Tuesday, February 28, 2012

Chapter 14 Part 1

అధ్యాయము 14 
దత్తదాసునకు అభయ ప్రదానము - భాగము 1 

నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమును చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురవగడ్డ చేరగలనని చెప్పిరి. శ్రీపాదులవారిని భౌతికముగా ఎప్పుడు దర్శించెదనా అని మనమున ఎంతయో ఆతురతగా నున్నది. ఒక చేతిలో కల్లుముంతను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితుడను కాకపోయిననూ బ్రాహ్మణుడనయిన కారణమున ఎంతో కొంత ఆచారమును పాటించువాడనగుట చేతనూ, ఆ కల్లు వాసన నాకు ఎంత మాత్రము ఆమోద యోగ్యము కాని కారణముననూ, నేను పయనించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదనను కలిగించెను. శ్రీపాదులవారి నామమును ఉచ్ఛరించుచూ వడివడిగా నడచుచుంటిని. నాకంటే వేగముగా ఆ వ్యక్తి నా వద్దకు చేరెను. నేను నీ వద్దకు వచ్చుచుండగా నా నుండి దూరమగుటకు ప్రయత్నము సలుపుట భావ్యమా? అని అతడు ప్రశ్నించెను.

అంతట ఓయీ! నీవెవ్వడవు? నాతో నీకేమి పని? అని నేనడిగితిని. దానికతడు బిగ్గరగా నవ్వెను. గుప్పుమని కల్లువాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకొనుటకు ముందు నీవెవ్వడివో, ఎందుండి వచ్చితివో? నీ పయనము ఎక్కడికో? తెలుసుకొనుట యుక్తమనెను. కల్లు నమ్ముకొనువారు గూడ యీ ప్రాంతముల వేదాంత సంభాషణ చేయు సమర్ధులు కాబోలనుకొంటిని. దారిన బోవు వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అచట చేరినది. ఆ కల్లు నమ్ముకొను వ్యక్తి, "అయ్యా! నేను యీ ప్రాంతములో కల్లు తీసుకొని అమ్ముకొనువాడను. ధర్మబద్ధముగా జీవించు వాడను. నాకు తాటిచెట్టే కల్పవృక్షము. నేను చెట్లునెక్కికల్లు తీసుకొని వచ్చునంత వరకును యీ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నాకొరకు వేచి యుండెను. నేను బ్రాహ్మణుడనయిననూ కల్లు త్రాగుటకు అలవాటు పడితిననియూ, చెల్లించుటకు తనవద్ద పైకము లేదనియూ, కాస్త కల్లుపోసి పుణ్యమును పొందవలసినదనియూ కోరెను. నేను వల్లె యంటిని. నేను కల్లు పోయుటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారము ఎక్కువగా నుండుటను గమనించి, నలుగురి ఎదుట కల్లు త్రాగినచో తన బ్రాహ్మణత్వమునాకు కళంకమేర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దానభంగమొనరించిన మహాపాపినౌదును. మా కులస్థులకు యిది అమృతముతో సమానమైనది. అంతటి అమూల్యమైన కల్లును బ్రాహ్మణునకు త్రాగుటకు పోసిన యెడల విశేష పుణ్యము లభించును గదాయను ఆశతో నున్నాను, నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులయిన మీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశము చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసినది." అనెను.

అచ్చట ప్రోగుపడిన వారందరునూ కల్లుగీసుకొని జీవించు గౌడకులస్థులైనందున తమసాటి కులస్థుని మాటకు ఎక్కువ విలువనిచ్చిరి. నాచే బలవంతముగా కల్లు త్రావింపబడెను. తదుపరి వారందరునూ తలా ఒకదారిలోను పోయిరి. నాకు కల్లు త్రావించిన ఆ విచిత్రవ్యక్తి కూడా ఎటో పోయెను. నేను నా మనసులో "ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి అవతార వరేణ్యుడయిన శ్రీపాదుని సందర్శనమునకు పోవుచూ నీచమైన కల్లును సేవిన్చితిని. నా బ్రాహ్మనత్వము మంట కలిసినది. పరమపవిత్రులైన శ్రీపాడులవారి ముఖమునెట్లు చూడగలను? నా ఖర్మ యిట్లు కాలినది. విధి బలీయమైనది. నా నుదుట యీ రకముగా వక్రలిపి లిఖించియుండ మరోవిధముగా ఎట్లు జరుగును?" అని కుమిలిపోసాగితిని.

నాకు అడుగులు తడబడసాగెను. నా ముఖము నుండి దుస్సహమైన కల్లువాసన వచ్చుచుండెను. శరీరమున కొంత మైకము క్రమ్మినది. నా దురదృష్టమునకు దూషించుకొనుచు శ్రీపాడులవారి నామోచ్ఛరణము చేసుకోనుచూ నడుచుచుంటిని. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కన్పించుచున్నది. అందు ఎవ్వరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనమునకు నేను అయోగ్యుడనని భావించితిని. ఆ పవిత్ర తపోభూమిలో అడుగిడుటకు నాకు మనస్కరింపలేదు. అందుననూ, కల్లు త్రాగిన యీ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహునింద్యమని తలంచితిని.

నేను నా దారిన పోవుచుండ వెనుకనుండి ఒకవ్యక్తి చప్పట్లు చరచుచూ, "ఓయీ! శంకరభట్టూ! ఆగుము. నిన్ను తమ ఆశ్రమమునకు తోడ్కొని రమ్మని దత్తానందస్వాముల వారి ఆజ్ఞ" అని ఉచ్చైశ్వరమున పల్కెను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తీ దత్తానందస్వాముల వారి ఎదుట నిల్పిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీస్వామి నన్ను శీఘ్రముగా స్నానము చేయ ఆజ్ఞాపించిరి. స్నానానంతరము మధురములయిన ఫలముల నొసంగిరి. నేను భుజించిన తదుపరి వారు నన్ను చేరబిలిచి, "నాయనా! దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యము! వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే త్రాగించిరి. వారిని నీవు కల్లు గీసుకోను గౌడ కులస్థునిగా భావించితివి. వారు నీకిచ్చిన అమృతమును కల్లుగా భ్రమించితివి! ఎంతటి విడ్డూరము!" అని పలికిరి.

నాకు తల తిరిగినంత పని అయినది. నేను చూచుచున్న విశ్వమంతయునూ నా కళ్ళముందే క్రమక్రమముగా అదృశ్యమగుచున్నట్లు తోచినది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరము యొక్క తరంగమువలె నాపై ఎగిసిపడినట్లు అనుభూతమైనది. అనంతమైన ఆ సత్తాయందు అత్యంత హేయమును, అత్యల్పమును అయిన నా అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగయినది. 'నేను' అనునది ఏమిటో తెలియరాని, తెలియలేని ఒకానొక దివ్యానందములో నేను మునిగిపోయితిని. నాలోని పరిమితమైన 'నేను' అనునది నశింపగా యీ సమస్త సృష్టియూ కేవలము స్వప్నమువలె అనిపించసాగినది. 

ఇంతలో శ్రీస్వామి నాపై మంత్రజలమును ప్రోక్షించిరి. పవిత్రభస్మమును నా నుదుటిపై తమ దివ్య హస్తములతో అద్దిరి. నేను ప్రకృతిస్థుడనయితిని. కొద్ది క్షణములపాటు నేను దివ్యానందమును అనుభవించితిని. ప్రకృతిస్థుడనయిన వెంటనే నేను స్థూలతత్త్వములోనికి కూరుకుపోయితిని అని తెలిసికొంటిని.

శ్రీస్వామి, "ఒకానొక జన్మమందు నీవు గౌడకులస్థుడవు. మిక్కుటముగా కల్లును సేవించువాడవు. నీ వ్యక్తిత్వమునందలి అంతరాంతరములలో నీకు కల్లును త్రాగవలెననెడి కోరిక మిగిలియున్నది. శ్రీపాదులవారి అనుగ్రహమే లేకున్నచో నీవు బ్రాహ్మణుడవైననూ, నీవు కల్లు త్రాగుటకు అలవాటు పడిపోయి పతన మయ్యెడివాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకమునందు అనేక గండాంతరములు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండగనే వాటిని పరిహరించుచుంటిరి. శ్రీగురువుల మహిమను వర్ణించుట ఎవరితరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనము వహించినవి." అని వివరించిరి.

(ఇంకా ఉంది...)         

Tuesday, February 21, 2012

Chapter 13 Part 5 (Last Part)

అధ్యాయము 13 
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 5 
మండల కాల అర్చన మరియు శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణవల్ల కలుగు ఫలము

శ్రీపాదులవారు గణేశచతుర్థిన అవతరించుటలో ఒక గొప్ప విశేషమున్నది. లాభుడు శ్రీ గణేశుని పుత్రుడు. ఒకానొక కల్పములో, ఒకానొక యుగమున అతడే లాభాదమహర్షి యని పెరుగాంచెను. అతడే శ్రీ కృష్ణావతార సమయమున నందుడై జన్మించెను. లాభుడే శ్రీపాద శ్రీవల్లభావతారమున శ్రీపాదుల వారికి మాతామహుడై జన్మించెను. తన భక్తుల యొక్క సమస్త విఘ్నములను పోగొట్ట దలంచి తమ చైతన్యములో విఘ్నేశతత్త్వమును స్థిరముగా నిలుపుకొని శ్రీపాదులు అవతరించిరి. వారు చిత్తానక్షత్రమందు అవతరించిరి. దీనికి 27 వ నక్షత్రమైన హస్తా నక్షత్రమందు కురువపురమున వారు అదృశ్యులయిరి. తమ జాతకము ప్రకారము 27 నక్షత్రములందును సంచరించు నవగ్రహముల వలన కలుగు అనిష్టఫలములు తొలగిపోవుటకు శ్రీపాదుల వారి భక్తులు మండలదీక్షను వహించవలెను. ఒక మండలము శ్రద్ధాభక్తులతో శ్రీపాదులవారిని అర్చించిన లేదా వారి దివ్య చరిత్రను పారాయణము చేసిననూ సర్వాభీష్టములు సిద్ధించును. మనోబుద్ధి చిట్టాహన్కారములు ఒక్కొక్కటి దశదిశలలో తమ స్పందనలను, ప్రకంపనలను వెలువరించు చుండును. అనగా వాటి ప్రకంపనలు విడివిడిగా 40 దిశలలో వెలువడుచుండును. ఈ నలభై దిశలలోని ప్రకంపనలను అరికట్టి శ్రీపాదులవారి వైపు మళ్లించిన అవి శ్రీపాద శ్రీవల్లభ చైతన్యమున చేరును. అచ్చట అవి తగురీతిన సంస్కరింపబడి యోగమైన స్పందనలుగా మార్పునొంది తిరిగి సాధకుని చేరును. అపుడు సాధకుని ధర్మబద్ధమైన అన్ని కోరికలును సిద్ధించును. నాయనా! శంకరభట్టూ! "నీవు శ్రీపాదులవారి చరితమును లిఖింపగలవని అంతర్దృష్టితో తెలుసుకొంటిని. లోకములో వ్యవహారములోనున్న పారాయణ గ్రంథములలో రచయిత యొక్క వంశావళి, వివిధ స్తోత్రములు వగైరా ఉండును. నీవు వ్రాయు ప్రభు చరిత్రమున నీ వంశావళి వర్ణనము అనవసరము. ప్రభువులను ధ్యానించి, నీ అంతర్నేత్రములో శ్రీపాదులవారిని నిలుపుకొని అందరికినీ సులభముగా అర్థమగు రీతిలో రచింపుము. అపుడు శ్రీపాదులవారి చైతన్యము నీ లేఖిని నుండి ఏది వెలువరించిన అది మాత్రమే సత్యము కాగలదు. ఆ రకమయిన స్పూర్తిలో వ్రాయబడు గ్రంథములకుగాని, ఉచ్చరింపబడు మంత్రములకు గాని ఛందోబద్ధత ఉండవలసిన అవసరము లేదు. కొంతమంది మహాభక్తులు తమకు దైవ సాక్షాత్కారమైనపుడు వారి వారి స్థానికభాషలో, వ్యావహారికములలోని పదములలో స్తోత్రము చేసిరి. వారు సాధారణ వ్యాకరణ నిబంధనలను కూడా అతిక్రమించిరి. అయిననూ ఆ స్తోత్రములను ఆ విధముగానే  పఠి౦ప వలెను. ఛందోబద్ధముగా నుండవలెను గదా యని మార్పు చేసినచో అనుకున్న ఫలము లభింపదు. భక్తుని యొక్క ఏ పదజాలములో భగవానుడు సంతుష్టుడై వరములనిచ్చెనో ఆ పదములలో భగవానుని అనుగ్రహశక్తి యుండును. ఆయా పదములతో కూడిన స్తోత్రములను మనము పఠి౦చునపుడు మన చైతన్యము తొందరగా భగవచ్చైతన్యమునకు సామీప్యములో నుండును. భగవానుడు భావప్రియుడు గాని బాహ్యప్రియుడు గాడు. భావన అనునది శాశ్వతమైన శక్తి. ఈ విషయమును గమనింపుము". అని చెప్పెను.

అంతట నేనిట్లంటిని. "అయ్యా! భోజనానంతరము సద్గురుని గూర్చిన గోష్ఠి ఎంతయో ముదావహము. ఇంకనూ శ్రీపాదులవారి అవతార విశేషములను తెలియజేసి నన్ను కృతార్థుని చేయ ప్రార్థన."

ఆనంద శర్మ యిట్లు పలికెను. "శ్రీపాదుల వారు మల్లాది వారికిని, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికిని, వత్సవాయి వారికిని కూడా చాలా సన్నిహితమై, భాషచేత వెల్లడి చేయుటకు వీలుగాని ఋణానుబంధము కలవారు. ఆ మూడు కుటుంబముల వారికిని పుణ్యబలమెంతో యున్నది. అందువలననే తన తండ్రి ఆ మూడు కుటుంబములవారు యిచ్చు ద్రవ్యమును గాని, వస్తువులను గాని స్వీకరించక పోవుట అనర్థ హేతువని శ్రీపాదులు అభిప్రాయపడిరి. శ్రీపాదుని అభీష్టము మేరకు పండగ, పబ్బములందే గాక, యితర సమయములందు కూడా అప్పలరాజుశర్మ దంపతులు, తమ సంతానముతో సహా మల్లాది వారింటికిని, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికిని, వత్సవాయి వారింటికిని  యథేచ్చముగా పోయెడివారు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఒకానొక పండుగ రోజున అప్పలరాజు శర్మ దంపతులను తమ యింటికి ఆహ్వానించిరి. శ్రీపాడులవారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుని తూగుటుయ్యాలలో శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఊగుచుండిరి. ఆ రోజున శ్రేష్ఠి గారెంతయో గంభీరముగా నుండిరి. దానికి కారణమున్నది. పీఠికాపురములో ఒక ప్రసిద్ధుడైన జ్యోతిష్కుడు ఉండేవాడు. అతడు ఓఢ్రదేశమునకు పోయి జ్యోతిషమునభ్యసించెను. అతడు చెప్పిన జ్యోతిషము పొల్లు అయిన దాఖలాలు లేవు. అతడు అతి ఖచ్చితముగా ప్రాణ ప్రయాణ సమయమును సూచించగలడు. అతడు ఫలానారోజున యిన్ని ఘడియల యిన్ని విఘడియలకు హృదయ సంబంధ రోగముచే శ్రేష్ఠి పంచత్వము నొందునని చెప్పెను. కొన్ని ఔషధ మొక్కలకు, గ్రహములకు, నక్షత్రములకు, కొన్ని పవిత్ర వృక్షములకు, యోగ ప్రక్రియలకు సన్నిహిత సంబంధము కలదనియూ తానొక ఔషధరాజమును, తాయెత్తును యిచ్చేదననియూ దాని వలన అపమృత్యు దోషము హరించుననియూ, అప్పలరాజుశర్మను వదలి తనను తమ కులపురోహితునిగా చేసుకొనవలసినదియూ చెప్పెను. ఈ విధానమునకు శ్రేష్ఠి నిరాకరించెను. నా జ్యోతిషము తప్పిన యెడల నేను శిరోముండనము చేయించుకొని గార్దభముపై ఊరేగెదననియూ ఆ జ్యోతిష్కుడు ప్రతిజ్ఞ చేసెను. విషయము అప్పలరాజుశర్మకును, బాపనార్యులకును నివేదింపబడెను. బాపనార్యులు జటిలమైన గణితము చేసి దైవిక శక్తి పని చేసి వాని అపమృత్యువు పరిహరింపబడునని సూచించెను. అప్పలరాజుశర్మ కాలాగ్నిశమనుని పూజించి తీర్థమును ప్రసాదముగా నిచ్చెను. సుమతీ మాత ప్రసంనవదనయై తన చిన్ననాయనగా భావించు శ్రేష్ఠి వద్దకు వచ్చెను. ఇంతలో శ్రేష్ఠికి హృదయమునందు బాధ కలిగి అమ్మా! అని పిలిచెను. దగ్గరనేయున్న సుమతీ మాత నాయనా! నన్ను పిలిచితివా? యని పరుగున వచ్చి దివ్య మంగళ స్వరూపమైన శ్రీ హస్తముతో శ్రేష్ఠి హృదయమును స్పృశించెను. శ్రేష్ఠి ఓడిలోనున్న శ్రీపాదులవారు 'పో' అని గట్టిగా అరచిరి. శ్రేష్ఠి యింట ఒక ఆబోతు ఉండెను. వెంటనే అది గిలగిలా తన్నుకొని కొన్ని క్షణములలో అసువులు బాసెను. శ్రేష్ఠి రక్షింపబడెను.

ఈ విషయము జ్యోతిష్కునకు తెలిసెను. అతడు శ్రేష్ఠి యింటికి పరుగు పరుగున వచ్చెను. తృటిలో తన అమోఘ జోశ్యము తప్పి పోయినండులకు అతడు లోలోన ఎంతో దుఃఖించెను. 

జ్యోతిష్కునితో శ్రీపాదులవారు, "నీవు జ్యోతిష్కుడవే! చాలా గొప్ప పరిశ్రమ చేసిన వాడవే! కాదనను! జ్యోతులన్నిటికీ జ్యోతినైన నేనుండగా శ్రేష్ఠికి మృత్యుభయమేల? నీవు శిరో ముండనము చేయించుకొని గార్దభముపై ఊరేగనక్కరలేదు. నీవు పశ్చాత్తప్తుడవయిన చాలును. నీ తండ్రి తను జీవించి యుండగా శ్రేష్ఠి వద్ద అప్పు తీసుకొనెను. అతడు ఆ అప్పును తీర్చి వేసితినని అబద్ధమాడెను. ఆ అబద్ధము కూడా గాయత్రీ సాక్షిగా చెప్పెను. దాని ఫలితముగా మీ తండ్రి శ్రేష్ఠి యింట ఆబోతుగా జన్మించెను. శ్రేష్ఠి ధర్మాత్ముడు గనుక ఆ ఆబోతునకు సమృద్ధిగా మేత పెట్టుచుండెను. హీన జన్మనొందిన నీ తండ్రికి ఉత్తమజన్మను నేను ప్రసాదించితిని. అపమృత్యువాత పడనున్న శ్రేష్ఠి యొక్క కర్మఫలమును ఆబోతునకు బదలాయించితిని. నీవు యీ ఆబోతునకు దహన సంస్కారములోనరించి అన్నదానము చేయుము. నీ తండ్రికున్న కర్మఫలము నశించును. ఉత్తమగతి కల్గును." అని పలికిరి. శ్రీపాదుల వారి యీ వచనముల ప్రకారమే ఆ జ్యోతిష్కుడు నడచుకొనెను.

నాయనా! శంకరభట్టు! శ్రీపాదులవారు అనేక పద్ధతులలో ప్రాణరక్షణ చేసెదరు. ఒక్కొక్క పర్యాయము రాబోవు జన్మలోని కొంత ఆయుష్షును తగ్గించి యీ జన్మలో ఆయుష్షును పెంచగలరు. లేదా కర్మ ఫలితములను బదలాయించు పద్ధతిలో శ్రేష్ఠికి జరిగినట్లు చేయగలరు. శ్రేయోభిలాషి అయిన ఒకని ఆయుష్షు నుండి ఆ వ్యక్తికి ఆయుష్షు పెంచగలరు. అసాధారణ పద్ధతిలో మృత్యువునే శాసించి ఆయుర్దాయము నీయగలరు. శరీరములో తరుగుదలనూ, పెరుగుదలనూ నిలుపుదల చేసి యోగి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకొనును. శ్రీపాదులు యోగ సంపూర్ణ అవతారులు. వారికి అసాధ్యమనునది లేదు. ఉచ్చ్వాస నిశ్వాసముల గతిని విచ్చేదనం చేయుట వలన ముక్తిని సాధించుట సులభతరము. క్రియాయోగి తన ప్రాణ శక్తిని ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్టాన, మూలాధార చక్రములను చుట్టి పై నుంచి క్రిందికి, క్రింది నుంచి పైకి పరిభ్రమించునట్లు చేస్తాడు. ఒక్క క్రియకు పట్టే కాలము ఒక సంవత్సరంలో జరిగే ప్రకృతిసహజమైన ఆధ్యాత్మిక వికాసమునకు సమానమౌతుంది. నాయనా! ఆహోరాత్రములోని మూడోవంతు సమయంలో వెయ్యి క్రియలు జరిగితే కేవలం మూడు సంవత్సరకాలంలో సహజ ప్రకృతి ద్వారా పది లక్షల సంవత్సరములలో వచ్చే పరిణామం వస్తుంది. పురాణములలో అనేక వేల సంవత్సరములు తపస్సు చేసిన యోగుల గురించి చెప్పేటప్పుడు ఆ కాలం సహజంగా ప్రకృతికి పట్టే పరిణామ కాలమని అర్థం చేసుకోవాలి. అంటే ఆయా యోగులకి పట్టే వాస్తవకాలం వేరుగాను, ఆ పరిణామం ప్రకృతి సిద్ధంగా రావడానికి పట్టేకాలం వేరుగాను అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ప్రతీ జీవికి ఆయుర్దాయాన్ని యిచ్చి శ్వాస ప్రశ్వాసలని నిర్ధారిస్తాడు. అంతేగాని యిన్ని సంవత్సరాలుగా నిర్ణయించాడు. క్రోధం, ఆవేశం వంటి దుర్లక్షణాలు ఉన్నప్పుడు శ్వాస ఎక్కువగా ఖర్చవుతుంది. తద్వారా ఆయుర్దాయం తగ్గుతుంది. మనశ్చాంచల్యం కలిగిన కోతి చాలా ఎక్కువగా శ్వాసలు తీసుకుంటుంది. 300 సంవత్సరాలు జీవించగలిగే తాబేలు ఒక నిర్దిష్ట కాలంలో కోతి తీసుకునే శ్వాసలలో ఎనిమిదో వంతు మాత్రమే తీసుకుంటుంది. 

ఆనంద శర్మ సద్గోష్ఠి వలన నేనెంతో జ్ఞానవంతుడను అయినాను. ఉదయాన్నే కాలకృత్యాలను తీర్చుకుని ఆనంద శర్మ అనుజ్ఞ తీస్కుని శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థం కురువపురం వైపుకు బయలుదేరితిని. 


శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 13 సమాప్తం.)   

Chapter 13 Part 4

అధ్యాయము 13
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 4 

నాకు శ్రీ ఆనందశర్మ మహాశయులు సెలవిచ్చినది ఎంతయో అపూర్వముగా నుండెను. అంతట నేనిట్లంటిని. "మహాభాగా! మీరెంతయో ధన్యులు. శ్రీపాదులవారు శ్రీ నృసింహసరస్వతీ అవతారము ధరించెదరని వింటిని. ఆ అవతారములో శ్రీ కృష్ణసరస్వతి యనువారిని గురువులుగా స్వీకరించెదరని వింటిని. ఇది ఏమి విచిత్రము?"

శ్రీ ఆనందశర్మ యిట్లు చెప్పసాగెను. "భగవంతుని అవతారము వచ్చునదే భక్తులకొరకు. మానవ రూపమును ధరించి వచ్చినపుడు ఉత్కృష్ఠ మానవుడు ఏ విధముగా నుండవలెనో ఆచరించి బోధించును. సన్యాసాశ్రమమును ఉద్ధరింపవలసియున్నది. తను సన్యాసి కావలెనన్న తనకు కూడా ఒక గురువు కావలెను. ఆ గురువు బహుయోగ్యుడై యుండవలెను. సాక్షాత్తు అవతారపురుషునికి గురువు కాగల యోగ్యత కోటిలో ఏ ఒక్కరికో ఉండును. అవతార పురుషుడు జన్మించిన వంశములో 80 తరముల వారు అవతరించేదారు. ఆ వంశమునందు విశేష పుణ్యము రాశులు రాశులుగా పదియుండవలెను. అదే విధముగా అవతార పురుషునకు గురువుగా నుండెడి వ్యక్తీ వంశము కూడా పరమపవిత్రముగా నుండవలెను. తాటంకపురమున (తణుకు) వాజపేయయాజుల వారి వంశము నందు మాయణాచార్యుడను మహనీయుడు జన్మించెను. అతని భార్య పేరు శ్రీమతి. వారు పుణ్య దంపతులు. వారు దరిమిలా నందికొట్కూరు ప్రాంతములందలి మంగళాపురమునందు జీవించసాగిరి. వారికి మాధవుడు, సాయణుడు, భోగినాథుడను వారు జన్మించిరి. సనాతన ధర్మము నుద్ధరించుటకు మాధవుడు విద్యారణ్యుడైనాడు. మహాతపస్సంపన్నులైన బాపనార్యులు సూర్యమండలము నుండి శ్రీశైల మల్లిఖార్జున లింగామునండు శక్తిపాతమొనరించిరి. వాస్తవమునకు శ్రీదత్తుల వారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించినవి. శ్రీపాదులవారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించుట ఎంతయో అద్భుతమైన విషయము. పర్వతము పేరు "శ్రీ" దత్తప్రభువు చరణములు శ్రీచరణములు. ఈ నవావతారమునకు శ్రీపాద శ్రీవల్లభ నామము ఎంతయో తగియున్నది."

బాపనార్యులవారి వంశమునకునూ, మాయణాచార్యులవారి వంశమునకునూ ఎన్నియో తరముల నుండి సంబంధబాంధవ్యములు కలవు. మల్లాది వారింట ఆడపడుచు జన్మించిన వాయపేయయాజుల వారి కోడలనియు, వాజపేయయాజుల వారింట ఆడపడుచు జన్మించిన మల్లాది వారి కోడలనియు చమత్కారముగా అనుకొనెడివారు. అయితే బాపనార్యులు తమ కుమార్తె సకల సౌభాగ్యవతి సుమతీ మహారాణిని వాజపేయయాజుల వారింటి కోడలిగా చేయలేదు. విధిప్రేరితులై, అగోచరమైన దివ్య సంకల్పము వలన ఘండికోట అప్పలరాజశర్మగారికిచ్చి వివాహము చేసిరి. 

సాక్షాత్తు దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించి తమ మాతామహులతో రక్త సంబంధము కలిగిన వాజపేయయాజులవారిని కూడా తరింపజేయదలచి మాధవాచార్యుని తనవద్దకు ఆకర్షించిరి. మాధవాచార్యులవారికి శ్రీపాదులవారియందు వాత్సల్యభావము పెల్లుబికినది. మాధవాచార్యులు విద్యారణ్య మహర్షిగా పరిణామము చెందిరి. వారి శిష్యులు మలయానందులు. వారి శిష్యులు దేవ తీర్థులు. వారి శిష్యులు యాదవేంద్రసరస్వతులు. వారి శిష్యులు కృష్ణసరస్వతులు. శ్రీ విద్యారణ్యులకును, కృష్ణసరస్వతులకును మధ్య ముగ్గురు కలరు. శ్రీ విద్యారణ్యులే కృష్ణసరస్వతిగా అవతరించి శ్రీపాదులవారి తరువాత అవతారము నందు గురువులుగా నుందురు. శ్రీ విద్యారణ్యులు భవిష్యత్తులో తన సోదరుడైన సాయణాచార్యుని వంశమందు గోవిందదీక్షితనామమున జన్మించి రాజర్షియై తంజావూరు మహామంత్రి కాగలరు. ఇది శ్రీపాదుల వారి దివ్యవచనము.

శ్రీపాదులవారు నిత్యసత్యవచనులు. ఒక పర్యాయము సుమతీ మహారాణి శ్రీపాడులవారికి స్నానము చేయించుచుండెను. ఇంతలో వెంకటప్పయ్యశ్రేష్ఠిగారు అచ్చటకు విచ్చేసిరి. వారిని చూచి శ్రీపాదులవారు, "తాతా! మనది మార్కండేయ గోత్రమా?" అని ప్రశ్నించిరి. వారు బదులివ్వక శ్రీపాదుల వారి ముద్దుగొలుపు మాటలకు, శ్లేశార్థమునకు నవ్వుకొనిరి. వాస్తవమునకు శ్రీపాదుల వారు భారద్వాజ గోత్రీకులు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిది మార్కండేయ గోత్రము. తను భావనాపరముగా వెంకటప్పయ్యశ్రేష్ఠిగారికి కూడా దౌహిత్రుడనే అను విషయమును నర్మగర్భితముగా చెప్పిరి. ఇంతలోనే సుమతీ మాత స్నానానంతరము "మార్కండేయునంతటి ఆయుష్మంతుడవు కావలె"నని నీళ్ళను గుండ్రముగా త్రిప్పి ఆశీర్వదించినది. మార్కండేయుడు 16 సంవత్సరముల వరకు మాత్రమే ఆయుషు గలవాడు. శివానుగ్రహమున చిరంజీవి అయినాడు. తను పదునారు వర్షముల పర్యంతము మాత్రమే తల్లిదండ్రుల వద్ద నుండెదనని నర్మగర్భితముగా సూచించెను. 16 సంవత్సరముల వయస్సు తరువాత మార్కండేయుడు మహర్షియై గృహత్యాగము చేసి చిరంజీవి అయినాది. శ్రీపాదులవారు కూడా 16 సంవత్సరముల వరకు మాత్రమే తల్లిదండ్రుల వద్దనుండి తరువాత జగద్గురువైనారు. తాను తన శరీరమును గుప్త మొనరించెదననియు, తన యీ శరీరమునకు చిరంజీవిత్వముండుననియు, ఇపుడు మనము చూచు శ్రీపాద శ్రీవల్లభ రూపమేదైతే ఉన్నదో అదే స్వరూపములో అత్రి అనసూయలకు కుమారుడుగా గతములో అవతరించితిననియూ పదే పదే చెప్పియున్నారు.

శ్రీపాదుల వారి వివిధ రూపములు 

శ్రీపాదులవారు తమ యోగశక్తిని బహిర్ముఖముగావించి స్త్రీరూపముననున్న తమ యోగశక్తితో సహా దర్శనమిచ్చెడివారు. ఇది ఎంతయో అపూర్వమైన విషయము. కుండలినీశక్తిని యీ విధముగా స్త్రీ స్వరూపముగా బహిర్ముఖమొనర్చుట కేవలము శ్రీదత్త ప్రభువులకే చెల్లును. 16 సంవత్సరముల వయస్సులో నుండు ఆ నవయౌవన దంపతీరూపమును బాపనార్యులును, రాజమాంబయును, శ్రీపాదుల వారి జననీజనకులును, నరసింహవర్మ దంపతులును, వెంకటప్పయ్యశ్రేష్ఠి దంపతులును, మరికొంతమంది దర్శించిరి. వారిరువురికి వివాహము చేయసంకల్పించిన తల్లిదండ్రులకు కేవలము నిరాశ మాత్రమే ఎదురయ్యెను. తాము భవిష్యత్తులో దివ్య దంపతీ రూపమున దర్శనమీయ సంకల్పించిరనుటకు ప్రప్రథమమున వారు అవధూత రూపమున సుమతీ మాతకు దర్శనమిచ్చినపుడే సూచించిరి. అవధూత సుమతీమాతతో యిట్లనిరి. "అమ్మా! నీ కుమారుడు 16 సంవత్సరములవరకు మీ వద్ద నుండును. వానికి వివాహము చేయ సంకల్పించిన వినడు సరిగదా గృహత్యాగము చేసి వెడలిపోవును. అందుచేత అతని మనోభీష్టము ననుసరించి నడుచుకొనవలసినది." శ్రీ అనఘాదత్తులు ఆదిదంపతులు. వారికి చావు పుట్టుకలు లేవు. వారు సదా లీలావిహారులు. వారు శ్రీపాద శ్రీవల్లభరూపమునను, శ్రీ నరసింహసరస్వతి రూపమునను, స్వామి సమర్థుల రూపమునను అర్థనారీశ్వరులై యుందురు. ఇది దైవ రహస్యము.  

(ఇంకా ఉంది..)

Monday, February 6, 2012

Chapter 13 Part 3

అధ్యాయము 13
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 3 

అంతట నేనిట్లంటిని. "అయ్యా! గాయత్రీ మంత్రములోని 24 అక్షరముల గురించి మీరు చెప్పినది కొంత అవగతమైనది. అయితే 9 అను సంఖ్యా పరమాత్మ స్వరూపమంటిరి. 8 అనునది మాయాస్వరూపమంటిరి. ఇది నాకంతగా అవగతము కాలేదు."

నవమ సంఖ్య వివరణ

అంతట ఆనందశర్మ యిట్లు నుడివెను. "నాయనా! శంకరభట్టూ! పరమాత్మ యీ విశ్వమునకు అతీతుడు. అతడు ఎటువంటి మార్పులకునూ లోనుగానివాడు. తొమ్మిది అనునది ఒక విచిత్ర సంఖ్య. తొమ్మిదిని ఒకటి చేత గుణింపగా తొమ్మిది వచ్చును. తొమ్మిదిని రెండు చేత గుణింపగా పదునెనిమిది వచ్చును. ఆ పదునెనిమిదిలోని ఒకటిని, ఎనిమిదిని కలిపిననూ తిరిగి తొమ్మిదియే వచ్చును. తొమ్మిదిని మూడు చేత గుణించిన ఇరువది ఏడు వచ్చును. దీనిలో రెండును, ఏడును కలుపగా తిరిగి తొమ్మిదియే వచ్చును. ఈ విధముగా తొమ్మిదిని ఏ సంఖ్య చేత గుణించిననూ వచ్చిన సంఖ్యలోని విడివిడి అంకెలను కలుపగా వచ్చునది తొమ్మిదియే అగుచున్నది. అందుచేత తొమ్మిది అనునది బ్రహ్మ తత్త్వమును సూచించుచున్నది.

గాయత్రి వివరణ

అంతేగాక గాయత్రీ మంత్రము కల్పవృక్షము వంటిది. దీనిలోని "ఓం" కారము భూమినుండి పైకి వచ్చెడి మూలకాండమని గ్రహింపుము. భగవంతుడున్నాడనెడి జ్ఞానమును, పరమేశ్వరుని యందు నిష్ఠను 'ఓం'కారోచ్ఛరణము వలన పొందవచ్చును. మూలకాండము యొక్క మూడు శాఖలుగా 'భూ:' , 'భువః', 'స్వః' అనునవి వర్ధిల్లినవి. "భూ:" అనునది ఆత్మజ్ఞానమును కలిగించుటకు సమర్థము. "భువః" అనునది జీవుడు శరీరధారిగా నుండగా అనుష్ఠింపదగిన కర్మయోగామును సూచించును. "స్వః" అనునది సమస్త ద్వంద్వములందును స్థిరత్వమును కలిగియుండి సమాధి స్థితిని పొందుటకు సహకరించును.

'భూ:' అను శాఖ నుండి 'తత్', 'సవితు:', 'వరేణ్యం' అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. 'తత్' అనునది శరీరధారికి జీవన విజ్ఞానము కలిగించుటకును, 'సవితు:' అనునది శరీరధారికి శక్తిని సముపార్జనము చేయుటకును, 'వరేణ్యం' అనునది మానవుడు తన జంతుధర్మములను అతిక్రమించి దివ్యుడుగా మార్పునొందుటకును సహకరించును.

'భువః' అను శాఖ నుండి 'భర్గో:', 'దేవస్య', 'ధీమహి' అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. 'భర్గో' అనునది నిర్మలత్వము పెంపొందించును. 'దేవస్య' అనునది దేవతలకు మాత్రమే సాధ్యమైన దివ్యదృష్టిని కలిగించును. 'ధీమహి' అనునది సద్గుణములను పెంపొందించును.

'స్వః' అను శాఖనుండి 'ధియో' , 'యోనః', 'ప్రచోదయాత్' అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. 'ధియో' అనునది వివేకమును, 'యోనః' అనునది సంయమమును, 'ప్రచోదయాత్' అనునది సేవాభావమును సమస్త జీవరాశుల యందును పెంపొందుటకు సహకరించును.

అందుచేత గాయత్రీ కల్పవ్రుక్షమునకు మూడు శాఖలను, ఒక్కొక్క శాఖకు మూడు ఉపశాఖలును, కలవని నీకు అవగతమైనది గదా! అందుచేత 2498 అనునది శ్రీపాదుల వారిని సూచించే సంఖ్య. దానిలో 9 అను దాని గురించి నీకు వివరించితిని.

అష్టమ సంఖ్య వివరణ

ఎనిమిది అను సంఖ్య మాయాస్వరూపము. ఇదియే అనఘామాత తత్త్వము. ఎనిమిదిని ఒకటి గుణించిన ఎనిమిది వచ్చును. ఎనిమిదిని రెండు చేత గుణించిన 16 వచ్చును. దీనిలోని ఒకటిని, ఆరును కలిపిన ఏడు వచ్చును. ఇది ఎనిమిది కంటె తక్కువ. ఎనిమిదిని మూడు చేత గుణించిన 24 వచ్చును. దీనిలోని రెండును, నాలుగును కలిపిన ఆరు వచ్చును. ఇది ఏడు కంటెను తక్కువ. ఈ రకముగా సృష్టిలోని సమస్త జీవరాశులలోని శక్తులను హరింపజేయు తత్త్వము జగన్మాత యందు కలదు. ఎవడు ఎంతగొప్ప వాడయిననూ వానిని తక్కువగా  చేసి చూపగల శక్తి మాయాస్వరూపమునకున్నది. శ్రీపాద శ్రీవల్లభులు గాయత్రీమాత స్వరూపము. వారు అనఘాదేవీ సమేత శ్రీదత్తులు. వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభీష్టములు సిద్ధించును.

గాయత్రీమాత యందు ప్రాతఃకాలమున హంసారూఢ అయిన బ్రాహ్మీశక్తి, మధ్యాహ్న కాలమందు గరుడారూఢ అయిన వైష్ణవీశక్తి, సాయంసమయము నందు వృషభారూఢ అయిన శాంభవీశక్తియు నుండును. గాయత్రీ మంత్రాధిష్ఠాన దేవత సవితాదేవి. త్రేతాయుగములో శ్రీ పీఠికాపురమందు భరద్వాజ మహర్షి సావిత్రుకాఠక చయనము చేసిన ఫలితముగా శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురమున అవతరించిరి. సవితాదేవత ప్రాతఃకాలమందు ఋగ్వేదరూపముగా నుండును. మధ్యాహ్న కాలమందు యజుర్వేదరూపముగా నుండును. సాయంకాలమందు సామవేదరూపముగా నుండును. రాత్రికాలమందు అధర్వణవేదరూపముగా నుండును. మనకు కంటికి కనిపించు సూర్యుడు కేవలం ఒక ప్రతీక మాత్రమే. యోగులు మహోన్నత స్థితిని పొందునపుడు త్రికోణాకారమున మహాజాజ్వల్యమానముగా ప్రకాశించు బ్రహ్మయోనిని దర్శింపగలరు. దీని నుండియే కోటానుకోట్ల బ్రహ్మాండములు ప్రతీక్షణము ఉద్భవించుచుండును. ప్రతీక్షణము నందును సంరక్షింపబడుచుండును. ప్రతీక్షణమందును విద్వంసము కావించబడుచుండును. ఈ విధముగా ప్రతీక్షణమందును సృష్టి స్థితి లయములు కావిన్ప బడుచుండును. అసంఖ్యాకమైన యీ ఖగోళములనన్నింటిని సృష్టి స్థితి లయముల గావించు సవితాశక్తికే సావిత్రియని పేరు. అయితే గాయత్రియు, సావిత్రియు అభిన్న స్వరూపములు. శవములను కాల్చుటకుపయోగించు అగ్నిని లోహిత అని పిలిచెదరు. భోజన పదార్థములను తయారు చేసుకొనుటకు ఉపయోగించు అగ్నిని రోహిత అని పిలిచెదరు. అదే విధముగా పరాస్థాయిలో గాయత్రిగా, అపరాస్థాయిలో సావిత్రిగా ఒకే మహాశక్తి వ్యవహరించుచున్నది.

జీవరాశుల పరిణామక్రమములో యిహలోకసంబంధమైన అవసరములు ఎన్నో కలవు. అవి అన్నియు సావిత్రీమాత అనుగ్రహము వలన సిద్ధించును. జీవరాశులకు అధ్యాత్మికోన్నతి గాయత్రీమాత అనుగ్రహము వలన సిద్ధించును. ఇహలోకమునందు సకల సుఖభోగములను అనుభవించుటకునూ, పరలోకమునందు విముక్త స్థితి యందు దివ్యానందమును అనుభవించుటకునూ సమన్వయము కావలసి ఉన్నది. శ్రీపాదుల శ్రీచరణాశ్రితులకు ఇహపరలాభములు రెండునూ సిద్ధించును. తక్కిన దేవతారాధనలకునూ, శ్రీ దత్తారాధనమునకునూ గల వ్యత్యాసము యిదియే!

(ఇంకా ఉంది...)         

Sunday, February 5, 2012

Chapter 13 Part 2

అధ్యాయము 13 
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 2 
గాయత్రీ మంత్ర సర్వాక్షర మహిమా వర్ణన 

ఆనందశర్మ యిట్లు వివరించెను. "గాయత్రీ శక్తి విశ్వవ్యాప్త శక్తి. ఆ శక్తి తో సంబంధమును స్థాపించుకొనిన యెడల సూక్ష్మ ప్రకృతి స్వాదీనమగును. దానివలన భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రములలోని అన్ని సంపత్తులను పొంద వీలు కలుగును. శరీరమునందలి విభిన్న అంగముల నుండి నాడులు శరీరమందంతటను వ్యాపించియుండును. కొన్ని నాడులు కలిసిన యెడల గ్రంథియని పిలువబడును. మానవ శరీరము నందలి వివిధ గ్రంథులయందు వివిధ శక్తులు నిబిడీకృతమై యుండును. జపయోగము నందు నిష్ఠులయినవారు ఆయా మంత్రములను ఉచ్ఛరించుట వలన ఆయా గ్రంథుల యందు నిబిడీకృతమైన శక్తులు వ్యక్తీకరించబడుచుండును.

'ఓం'  అనుదానిని ఉచ్ఛరించినపుడు శిరస్సుపైన ఆరు అంగుళముల ప్రాంతము నందును,

'భూ:' అనుదానిని ఉచ్ఛరించినపుడు కుడికన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతము నందును 

'భువ' అనుదానిని ఉచ్ఛరించినపుడు మానవుని త్రినేత్రము పైన మూడు అంగుళముల ప్రాంతము నందును,

'స్వః' అనుదానిని ఉచ్ఛరించినపుడు ఎదమకన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతము నందును శక్తి జాగృతమగును.

ఆజ్ఞాచక్రము ప్రాంతము నందున్న 'తాపిని' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సాఫల్య' శక్తిని జాగృతము చేయుటకు 'తత్'

ఎడమకన్ను యందున్న 'సఫలత' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'పరాక్రమము' అను శక్తిని జాగృతము చేయుటకు  'స'

కుడికన్ను యందున్న 'విశ్వ' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'పాలన' అను శక్తిని జాగృతము చేయుటకు 'వి'

ఎడమ చెవి యందున్న 'తుష్టి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'మంగళకరము' అను శక్తిని జాగృతము చేయుటకు 'తు:'

కుడి చెవి యందున్న 'వరద' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'యోగము' అను శక్తి యొక్క సిద్ధి కొరకు 'వ' 

నాసికా మూలము నందున్న 'రేవతి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ప్రేమ' అను శక్తి యొక్క సిద్ధి కొరకు 'రే'

పై పెదవి యందున్న 'సూక్ష్మ' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ఘన' అను సంజ్ఞ గల శక్తిని జాగృతము చేయుటకు 'ణి'

క్రింది పెదవి యందున్న 'జ్ఞాన' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'తేజము' అను శక్తిని జాగృతము చేయుటకు 'యం'

కంఠము నందున్న 'భర్గ' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'రక్షణ' అను శక్తిని జాగృతము చేయుటకు 'భర్'

కంఠకూపము నందున్న 'గోమతి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'బుద్ధి' అను శక్తి యొక్క సిద్ధి కొరకు 'గో'

ఎడమవైపు ఛాతియొక్క అగ్రభాగము నందున్న 'దేవిక' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'దమనము' అను శక్తిని జాగృతము చేయుటకు 'దే'

కుడివైపు ఛాతియొక్క అగ్రభాగమునందున్న 'వారాహి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'నిష్ఠ' అను శక్తి యొక్క సిద్ధి కొరకు 'వ'

ఉదరమునకు పైభాగమున చివరి ప్రక్కటెముకలు కలియు స్థానమందున్న 'సింహిని' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ధారణా' అను శక్తిని జాగృతము చేయుటకు 'స్య'

కాలేయము నందున్న 'ధ్యాన' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ప్రాణ' అను శక్తిని జాగృతము చేయుటకు 'ధీ'

ప్లీహము నందున్న 'మర్యాద' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సంయమ' అను శక్తిని జాగృతము చేయుటకు 'మ'

నాభి యందున్న 'స్ఫుట' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'తపో' అను శక్తిని జాగృతము చేయుటకు 'హి'

వేనుబాము చివరిభాగము నందున్న 'మేధా' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'దూరదర్శితా' అని శక్తిని జాగృతము చేయుటకు 'ధి'

ఎడమ భుజము నందున్న 'యోగమాయా' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'అంతర్నిహితము' అను శక్తిని  జాగృతము చేయుటకు 'యో'

కుడి భుజము నందున్న 'యోగిని' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ఉత్పాదన' అను శక్తిని జాగృతము చేయుటకు 'యో'

కుడి మోచేయి యందున్న 'ధారిణి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సరసతా' అను శక్తిని జాగృతము చేయుటకు 'నః'

ఎడమ మోచేయి యందున్న 'ప్రభవ' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ఆదర్శ' అను శక్తిని జాగృతము చేయుటకు 'ప్ర'

కుడిమణికట్టు నందున్న 'ఊష్మా' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సాహసము' అను శక్తిని జాగృతము చేయుటకు 'చో'

కుడి అరచేతి యందున్న 'దృశ్య' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'వివేకము' అను శక్తిని జాగృతము చేయుటకు 'ద'

ఎడమ అరచేతి యందున్న 'నిరంజన' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సేవ' అను శక్తిని జాగృతము చేయుటకు 'యాత్'

అను వానిని ఉచ్ఛరింపవలెను.

ఈ విధముగా గాయత్రీమంత్రము నందలి 24 అక్షరములకునూ, మన శరీరమునందు వివిధ ప్రాంతములందు గల 24  గ్రంథులకునూ, ఆ గ్రంథులందు నిబిడీకృతమైన 24 రకములయిన శక్తులకును సన్నిహిత సంబంధము కలదు. 9 అను సంఖ్యా మార్పులకు లోనుగాని బ్రహ్మ తత్త్వమును సూచించును. 8 అను సంఖ్యా మాయాతత్త్వమును సూచించును.

దో చౌపాతీ దేవ్ లక్ష్మి అను వాక్యమునకు వివరణ 

శ్రీపాదులవారు తమకిష్టమైనవారి గృహము నుండి రెండు చపాతీలను స్వీకరించువారు. వారు 'దో చపాతీ దేవ్ లక్ష్మీ' అని పిలుచుటకు బదులు 'దో చౌపాతీదేవ్ లక్ష్మీ' అని పిలుచువారు. "దో" అనునది రెండు సంఖ్యను, "చౌ" అనునది నాలుగు సంఖ్యను, "పతిదేవ్" శబ్దము జగత్ప్రభువైన పరమేశ్వరుని తొమ్మిది సంఖ్యను సూచింపగా, ' లక్ష్మీ' శబ్దము మాయాస్వరూపమైన ఎనిమిది సంఖ్యను సూచించుచున్నది. అందువలన 2498 అను సంఖ్య ఒక వింత సంఖ్య అయి ఉన్నది. తను గాయత్రీ స్వరూపమనియు, పరమాత్మననియు, పరాశక్తిని కూడా తానేననియూ సూచించుటకు యీ సంఖ్యను శ్రీపాదుల వారు యీ విధముగా అన్వయించిరి.

(ఇంకా ఉంది..)       

Saturday, February 4, 2012

Chapter 13 Part 1

అధ్యాయము 13 
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 1 

నేను సుబ్బయ్యశ్రేష్ఠి నుండి అనుమతి తీసుకొని కురువపురం దిశగా ప్రయాణమును సాగించితిని. రాత్రి సమయమునకొక గ్రామమును చేరుకొంటిని. మాధూకరమునకు ఎవరింటికి పోవలెనాయని ఆలోచించు చుంటిని. తన వీధి అరుగు మీద సుఖాసీనుడయి ప్రక్కనున్న వారితో సంభాషణ చేయుచున్న బ్రాహ్మణుని చూచితిని. అతని కన్నులు తేజస్వంతములైయుండెను. కనులనిండుగా కరుణారసము చిప్పిలుచుండెను. అతడు నన్ను సాదరముగా లోనికి ఆహ్వానించి భోజనమిడెను. భోజనానంతరము అతడు యిట్లు చెప్పనారంభించెను. "నాయనా! నన్ను ఆనందశర్మ అని అందురు. నేను గాయత్రీ మంత్రమును అనుష్టించుచుందును. గాయత్రిమాత కొలదిసేపటి ముందు నా అంతర్నేత్రమునకు గోచరించి, దత్తభక్తుడొకడు వచ్చుచున్నాడు, అతనికి కడుపారా భోజనమిడుము. దత్తప్రభువును దర్శించినంత నీకు పుణ్యము లభించును అని చెప్పినది. ఆమె చెప్పిన ప్రకారమే జరిగినది. కడున్గాడు సంతసము."

అంతట నేనిట్లంటిని. "అయ్యా! నేను దత్తభక్తుడనే! దత్తప్రభువుల వారు ప్రస్తుతము భూలోకములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో వ్యవహరించుచున్నారని విని వారి దర్శనార్థము కురువపురమునకు పోవుచుంటిని. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక బ్రాహ్మణుడను."

కణ్వమహర్షి ఆశ్రమ వివరణ 

నా మాటలను విని ఆనందశర్మ నవ్వుకొనెను. "అయ్యా! మా నాయన నాకు ఉపనయనము చేయు సమయమున మా యింటికి అవధూత ఒకరు వచ్చిరి. మా యింటివారు అతనికి సకల పరిచర్యలను చేసిరి. అతడు గాయత్రి మంత్రానుష్ఠానమునకు సంబంధించిన అనేక విషయములను తెలియజేసెను. బృహత్ శిలకోన(పెంచలకోన)లో గల నృసింహదేవుని దర్శించమని ఆదేశించెను. మా నాయన నన్ను పెంచలకోనకు తీసుకొనిపోయెను. అచ్చట నృసింహ దేవుని దర్శనానంతరము తలవని తలంపుగా మా నాయన ధ్యానస్థుడయ్యెను. ఆ ధ్యానము రేయింబవలు సాగెను. నాకు భయము వేసినది. ఆకలి వేసినది. ఎవరో ఆగంతకుడు నాకు భోజనమిడెను. నన్ను తీసుకొని దుర్గమములైన అడవి దారివెంట కొండ గుహల లోనికి తీసుకొనిపోయెను. తరువాత అతడు అంతర్హితుడయ్యెను. ఆ గుహలో ఒకానొక వృద్ధ తపస్విని చూచితిని. అతని కన్నులు ప్రచండ అగ్ని గోళములవలె నుండెను. అతడు 101 మంది ఋషులచే సేవింపబడుచుండెను. ఆ వృద్ధ తపస్వి తాను స్వయముగా కణ్వమహర్షిననియూ, యిది తన తపోభూమి అనియూ, తన శిష్యులందరునూ యువకులుగా కన్పించిననూ, అనేక వేల సంవత్సరముల వయస్సు కలవారనియూ, అవధూతరూపమున శ్రీదత్తప్రభువు దర్శనమువలన మహా పుణ్యము పొందిన కారణమున యీ తపోభూమికి రాగలుగుట సంభవించెననియూ తెలిపెను. నాకు సంభ్రమాశ్చర్యములు కలిగి నోటమాట రాదాయెను. శరీరము వణుకుచుండెను. అంతట కణ్వయోగీంద్రులిట్లనిరి. ప్రస్తుతము దత్తప్రభువులు పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నున్నారు. మమ్ములను దయతో కనిపెట్టి చూడవలసినదని ప్రభువునకు మా విన్నపముగా తెలియజేయుము. నీకు శీఘ్రముగా శ్రీపాద శ్రీవల్లభ పాదుకా దర్శనము కలుగును గాక! అని, ఆశీర్వదించి నా శిరస్సుపై తమ దివ్యహస్తమునుంచిరి. నేను క్షణ కాలములో మా నాయన వద్ద నుంటిని. మా నాయన ప్రకృతిస్థుడైన తదుపరి మేమిర్వురమునూ మా స్వగ్రామమునకు విచ్చేసితిమి. నాకు కణ్వమహర్షి ఆశ్రమములో కలిగిన అనుభవమునూ, దత్తప్రభువు యొక్క నవావతారము పీఠికాపురములో ఉన్నదనెడి విషయమునూ మా నాయనకు కూడా తెలియజేయలేదు. 

రాజమహేంద్రవరము దగ్గర పట్టసాచల పుణ్యక్షేత్రము

కాలము గడచుచుండెను. కణ్వమహర్షి ఆశీర్వాద ప్రభావము వలన నాకు ధ్యానములో తరచు పాదుకా దర్శనము అగుచుండెను. ఒక పర్యాయము మా యింటికి కొందరు బంధువులు వచ్చిరి. వారికి పుణ్య నదులందు స్నానములాచరించి పుణ్యక్షేత్రములు సందర్శింప అభిలాష కలిగెను. వారు మా నాయనను కూడా తమతో రమ్మనిరి. అప్పటికి నా వయస్సు పది సంవత్సరములు. మా నాయనకు నా యందు ప్రీతి మెండు. తనతో నన్ను కూడా రమ్మనెను. నేను వల్లెయంటిని. రాణ్మహేంద్రవరము గోదావరీనది యోడ్డున గల పట్టణము. మహాపుణ్యక్షేత్రము. రాణ్మహేంద్రవరమునకు ఉత్తర దిశలో నుండిన కొండలమీద ఋషులు కొందరు తపస్సు చేసుకొనువారు. తూర్పుదిశలో నుండిన కొండలమీద మరికొంతమంది ఋషులు తపస్సు చేసుకొనువారు. రాణ్మహేంద్రవరమునకు ఆనతి దూరముననున్న పట్టసాచల పుణ్యక్షేత్రము గోదావరీనదీ మధ్యస్థమై యున్నది. మహాశివరాత్రికి ఈ ఋషీశ్వరులలో కొంతమంది పట్టసాచలములోను, మరికొంతమంది ఋషీశ్వరులు రాణ్మహేంద్రవరమునందలి కోటిలింగక్షేత్రము నందును వేదస్వస్తి చెప్పువారు. ఈ ఋషీశ్వరులు పరస్పరము మధ్యేమార్గముగా తూర్పు నుండి వచ్చువారు, పశ్చిమము నుండి వచ్చువారు, ఉత్తరము నుండి వచ్చువారు, దక్షిణమునుండి వచ్చువారు "ఎదురులపల్లి" యను గ్రామమున కలుసుకొనువారు. ఈ ఎదురులపల్లి గ్రామమునకు అత్యంత సామీప్యమైయున్న మునికూడలి గ్రామమున విశ్రమించి పరస్పరము చర్చలు చేసుకొనువారు. నా అదృష్టవశమున మా నాయనతో కలిసి నేను మునికూడలి గ్రామమును దర్శించగలిగితిని. ఇది అంతయును శ్రీదత్త ప్రభువుల లీల.

కలియుగములో శ్రీదత్తాత్రేయుల వారి ప్రప్రథమ అవతరణ శ్రీపాద శ్రీవల్లభులు 

అత్యంత గహనములయిన వేదాంత విషయములు, యోగశాస్త్ర రహస్యములు, జ్యోతిశ్శాస్త్ర విషయములు చర్చకు వచ్చినవి. ఈ చర్చలలో పాల్గొన్న మహామునులందరునూ ముక్తకంఠముతో శ్రీదత్త ప్రభువుల వారు శ్రీపాద శ్రీవల్లభ నామమున పీఠికాపురములో అవతరించియున్నరనియూ, కలియుగములో వారిది ప్రప్రథమ సంపూర్ణ దత్తవతారమనియూ చెప్పిరి. భౌతికముగా వారి దర్శనము పొందుటకు వీలులేని వారు ధ్యాన ప్రక్రియల వలన తమ తమ హృదయములలోనే దర్శించగలరనియూ, యీ అవతారము అత్యంత శాంతమయ, కరుణారస పరిపూర్ణము అనియూ చెప్పిరి.

అంతట మా నాయన నన్ను పీఠికాపురమునకు తీసుకొని వెళ్ళినారు. మాతో వచ్చిన పండిత బృందము పాదగయా తీర్థమునందు స్నానమాచరించి కుక్కుటేశ్వర దేవాలయము నందలి వివిధ దేవతలను దర్శించి, అర్చించి అచ్చటనుండి వేదస్వస్తి చెప్పుచూ శ్రీ బాపనార్యుల వారింటికి బయలుదేరిరి. శ్రీ బాపనార్యులవారు, శ్రీ అప్పలరాజుశర్మగారు, తమ పండిత బృందముతో వేదస్వస్తి చెప్పుచూ మమ్ములను కలసికొనిరి. అది ఎంతయో మనోహరమైన దృశ్యము. అటువంటి దివ్య, భవ్య దృశ్యములను చూచుట కూడా పూర్వజన్మలలోని సుకృత విశేషమున గాని పొందలేని విషయము.

శ్రీపాదుల వారి దివ్యమంగళ స్వరూప వర్ణన 

మాకు అందరకునూ శ్రీ బాపనార్యుల యింట విందు భోజనములు ఏర్పాటు చేయబడినవి. అప్పటికి శ్రీపాద శ్రీవల్లభుల వారి వయస్సు అయిదు సంవత్సరములు మించిలేదు. పాలుగారు పసివయస్సు నందున్న ఆ దివ్యశిశువు అత్యంత తేజోవంతుడు, వర్చస్వి, బహురూపసి, ఆజానుబాహుడు. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహముగా బయల్వెడలుచుండెను. నేను వారి శ్రీపాదములను స్పృశించగా వారు తమ అభయహస్తమును నా తలపై నుంచిరి. "జన్మ జన్మాంతరములందుననూ నా అనుగ్రహము నీపై ఉండును. నీవు కడపటి జన్మము నందు వెంకయ్య నామముతో అవధూతవై, నిత్యాగ్ని హోత్రివై , అకాలము సంభవించినపుడు వర్శములను కురిపింప సమర్థుడవై, సాంసారికజనుల ఈతిబాధలను తీర్ప సమర్థుడవై, వెలుగొందుదువు గాక!" అని ఆశీర్వదించిరి.

అంతట వారిని నేనిట్లంటిని. "శ్రీపాదుల వారి లీలలు ఆలకించు కొలదిని చిత్రవిచిత్రములుగా నున్నవి. గాయత్రీమంత్ర సాధనలలోని రహస్యములను ఎరిగింప ప్రార్థన."

(ఇంకా ఉంది..)               

Friday, February 3, 2012

Chapter 12 Part 2 (Last Part)

అధ్యాయము 12 
కులశేఖర వృత్తాంతము - భాగము 2 
సత్పురుషులకు అన్నదానము చేసిన కలిగెడి ఫలము 

గ్రంథ పారాయణానంతరము కనీసము 11 మంది సత్పురుషులకు భోజనము పెట్టుటగానీ లేదా దానికి సమానమైన ద్రవ్యమును ఏదేని దత్త క్షేత్రములందు వినియోగించబడునట్లు చేసినగానీ పారాయణ ఫలము సంపూర్తిగా లభింపదు. సత్పురుషులకు భోజనము పెట్టుట వలన సాధకునికి ఆయుర్దాయము లభించును. అనగా సాధకునకు మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది. అంతే కాకుండా వారు సంతుష్టులయినపుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యము, మొదలయిన వాటికి సంబంధించిన భోగ, యోగ స్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించును. కాలాంతరములో అవ్యక్తము నందలి బీజములు వ్యక్త స్థితిలో అంకురములై, మహావృక్షములై విరాజిల్లుచున్నవి. ద్రౌపదీమాత నుండి ఒక్క అన్నపుమెతుకును స్వీకరించిన శ్రీకృష్ణపరమాత్మ దుర్వాస మహర్షికిని, అతని పదివేలమంది శిష్యులకును కడుపు నిండుగా భోజనము అనుగ్రహించ గలిగెను. అందువలన శ్రీ గురునకు భక్తి శ్రద్ధలతో సమర్పించబడు సమస్తమునూ అవ్యక్తమునందు బీజరూపమున నుండి కాలాంతరమున వ్యక్త స్థితి యందు సాధకునకు కావలసిన సమస్త భోగభాగ్యములను ప్రసాదించుచున్నవని గ్రహింపవలెను. 

ఒకసారి శ్రీకృష్ణుడును, సుధాముడును దర్భలను కోసుకొను నిమిత్తము అడవికిపోయిరి. శ్రీకృష్ణుడు అలసిపోయిన కారణమున సుధాముని ఒడిలో విశ్రమించెను. శ్రీకృష్ణునకు చెప్పకుండా సుధాముడు ఆశ్రమము నుండి తెచ్చుకొన్న అటుకులను తినుచుండెను. కపటనిద్ర పోవుచున్న శ్రీకృష్ణుడు నిద్ర మేల్కాంచినట్లు నటించి, "సుధామా! ఆకలి యగుచున్నది. ఇంటివద్ద నుండి వచ్చునపుడు గురుపత్ని బిడ్డల ఆకలి బాపుటకు ఏమయినా ఆహార పదార్థములను యిచ్చినదా?" అని అడిగెను. సుధాముడు లేదనెను. నీవు ఏదో నములుచున్నట్లు తోచుచున్నదే అని యనెను. ఏమియునూ లేదు. విష్ణు సహస్రనామమును చదువుకొనుచున్నాననెను. ఓహో! అలాగునా! మనయిద్దరికీ అమ్మగారు అటుకులను తినుట కిచ్చిరనియూ, నాకు పెట్టకుండా నీవు ఒక్కడివే తినుచున్నట్లును కల వచ్చినది అని అనెను. అంతట సుధాముడు "శ్రీకృష్ణా! అలసియుంటివి గదా! అందులోనూ పగటివేళ. ఈ వేళలో వచ్చు కలలకు ఫలితము ఉండదని శాస్త్రము చెప్పుచున్నదనెను." శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకొనెను.

కాలాంతరమున సుధాముడు కుచేలుడై పరమ నిర్భాగ్యుడయ్యెను. తన వెతలను బాపుమని ఎన్నియో మార్లు విష్ణు సహస్ర నామమును పఠించెను. ఆఖరుకి శ్రీకృష్ణునికి అనుగ్రహము కలిగినది. కుచేలుని నుండి అటుకులను స్వీకరించి వానికి విశేషమైన ఐశ్వర్యమును ప్రసాదించెను. తాను అలసిపోయినపుడు కుచేలుడు ఒడిలో తలపెట్టుకొననిచ్చిన కారణముననే శ్రీకృష్ణుడు కుచేలుని హంసతూలికాతల్పముపై పరుండబెట్టి పాదసేవ చేసెను. కర్మసూత్రము ఎంత నిగూఢముగా పనిచేయునో ప్రభువు దీనిలో సూచించెను. 

మల్లయుద్ధ ప్రవీణునకు గర్వభంగము 

శ్రీపాదులవారు 4 సంవత్సరముల బాలుడై యుండగా పీఠికాపురమునకు వర్మకళ అను ఒక మర్మకళను తెలిసిన మళయాళ దేశీయుడొకడు వచ్చెను. వాని పేరు కులశేఖరుడు. మన శరీరములోని చాలా భాగములను నియంత్రించు కొన్ని జీవశక్తి కేంద్రములను మర్మలని పిలిచెదరు. ఈ మర్మలపై కొట్టిన లేదా తాకిన యెడల మనిషిని స్పృహ కోల్పోవునట్లు చేయవచ్చును. ఏదయినా శరీరభాగమును పనిచేయకుండా అంగవైకల్యమును కూడా కల్పించవచ్చును. మర్మాభిఘాతాలలో బాధపడే వారిని రక్షించడానికి లేదా రోగ లక్షణాలను నివారించడానికి వీటిని వినియోగించవలెను. యుద్ధకళే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మర్మలను అడంగళ్ లని అంటారు. ఈ అడంగళ్ మర్మాలలో చికిత్స ఏ విధముగా చేయవలెనో నేర్పే కళనే మర్మ చికిత్స అని అందురు. ఈ శాస్త్రమును ముందుగా లోకమునకు తెలియజేసిన ప్రాచీన వైద్యుడు 'సుశ్రుతుడు'. ఈ కళలో అత్యంత ప్రమాదకరమైన 12 మర్మ స్థానములు ఉన్నవి. వాటిని గురుముఖతః నేర్చుకుని లోక కళ్యాణమునకు మాత్రమే వినియోగించవలెను. ఈ మర్మ స్థానములలో ప్రాణశక్తి విశేషంగా ఉండును. వీటిపై తీవ్ర వత్తిడి కలిగించడంవలనగాని, ఆ స్థానములలో దెబ్బ తీయుటవలనగాని మనిషికి ప్రాణాపాయమును కలిగించవచ్చు. కొన్ని స్థానములలో వత్తిడి కలిగించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించడమే గాక రకరకాల దీర్ఘ వ్యాధులను కూడా నయము చేయవచ్చును.

కులశేఖరుడు ఏడుకొండల వాని భక్తుడు. అతడు ప్రతి రాజ్యములోని మల్లయోధులను జయించుచూ జయపతాకములను గైకొనుచూ కాలకర్మవశమున పీఠికాపురమునకు వచ్చెను. పీఠికాపురములో కూడా మల్లయోధులు ఉన్నారు. వారందరూ సమావేశమై మనము కులశేఖరుని చేతిలో చావు దెబ్బ తినుట ఖాయము. మన ఊరి ప్రతిష్ఠకూడా మంటగలసిపోవును. యోగులకు అనేక విచిత్ర శక్తులుండునని ప్రతీతి. శ్రీపాద శ్రీవల్లభులవారు దత్తాత్రేయుల వారి అవతారమని తెలిసినవారు అనుచున్నారు. కావున మనము ఈ విషమ సమస్యా పరిష్కారము వారినే శరణువేడెదము అని అనుకొనిరి. అపుడు శ్రీపాదులవారు నరసింహవర్మ గారి యింటనుండిరి. శ్రీ వర్మగారు శ్రీపాదుల వారికి ప్రత్యేకముగా ఒక వెండిజరీతలపాగాను తయారు చేయించిరి. వారు తమ జమిందారీ భూముల పర్యవేక్షణకు పోవునపుడు వెండిజరీతలపాగాను ధరింపజేసి శ్రీపాదుల వారిని గుఱ్ఱపుబండిలో తీసుకొని వెళ్ళుట పరిపాటి. ఒకరోజు తలపాగాను ధరింప జేయబోవు సందర్భములో శ్రీపాదులవారు  తాతా! మనము మరికొంత సమయము ఆగి వెళ్ళవచ్చుననిరి. 

ఇంతలోనే పీఠికాపుర మల్లయోధులు వారివద్దకు వచ్చిరి. వారు శ్రీపాదులవారిని శరణుజొచ్చిరి. శ్రీపాదులవారు వారికి అభయమిచ్చినారు. పీఠికాపురములో భీముడు అనుపేరుగల గూనివాడు ఒకడుండెను. అతడు అష్టవంకరలతో నుండెడివాడు. పైగా దుర్భలుడు. ఏ పనీ చేయలేకపోయిననూ వానిని వర్మగారు తనసేవకు వినియోగించుకొని జీతమునిచ్చువారు. భీమునకు శ్రీపాదులవారియందు అపారమైన ప్రేమాభిమానములు మరియు మహా అచంచల విశ్వాసము. వాడు, తన గూనెను బాగు చేయవలసినదని శ్రీపాదులవారిని తరచుగా కోరెడివాడు. దానికి శ్రీపాదులవారు తగిన సమయము వచ్చినపుడు బాగు చేసెదనని చెప్పెడివారు.శ్రీపాదులవారు మల్లయోధులతో మనకేమి భయము? మన భీముడున్నాడు. కులశేఖరుని ఎదుర్కొనగలడు. భీముడంతటివాడు మన అండనుండగా మనకేమి భయము? అని అనిరి.

దత్త విధానములు చిత్ర విచిత్రములుగా నుండును. కులశేఖరునిపై పోరునకు భీముని ఎంపిక చేయుట పీఠికాపుర వాసులకు ఆశ్చర్యమును కలిగించినది. ఈ దెబ్బతో భీముడు చనిపోవుట అయినా జరుగవచ్చును, లేదా శ్రీపాదులవారి దివ్యత్వము వెలుగులోనికి వచ్చును అని కొందరు తలపోసిరి. కుక్కుటేశ్వరాలయ పరిసరములందు మల్లయుద్ధ ప్రాంగణము ఏర్పాటు చేయబడినది. అనేకమంది అచ్చటకు ఈ వినోదమును చూచుటకు వచ్చిరి. పోరు ఆరంభమయ్యెను. కులశేఖరుడు కొట్టు ప్రతి దెబ్బకును భీముని శరీరము శక్తివంతమగుచుండెను. భీముని అతడు ఏ ప్రాంతములందు కొట్టుచుండెనో అదే ప్రాంతములో కులశేఖరునికి దెబ్బలు తగులుచుండెను. కులశేఖరునికి నీరసము వచ్చెను. భీముని గూనె సరిచేయబడుటయే గాక అతడు మంచిబలశాలిగా తయారయ్యెను.

కులశేఖరుడు శ్రీపాదులవారి పాదాక్రాంతుడయ్యెను. శ్రీపాదులవారు, "కులశేఖరా! మానవశరీరంపై మర్మలు 108 వరకూ ఉన్నాయి. వాటికి సంబంధించిన సమస్త జ్ఞానమును నీకున్నది. అయితే భీముడు కేవలము నన్నే నమ్ముకొని యున్నవాడు. నేనే తన రక్షకుడనను జ్ఞానము వానికున్నది. నీ జ్ఞానము గొప్పదా? వాని జ్ఞానము గొప్పదా? నీవు అహంకారముతో విర్రవీగితివి. నేను దివ్య వినోదిని. రకరకాల శిక్షలను వేయగల శాసనకర్తను. ఈనాటి నుండి భీమునిలోని సమస్త దుర్బలత్వమును నీకిచ్చుచున్నాను. శరీరమునందు నీరసముతో అన్నవస్త్రములకు లోటు లేకుండా మాత్రము జీవించెదవు గాక! భీముడు నీ యొక్క శరీరంలోని ప్రాణశక్తినంతటినీ తీసుకొని ధృడకాయుడై యుండుగాక!నేను ప్రపంచములోని ప్రతి జీవికంటెను బలవంతుడను. తిరుపతిలో ఉన్నది ఎవ్వరు? నేను కాదా? సదా నా రక్షణను కోరుచూ ఈ మర్మకళను నీవు దుర్వినియోగపరచినావు. కావున నీలోని ఈ మర్మకళను ఉపసంహరించుచున్నాను." అని పలికిరి.

శ్రీపాదుల వారు క్షణకాలము పాటు కులశేఖరునకు శ్రీ పద్మావతీ వేంకటేశ్వరునిగా దర్శనమిచ్చి వానిని కృతార్థుని చేసిరి. శ్రీపాదుల వారి లీలలు దుర్గ్రాహ్యములు. అచింత్యములు. వారి కరుణ పొందుట ఒక్కటే మనకు సరి అయిన మార్గము.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

( అధ్యాయము 12 సమాప్తం )        

Chapter 12 Part 1

అధ్యాయము 12 
కులశేఖర వృత్తాంతము-భాగము 1  

శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఎన్నో క్రొత్త విషయములను సులభ గ్రాహ్యంగా నాకు తెలియజేయుట వలన వానిని ఆకళింపు చేసుకోను కొలదిని నాలో ఆత్మవికాసము కలుగుచున్నట్లు కనుగొంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి యిట్లు చెప్పనారంభించెను. "శ్రీపాద శ్రీవల్లభుల వారు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామియే ! కలియుగాంతమున శ్రీపాద శ్రీవల్లభుల వారే కల్కి అవతారముగా వచ్చువారు. సాధారణముగా బ్రాహ్మణులు కలియుగము 4 , 32 ,000 సంవత్సరములని చెప్పెదరు. కాని సాంద్ర సింధు వేదము ననుసరించి కలియుగము 5000 సంవత్సరముల కాలము దాటిన తదుపరి సామాన్య ప్రళయము జరిగి కలియుగములో సత్యయుగము స్థాపించబడును." నా ఆశ్చర్యమునకు అంతు లేదు. నేను బ్రాహ్మణులనుండి విన్న విషయములకు శ్రేష్ఠి చెప్పునది వ్యతిరిక్తముగా నుండెను.

శ్వాసకు ఆయుష్షునకు గల సంబంధము

"నాయనా! శంకరభట్టూ! కలియుగములో కలి అంతర్దశ 5000 సంవత్సరములకు అంతమగును. ఆ తదుపరి కొంతకాలము సంధికాలము. ఆ తరువాత కలియుగములో సత్యయుగ అంతర్దశ ప్రారంభమగును. మొత్తం 4 ,32 ,000 సంవత్సరములు కలియుగ ప్రమాణమైననూ దానిలో కూడా అంతర్దశలు, సూక్ష్మ దశలు, విదశలు మొదలయినవి ఉండును. ఇది యోగ శాస్త్రము తెలిసినవారికే సుబోధకమగు విషయము. బ్రహ్మ దేవుడు ఒకనికి 120 సంవత్సరముల ఆయుర్ధాయమును నిర్ణయించెననుకొనుము. భౌతికముగా వాడు 120 సంవత్సరములు జీవించుననికాదు అర్థము. 120 సంవత్సరములలో ఎన్ని శ్వాస ప్రశ్వాసలు సామాన్య స్థితిలో తీసుకొనుటకు వీలుండునో అన్ని శ్వాస ప్రశ్వాసల కాలము యీయబడినదని అర్థము. మనశ్చాంచల్యము గలవారు, కోపధారులు, వడివడిగా పరిగెత్తువారు, నిత్యమూ దిగులుతో జీవించువారు, దుష్ట ప్రవత్తులను కలవారు తమయొక్క శ్వాసలను తక్కువ కాలములో ఖర్చు చేసుకొందురు. అన్నింటి కంటెను తక్కువ శ్వాస ప్రశ్వాసలను తీసుకొను రాకాసి తాబేలు 300 సంవత్సరముల వరకు జీవించుచున్నది. అత్యంత చంచల స్వభావము గలిగిన కోతి స్వల్పకాలములోనే మరణించుచున్నది. శ్వాస ప్రశ్వాసలను తీసుకొనుటకు శరీర అవయవ నిర్మాణము కూడా సరియైన స్థితిలో నుండవలెను. యోగులు గాలిని కుంభించి, శ్వాస శరీరాంతర్భాగములందే నడయాడునట్లు చేసెదరు. దీనివలన ఎన్నో శ్వాసలు మిగిలిపోయి వారు ఎక్కువకాలము జీవించుచున్నారు. మనిషి శరీరములోని జీవాణువులు పరిణామక్రమమునకు లోనగుచున్నవి."

శ్రీపాద చరితామృత పారాయణ ఫలితము 

పది వర్షముల క్రిందట శరీర భాగములు యీనాటి శరీరభాగములు కావు. పాత జీవాణువుల స్థానములో క్రొత్త జీవాణువులు పుట్టుచున్నవి. క్రొత్త శరీరభాగములు పుట్టుచున్నవి. అదే విధముగా ప్రాణశక్తి కూడా అనేక మార్పులకు లోనగుచున్నది. జీవన దాయకమైన క్రొత్త ప్రాణశక్తి పుట్టుచుండును. జబ్బు పడిన పాత ప్రాణశక్తి నశించుచుండును. అదే విధముగా మానసిక శక్తి కూడా అనేక మార్పులను పొందుచున్నది. పాత భావములు మారిపోయి, నశించి, కొత్త భావములు పుట్టుచున్నవి. నవీనముగా జన్మించిన మానసిక పదార్థము దైవశక్తిని, దైవకృపను ఆకర్షించు సామర్థ్యమును కలిగియున్నది. తద్వారా మనస్సు పరిశుద్ధమై, ప్రాణము పరిశుద్ధమై, తద్వారా శరీరము కూడా పరిశుద్ధమగుచున్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వంటి గ్రంథములు సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపము. ఈ గ్రంథములందలి ప్రతీ అక్షరమునందు సిద్ధశక్తులు, యోగశక్తులు అంతర్నిహితముగా నుండును. అటువంటి గ్రంథములను మానసికముగా గాని, వాచికముగా గాని లేదా మనస్సు, వాక్కు రెండింటి యందు సమన్వయము కలిగిగాని, పఠిoచిన యెడల శ్రీపాదులవారి దివ్య మానస చైతన్యము అటు ఆకర్షించబడును. గ్రంథ పారాయణము చేయు భక్తుల శారీరక, ప్రాణ, మానసిక రుగ్మతలు, బాధలు, కష్టములకు సంబంధించిన సమస్త స్పందనలునూ శ్రీపాదులవారి మానసిక చైతన్యము నందు చేరును. అచ్చట అవి పరిశుద్ధత పొంది, దివ్యానుగ్రహపూరితమైన స్పందనలతో తిరిగి సాధకుని చేరును. అటువంటి పరిస్థితిలో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి. 

(ఇంకా ఉంది..)              

Wednesday, February 1, 2012

Chapter 11 Part 2 (Last Part)

అధ్యాయము 11 
సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణి, బిల్వమంగళుల వృత్తాంతము - భాగము 2 
శ్రీపాదుల ఘటనాఘటన సామర్థ్యము

బాపనార్యుల అగ్నిహోత్రము సల్పు కార్యమును ఆనాడు ఎన్నిమార్లు వేదమంత్రములను ఉచ్చరించుచున్ననూ అగ్ని సృష్టి జరుగలేదు. శ్రీపాడులవారు తమ తాతగారి దురవస్థను చూచి లీలగా నవ్వుకొనుచుండిరి. తాతగారికి ముచ్చెమటలు పోయుచుండెను. అంతట శ్రీపాదులవారు అగ్ని కుండమువైపు చూచి "ఓయీ! అగ్నిదేవా! నిన్ను అజ్ఞాపించుచున్నాను. తాతగారి దైవకార్యమునకు ఆటంకము కలిగింపకుము." అనిరి. వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగెను. శ్రీపాదులవారు తాతగారి కలశము నందలి నీటిని గైకొని అగ్ని గుండములో పోసేను. అగ్ని ఆరిపోవుటకు బదులు మరింతగా ప్రజ్వలిమ్పసాగెను. తాతగారు ఈ వింతను చూచి మరింత ఆశ్చర్యపోయిరి. శ్రీపాదుల వారిట్లనిరి. "తాతా! నా ఈ అవతరణమునకు నీవునూ, వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహ వర్మయును కారకులు. అందువలన నీవుగాని, మా నాయనగాని, వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండిగాని, ధనసహాయముగాని, ధనేతర సహాయముగాని స్వీకరించిన అది దానము క్రింద లెక్కకు రాదు. ఆ రకముగా సహాయమును స్వీకరించకపోవుట దైవద్రోహము కూడా కాగలదు. అటువంటి సహాయమును పరమేశ్వరానుగ్రహముగా భావింపవలెను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతీ మహారాణి మల్లాది వారికే కాదు, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి, వత్సవాయి వారి కుటుంబమునకు కూడా ఆడపడుచుగా భావింపబడవలెను. ఇది నా శాసనము." అనిరి. శ్రీపాదులు ఈ మాటలను పలుకు సమయమున అప్పలరాజు యాదృచ్ఛికముగా అచ్చటనే యుండిరి. శ్రీపాదుల వారిట్లనిరి. "నా సంకల్పము లేనిదే బాపనార్యులవంటి మహా తపస్వి కూడా అగ్ని సృష్టి కావింపలేడు. మా నాయన కూడా అగ్నిగుండము నందు దిగిన యెడల అగ్నిహోత్రుడు తన ప్రతాపమును చూపించితీరును. నా సంకల్పము నందు మార్పు జరిగినచో వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపెడగా మారిపోవును. పుట్లకొలది భూములున్న నరసింహవర్మ నిలువనీడలేనివాడగును. మీరందరునూ నా సంకల్పము ననుసరించియే ఆయాస్థితులలో నున్నారు. నేను బిచ్చమెత్తుకొను వానిని మహారాజుగా చేయగలను. మహారాజును బిచ్చగానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తునికి వాడు ఏది కోరినా యివ్వగలను. అయితే యిచ్చుటకు ముందు అంతటి ఉన్నతశక్తిని ఆ భక్తుడు నిలుపుకొనగలడా? తన శక్తి సామర్థ్యములను లోకోపకారము కొరకు ఉపయోగించునా? లేదా? అని వారిని పరీక్షింతును. నాకు అవసరమని తోచినపుడు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను మార్చివేయగలను. బాపనార్యులు కృతయుగములో లాభాదమహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడొకడు ఉండెడివాడు. మంగళ మహర్షి దర్భలు కోయుచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము స్రవించెను. ఆ రజతము గడ్డకట్టి సుగంధభరితమైన విభూతిగా మారెను. ఆహా! నేను ఎంతటి గొప్పసిద్ధిని పొందితిని అని మనసులో వానికి గర్వము కలిగెను. అంతట పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించెను. హిమగిరుల నుండి మంచుపెళ్లలు విరిగి పడునట్లు చెప్పలేనంతటి విభూతి వర్షించెను. పరమశివుడిట్లనియె. "త్రేతాయుగములో భరద్వాజుడు పీఠికాపురములో సవితృ కాఠక చయనము చేయును. ఆ మహాచయనము నందు పేరుకొనిన విభూతిలోని లవలేశమును నీను చూపించితిని." అంతట మంగళ మహర్షి గర్వము తొలగిపోయెను. శ్రోతలందరునూ అవాక్కయి శ్రీపాదులవారు చెప్పునది వినుచుండిరి. శ్రీపాదులిట్లనిరి. "ఈ పీఠికాపుర అగ్రహారములో అడుగుపెట్టుట ఎన్నో జన్మల పుణ్యఫలము. నా యీ అవతరణము సమయములో మీరు నాతోనుండుట చెప్పరానంతటి విశేషము. నా శక్తి అనుభవములోనికి రావలెనన్న మొదట నీవు తీవ్ర సాధకుడవు కావలెను. అప్పుడు మాత్రమె నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము నీకు అనుభవములోనికి వచ్చును. నా జన్మభూమి అయిన యీ బాపనార్యుల యింట నా పాదుకలు ప్రతిష్టింపబడును. నేను పీతికాపురమున ఉదయవేళలో అమ్మ సుమతి ఒడిలో నుండి పాలను త్రాగెదను. మధ్యాహ్న సమయములో పీఠికాపురమున అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నము తినిపించును. రాత్రి సమయమున పీఠికాపురమున అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురమునందు ఉన్నట్లే గంధర్వపురమున నృసింహ సరస్వతి రూపమున ఉందును. మధ్యాహ్న సమయము నందు ఖచ్చితంగా గంధర్వపురమున భిక్ష చేసెదను. అంతర్నేత్ర దృష్టి కలవారలకు యివి స్పష్టముగా గోచరించును."

మహాపురుషులు, మహాయోగులు అన్నిదేశములవారు చీమల పుట్టలవలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారునకు వచ్చెదరు. వారు దత్త దిగంబర! శ్రీపాద వల్లభ దత్త దిగంబర! నృసింహ సరస్వతి దత్త దిగంబర! యనుచు తన్మయత్వముతో నృత్యము చేసెదరు. నేను కాలపురుషునకు అనుమతి యిచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణములో నెరవేరును. నా పేరిట మహాసంస్థానమొకటి ఏర్పడును. నా ప్రభావము అతిశయించిన కొలదిని యీ పీఠికాపుర క్షేత్రములో గోష్పాదమంత భూమి కూడా క్రయము పొందుటకు అవకాశము లేకుండును. నేను నా వారు అనుకున్నవారిని అవసరమైతే జుట్టుపట్టుకొని యీడ్చుకొని వచ్చి పీఠికాపురములో పడవేసేదను. ఎంతటి ధనవంతుడు అయిననూ, ఎంతటి యోగి అయిననూ నా సంకల్పము లేక పీఠికాపురములోని నా సంస్థానమునకు రాలేరు. ఇది నిశ్చయము. నా నిజతత్త్వమును గ్రహించి ఆనందించుడి. ఈ తరుణము మరిరాదు. మానవుని అవగాహనలోని సమస్త దేవతా శక్తులు నా స్వరూపమునందే ఉన్నవి." నాకు ఎవరయినా దక్షిణ సమర్పించిన నేను దానిని నూరింతలు చేసి తరునమాసన్నమయినపుడు వారికి అనుగ్రహింతును. ధర్మమునకు విరుద్ధము కాకుండా ధనార్జన చేయవలెను. ధర్మమునకు విరుద్ధము కాకుండా కోరికలను అనుభవింపవచ్చును. సత్కర్మలనాచరించుట వలన మోహము నశించును. మోహము క్షయమయిన పిమ్మట మోక్షము లభించును.

నాయనా! శంకరభట్టూ! వింటివా! శ్రీపాదులవారి అమృత వచనములు. ఈ దివ్యోపదేశము తదుపరి ఆ మర్నాడు నరసింహవర్మ శ్రీపాదులవారిని తమ గుర్రపుబండిలో తమ భూములను చూపించ తీసుకొనిపోయిరి. వారికి పుట్లకొలది భూములు కలవు. ఆ భూములలో అనేక రకముల పంటలు పండును. కాని బీరపాదులు మాత్రము పుష్పించుట అరుదుగా నుండెను. పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించిపోవుట జరుగుచుండెను. ఒకవేళ పిందెలు పెద్దవి అయి కాయలైయిన యెడల అవి వంటకు పనికిరానంతటి చేదుగా నుండెను. ఈ విషయమును శ్రీపాదులవారితో నరసింహవర్మ మనవి చేసుకొనెను. శ్రీపాదులవారు ప్రసన్నవదనులయి "మా యింటిలో వారికందరికీ బీరకాయపప్పు నందు ప్రీతి మెండు. మా యింటిలోని వారికి యిష్టము గనుక నాకు కూడా యిష్టమే! అయితే పూర్వకాలములో ఒకానొక దత్తోపాసకుడు యీ భూమిలో తపమాచరించెను. ఈ పవిత్రభూమి సాక్షాత్తు దత్తుడనయిన నా పాదస్పర్శ కోసము తపన పడుచున్నది. తన తపనను నీకు తెలియజేయుటకు తన భాషలో యీ విధముగా వ్యక్తీకరించుచున్నది. తప్పక యీ నేలతల్లి కోరికను తీర్చెదను. ఈ భూమికి నా స్పర్శ కలిగిన తరువాత యీ భూమాత తత్త్వములో మార్పు వచ్చును. మంచి రుచి కలిగిన బీరకాయలను యీ తల్లి మనకు అందించును. తాతా! నీవు నిర్భయముగా మా యింటికి యిక్కడ పండిన బీరకాయలను పంపుము. యింటివారితో పాటు నేను కూడా ఆ వంటకమును భుజించెదను." అని పలికెను.

నాయనా! శంకరభట్టూ! చిత్రాతిచిత్రము! ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతముగా కాయుచుండెను. అవి మంచిరుచిని కూడా కలిగి యుండెను. 

శ్రీపాదులవారు నరసింహవర్మతో పాటు గుర్రపుబండి నుండి దిగి ఆ భూములలో కొద్ది ముహూర్తముల సమయము విహరించిరి. ఇంతలో కొంతమంది చెంచు యువతీయువకులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. వచ్చిన వారందరునూ శ్రీపాదుల వారికి ప్రణమిల్లిరి. ఆ సమయమున శ్రీపాదులవారి దివ్యవదనారవిందమున పరివేష్ఠిoచి దివ్యకాంతి వలయమేర్పడెను. శ్రీపాదులు యిట్లనిరి. "తాతా! ఈ చెంచులందరునూ నరసింహావతారమునకు సంబంధించినవారు. వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబుట్టువుగా భావించి ఆరాధించువారు. నీవు నరసింహస్వామికి భక్తుడవు గదా! నీవు వీరిని ఆశ్రయించిన నృశింహ దేవుని దర్శనభాగ్యమును పొందవచ్చును."

శ్రీపాదులవారు యిట్లు పలుకుట తమను ఆటపట్టించుట కొరకని నరసింహవర్మ తలచిరి. వారిట్లు పలికిరి. "ఓ చెంచులారా! మీరు నృసింహదేవుని చూచినారా? వారి జాడ ఏదయినా తెలుపగలరా?" దానికి బదులుగా వారిట్లనిరి. "అదేమంత గొప్ప భాగ్యము! సింహపుతల, మనుష్య శరీరము గలవాడు తిక్కరేగి యీ అడవులలోనే తిరుగుచున్నాడు. వాడు మా సోదరి చెంచులక్ష్మిపై మరులుగొన్నాడు. మా చిన్నది కూడా వానిని యిష్టపడినది. వారికి మేము వివాహము కూడా చేసియున్నాము. మీరు కావలెనన్న చెంచులక్ష్మిని, నృశింహుని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము."

ఈ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువతీయువకులు వడివడిగా పరుగెత్తుకొనిపోయిరి. నరసింహవర్మ దీనిని అంతటిని వింతగా చూచుచుండెను. ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువతియును, యువకుడును వచ్చుచుండుతను గమనించిరి. అదృష్టవశమున నేను కూడా ఆ దారి వెంబడి పోవుచుంటిని. శ్రీపాదులవారు నన్ను తమవద్దకు రమ్మనిరి. నేను వారి దరినిచేరగా వారు "సుబ్బయ్య శ్రేష్ఠి ! దూరమునుండి ఆ వచ్చువారు ఎవరనుకొంటివి? ఆ వచ్చువారు బిల్వమంగళుడును, చింతామణియును. కొద్దిపాటి చితుకులను ప్రోగుచేయుము. మనము చితుకుల మంట వేయుదుము. అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చును." అని పలికిరి. 

నరసింహ వర్మకును, నాకునూ ముచ్చెమటలు పోయుచుండెను. ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును, చింతామణియే! సందేహము లేదు. వారిరువురును గురువాయుర్ క్షేత్రము నందలి శ్రీకృష్ణదేవుని దర్శనము చేసుకొనిన తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనెడి మహాయోగినిని దర్శించిరి. ఆమె అప్రయత్నముగా వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను. ఆమె ఆశీ: ప్రభావమున వీరిలో భక్తి, వైరాగ్య బీజములు పడినవి. మంగళగిరి క్షేత్రము నందలి నృసింహుని దర్శించుకొని పీఠికాపురమున శ్రీపాదులవారి దర్శనార్థము వచ్చుచుండిరి. శత వృద్ధురాలైన ఆ మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వచన ప్రభావమున వారికి శ్రీపాదుల వారి దర్శనము యిచ్చటనే లభించినది! ఇది ఆశ్చర్య కర విషయము. వారిరువురు మంగళగిరిలో యిట్లు ప్రార్థించిరి. "మహాయోగిని కురూరమ్మ దీవెన ఫలించి దత్తభిన్న స్వరూపులయిన శ్రీపాదుల వారి దర్శనము మాకు కలుగనెడల నృశింహ దేవుడవయిన నీ దర్శనము భౌతికముగా పొందగోరుచున్నాము."

చితుకులమంట ప్రజ్వరిల్లుచుండగా బిల్వ మంగళుడును, చింతామణియు తమ శరీరములకు దహన సంస్కారములు జరుగు చున్నంత బాధను అనుభవించిరి. కొంతసేపటికి వారి శరీరములనుండి వారిని పోలిన నల్లటి ఆకారములు బయటకు వచ్చి ఆ మంటలోపడి రోదించుచూ ఆహుతి అయిపోయినవి. ఆ నల్లటి ఆకారములు ఆహుతి అయిన తరువాత వారిద్దరునూ స్పృహ లోనికి వచ్చిరి. ఇంతలో చెంచులు తమ తోబుట్టువు చెంచులక్ష్మితో అచ్చటకు వచ్చిరి. నృశింహ దేవుని రెక్కలు విరిచికట్టి చెంచులు నృశింహ దేవుని శ్రీపాదుల ముందుంచిరి. 

ఇటువంటి చిత్రాతిచిత్రములు ఏ యుగములలోనూ జరుగలేదు. శ్రీపాదులవారి అవతార కార్యక్రమములో లీలలు, చమత్కారములు, కోకొల్లలు.అనూహ్యములు. శ్రీపాదులవారిట్లు ప్రశ్నించిరి. "పూర్వయుగములందలి నృశింహుడవు  నీవేనా? ఈ చెంచులక్ష్మి నీ భార్య యేనా? హిరణ్య కశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించినది నీవేనా?" దానికి శ్రీ నృశింహదేవుడు ఔనని ముమ్మారు పలికెను. చెంచులక్ష్మియు, శ్రీనృశింహదేవుడును జ్యోతి స్వరూపముతో శ్రీపాదులవారి శరీరములోనికి ప్రవేశించిరి. చెంచులు అంతర్ధానమైరి. బిల్వ మంగళుడు మహాభక్తుడై బిల్వ మంగళ మహర్షిగా రూపొందెను. చింతామణి మహా యోగినిగా మారిపొయినది. చిత్రాతి చిత్రమైన యీ లీలలు జరిగిన నరసింహవర్మ గారి భూములయందు ఒక గ్రామము వేలయుననియూ, దానిని "చిత్రవాడ" అని వ్యవహరించెదరని శ్రీపాదులవారు సెలవిచ్చిరి. వారు సత్య సంకల్పులు. సిద్ధ సంకల్పులు.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 11 సమాప్తము)       

Chapter 11 Part 1

అధ్యాయము 11 
సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణి, బిల్వమంగళుల వృత్తాంతము- భాగము 1 

దత్తారాధన వలన సకల దేవతారాధన ఫలము.
శ్రీపాదుల జన్మము- అత్యద్భుత జ్యోతిర్మయము.

శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మరునాడు యీ విధముగా సెలవిచ్చెను. "శ్రీ దత్తప్రభువు సర్వ దేవతా స్వరూపులు. దత్తుని ఆరాధించిన యెడల సకల దేవతారాధన ఫలితము లభించును. సర్వ దేవతలలోను అంతర్లీనముగా శ్రీ దత్తులే ఉన్నారు. శ్రీ సుమతీమాత శని ప్రదోష సమయమున అనసూయా తత్త్వము నందలి పరమశివుని ఆరాదిన్చేదివారు. అందువలన శ్రీ దత్తప్రభువులోని శివ తత్త్వము అనసూయా తత్త్వము నందు ప్రతిబింబించి, అనసూయా మాతతో సమానమైన స్థితి నందున్న సుమతీమాత యొక్క గృహమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఇది ఒకానొక అద్భుత యోగప్రక్రియ. వారు మాతా పితృ సంయోగము వలన గాక యోగానిష్ఠులైయున్న అప్పలరాజశర్మ, సుమతీమాతల నేత్రములనుండి యోగాజ్యోతులు ప్రభవించి, అవి సంయోగము చెంది సుమతీమాత గర్భమునందు నిల్చి నవమాసములు నిండిన తదుపరి కేవలము సంవత్సరమునుండి కొన్ని వింతశక్తులను ప్రకటించసాగిరి. శ్రీపాదుల వారి తరువాత వారికి శ్రీవిద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు సోదరీమణులు జన్మించిరి. శ్రీవిద్యాధరి జననమందిన రోజున బాపనార్యుల దూరపు బంధువు మల్లాది రామకృష్ణావధాన్లు అను మహాపండితుడు వారియింటికి వచ్చెను. వారికి చంద్రశేఖరుడను కుమారుడుండెను. ఘండికోట వారింట మహాలక్ష్మియే జనించెను, ఆమె మల్లాదివారి కోడలయిన బాగుండునని బంధువులు ముక్తకంఠముతో పలికిరి. శ్రీపాడులవారు కూడా తమ సోదరి శ్రీవిద్యాధరిని చంద్రశేఖరునకిచ్చి వివాహము చేసిన బాగుండుననిరి. శ్రీపాడులవారు సిద్ధ సంకల్పులు. వజ్రసంకల్పులు. వారి వచనానుసారమే తదుపరి కాలమునందు శ్రీవిద్యాధరికిని, చంద్రశేఖరావధాన్లునకును రంగరంగ వైభవముగా పీఠికాపురమున వివాహమాఎను. రాధయను సోదరిని విజయవాటికా నివాసులైన విశ్వనాధ మురళీకృష్ణావధాన్లగారికిని, సురేఖయను సోదరిని మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధాన్లగారికిని ఇచ్చి వివాహము చేసిరి.

నాయనా! శంకరభట్టూ! శ్రీపాదులవారి లీలలు అనూహ్యములు. ఆ లీలలను స్మరించువారికి పాపములు నశించును. గోదావరీ మండలమునందు తాటంకపురము (తణుకు) అను గ్రామము కలదు. అందు అనేక వాజపేయములను, పౌండరీకములను, మహాయాగములను ఆచరించిన పరమపవిత్రమైన వంశము ఒకటి కలదు. వారే వాజపేయయాజులవారు. పీఠికాపురమునందలి మల్లాదివారికిని, తణుకు నందలి వాజపేయయాజుల వారికిని సన్నిహితబంధములు కలవు. అయితే వాజపేయయాజుల వారు ఇదంబ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అను సిద్ధాంతము నందు విశ్వాసము కలవారు. వారు వశిష్ఠ శక్తి, పరాశరత్రయాఋషి ప్రవరాన్విత పరాశర గోత్ర సంభవులు. వారు ఋగ్వేదులు, మల్లాది వారు యజుర్వేదులు. కర్ణాటదేశమున ఋగ్వేదము పఠిoచు బాలకులకు సరియయిన బోధకులు లేకుండిరి. ఆ సందర్భమున తణుకు నందున్న వాజపేయ యాజుల మాయణాచార్యుల వారిని వారాహ్వానింప కర్ణాట దేశమునందున్న హోయసాలకు వారు వలసవెడలిరి. అప్పటినుండి వారిని హోయసాల బ్రాహ్మనులని పిలువసాగిరి. వారు బ్రాహ్మణవృత్తిని, క్షాత్ర వృత్తిని సమముగా స్వీకరించిరి. సనాతన ధర్మమును సంరక్షించు నిమిత్తము వారు ఎన్నియో పడరాని పాట్లు పడిరి. మాయణాచార్యులకు యిద్దరు కుమారులు. ఒకరు మాధవాచార్యులు, రెండవవారు సాయణాచార్యులు. వీరిరువురును ఉద్ధండపండితులే! సాయణాచార్యుల వారు వేదములకు భాష్యమును వ్రాసిరి. మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహమునకై తీవ్ర తపమాచరించిరి. మహాలక్ష్మి ప్రసన్నము కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షము కావలెననిరి. అంతట శ్రీదేవి "నాయనా! అది నీకు ప్రస్తుత జన్మమున సాధ్యము కాదు." అనెను. వారు వెంటనే "అమ్మా! నేను సన్యసించుచున్నాను. నాకు యిప్పుడు రెండవ జన్మయే కదా!" అనిరి. శ్రీదేవి  అనుగ్రహించెను. వారు లోహమును ముట్టుకొన్న అది బంగారముగా మారుచుండెడిది. వారే విద్యారణ్య మహర్షులు. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించిరి. వారికి మూడవ తరముగా సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణసరస్వతిగా జన్మించునది వారే! శ్రీపాదులు భవిష్యత్తులో నృసింహసరస్వతిగా అవతరించునపుడు వారికి శ్రీకృష్ణసరస్వతి సన్యాసాశ్రమ గురువులుగా నుందురు. వారికి భోగముల యందు కాంక్ష నశింపలేదు గనుక తదుపరి శతాబ్దములలో సాయణాచార్యుల వంశములో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రియై రాజర్షిగా వేనోళ్ళ కొనియాడబడెదరు. ఇది అంతయును భవిష్యవాణి. ఇది శ్రీపాదులవారే స్వయముగా నిర్ణయించిన విధి విధానము. వారు సత్యసంకల్పులు. కనుక విధిగా ఈ భవిష్యద్వాణి జరిగితీరును. 

అనేక దేవతారాధనలు చేయునపుడు ఆయా దేవతలలో దత్తప్రభువు చైతన్యము ప్రతిబింబించి, నూతన చైతన్యముగా మార్పునొంది సాధకుల అభీష్టములను నెరవేర్చును. దత్తప్రభువునే ఆశ్రయించినచో ఏ దేవతాంశము వలన ఎంతమేరకు ఏ పని నిర్వర్తింపబడవలెనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పవలె కాపాడుదురు. ధ్రువుడు కఠోర తపమాచరించెను. అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యమును పంచి యిచ్చెను. శ్రీదత్తప్రభువు సగుణ తత్త్వమునకు, నిర్గుణ తత్త్వమునకు అతీతమును ఆదారమును అయిన పరమతత్త్వము, అదియే చరమతత్త్వము, అదియే ఆదితత్త్వము, అదియే ఆద్యంత రహిత తత్త్వమును దత్తతత్వముకు కేవలము అనుభవ పూర్వకముగా తెలుసుకొనవలెనే గాని అది యీ విధముగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించుట కేవలము నిష్ఫలము. ఒకపని జరుగుటకు గాని, జరగకుండుటకు గాని, వేరొక విధముగా జరుగుటకు గాని గల సర్వసామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యము. 

శ్రీపాదతత్త్వము

తాను స్వయముగా దత్తాత్రేయుడనని వచించిన శ్రీపాదులు తమ యింట నుండెడి కాలాగ్నిశమనదత్తుని ఆరాధించువారు. ఒక పర్యాయము బాపనార్యులు యీ విషయమున మధనపడి శ్రీపాదులవారినే "నాయనా! శ్రీపాదా! నీవు దత్తుడవా! లేక దత్తఉపాసకుడువా ?" అని ప్రశ్నించిరి. అంతట వారినిట్లనిరి. "నేను దత్తుడనని చెప్పునపుడు నేను దత్తుడనే అగుచున్నాను. నేను దత్త ఉపాసకుడనని చెప్పునపుడు దత్తోపాసకుడనే అగుచున్నాను. నేను శ్రీపాద శ్రీవల్లభుడనని చెప్పునపుడు శ్రీపాద శ్రీవల్లభుడనే అగుచున్నాను. నేను ఏది సంకల్పించిన అదే జరుగును. నేను ఏ విధముగా అనుకొనిన అదే అగుచున్నాను. ఇదే నా తత్త్వము."

తాతగారికి యిదంతయునూ అయోమయముగా నుండెను. అంతట శ్రీపాదులిట్లనిరి. "తాతా! నీవు నేను ఒకటే! రాబోవు జన్మలో ముమ్మూర్తులా నిన్నుపోలిన శరీరముతో మాత్రమే అవతరింప నున్నాను. నీలో సన్యాసాశ్రమము స్వీకరించవలెననెడి కోరిక ప్రబలముగా ఉన్నది. నీవు యీ జన్మలోగాని, వచ్చే జన్మలోగాని సన్యాసిగా ఉండుట నా సంకల్పములో లేదు. ముమ్మూర్తులా నీ రూపములో అవతరించి నీ కర్మబంధములను వాసనా విశేషములను ధ్వంసము చేయదలచినాను, అని గోముగా తాతగారి భ్రూమధ్యమును తాకెను. అది కూటస్థ చైతన్యమునకు ఆవాసము. వారు కొద్ది క్షణములపాటు హిమాలయములలో నిశ్చల తపోసమాధిలోనున్న బాబాజీని చూచిరి. వారు ప్రయాగ మహాక్షేత్రములోని త్రివేణి సంగమములో స్నానము చేయుటను గాంచిరి. ఆ తదుపరి శ్రీపాదవల్లభ రూపమును గాంచిరి. ఆ స్వరూపము కుక్కుటేశ్వరాలయము నందలి స్వయంభూ దత్తునిలో అంతర్లీనమాయెను. దానిలో నుండి అవధూత స్వరూపము వెడలెను. తన కుమార్తెయగు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి ఒడిలో పసిబిడ్డగా నుండుటను చూచిరి. ఆమె ఒడినుంచి విడివడి 16 సంవత్సరముల యువకునిగా మారుతాను గమనించిరి. ఆ నవయువకుడు తనవంక గంభీర దృక్కులను ప్రసరించి ముమ్మూర్తులా తన స్వరూపమును పొందెను. అయితే ఆ మూర్తి సన్యాసిగా నుండెను. ఏదో రెండు పవిత్రనదుల సంగమ స్థలములో స్నానము చేసి తన శిష్య బృందముతో ఠీవిగా నడుచుచుండెను. ఆ సన్యాసి తనవంక చూసి యిట్లు పలికెను. ఓహో!నేను ఎవరా? అని విచికిత్సలో ఉన్నట్లున్నావు. నన్ను నృసింహ సరస్వతి యందురు. ఇది గంధర్వపురము. ఈ మాటలు పలికిన కొద్ది క్షణములలోనే తన అంగవస్త్రమును నదిలో వైచి దానిమీద కూర్చొని శ్రీశైలమును చేరెను. అచ్చట కదళీవనము నందలి మహాపురుషులు, మహాయోగులు సాష్టాంగ ప్రణామములు చేసిరి. వారందరూ, "మహాప్రభూ! మీ రాకకోసం అనేక వందల సంవత్సరముల నుండి తపమాచరించుచున్నాము. మమ్ముల ధన్యులజేయవలసినదని" ప్రార్థించిరి. అనేక సంవత్సరములు అచట తపమాచరించిన మీదట కేవలము కౌపీనధారియై వృద్ధరూపమును పొందునట్లు కనిపించెను. అత్యంత తీక్షణ దృక్కులను బాపనార్యుల యెడల ప్రసరింపజేయుచూ ఈ నా స్వరూపమును స్వామీ సమర్థుడని అందురు అని వచించెను. కొంతసేపటికి శరీర త్యాగాముచేసి తన ప్రాణశక్తిని ఒకానొక వటవృక్షము నందును, తన దివ్యాత్మను శ్రీశైలము నందలి మల్లిఖార్జున శివలింగమునందును విలీనము కావిన్చినట్లు గాంచెను. మహాపవిత్రమును, అత్యంత శక్తిమంతమునయిన ఆ శివలింగము నుండి  మేఘ గంభీర స్వరముతో "బాపనార్యా!  నీవు ధన్యుడవు. అగ్రాహ్యమును, అవాంగ్మానస గోచరమును, అనంతమును, కేవల జ్ఞాన స్వరూపమును, అనాద్యంతమును అయిన నన్ను, నీవు నీయొక్క క్రియాయోగ శక్తివలన సూర్యమండలము నుండి శక్తిపాతమొనరించి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించితివి. 18 వేలమంది దివ్యపురుషులు ఈ జ్యోతిర్లింగము నందు విలీనుడనైయున్న నన్ను సదా సేవించెదరు. ఈ జ్యోతిర్లింగా దర్శనము చేయువారికి సదా ఆ దివ్యపురుషులు భౌతిక, ఆధ్యాత్మిక ప్రగతి యందు దోహదపడెదరు. త్రిమూర్తి స్వరూపుడనైన నేను శ్రీపాద శ్రీవల్లభ, నృసింహ సరస్వతి, స్వామీ సమర్థ స్వరూపములలో నిన్ను అనుగ్రహించుచున్నాను." అను మాటలు వినిపించెను.

నాయనా! శంకరభట్టూ! శ్రీగురుని లీలలు అనూహ్యములు. కొంతసేపటికి బాపనార్యులు ప్రకృతిస్థులయిరి. తమకు ఎదురుగా అమాయకమయిన ముఖముతో చిరునవ్వులు చిన్దిన్చుచూ మూడు సంవత్సరముల ప్రాయములో ఉన్న శ్రీపాదుల వారిని చూచిరి. ఈ వింత అనుభవము వారికి దివ్యమధురముగా నుండెను. శ్రీపాదులవారిని తమ గుండెలకు హత్తుకోనిరి. కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో నుండిరి. ఆ తన్మయావస్థనుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమమునకు పూనుకొనిరి. వారు అగ్నిహోత్రము చేయుకార్యము వింత గొల్పునదిగా ఉండును. జమ్మికర్రను, రావికర్రను ఉపయోగించి సాధారణముగా అగ్నిని పుట్టించెదరు. కాని బాపనార్యులు మాత్రము సమిధలను అగ్నికుండము నందుంచి వేద మంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును. అప్పలరాజు శర్మగారు కూడా యిదే విధముగా చేయుదురు. వారి వంశము నందు అగ్నిపూజ కలదు. ప్రజ్వలించుచున్న అగ్నికుండము నందు దిగి ఆహుతులను వ్రేల్చుదురు. ఇది సాధారణముగా విశేష పర్వములందు చేయువారు. ఈ విధమైన అగ్నిపూజయందు వారి శరీరమునకు గాని, వస్త్రములకు గాని అగ్నివలన ఏ విధమైన యిబ్బందియు కలుగదు. ఇది ఆశ్చర్యములలో కెల్లా ఆశ్చర్యము.       

(ఇంకా ఉంది..)