Wednesday, February 1, 2012

Chapter 11 Part 2 (Last Part)

అధ్యాయము 11 
సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణి, బిల్వమంగళుల వృత్తాంతము - భాగము 2 
శ్రీపాదుల ఘటనాఘటన సామర్థ్యము

బాపనార్యుల అగ్నిహోత్రము సల్పు కార్యమును ఆనాడు ఎన్నిమార్లు వేదమంత్రములను ఉచ్చరించుచున్ననూ అగ్ని సృష్టి జరుగలేదు. శ్రీపాడులవారు తమ తాతగారి దురవస్థను చూచి లీలగా నవ్వుకొనుచుండిరి. తాతగారికి ముచ్చెమటలు పోయుచుండెను. అంతట శ్రీపాదులవారు అగ్ని కుండమువైపు చూచి "ఓయీ! అగ్నిదేవా! నిన్ను అజ్ఞాపించుచున్నాను. తాతగారి దైవకార్యమునకు ఆటంకము కలిగింపకుము." అనిరి. వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగెను. శ్రీపాదులవారు తాతగారి కలశము నందలి నీటిని గైకొని అగ్ని గుండములో పోసేను. అగ్ని ఆరిపోవుటకు బదులు మరింతగా ప్రజ్వలిమ్పసాగెను. తాతగారు ఈ వింతను చూచి మరింత ఆశ్చర్యపోయిరి. శ్రీపాదుల వారిట్లనిరి. "తాతా! నా ఈ అవతరణమునకు నీవునూ, వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహ వర్మయును కారకులు. అందువలన నీవుగాని, మా నాయనగాని, వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండిగాని, ధనసహాయముగాని, ధనేతర సహాయముగాని స్వీకరించిన అది దానము క్రింద లెక్కకు రాదు. ఆ రకముగా సహాయమును స్వీకరించకపోవుట దైవద్రోహము కూడా కాగలదు. అటువంటి సహాయమును పరమేశ్వరానుగ్రహముగా భావింపవలెను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతీ మహారాణి మల్లాది వారికే కాదు, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి, వత్సవాయి వారి కుటుంబమునకు కూడా ఆడపడుచుగా భావింపబడవలెను. ఇది నా శాసనము." అనిరి. శ్రీపాదులు ఈ మాటలను పలుకు సమయమున అప్పలరాజు యాదృచ్ఛికముగా అచ్చటనే యుండిరి. శ్రీపాదుల వారిట్లనిరి. "నా సంకల్పము లేనిదే బాపనార్యులవంటి మహా తపస్వి కూడా అగ్ని సృష్టి కావింపలేడు. మా నాయన కూడా అగ్నిగుండము నందు దిగిన యెడల అగ్నిహోత్రుడు తన ప్రతాపమును చూపించితీరును. నా సంకల్పము నందు మార్పు జరిగినచో వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపెడగా మారిపోవును. పుట్లకొలది భూములున్న నరసింహవర్మ నిలువనీడలేనివాడగును. మీరందరునూ నా సంకల్పము ననుసరించియే ఆయాస్థితులలో నున్నారు. నేను బిచ్చమెత్తుకొను వానిని మహారాజుగా చేయగలను. మహారాజును బిచ్చగానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తునికి వాడు ఏది కోరినా యివ్వగలను. అయితే యిచ్చుటకు ముందు అంతటి ఉన్నతశక్తిని ఆ భక్తుడు నిలుపుకొనగలడా? తన శక్తి సామర్థ్యములను లోకోపకారము కొరకు ఉపయోగించునా? లేదా? అని వారిని పరీక్షింతును. నాకు అవసరమని తోచినపుడు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను మార్చివేయగలను. బాపనార్యులు కృతయుగములో లాభాదమహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడొకడు ఉండెడివాడు. మంగళ మహర్షి దర్భలు కోయుచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము స్రవించెను. ఆ రజతము గడ్డకట్టి సుగంధభరితమైన విభూతిగా మారెను. ఆహా! నేను ఎంతటి గొప్పసిద్ధిని పొందితిని అని మనసులో వానికి గర్వము కలిగెను. అంతట పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించెను. హిమగిరుల నుండి మంచుపెళ్లలు విరిగి పడునట్లు చెప్పలేనంతటి విభూతి వర్షించెను. పరమశివుడిట్లనియె. "త్రేతాయుగములో భరద్వాజుడు పీఠికాపురములో సవితృ కాఠక చయనము చేయును. ఆ మహాచయనము నందు పేరుకొనిన విభూతిలోని లవలేశమును నీను చూపించితిని." అంతట మంగళ మహర్షి గర్వము తొలగిపోయెను. శ్రోతలందరునూ అవాక్కయి శ్రీపాదులవారు చెప్పునది వినుచుండిరి. శ్రీపాదులిట్లనిరి. "ఈ పీఠికాపుర అగ్రహారములో అడుగుపెట్టుట ఎన్నో జన్మల పుణ్యఫలము. నా యీ అవతరణము సమయములో మీరు నాతోనుండుట చెప్పరానంతటి విశేషము. నా శక్తి అనుభవములోనికి రావలెనన్న మొదట నీవు తీవ్ర సాధకుడవు కావలెను. అప్పుడు మాత్రమె నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము నీకు అనుభవములోనికి వచ్చును. నా జన్మభూమి అయిన యీ బాపనార్యుల యింట నా పాదుకలు ప్రతిష్టింపబడును. నేను పీతికాపురమున ఉదయవేళలో అమ్మ సుమతి ఒడిలో నుండి పాలను త్రాగెదను. మధ్యాహ్న సమయములో పీఠికాపురమున అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నము తినిపించును. రాత్రి సమయమున పీఠికాపురమున అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురమునందు ఉన్నట్లే గంధర్వపురమున నృసింహ సరస్వతి రూపమున ఉందును. మధ్యాహ్న సమయము నందు ఖచ్చితంగా గంధర్వపురమున భిక్ష చేసెదను. అంతర్నేత్ర దృష్టి కలవారలకు యివి స్పష్టముగా గోచరించును."

మహాపురుషులు, మహాయోగులు అన్నిదేశములవారు చీమల పుట్టలవలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారునకు వచ్చెదరు. వారు దత్త దిగంబర! శ్రీపాద వల్లభ దత్త దిగంబర! నృసింహ సరస్వతి దత్త దిగంబర! యనుచు తన్మయత్వముతో నృత్యము చేసెదరు. నేను కాలపురుషునకు అనుమతి యిచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణములో నెరవేరును. నా పేరిట మహాసంస్థానమొకటి ఏర్పడును. నా ప్రభావము అతిశయించిన కొలదిని యీ పీఠికాపుర క్షేత్రములో గోష్పాదమంత భూమి కూడా క్రయము పొందుటకు అవకాశము లేకుండును. నేను నా వారు అనుకున్నవారిని అవసరమైతే జుట్టుపట్టుకొని యీడ్చుకొని వచ్చి పీఠికాపురములో పడవేసేదను. ఎంతటి ధనవంతుడు అయిననూ, ఎంతటి యోగి అయిననూ నా సంకల్పము లేక పీఠికాపురములోని నా సంస్థానమునకు రాలేరు. ఇది నిశ్చయము. నా నిజతత్త్వమును గ్రహించి ఆనందించుడి. ఈ తరుణము మరిరాదు. మానవుని అవగాహనలోని సమస్త దేవతా శక్తులు నా స్వరూపమునందే ఉన్నవి." నాకు ఎవరయినా దక్షిణ సమర్పించిన నేను దానిని నూరింతలు చేసి తరునమాసన్నమయినపుడు వారికి అనుగ్రహింతును. ధర్మమునకు విరుద్ధము కాకుండా ధనార్జన చేయవలెను. ధర్మమునకు విరుద్ధము కాకుండా కోరికలను అనుభవింపవచ్చును. సత్కర్మలనాచరించుట వలన మోహము నశించును. మోహము క్షయమయిన పిమ్మట మోక్షము లభించును.

నాయనా! శంకరభట్టూ! వింటివా! శ్రీపాదులవారి అమృత వచనములు. ఈ దివ్యోపదేశము తదుపరి ఆ మర్నాడు నరసింహవర్మ శ్రీపాదులవారిని తమ గుర్రపుబండిలో తమ భూములను చూపించ తీసుకొనిపోయిరి. వారికి పుట్లకొలది భూములు కలవు. ఆ భూములలో అనేక రకముల పంటలు పండును. కాని బీరపాదులు మాత్రము పుష్పించుట అరుదుగా నుండెను. పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించిపోవుట జరుగుచుండెను. ఒకవేళ పిందెలు పెద్దవి అయి కాయలైయిన యెడల అవి వంటకు పనికిరానంతటి చేదుగా నుండెను. ఈ విషయమును శ్రీపాదులవారితో నరసింహవర్మ మనవి చేసుకొనెను. శ్రీపాదులవారు ప్రసన్నవదనులయి "మా యింటిలో వారికందరికీ బీరకాయపప్పు నందు ప్రీతి మెండు. మా యింటిలోని వారికి యిష్టము గనుక నాకు కూడా యిష్టమే! అయితే పూర్వకాలములో ఒకానొక దత్తోపాసకుడు యీ భూమిలో తపమాచరించెను. ఈ పవిత్రభూమి సాక్షాత్తు దత్తుడనయిన నా పాదస్పర్శ కోసము తపన పడుచున్నది. తన తపనను నీకు తెలియజేయుటకు తన భాషలో యీ విధముగా వ్యక్తీకరించుచున్నది. తప్పక యీ నేలతల్లి కోరికను తీర్చెదను. ఈ భూమికి నా స్పర్శ కలిగిన తరువాత యీ భూమాత తత్త్వములో మార్పు వచ్చును. మంచి రుచి కలిగిన బీరకాయలను యీ తల్లి మనకు అందించును. తాతా! నీవు నిర్భయముగా మా యింటికి యిక్కడ పండిన బీరకాయలను పంపుము. యింటివారితో పాటు నేను కూడా ఆ వంటకమును భుజించెదను." అని పలికెను.

నాయనా! శంకరభట్టూ! చిత్రాతిచిత్రము! ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతముగా కాయుచుండెను. అవి మంచిరుచిని కూడా కలిగి యుండెను. 

శ్రీపాదులవారు నరసింహవర్మతో పాటు గుర్రపుబండి నుండి దిగి ఆ భూములలో కొద్ది ముహూర్తముల సమయము విహరించిరి. ఇంతలో కొంతమంది చెంచు యువతీయువకులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. వచ్చిన వారందరునూ శ్రీపాదుల వారికి ప్రణమిల్లిరి. ఆ సమయమున శ్రీపాదులవారి దివ్యవదనారవిందమున పరివేష్ఠిoచి దివ్యకాంతి వలయమేర్పడెను. శ్రీపాదులు యిట్లనిరి. "తాతా! ఈ చెంచులందరునూ నరసింహావతారమునకు సంబంధించినవారు. వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబుట్టువుగా భావించి ఆరాధించువారు. నీవు నరసింహస్వామికి భక్తుడవు గదా! నీవు వీరిని ఆశ్రయించిన నృశింహ దేవుని దర్శనభాగ్యమును పొందవచ్చును."

శ్రీపాదులవారు యిట్లు పలుకుట తమను ఆటపట్టించుట కొరకని నరసింహవర్మ తలచిరి. వారిట్లు పలికిరి. "ఓ చెంచులారా! మీరు నృసింహదేవుని చూచినారా? వారి జాడ ఏదయినా తెలుపగలరా?" దానికి బదులుగా వారిట్లనిరి. "అదేమంత గొప్ప భాగ్యము! సింహపుతల, మనుష్య శరీరము గలవాడు తిక్కరేగి యీ అడవులలోనే తిరుగుచున్నాడు. వాడు మా సోదరి చెంచులక్ష్మిపై మరులుగొన్నాడు. మా చిన్నది కూడా వానిని యిష్టపడినది. వారికి మేము వివాహము కూడా చేసియున్నాము. మీరు కావలెనన్న చెంచులక్ష్మిని, నృశింహుని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము."

ఈ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువతీయువకులు వడివడిగా పరుగెత్తుకొనిపోయిరి. నరసింహవర్మ దీనిని అంతటిని వింతగా చూచుచుండెను. ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువతియును, యువకుడును వచ్చుచుండుతను గమనించిరి. అదృష్టవశమున నేను కూడా ఆ దారి వెంబడి పోవుచుంటిని. శ్రీపాదులవారు నన్ను తమవద్దకు రమ్మనిరి. నేను వారి దరినిచేరగా వారు "సుబ్బయ్య శ్రేష్ఠి ! దూరమునుండి ఆ వచ్చువారు ఎవరనుకొంటివి? ఆ వచ్చువారు బిల్వమంగళుడును, చింతామణియును. కొద్దిపాటి చితుకులను ప్రోగుచేయుము. మనము చితుకుల మంట వేయుదుము. అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చును." అని పలికిరి. 

నరసింహ వర్మకును, నాకునూ ముచ్చెమటలు పోయుచుండెను. ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును, చింతామణియే! సందేహము లేదు. వారిరువురును గురువాయుర్ క్షేత్రము నందలి శ్రీకృష్ణదేవుని దర్శనము చేసుకొనిన తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనెడి మహాయోగినిని దర్శించిరి. ఆమె అప్రయత్నముగా వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను. ఆమె ఆశీ: ప్రభావమున వీరిలో భక్తి, వైరాగ్య బీజములు పడినవి. మంగళగిరి క్షేత్రము నందలి నృసింహుని దర్శించుకొని పీఠికాపురమున శ్రీపాదులవారి దర్శనార్థము వచ్చుచుండిరి. శత వృద్ధురాలైన ఆ మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వచన ప్రభావమున వారికి శ్రీపాదుల వారి దర్శనము యిచ్చటనే లభించినది! ఇది ఆశ్చర్య కర విషయము. వారిరువురు మంగళగిరిలో యిట్లు ప్రార్థించిరి. "మహాయోగిని కురూరమ్మ దీవెన ఫలించి దత్తభిన్న స్వరూపులయిన శ్రీపాదుల వారి దర్శనము మాకు కలుగనెడల నృశింహ దేవుడవయిన నీ దర్శనము భౌతికముగా పొందగోరుచున్నాము."

చితుకులమంట ప్రజ్వరిల్లుచుండగా బిల్వ మంగళుడును, చింతామణియు తమ శరీరములకు దహన సంస్కారములు జరుగు చున్నంత బాధను అనుభవించిరి. కొంతసేపటికి వారి శరీరములనుండి వారిని పోలిన నల్లటి ఆకారములు బయటకు వచ్చి ఆ మంటలోపడి రోదించుచూ ఆహుతి అయిపోయినవి. ఆ నల్లటి ఆకారములు ఆహుతి అయిన తరువాత వారిద్దరునూ స్పృహ లోనికి వచ్చిరి. ఇంతలో చెంచులు తమ తోబుట్టువు చెంచులక్ష్మితో అచ్చటకు వచ్చిరి. నృశింహ దేవుని రెక్కలు విరిచికట్టి చెంచులు నృశింహ దేవుని శ్రీపాదుల ముందుంచిరి. 

ఇటువంటి చిత్రాతిచిత్రములు ఏ యుగములలోనూ జరుగలేదు. శ్రీపాదులవారి అవతార కార్యక్రమములో లీలలు, చమత్కారములు, కోకొల్లలు.అనూహ్యములు. శ్రీపాదులవారిట్లు ప్రశ్నించిరి. "పూర్వయుగములందలి నృశింహుడవు  నీవేనా? ఈ చెంచులక్ష్మి నీ భార్య యేనా? హిరణ్య కశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించినది నీవేనా?" దానికి శ్రీ నృశింహదేవుడు ఔనని ముమ్మారు పలికెను. చెంచులక్ష్మియు, శ్రీనృశింహదేవుడును జ్యోతి స్వరూపముతో శ్రీపాదులవారి శరీరములోనికి ప్రవేశించిరి. చెంచులు అంతర్ధానమైరి. బిల్వ మంగళుడు మహాభక్తుడై బిల్వ మంగళ మహర్షిగా రూపొందెను. చింతామణి మహా యోగినిగా మారిపొయినది. చిత్రాతి చిత్రమైన యీ లీలలు జరిగిన నరసింహవర్మ గారి భూములయందు ఒక గ్రామము వేలయుననియూ, దానిని "చిత్రవాడ" అని వ్యవహరించెదరని శ్రీపాదులవారు సెలవిచ్చిరి. వారు సత్య సంకల్పులు. సిద్ధ సంకల్పులు.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 11 సమాప్తము)       

No comments:

Post a Comment