Wednesday, March 28, 2012

Chapter 15 Part 2

అధ్యాయము 15
బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 2
జీవులకు వివిధ యోనుల యందు కలుగు యాతనల వివరణ

అంతట నేను "అయ్యా! జీవమున్నప్పుడే కదా బాధగాని, సుఖముగాని అనుభవమయ్యేది? అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండుట ఎట్లు సాధ్యపడును?" అని ప్రశ్నించితిని. అంతట బంగారప్ప, "జీవాత్మ, పరమాత్మలో కలిసియున్నప్పుడు బ్రహ్మానందమును అనుభవించును. అది వాక్కులో వివరించుటకు వీలుకానిది, మనస్సులో తెలియరానిది. అదే విధముగా జీవాత్మ, శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైన మహా దుఃఖమును అనుభవించును. అది కూడా వాక్కులో వివరించుటకు సాధ్యము కానిది, మనస్సులో తెలియరానిది, అనగా ప్రాణమనునది లేనపుడు అనుభవింపబడే మహాదుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచూ, తెలియరాని, ఊహించరాని, ప్రాణరహితమైన మహాదుఃఖములను అనుభావిన్చుచూ లోహములో ప్రవేశించును. నానావిధ లోహములలో అది సంచరించుచూ నిద్రాణస్థితిలోనున్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహముపై, దాని సరిపడని విషపూరిత పదార్థమును పోసినావనుకొనుము. దానిలో నున్న ప్రాణము నిద్రాణస్థితిలోనే బాధననుభవించి ఆ లోహమును విడచి మరియొక లోహములోనికి ప్రయాణించును. లోహజాతులలో తాదాత్మ్యము నొందిన ఆత్మ పరిణామక్రమములో వృక్షములో ప్రవేశించును. ఇదివరకు నిర్జీవ పదార్థముగా నున్నపుడు నిద్రాణమైయున్న ప్రాణము యిప్పుడు చైతన్యవంతమై నితారుగానో, వాలుగానో ఉండవలెననెడి సంకల్పమును కలిగి యుండును. అయితే ధృడత్వమునకు ఏర్పాటైన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొనిపోయి దాని పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఈ విధముగా అనేక రకముల వృక్ష జాతులలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుచూ సగము జీవనసహితముగను, సగము జీవనరహితముగను ఉండెడి స్థితి నుండి వెలువడి క్రిమికీటకములుగా పరిణతి చెందును. ఈ దశలో చలనము కావలెననెడి దాని సంకల్పము నెరవేరును. ఈ విధముగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచూ మత్స్య రూపమును పొందును. ఆ తర్వాత పక్షిరూపమును పొందును. అనేక రకముల పక్షుల రూపములలో అనుభవము పొందిన తదుపరి నాలుగు కాళ్ళు కలిగిన జంతువులుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందును. మానవులకు తల్లివలె క్షీరమునొసంగుట చేత తనకు తెలియకుండగనే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహారధాన్యముల ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సముపార్జితమగును. తరువాత జన్మమునందు మానవ శరీరమును పొందును. సంస్కారముల వలన ఆలోచనలు కలుగును. అవి చేతలుగా మారును. ఈ విధముగా పుణ్య కర్మలు, పాపకర్మలు చేయబడుచుండును.

సాధన పథమున సప్తభూమికల విచారణ

మానవుడు తన పరిణామక్రమములో సప్తభూమికలందుండును. మొదటి భూమికయందు స్థూల దేహేంద్రియములు, సూక్ష్మ దేహేంద్రియములు ఏకకాలములో ఉపయోగించబడును. రెండవ భూమికయందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవమును పొందుచూ చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందును. మూడవ భూమిక యందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతములకు ప్రయాణము చేయగల శక్తిని పొందును. మూడు, నాలుగు భూమికల మధ్య వశీకరణ కేంద్రమొకటి ఉన్నది. వశీకరణకు లోనయినప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాల దిగ్భ్రాంతికి లోనయింది. అపుడు ఆమె తాను శిలా చైతన్యములో నున్నట్లు భావించుకొన్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము వరకు అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే మూడు, నాలుగు భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రములో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగనే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజస్థితిని పొందినది.

నాలుగవ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగాశాక్తులు లభించును. తమ యోగశక్తులను లోకకళ్యాణార్థము అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితిలోనికి పోయే వీలుంటుంది. అట్లుగాక పాపకార్యముల నిమిత్తము, తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం యీ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలాచైతన్యములోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలనెత్తిన గాని మానవజన్మలోనికి అడుగు పెట్టే అవకాశం ఉండదు. అయిదవ భూమికలో నున్నవారు సంకల్పజ్ఞానులు. ఆరవ భూమికలో నున్నవారు భావజ్ఞానులు. సంకల్పజ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపములను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస చాల తక్కువగా ఉంటుంది. ఏడవభూమికలో నున్నవారు పరమాత్మ యందుండే అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందగలుగుతారు." అని తెలియపరచెను.

అవతార పురుషులకు, సాధకులకు గల వ్యత్యాసము 

బంగారప్ప చెప్పిన మాటలను ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకొను నిమిత్తం యిట్లు ప్రశ్నించితిని. "అయ్యా! జీవులకు మాత్రమే పరిణామ క్రమముండునా? లేక అవతారములకు కూడా యివి వర్తించునా? " అంతట బంగారప్ప "అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన యెడల సమర్థ సద్గురువని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన యెడల అవతారమనబడును. మత్స్యము నీటిలో వడిగా పరిగెత్తగలదు. కూర్మము నీటిలోనూ, భూమిమీద వాడిగా ఉండగలదు. వరాహము అనగా ఖడ్గమృగము, భూమిమీద వాడిగా పరిగెత్తగల జంతువు. నారసింహము, మృగములలో శ్రేష్ఠమైన సింహపు ముఖాకృతితోను, మిగిలిన భాగము మనుష్య రూపముతోను ఉన్న అవతారము. యాచనాప్రవృత్తిని గల తమోగుణ ప్రధానముగా వచ్చినది వామనావతారము. రజోగుణ ప్రధానముగా వచ్చినది పరశురామావతారము. సత్త్వగుణ ప్రధానముగా వచ్చినది రామావతారము. త్రిగుణములకు అతీతమైన నిర్గుణ తత్త్వ ప్రధానముగా వచ్చినది శ్రీకృష్ణావతారము. కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారము. సమస్త సృష్టిలోని ఏకత్వము నందలి అనేకత్వమును, అనేకత్వము నందలి ఏకత్వమును తన యందె నిలుపుకొనివచ్చిన అత్యంత అద్భుతమైన, అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారము. శ్రీపాదుల వారికి ఋణానుబంధము లేని యోగసంప్రదాయములు గాని, మతములు గాని, ధర్మములు గాని సృష్టిలో లేనేలేవు. శ్రీపాదులవారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరము కానిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములునూ, అన్ని సంప్రదాయములును వారి యందు సమన్వయము చెందును. ఈ సృష్టికంతటికినీ ఆది బిందువు, అన్త్యబిండువు వారే. స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారము నంతయునూ పర్యవేక్షించునది, సంకల్పించునది, గతి నొందించునది వారే. ఇది నిగూఢమైన దైవ రహస్యము. సప్త ఋషులకే అంతు పట్టని వారి స్థితిని నేనేమని వర్ణించగలను? నాయనా! శంకరభట్టూ! నీవు ధన్యుడవు! వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు, అన్యజీవులు వ్యర్థజీవులు." అని చెప్పెను.

సత్కర్మ, దుష్కర్మల ఫల వివరణ 

"అయ్యా! నాకొక సందేహము కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినపుడు లోకములో కొందరిని మంచివారు గానూ, మరికొందరిని చెడ్డవారుగాను పుట్టించనేల? అని నేనడిగితిని.

దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, "నాయనా! నీవు మంచి ప్రశ్ననే అడిగిటివి. సృష్టి యంతయునూ ద్వంద్వముల సాయము చేతనే ఏర్పడినది. మృత్యు భయము లేకపోతే కన్నతల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనే అర్థములో వాడబడినది. అంతేగాని పురుషాధిక్యతను సూచించు అర్థములో కాదు. మానవధర్మములకు, జంతుధర్మములకు ఎంతటి వ్యత్యాసము కలదో మానవ ధర్మములకు, దేవతా ధర్మములకు కూడా అంతటి వ్యత్యాసముండును. ద్వంద్వములే లేకున్న వికాసముగాని, పరిణామముగాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడనిన యెడల, అన్నియునూ మంచిశక్తులు మాత్రమే వారియందు కలవని అర్థము కాదు. నీవు యీ ప్రపంచములో చూచేది మోసము, దగా, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖము కోరుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానము లేనిదే సుఖానుభవము అనునది తెలియరాదు. మనము చూచెడి యీ కోటానుకోట్ల నక్షత్ర రాశులన్నియు మొట్టమొదట అస్త్యవ్యస్తముగా ఏర్పడినవే! అవి పరస్పరము డీకొని మరికొన్ని నక్షత్ర రాశులేర్పడినవి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతము మనకు దృగ్గోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్రరాశులు ఏర్పడినవి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధృవుడు ఆధారము. ఈ రకముగా పరస్పర ఆకర్షణ వికర్షణలలో సృష్టి నడుచుచున్నది. పరమాత్మ యందు ఆకర్షణ కలిగినవాడు ఆస్తికుడై, సత్కర్ముడగుచున్నాడు. వికర్షణ కలిగినవాడు నాస్తికుడై, దుష్కర్ముడగుచున్నాడు. ఆస్తికులకునూ, నాస్తికులకునూ వారే ఆధారము. సత్కర్ములకునూ, దుష్కర్ములకునూ వారే ఆధారము. ఈ సృష్టిలీలలో ఏదియునూ స్థిరము కాదు. నీవు యీనాడు ఎవరిని సత్కర్ములుగా ననుకొనుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలనాచరించిన వారే! అందువలననే యీ జన్మలో ధర్మతత్పరులైయున్నను వారికి దుఖములు తప్పుటలేదు. అటులనే దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా వారి పూర్వజన్మకృత పుణ్యఫలానుభవము కాని వేరు కాదు. సామాన్య పాపముకాని, పుణ్యము కాని వెంటనే ఫలితముల నీయవు. అయితే తీవ్రమైన పాపముగాని, మహాపుణ్యముగాని చేసిన యెడల శీఘ్రముగనే ఫలించును. మానవుడు ఏ విధముగా నడుచుకొన్నయెడల సుఖముగా జీవింపవచ్చునో సద్గ్రంథములు తెలియజేయుచున్నవి. మంచి పని చేయుటకుగాని, చెడుపని చేయుటకుగాని వానికి పరిమితమైన స్వేచ్ఛ యీయబడినది. అధర్మము మితిమీరి ధార్మికులు దిక్కు తోచని స్థితిలో నున్నపుడు పరమాత్మ తన మాయచేత అవతరించుచున్నాడు. చావు, పుట్టుకలు లేని దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్యనుండుట అద్భుతమైన విషయము." అని చెప్పిరి.      
 
(ఇంకా ఉంది..)  

Tuesday, March 27, 2012

Chapter 15 Part 1

అధ్యాయము 15
బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 1

నేను శ్రీ దత్తానందులస్వామి వారినుండి శెలవు తీసుకొని నా ప్రయాణాన్ని కొనసాగించుచున్నాను. దారిలో దప్పిక అగుటవలన అక్కడకు దగ్గరనే ఉన్న ఒక బావి వద్దకు వెళ్ళితిని. అచట నీరు చేదుకొనుటకు ఒక చేద కూడా కలదు. నేను నూతిలోపలికి తొంగిచూద్దును గదా! ఒక వింత దృశ్యం కంట పడినది. నూతి ఒరల మధ్య భాగము నుంచి మొలిచిన ఒక చెట్టు కొమ్మను ఆధారముగా చేసుకొని తలక్రిందులుగా ఒక వ్యక్తి వేలాడుచుండెను. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో, శంకరభట్టూ! అని పిలిచెను. ఆశ్చర్యముతో నా పేరు మీకెట్లు తెలిసిందని అడిగితిని. అందులకతడు, "నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు కురుంగడ్డ వెడుతున్న విషయం కూడా నాకు తెలియును. నిన్ను కలుసుకునే నిమిత్తమై మాత్రమే నేను వేచియున్నాను." అని చెప్పెను.

అతడిని నూతిలోనుండి బైటకు తీయుట ఎట్లా అని నేను ఆలోచించసాగితిని. చేదకున్న త్రాడు బలహీనమైనది. నా ఆలోచనను పసిగట్టిన ఆ పుణ్యపురుషుడు "ప్రాపంచిక బంధములతో సంసార కూపమున బడిన మానవుడవు నీవు. బంధరహితుడనై యీ విచిత్ర యోగప్రక్రియలో ఆత్మానందమున ఉన్నవాడను నేను. నన్ను నీవేమి లేవనెత్తగలవు? నా యంతట నేనే లేచేడను. మనకు శక్తి చాలనపుడు శ్రీపాదులవారు దయతో శక్తి ననుగ్రహించెదరు." అని అనెను. అట్లనుటయే తడవుగా కనురెప్ప పాటులో నా ప్రక్కన ఉండెను. నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని. అతడిట్లు చెప్పసాగెను. "నా పేరు బంగారప్ప. నీవు దాహము గొనినట్లున్నావు. నేను నీ దప్పిక తీర్చెదను." అని పలికి తక్షణమే చేదతో నీతిని తోడి తానూ గడగడ త్రాగుచుండెను. విచిత్రముగా నా దాహము కట్టబడెను. నేను ఆశ్చర్యపోయితిని.

అంతట మేమిద్దరమును కలిసి ప్రయాణము చేయసాగితిమి. అతడిట్లు చెప్పసాగెను. "నేను స్వర్ణకార కుటుంబమునకు చెందినవాడను. మంత్ర తంత్రములలో ప్రావీణ్యమును సంపాదించినవాడను. నాకు అయిష్టులయిన వారిని మంత్ర తంత్ర ప్రయోగాములతో చేతబడి చేసి చంపగల సామర్థ్యమును సంపాదించితిని. భూత ప్రేత పిశాచములతో సన్నిహితత్వమును కూడా పొందితిని. శ్మశానములలో వివిధములయిన కార్య కలాపములను చేసెడివాడను. నా పేరు వినినంతనే జనులు గడగడలాడెడివారు. నేను ఏ గ్రామమునకు పోయిననూ, అచ్చటి జనులు నేను భూతప్రేతములను ప్రయోగించుటద్వారా వారికి ఏ విధమైన కష్ట నష్టములను కలిగించెదనో అను భయముతో నాకు విశేషముగా ధనము నిచ్చెడివారు. వారొసంగిన ధనములో ఎక్కువ భాగము సదా నన్ను ఆశ్రయించి యుండు భూతప్రేతముల బలులకు ఉపయోగింపబడెడిది. సకాలములో బలులు సమర్పింపని యెడల ఆ భూతములు నాకే తీవ్ర హానిని కలిగింపగలవు. నా ముఖములో సాధారణ మనుష్యులకుండవలసిన ప్రసన్నత్వము లోపించి భూతప్రేతములకుండు వికృత కళలను, క్రూర స్వభావ లక్షణములను పెంపొందినవి. నా సంచారములలో ఒకసారి పూర్వ పుణ్యవశమున పీఠికాపురమునకు వచ్చితిని.

దత్తప్రభువుల అవతారముచే పవిత్రమైన యీ నగరమందు క్షుద్రములయిన కుతంత్రములకును, పరస్పర కలహములకును కూడ లోటులేదు. నేను శ్రీ బాపనార్యులవారి గురించి, శ్రీపాదులవారి గురించి కర్ణాకర్ణిగా చిత్రవిచిత్రములయిన విషయములను వింటిని. మునుముందుగా నేను బాపనార్యులవారిని సంహరింపదలచితిని. నేనొక కొలను వద్దకుపోయి దోసిళ్ళకు దోసిళ్ళు నీటిని త్రాగుచుంటిని. నేను ఎవరినయినా చంపదలచుకొన్నపుడు నా వద్ద అనేక రకములయిన ప్రక్రియలుండెడివి. అందులో ఒకటి నేను చంపదలచుకున్న మనుష్యుని రూపమును ధ్యానించుచూ నీటిని త్రాగినచో, నేను త్రాగిన నీరంతయునూ ఆ మనుష్యుని పొట్టలో చేరును. నీటితో పొట్ట నిండిపోగా ఆ వ్యక్తి పొట్టపగిలి చచ్చును. శ్రీపాదుల వారి లీలావిశేషములు అనూహ్యములు. నేను కొలనులో నీరు త్రాగు సమయమున బాపనార్యుల వద్ద శ్రీపాదులుండిరి. శ్రీపాదుల వారు ప్రేమతో బాపనార్యుల పొట్టను నిమిరిరి. నేను ఎంత నీరు త్రాగుచుండిననూ అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరియై పోవుచున్నది. నీటిని త్రాగి త్రాగి నేనే అలసిపోయితిని. కాని బాపనార్యులవారు మాత్రము నిక్షేపముగా నుండిరి. నా యీ క్షుద్రవిద్య ఎందులకు యీ రోజున విఫలమయ్యెనాయని ఆవేదన చెందితిని. కారణము తెలియరాకుండెను.

శ్రీపాదులు క్షుద్రోపాసకుల పీడ తొలగించుట

నా వద్ద సర్పమంత్రమొకటుండెడిది. అది పఠిoచినచో వెంటనే నేను మనస్సులో ధ్యానించిన వ్యక్తి యింటివద్దకు ఎక్కడెక్కడి సర్పములు వచ్చిచేరి వానిని కాటు వేయును. నేను బాపనార్యులను ధ్యానించి ఆ సర్పమంత్రమును పఠించితిని. అపుడు అనేక సర్పములు బాపనార్యుల యింట చేరినవి. అయితే అవి ఆ యింటనున్న ఒక పందిరిపైకి ఎగబ్రాకి పొట్లకాయలవలె వ్రేలాడినవి. రెండు ముహూర్తముల కాలము గతించిన తరువాత ఆ సర్పములు ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి తిరిగి వెళ్లిపోయినవి. ఈ విధముగా నా రెండవ ప్రయత్నము కూడా విఫలమైనది. నా వద్ద నున్న భూతప్రేతములు బాపనార్యుల యింటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షగా చెప్పినవి. ఇదంతయునూ శ్రీపాదుల వారి చమత్కారమని లీలగా నాకు అర్థమైనది. నాలో యింకనూ రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానమునకు పోయి శ్రీపాదులవారి పిండిబొమ్మను చేసి, దానికి 32 స్థానములలో 32 సూదులను గ్రుచ్చితిని. ఈ మారణప్రక్రియ వలన శ్రీపాదులవారి శరీరములో ఆయా స్థానములలో రుగ్మతలు కలిగితీరవలెను. అంతేగాక ఆ సూదులు ద్రవరూపమును పొంది శ్రీపాదుల వారి శరీరములోకి యింకిపోయి శరీరమంతయును విషపూరితమై మరణము కలిగితీరవలెను. నా యీ ప్రయత్నము కూడా విఫలమయ్యెను. విచిత్రముగా ఒకానొక అర్థరాత్రి సమయమున నా పొట్టలో నీరు అధికముగా చేరుచున్నదను అనుభవము కలిగెను. నాకు ప్రాణాంతకముగా నుండెను. నా సర్పమంత్ర ప్రభావమునకు బాపనార్యుల యింట చేరిన సర్పములన్నియును పీఠికాపురములోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటువేసినవి. శ్రీపాదులవారి పిండిబొమ్మకు ఎక్కడయితే నేను సూదులను గుచ్చితినో నా శరీరమునందు సరిగా అదే ప్రదేశములలో బాధ కలుగజొచ్చెను. ఈ విధముగా నా దుష్ట చర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరమునందే అనుభవింప సాగితిని. నరకయాతననుభవించితిని. చనిపోయిన బాగుండునని తోచినది. అయితే నాకు చావు రాకుండెను. నరకబాధలు ఎట్లుండునో చనిపోయిన గాని తెలియవు. కాని నేను ఆ రాత్రి బ్రతికుండగనే నరకబాధాలను చవిచూసితిని. భరించలేని బాధలు కలిగినపుడు ఏ మానవుడైననూ దైవము వైపునకు తిరుగక మానడు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనస్సులోనే శరణుజొచ్చితిని. నా మనోనేత్రమునకు శ్రేపాదుల వారి రూపము గోచరించి, "బంగారప్పా! నీవొనరించిన మహాపాపములకు నీవు అనేక సంవత్సరములు యిహలోకములో బాధలు అనుభవించిన తదుపరి నరకములో కూడా బాధలను అనుభవింప వలసియున్నది. అయితే నీయందు కృప వహించి యీ ఒక్క రాత్రిలో నీవు పడెడి యాతనలద్వారా నీ పాపకర్మను ధ్వంసము చేయుచున్నాను. నీ యొక్క క్షుద్రవిద్యలు అన్నియూ నశించును. అయితే ఎవరయినా దాహము గొనియున్నవారు నీ మనోనేత్రములకు గోచరించినపుడు నీవు నీరుత్రాగి దప్పిక తీర్చుకున్నయెడల వారెంతటి దూరములో నున్నను వారు దాహార్తి తీరినవారగుదురు. తలక్రిందులుగా వ్రేలాడుట అను ఒకానొక యోగప్రక్రియ కలదు. దానిని అభ్యసించినచోనీవు ఆనందప్రాప్తిని పొందగలవు. నేటినుండి సాత్వికప్రవృత్తి ననుసరించి జీవింపుము. మా మాతాపితరుల గృహమునందు గాని, బాపనార్యుల వారి గృహమునందు గాని అడుగిడుటకు ఎన్నియో జన్మల పుణ్యము కావలెను. నీకు యీ జన్మమునందు అంతటి అదృష్టము లేదు. అదృష్టమనునది ఆకస్మాత్తుగా లభించునది కాదు. దురదృష్టమనునది విచక్షణారహితముగా యివ్వబడునది కాదు. పూర్వజన్మములోని పుణ్యకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చునపుడు అదృష్టమని అందురు. పాపకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చునపుడు దురదృష్టమని అందురు. ప్రాణము నొసంగునది పరమేశ్వరుడు గనుక ప్రాణము తీయు అధికారము కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు. మాతాపితలు జన్మదాతలు గనుక వారు పరమపూజ్యులు. వారిని వృద్ధాప్యములో అనాదరము చేసినవారి యందు నా కటాక్షము ఉండదు. నీవు క్షుద్రవిద్యలతో ఎందరో అమాయకులను అకాలమరణమునకు గురిచేసినావు. ఆ పాపఫలము నీకు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు కనుపించునంతవరకు ఉండును. అతడు దప్పిగొనియున్నపుడు నీవు నీ విద్యనుపయోగించి అతని దప్పికను తీర్చుము. అప్పుడు నీ పాపము నిశ్శేషమగును. ఆ శంకరభట్టు అనునతడు నా చరిత్రమును వ్రాయును." అని చెప్పిరి. ఈ సంఘటన జరుగునాటికి శ్రీపాదులవారి వయస్సు ఏడెనిమిది సంవత్సరములుండును. నాయనా! శంకరభట్టూ! ఆ రోజు నుండి నీ కోసమే నేను వేచియున్నాను. నేడు నాకెంతయో సుదినము! అని బంగారప్ప అనెను. నాకు యీ గాధ అంతయునూ అయోమయముగా నుండెను. అంతట నేనిట్లంటిని. అయ్యా! మీరు నీరు త్రాగిన యెడల మరియొకరి దప్పిక ఎట్లు తీరును? ఇందలి మర్మమును నాకు విశదపరచవలసినదంటిని. దానికి బంగారప్ప, "నాయనా! అన్నమయకోశము నందుండు జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచములో అనుభవములను పొందుదురు. ప్రాణమయకోశము నందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగియుందురు. మనోమయకోశము నందలి జీవులు మానసిక ప్రపంచముతో సంబంధమును కలిగియుందురు. విజ్ఞానమయకోశము నందలి జీవులు దానికి సంబంధించిన ప్రపంచముతో సంబంధమును కలిగియుందురు. ఆనందమయ కోశము నందలి జీవులకు ఆనందానుభవముండును. ప్రాణమయశక్తిని ఒకానొక యోగప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయశక్తితో అనుసంధానమొనరించెదను. తద్వారా, యీ తాదాత్మ్యభావము వలన యిది సాధ్యమగును. ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా పూర్వకాలమున వాలి, తన ఎదురుగానున్న వానికంటె రెట్టింపు బలమును, శక్తిని పొందుచుండెను. అందువలననే రాముడు వాలిని చెట్టు చాటు నుండి వధించెను. విశ్వామిత్రమహర్షి రామ లక్ష్మణులకు బల అతిబల అను రెండు పవిత్ర మంత్రములనుపదేశించెను. ఈ మంత్రముల స్పందనలకు అనుగుణముగా ప్రాణశక్తిని సిద్ధపరచుకొనినయెడల విశ్వాంతరాళమునందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకొన వీలుకలుగును. శరీరము పరిశుద్ధమైనది గానిచో, ఆ శక్తి మన శరీరములోనికి ప్రవేశించునపుడు విపరీతమైన బాధ కలుగుటయే గాక ఆ శక్తిని నిలుపుకొనలేక మరణము కూడా సంభవించును. పరిశుద్ధతాక్రమములో మానవ శరీరములు 12 దశలలో కలవు. శ్రీరాముని శరీరము 12 వ దశకు చెందినది. శ్రీదత్తుని శరీరము 12 వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులయిన శ్రీపాదులవారియందు అనంతశక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధముగా నుండును." అని చెప్పెను. అంతట నేను "అయ్యో! గౌతమమహర్షి శాపము వలన అహల్య శిలారూపమును పొందెననియూ, శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యెనని అందురు గదా! ఆమె నిజముగా శిలారూపమును పొందెనా? లేక యిందులో ఏదయినా రహస్యార్థమున్నదా?" అని ప్రశ్నించితిని.

అంతట బంగారప్ప, "మంచి ప్రశ్ననే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధమును కలిగియుండెను. ఈ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను 'శిల'కమ్మని శపించెను. అంతట అహల్య గౌతముని, ఓ తెలివిమాలిన మునీ! ఎంతపని చేసితివి? అనెను. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్యస్థలములను దర్శించుచూ శివానుగ్రహమున స్వస్థత నందెను. చైతన్య పరిణామక్రమములో 'శిల' ప్రథమ స్థానము లోనిది. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో నుండును. శిలలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములను పొందుచున్నది. ఆ అనుభవముల తర్వాతా మరియొక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగానున్న ప్రథమశిలలో మరియొక ఆత్మ ప్రవేశించును. ఏ ఆత్మ ఏ శిలలో ఎంత కాలము ఉన్నదనుట కేవలము యోగదృష్టి కలవారికి మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా, ఆ శిల రెండుగా ఖండించబడెననుకొనుము. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా, మరియొక ఖండములో మరియొక ఆత్మ ఉండి కొన్ని అనుభవములను పొందును. అవి ఏ రకమయిన అనుభవములు పొందుచున్నవో వాటికే తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నపుడు ఆ ఆత్మ అపరిమితమైన బాధను అనుభవించును. వాటికి జీవము లేదు గాని బాధా అనుభవము మాత్రముండును." వివరించెను.


(ఇంకా ఉంది..)                  

Saturday, March 10, 2012

Chapter 14 Part 5 (Last Part)

శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయ వాక్యములు 

శ్రీపాదులవారు దత్తదాసుని యింట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము.

1 . నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోట నేను సూక్ష్మ రూపమున ఉందును.
2 . మనోవాక్కాయకర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలె కాపాడుచుందును.
3 . శ్రీ పీఠికాపురమున నేను ప్రతి నిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవరహస్యము.
4 . సదా నన్ను ధ్యానించువారి కర్మలను, అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవి అయిననూ వానినన్నింటినీ భస్మీపటలము గావించెదను.
5 . అన్నమో రామచంద్రా అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యెదను.
6 . నేను శ్రీపాద శ్రీవల్లభుడను! నా భక్తుల యింట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును.
7 . నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును.
8 . నీవు ఏ దేవతాస్వరూపమును ఆరాధించిననూ, ఏ సద్గురువును ఆలంబనముగా చేసికొన్ననూ నాకు సమ్మతమే!
9 . నీవు చేయు ప్రార్థనలన్నియునూ నాకే చేరును. నీవు ఆరాధించు దేవతాస్వరూపము ద్వారాను, నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందచేయబడును.
10 . శ్రీపాద శ్రీవల్లభుడనిన పరిమితమయిన యీ నామరూపము మాత్రమే కాదు. సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు.
11 . నాది యోగసంపూర్ణ అవతారము. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరునూ నాయొక్క అంశలే.
12 . నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న యెడల నేను నీకు ధర్మమార్గమును, కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.
     

Chapter 14 Part 4

అధ్యాయము 14
దత్తదాసునకు అభయ ప్రదానము - భాగము 4

నాయనా! శంకరభట్టూ! సకల దేవతలును తెజస్సంభూతులు. అదితి అనంతరూపిణి. ఆమె సంతానమే దేవతలు. మానవుని ప్రవృద్ధికిని, పురోగమనమునకునూ వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు. మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్య పోషకులు. దివ్యలోకమునకు నిర్మాతలు. మానవుల సంపూర్ణ మోక్షమునకు అవ్యాజానందమునకు విఘ్నములను కలిగించు దుష్ట శక్తులను జోడించువారు. ఋషులు దేవతల సాక్షాత్కారము పొంది, వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకముల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. ఆశ్వమను శబ్దమునకు గుఱ్ఱము అని లౌకికార్థము. అయితే వేదఋషులు మాత్రము కొంత జడ చైతన్యమును, మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించి ప్రాణమయ చైతన్యమునకు, జాజశ్శక్తికి, జీవశ్వాశశక్తికి అశ్వము సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధులు, పశువులు మొదలయిన జీవరాశులవలెనే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములయినవి కానేకావు. అవి సజీవములయిన జననోపచయ సంభూతములు. కొన్ని మూలబీజములనదగిన శబ్దముల వలన పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. అవి ధాతువుల అసంఖ్యాక సంతానమే. బహుదా అభివృద్ధి నొంది విభిన్న వర్గములుగా విడిపోయి, వేరువేరు జాతులు, వంశములు, కుటుంబములుగ వృద్ధి చెందినవి. పదముల సంప్యూహములందు ఒక్కొక్కదానికిని ఒక సమాన ప్రకాండము, మానసిక తత్త్వ చరిత్ర కలదు.

బ్రాహ్మణులే భూసురులు అనుటకు కారణము

వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును, అగ్నియును, ఇంద్రుడు మాత్రము కాదు. ప్రానేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించినది. మానవుని యొక్క యింద్రియముల సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామక్రమ పధ్ధతి ప్రకారమే ప్రానేంద్రియ చైతన్యములను అనుసరించి భాషాబోధనా ప్రయోగము అనునది పరిణమించినది. నాయనా! దేవతలందరునూ మంత్రస్వరూపులు.  ఈ జగత్తు అంతయునూ దైవాధీనమయి ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులయి ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల అధీనములై యున్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలైయున్నారు.

శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలయిన అత్యంత స్వల్ప పరిమితిగల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని శేముషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావవైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశితమైన నిష్చితత్వమునకు, భౌతికమైన అంశముల నుండి మానసికాంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు యీ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించును.

పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్య చరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడినవాడవు. నీవు దానిని సంస్కృత భాషయందు రచించిననూ, అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెనుగున అనువదింపబడిననూ, పారాయణము చేయుట వలన కలుగు ఫలితము మాత్రము ఒకటే! శ్రీపాదుల వారి దివ్య చరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్ననూ శ్రీపాడులవారు అచ్చటనే సూక్ష్మ రూపమున యుండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను. సావధానముగా ఆలకింపుము.

శ్రీపాదుల వారు సప్తవర్షముల ప్రాయము వారయిరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల యిండ్లలో యిటువంటివి జరిగినపుడు ఎంతో సంరంభముండెడిది. శ్రీ బాపనార్యులవారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురము నందుండు దత్తదాసుడను మాలదాసరికి యీ మహోత్సవమును చూచుయోగము కలుగలేదు. అతడు పంచమజాతికి చెందిన వాడయినందున యీ అవకాశము కలుగలేదు. అతడు తన జాతి వారందరిని తన యింటికి ఆహ్వానించి దత్త చరిత్రమును వినిపించెదమని చెప్పెను. వారందరునూ ఎంతో ఆసక్తితో వాని యింటికి చేరిరి. దత్తదాసు దత్తచరిత్రమును ఇట్లు చెప్పనారంభించెను. "పూర్వయుగములందు అనసూయామాతకును, అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే యీనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్యతేజో విరాజితుడై మన ప్రభువు భాసించుచుండెను. దీనజనోద్దారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు నిత్య శ్రీమంగళము అగును గాక!" ఇంతకంటె శ్రీగురుని గురించి చెప్పుటకు అతనివద్ద ఏ రకమైన పాండిత్యమునూ లేదు. అతడు ఇదే కథను పదే పదే చెప్పుచుండెను. వినువారలు కూడా తన్మయులై వినుచుండిరి. ఈ రకముగా 53 సార్లు జరిగెను. దత్తదాసుపై శ్రీపాదులవారి అమృతదృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదులవారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తానూ మాలదాసరి యింటికి వెంటనే పోవలసియున్నదనిరి. అంతట శ్రీ బాపనార్యులు శ్రీపాదులవారిని కారణమడుగగా "విశుద్ధ అంతఃకరణుడయిన దత్తదాసు నా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53 అధ్యాయములు పూర్తి అయినట్లు భావింపవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసినవారికి యివ్వవలసిన సద్యః ఫలితమును వెంటనే అతనికి యివ్వవలసియున్నది" అని శ్రీపాదులనిరి.

శ్రీపాదుల భక్త వాత్సల్యమునకు జాతి కులములు లేవు

శ్రీపాదులవారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతి నీయలేదు. అంతట క్రోధావేశముతో శ్రీపాదులిట్లనిరి. "మీరు ఎవరినయితే పంచములని, నీచజాతివారని క్రౌర్యముతో అణచివేయుచున్నారో వారియందే నా కటాక్షము మెండుగా నుండి రాబోవు శతాబ్దములో వారు ఉన్నతస్థితియందుందురు. రాబోవు శతాబ్దములలో మీ బ్రాహ్మణ్యము నందలి అధికాంశము సేవకావృత్తినవలబించి ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు అయ్యెదరు. నా వచనములు శిలాశాసనములు వంటివి. వాటి యందు ఒక్క అక్షరమైననూ మార్చుటకు వీలుండదు.అయితే మీ బ్రాహ్మణ్యము నందు ఎవరయిననూ ధర్మబద్ధులై జీవించుచూ, దత్తభక్తిని కలిగినయెడల వారిని కంటికి రెప్పవలె కాపాడెదను."

శ్రీపాదుల వారి క్రోధావేశమును జననీజనకులు శాంతింప ప్రయత్నించిరి. కొలదిసేపటికి శ్రీపాదులవారు శాంతులయి మౌనము నవలంబించిరి. 

సరిగా యిదే సమయములో దత్తదాసునింట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్య మంగళ స్వరూపముతో దర్శనమిచ్చిరి.వారు ప్రేమతో సమర్పించిన మధురములయిన పండ్లను స్వీకరించిరి. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలిరి. వారు స్వయముగా తమ దివ్య హస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసునింటనున్న ప్రతీ ఒక్కరినీ శ్రీపాదులవారు ఆశీర్వదించిరి.

నాయనా! శంకరభట్టూ! చూచితివా? శ్రీపాదులవారి దివ్య ప్రేమ! వారు భావనామాత్ర సంతుష్టులు. వారికి కుల గోత్రాదులతో గాని, మరే విధమైన భౌతికములయిన విషయములతో గాని ప్రమేయమే లేదు. దత్తప్రసాదమును అంత్యకులజుడు సమర్పించిననూ భక్తితో స్వీకరింపవలెను. అలక్ష్యము చేసిన యెడల కష్ట నష్టములకు గురి యగుదురు.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము 

(అధ్యాయము 14 సమాప్తం)     

Thursday, March 8, 2012

Chapter 14 Part 3

అధ్యాయము 14 
దత్తదాసునకు అభయ ప్రదానము - భాగము 3 
శ్రీపాదుల వారి అద్భుత లీల 

శ్రీస్వామి యిట్లు చెప్పసాగెను. నాకు చిన్నప్పటి నుండియూ నత్తి యుండెడిది. అందరునూ నన్ను హేళన చేయువారు. దీనికితోడు నాకు ఒక వింత జబ్బు పొడమినది. అయిదవ సంవత్సరము నుండి యీ జబ్బు ఉధృతమవసాగెను. ఒక్క సంవత్సరము గడుచుసరికి, పది సంవత్సరముల వయస్సు పెరిగినట్లుండెడిది. నాకు పది సంవత్సరముల వయస్సు వచ్చి నాటికి 50 సంవత్సరముల పైబడిన వృద్ధునికుండు లక్షణములు రాసాగెను. 

శ్రీ పీఠికాపురమున బాపనార్యుల ఆధ్వర్యములో యజ్ఞము జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు యివ్వబడుచుండెను. విద్వత్తు కలిగినవారలకు, భూరిదక్షిణలు యీయబడుచుండెను. శ్రీపాదులవారి మహిమా విలాసములను కర్ణాకర్ణిగా వినియుండుటచే మా నాయన నన్ను కూడా యజ్ఞమునకు తీసుకొనిపోయెను. శ్రీపాదులవారి వయస్సు ఆరు సంవత్సరములు మించదు. యజ్ఞమున కవసరమైన  ఘృతము  సేకరింపబడెను. ఆ ఘృతము నంతను ఒక వృద్ధ బ్రాహ్మణుని అధీనమునందుంచిరి. అతడు లోభియేగాక దురాశాపరుడు.  ఘృతము నందలి ఒక వంతు భాగమును తన యింట రహస్యముగా దాచివేసి మిగతా మూడువంతుల భాగమును మాత్రమే యజ్ఞ కార్యక్రమమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను.  ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘ్రుతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు యిటువంటి విఘ్నము కలుగుత అందరికినీ చింతాజనక విషయమాయెను. శ్రీ బాపనార్యులు ప్రశాంతవదనముతో శ్రీపాదులవారి నవలోకించిరి. అంతట శ్రీపాదులవారు, "నా ధనమును అపహరింపవలెనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్ట యోచన చేయుచున్నారు. నా పేరిట యీ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింప దలచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనమును తీసుకొని బయటకు వచ్చునపుడు ద్వారము వద్ద రహస్యముగా నిలబడి దుడ్డుకర్రతో ఒకటి వేసెదను. దానితో కొందరు అక్కడికక్కడే చత్తురు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగించెదరు. నా ధనమును అపహరించువారి యింట జ్యేష్ఠాపత్నీ సమేతముగా శనైశ్చ్వరుని నివసింపమని ఆజ్ఞాపించెదను." అని పలికిరి. శ్రీపాదులవారి మాటలు ఎవరికినీ అర్థము కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరుగబోవు సంఘటనలు గురించి చెప్పుచున్నారనుకొనిరి. ఇంతలో శ్రీపాదులవారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి, తాళపత్రముపై, "అమ్మా! గంగామతల్లీ! యజ్ఞ నిర్వహణ కవసరమైన ఘృతమును యీయవలసినది. నీ బాకీని మా తాతగారైన వెంకటప్పయ్యశ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ." అని వ్రాయించిరి. ఈ లేఖను వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపిరి. వారు అంగీకరించిరి. ఈ లేఖను తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా నలుగురు పాదగయా తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజమునకు సమర్పించిరి. తాము పట్టుకొని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేదమంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరునూ చూచుచుండగనే ఆ నీరు ఘృతముగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనుకున్న మాట ప్రకారము శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగయా తీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయుచుండగా అది నీరుగా మారిపోయెను.

మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించగా వారు "కొంచెము సేపు ఆగుడు. మీ అబ్బాయి జబ్బును నివారించెదను. నత్తిని కూడా పోగొట్టెదను. ఒక గృహము దహనము కావలసి ఉన్నది. దానికి ముహూర్తమును నిర్ణయింపవలెను." అనిరి. వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘ్రుతమును అపహరించినందులకు ఏమయినా కీడు వాటిల్లునాయని అతడు లోలోన చింతించు చుండెను. తను ఘ్రుతమును అపహరించిన విషయమును శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒకపరి యోచించుచుండెను. ఏదయిననూ , శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని ధృఢ నిశ్చయమునకు వచ్చెను. అపుడు వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను.

శ్రీపాదులవారు: తాతా! నీవు ముహూర్తములను నిర్ణయించుటలో దిట్టవు గదా! ఒక గృహమును పరశురామ ప్రీతీ గావింపవలెను. దానికి తగిన ముహూర్తమును నిర్ణయింప వలసినదనిరి. 
వృద్ధ బ్రాహ్మణుడు: గృహ నిర్మాణమునకు, శంఖుస్థాపనలకు ముహూర్తములుండును గాని, గృహ దహనములకు ముహూర్తములుండవు అనిరి.

శ్రీపాదులవారు: చౌర్యముచేయుటకును, గృహదహనములు చేయుటకును ముహూర్తములు ఎట్లు లేకుండును? 
వృద్ధబ్రాహ్మణుడు: అటువంటి ముహూర్తములున్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమయినా వర్జ్యములు , దుర్ముహూర్తముల వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు.

శ్రీపాదులవారు: అయిన యెడల యిప్పుడు అటువంటి వర్జిత సమయమేమయినా జరుగుచున్నదా?
వృద్ధ బ్రాహ్మణుడు: ఇప్పుడు ఖచ్చితముగా అటువంటి సమయమే జరుగుచున్నది.

శ్రీపాదులవారు: తాతా! ఎంత శుభవార్త చెప్పితివి. పరమపవిత్రమైన యజ్ఞము కోసము సేకరించబడిన ఘృతమును ఒక ధూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు, ఆ యింటిని కూడా దహనము చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందముతో గంతులు వేయుచున్నాడు.

శ్రీపాదులవారి మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివర్ణమాయెను. కొలదిసేపటిలో అతని గృహము భస్మీపటలమయ్యెను. భస్మము గావించబడిన గృహము నుండి భస్మమును తీసుకొని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించిరి. శ్రీపాదులవారు అనుగ్రహించి వరదానము చేయుటలోనూ, ఆగ్రహించి నష్టమును కలుగజేయుటలోను సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయముతో ఆ భస్మమును తీసుకొని వచ్చెను. ఆ భస్మమును నీరుగల పాత్రలో వైచి నన్ను త్రాగమని శ్రీపాదులాజ్ఞాపించిరి. ఈ విధముగా మూడురోజుల పర్యంతము చేయమనిరి. మేము శ్రీ బాపనార్యుల యింత అతిథులుగా నుంటిమి. నా నత్తితో పాటు దేహమునందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయెను. నేను స్వస్థుడనయితిని. శ్రీపాదులవారు తమ దివ్య వరదహస్తమును నా మస్తకము పైనుంచి శక్తిపాతము చేసి ధన్యుని చేసి, "ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేరా ప్రసిద్ధుడవయ్యెదవు గాక! గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించేడవు గాక!" అని ఆశీర్వదించిరి.

తదుపరి శ్రీపాదులవారు "ఓయీ! నీవును, ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలసి వ్యాపారము చేయుచుండెడివారు. వ్యాపారము నందు వైషమ్యములు పొడమి ఒకరినొకరు హననము చేయుటకు ప్రయత్నించుచుండిరి. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని యింటికి వచ్చి ప్రేమతో పాయసమును త్రాగించిటివి. ఆ పాయసమునందు నీవు విషమును కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసమును త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలివాండ్రను నియోగించి నీ గృహమునకు నిప్పంటింపజేసెను. నీ గృహము కాలి భస్మమయ్యెను. గృహమునందలి నీ భార్యకూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయియుండుటను గాంచి గుండెనొప్పితో మరణించితివి. నీవు గతములో విషప్రయోగము చేసిన కారణమున యీ జన్మలో ఈ వింత వ్యాధికి లోనయితివి. నీ గృహమును పూర్వ జన్మమున ఆ వృద్ధ బ్రాహ్మణుడు దహనము చేయించిన కారణమున అతని గృహము యీ జన్మమున భస్మీపటలము గావించబడినది. మీ యిరువురిని, కర్మబంధముల నుండి నా యీ లీల ద్వారా విముక్తులను చేసితిని." అని పలికిరి.


శ్రీపాదులవారి అనుగ్రహమును పొంది నేను యింటికి తిరిగివచ్చితిని. వేదశాస్త్రములందు పండితుడనయితిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి యిచ్చెను. శ్రీపాదులవారి ప్రమేయముతో మా యిర్వురి కర్మబంధములు విచ్ఛేదనమగుటచే అనంతర కాలమున యిర్వురుకును మేలు మాత్రమే జరిగెను. వారి లీలలు దివ్యలీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి, నత్తి కూడా పోయి పండితుడనయితిని, సాక్షాత్తు శ్రీ కృష్ణపరమాత్మ ఆధ్వర్యములో జరిగిన కురుక్షేత్ర సంగ్రామము యజ్ఞము వంటిదయ్యెను. శివుడు లేకుండా చేయబడిన దక్ష యజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందలి ధర్మసూక్ష్మమును గుర్తెరుంగుట మంచిది.

(ఇంకా ఉంది..)    

Wednesday, March 7, 2012

Chapter 14 Part 2

అధ్యాయము 14
దత్తదాసునకు అభయ ప్రదానము - భాగము 2

అంతట నేను, "అయ్యా! శ్రీగురుని మహిమా విశేషములను తెలియగోరుచున్నాను. తెలుసుకొను కొలదిని ఇంకనూ తెలిసికొనవలెననెడి ఉత్సుకత మిక్కుటమగుచున్నది. శ్రీగురుడు పదే పదే తాను నృసింహ సరస్వతీ నామమున అవతరించెదనని చెప్పుచున్నారు. వారి లీలలలోని అంతరార్థములను తెలుసుకోన ఉత్సాహము కలుగుచున్నది." అని అంటిని. అందులకు స్వామి, "నాయనా! వేదఋషులయొక్క తత్త్వాన్వేషణ ప్రధాన లక్ష్యము ఆధ్యాత్మికమైన అంతస్సత్యము వారి నిగూఢ శబ్దములలో అత్యంత ప్రధానమైనది. "ఋతము" అనగా సత్యము. ఇదియే ఆత్మా సత్యము. వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారముగా వ్యాఖ్యానము చేయునపుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకములుగా చెప్పిరి. అదే విధముగా సరస్వతీ శబ్దము కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతీ నది అంతర్వాహినీ. దీనిని వర్ణించునపుడు సత్యవాక్కులను ప్రబోధించునదిగాను, మహావర్ణవమును తెలియజెప్పునదిగాను, మనయొక్క చిత్తములను ప్రకాశింప చేయునది గాను చెప్పబడినది. కావున శ్రీగురుడు ఒకానొక ప్రబోధకశక్తి, ప్రబోధీనా ప్రవాహము. వారిది సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంతమొనరించెదరు. పరమసత్యమును, అంతర్ జ్ఞానమును వారు మనలో నెలకొల్పుదురు. వేదమునందు యజ్ఞము అనునది అంతః ప్రవృత్తికి బాహ్య చిహ్నము. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దానిని దేవతల కర్పించెదరు. దానికి ప్రత్యుపకారముగా దేవతలు వారికి గోగణములను, అశ్వములను ఇచ్చెదరు. గోగణములనగా తేజస్సు యొక్క సంపద. అశ్వములనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశ్శక్తులను కూడా ప్రసాదించెదరు. వేదములందలి నిగూఢ అర్థము యోగ్యులయిన వారలకే తెలియపరచబడుటకు అత్యంత రహస్యముగా నుంచబడినది. యజ్ఞకార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వాక్యార్థమును చూచినయెడల వెన్న కాచిన నెయ్యి అయితే 'ఘ్రుత' శబ్దమునకు దీప్తి యని మరొక అర్థమున్నది. వేదమందు 'గో' శబ్దమునకు 'వెలుగు' అని అర్థమున్నది. అశ్వము శక్తికిని, ఆత్మబలమునకును, తపశ్శక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖస్థమైయున్న యశ్వరూపమును వరముగా కోరిరి. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గోకిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థము. ఋషులు పుత్రులను, సంతతిని కాంక్షించుచూ ఎన్నియో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతరార్తమున్నది. పుత్రోత్పత్తి అనునది అంతః శక్తి జనకమునకు సంకేతము. దీనినే వారు 'అగ్ని స్వయముగా మనకు పుత్రుడై జన్మించుచున్నాడనియు, అగ్ని యజ్ఞమున పుట్టిన సుతుడనియు, విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియు' వర్ణించిరి. అదే విధముగా సలిలము, ఉదకము అనునవి కూడా సంకేత అర్థములోనే వాడబడినవి. 'సలిలం అప్రకేతం' అనగా చైతన్యరహితమైన సముద్రము అనగా దైవత్వము అంతర్లీనమైయున్న జడాబ్ధి అను చీకటి సముద్రము నుండి తన స్వకీయశక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థములో వాడిరి. దీనినే మహా సముద్రమని కూడా వర్ణించిరి. ఋషులు ఒకానొక సూక్తములో, సరస్వతి తన అంతర్ జ్ఞాన కిరణములలో ఊర్ధ్వసలిలములను మనకు గోచరింప జేయుచున్నదనిరి. వేదమునందు చెప్పబడిన సప్త స్రోతస్వినులకు కూడా అంతరార్థమున్నది. అవి స్వర్గ విభూతులు. పరాశర మహర్షి 'సలిలములందు వసించు జ్ఞానమును విశ్వప్రాణమని' చెప్పియున్నారు. గోవులను హరించు దోపిడిగాండ్రను వృత్రులని దస్యులని పేర్కొనిరి. వృత్రుడు తేజస్సును అనగా గోవులను సలిలములను, పరమసత్యమును, ఊర్ధ్వ చైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగా తన స్వాధీనమందుంచుకొను రాక్షసుడు. ఇటువంటి నీచకృత్యముల నోనగూర్చునట్టి శక్తులే వృత్రులు. వీరే దస్యులు. తమశ్శక్తులు. సత్యజ్ఞానమును అన్వేషించువారికి ప్రబలవిరోధులు." అని వివరించిరి.


ఔదుంబర వృక్షమునకు యిచ్చిన వరములు, నరసింహ సరస్వతి అవతార వైశిష్టము


నాయనా! శ్రీ మహావిష్ణువు హిరణ్య కశ్యపుని సంహరించుటకు ఔదుంబర వృక్షము యొక్క కొయ్య స్థంభము నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమై ప్రహ్లాదుని రక్షించెను. ప్రహ్లాదుడు రాజయ్యెను. కొంతకాలము తరువాత రెండు ముక్కలుగా విరిగిన ఆ కొయ్య స్థంభము చిగుర్చుట నారంభించెను. అచ్చట ఔదుంబరవృక్షము రూపొండెను. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఔదుంబరమును పూజింపసాగెను. శ్రీ దత్తాత్రేయులవారు ఒకనాడు ఆ ఔదుంబర మూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చి, ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేసిరి. ప్రహ్లాదునకు ద్వైతసిద్ధాంతమునందు ఆసక్తి యుండుటను గమనించిన శ్రీదత్తులు, నీవు కలియుగమున యతి వేషధారివై దీన జనోద్దరణ చేయగలవనియూ, ద్వైతసిద్ధాంతమును ప్రచారము చేయగలవనియూ వానిని ఆశీర్వదించిరి. పరమ పవిత్రమైన ఔదుంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీదత్తుని చరణకమలములపైబడి తనకు కూడా వరమిమ్మని కోరెను. అంతట శ్రీదత్తులు "ప్రతీ ఔదుంబరమూలము నందును నేను సూక్ష్మ రూపమున ఉందును. నీ నుండి నరసింగాకృతి వెలువడిన కారణమున కలియుగము నందు నృశింహసరస్వతీ నామము వహించి అవతరించెదనని వాగ్దానము చేసిరి. ఇదంతయునూ పైంగ్య బ్రాహ్మణము నందు వర్ణింపబడినది. ఈ పైంగ్య బ్రాహ్మణము ప్రస్తుతము సప్తమహర్షుల తపోభూమియయిన హిమాలయము నందలి శంబలగ్రామ పరిసరములందు మాత్రమే నిలచియున్నది. మిగిలినచోట్ల లుప్తమైపోయినది. ఉన్నవా? లేదా? అను ప్రశ్న ఉదయించినపుడు తాను ఉన్నానని తెలియజెప్పుటకు జడమైన స్థంభము నుండి ఆవిర్భవించిన ఆవేశావతారము శ్రీ నరసింహస్వామి. అదే విధముగా కలియుగమునందలి జనులు కల్మషచిత్తులై దైవమున్నాడా? లేడా? అను కుతర్కములు చేయునెడ తాను ఉన్నానని ఋజువుచేయుటయే గాక ప్రహ్లాదుని రక్షించిన రీతిన భక్త సంరక్షణ చేసెదననుటకు సూచన ప్రాయముగా వారు నృశింహ సరస్వతీ నామమున అవతరించెదరు.


అంతట శ్రీస్వామి వారిని "అయ్యా! మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదులు వారిని దర్శించితిరా! వారి బాల్య లీలలను వినుటకు మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది." అని అడిగితిని.


(ఇంకా ఉంది..)