత్మీయులుగా కనిపించాసాగిరి. వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదమును తిరుమలదాసు నాకు యిచ్చెను. దానిని నేను శ్రీపాదవల్లభుల ప్రసాదముగా భావించి స్వీకరించితిని. తిరుమలదాసు యిట్లు చెప్పనారంభించెను.

అయినవిల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుట

"అయ్యా! ఈ రోజు ఎంతయో సుకృతము! నాకు మీ దర్శనభాగ్యము కలిగినది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చెదరా? మాల్యాద్రిపుర విశేషాలను, పీతికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేయుదునాయని తహతహలాడుచుంటిని. నాయనా! శంకరభట్టు! వరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకొనినావు. నీవు యీ రోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమునకు శ్రీకారము చుట్టుము. కురువపురము నందు నీకు శ్రీవల్లభుల వారి ఆశీర్వాదము లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేద పండితుడను. పరమలోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డపీలికను నములుత గమనించి దానిని జాగ్రత్తపెట్టుకోవలసినదని నా కుమారులకు సూచించితిని. అవసానకాలమున మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణములు విడుచుట చేత నేను రజక జన్మము నొందితిని. జన్మావసానమున ఏ సంకల్పముతో ప్రాణము విడువబడునో, తదనుగుణమైన మరు జన్మము లభించును. నా పూర్వ పుణ్య వశమున గర్తపురీ (గుంటూరు) మండలాంతర్గతమగు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురము నందు జన్మించితిని. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమాయెను. ఆ గ్రామము నందు మల్లాది అను గృహనామము గల రెండు కుటుంబములుండెను. ఒకరు మల్లాది బాపన్నావధానులు అను పేరు గల మహాపండితులు. వారు హరితస గోత్ర సంభవులు. రెండవ వారు మల్లాది శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు. వారు కౌశికస గోత్ర సంభవులు. శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానులు గార్కి ఇచ్చి వివాహము చేసిరి. బావబావమరుదులు యిద్దరునూ మహా పండితులే. గోదావరీ మండలాంతర్గతమైన "అయినవిల్లి" అను గ్రామములో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞమునకు యిద్దరునూ వేంచేసిరి. శాస్త్రము ప్రకారము ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొన వలెననియూ, స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమీయ వలెననియూ, కొందరు పండితులు వాదము చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహాపండితులు యిద్దరునూ తాము మహాగణపతిని ప్రత్యక్షపరచ గలమనియూ, వేదోక్తముగా సమస్తమునూ జరిపిన్చాగాలమనియూ ప్రతిజ్ఞ చేసిరి. యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి, ఆనతి కాలములోనే వారు గణేశచతుర్థినాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించెదరని ఆనతిచ్చిరి. యజ్ఞమునకు హాజరయిన వారందరునూ ఆశ్చర్యచకితులయిరి. ఆ సభలో ముగ్గురు నాస్తికులుండిరి. వారు కనిపిన్చినదంతయునూ ఇంద్రజాలమో మహేంద్రజాలమో గాని గణపతి మాత్రము కాదు. అట్లయిన మరియొక పర్యాయము నిదర్శనమీయవలయును, అని వాడిన్చిరి.

కాణీపుర వినాయకుని మహిమ 

అప్పుడు హోమగుండము నందలి విభూతి మానవాకారము ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ మహా గణపతి రూపము "మూర్ఖులారా! త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడునూ, బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియునూ, శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవుచున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియునూ, మహిషాసురుని వధించు సమయమున పార్వతీదేవియునూ, భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువునూ, సమస్త సిద్ధులూ సిద్ధించుటకు సిద్ధ మునులునూ, ప్రపంచమును జయించు నిమిత్తము మన్మథుడునూ, యిదే విధముగా సమస్త దేవతలునూ, నన్ను ఆరాధించియే అభీష్టములను పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేనే. నేను సర్వశక్తిమంతుడను. దైవీశక్తులు, రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే. అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకొంటిరి? హరిహర పుత్రుడైన ధర్మశాస్తయే. విష్ణురూపములో బ్రహ్మరుద్రులు విలీనమయిన అది దత్తరూపము. ధర్మశాస్త రూపములో గణపతి, షణ్ముఖులు విలీనమైన అది కూడా దత్తరూపమే. దత్తుడెల్లప్పుడును త్రిమూర్త్యాత్మకుడని తెలియుడు. శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి యున్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభులు గణేశ చతుర్థి నాడు అవతరించిరి. సుబ్రహ్మణ్యతత్త్వము వలన వారిది కేవలము జ్ఞానావతారమని తెలియుడు. ధర్మశాస్త తత్త్వము వలన వారిది సమస్త ధర్మ కర్మలకు ఆదియునూ, మూలమునూ అని గమనించుడు. రాబోవు వారి అవతారము మాతాపితల సంయోగ ఫలితము కాదు. జ్యోతిస్వరూపము మానవాకృతి చెందును.

ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్యస్వరూపమును కంటితో చూచియూ అసత్యము పలికినండులకు మీలో ఒకడు గ్రుడ్డివాడుగా పుట్టును. సత్యస్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మూగవాడుగా పుట్టును. ఇంతమంది సత్యసందులయిన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్నను పెడచెవిన పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ ముగ్గురునూ అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు." అని పలికెను."

(ఇంకా ఉంది..)