Saturday, December 3, 2011

Chapter 8 Part 3

అధ్యాయము 8 
దత్తావతారముల వర్ణనము - భాగము 3 
కర్మ రహస్యము 

నిరంతరమూ శ్రీపాదుల వారి స్మరణలోనూ, ధ్యాసలోనూ ఉండెడి యీ పరిసర ప్రాంగణమంతయునూ శుభప్రదములు పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండియుండును. నరసావధానులు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్పందనలన్నియునూ విషపూరితములై యున్న కారణమున, కలుషిత వాయుమండలములో నిండిన ఆ బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిధ్యమును స్వీకరించరయిరి. దీనిలోని రహస్యము ఇది సుమీ!

జీవులు తమ పరిణామ క్రమములో గాని, విపరిణామ క్రమములో గాని కర్మసూత్రముననుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలెను కదా! అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మజ్ఞానాన్వేషి అయిన కారణమున పరినామక్రమము యొక్క చివరిదశలో కురువపురములో శ్రీపాదుల దర్శనభాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగల్గెను. నరసావధానులు పీఠికాపుర వాస్తవ్యుడయినను అనేక సంవత్సరముల వరకూ శ్రీపాడులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణము వలన, గుర్తించిన తదుపరి కూడ యింకనూ ఎంతయో సాధనాక్రమమున గాని వానికి శ్రీదత్తుని అనుగ్రహమును పొందసాధ్యము కాలేదు. 

అప్పుడు శంకరభట్టు ఇట్లదిగెను. "అయ్యా! మీరు జీవకణములు మార్పు చెందునని చెప్పితిరి. అయితే ప్రతీ జాతికిని ఒక ఆత్మ ఉండునా? పార్వతీ దేవి హిమవన్నగము కుమార్తె అని చెప్పుటలో భావమేమి?"

అంతట తిరుమలదాసు యిట్లనెను. "ప్రతి జాతికిని ఒక ఆత్మ యుండును. అది ఒక మానసిక పదార్థమై ఉండును. అది దివ్యాత్మ అయిన శ్రీదత్తుని నుండి వెలువడిన భాగము. సదా దానితో ప్రత్యక్ష సంబంధము కలిగిన మహాశక్తి అది. నీవు అనుకోనునట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తము కాదు. స్పృహ కలిగియుండి జీవించి యుండిన జీవులలో జీవకణములు ఏ విధముగా నుండునో అదే విధముగా ఆ సామూహిక వ్యక్తిత్వము నందు యీ వ్యక్తుల యొక్క వివిధములయిన శక్తి సామర్థ్యములు, గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధముగా ప్రతి పల్లెకును ఆత్మ ఉండును. ప్రతి పట్టణమునకును ఆత్మ ఉండును. ప్రతి దేశమునకునూ ఆత్మ ఉండును. మనము నివసించు భూమికి కూడా ఆత్మ కలదు. దానినే మనము భూమాత అని పిలుచుచున్నాము. అనగా యీ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకానొక మనస్సంబంధమును కలిగిన మహాశక్తి. ఇదే విధముగా హిమవన్నగము నందు అభిమానము  గల దేవతాశాక్తికి హిమవంతుడని పేరు. ఆ హిమవంతుని కుమార్తెయే హైమవతి. సర్వసాక్షి అయిన సూర్య భగవానుని కుమారుడు యమధర్మరాజు అనిన యెడల జీవుల శుభాశుభ కర్మలననుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థము. 

సూర్య భగవానుని వలన మాత్రమే సర్వజీవులును, తమతమ కార్యకలాపములను సాగించగలుగు చైతన్యమును పొందుచున్నారు. ఆకాశమున విరాజమానుడైన సూర్యుడు వేరు. ఆ సూర్యుని అభిమానదేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాదవల్లభులు 30 సంవత్సరముల వయస్సులో గుప్తమయ్యెదరని నీతో చెప్పితిని. కోటానుకోట్ల బ్రహ్మాండములలో వారు ప్రతి అనువులోను విలీనమయ్యెదరు, వారు సర్వాంతర్యామి గదా! తిరిగి విలీనమగుట అనగా నేమి అని నీవు అడుగవచ్చును. వారు సర్వాంతర్యామిగా నున్ననూ, వారియొక్క శక్తి ప్రభావములకు కొంత దూరముగా కోటానుకోట్ల బ్రహ్మాండములునూ ఉన్నవి. వాటిలోని పరిణామ క్రమములను వేగిరపరచు ఉద్దేశ్యముతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోనూ పరిణామదశలో ఒకానొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధముగా శ్రీ దత్తాత్రేయులవారు అవతరించెదరు. ఇనుమును సూదంటు రాయి ఆకర్షించును. అదే ఇనుము మాలిన్యములతో కూడియున్నపుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాలిన్యములను రహితమొనర్చి సృష్టి యందలి ప్రతీ అణువును తమవైపు ఆకర్షించుకొని విశ్వపరిణామక్రమమునకు వినూత్న దిశను యివ్వదలచినపుడు మాత్రమే యీ విధమైన అవతారము వచ్చును.

పంచకన్యల వివరణ 

శంకరభట్టు తిరుమలదాసును ఇట్లడిగెను. "అయ్యా! అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా పంచకన్యాం పఠేన్నిత్యం మహాపాతక నాశనం" అని చెప్పుదురు గదా! ఈ విషయము నాకు అంత సులభముగా అర్థమగుట లేదు. వివరింప ప్రార్థన.

అంతట తిరుమలదాసు యిట్లు చెప్పెను. 'అహల్యను దేవేంద్రుడు మోహించెను. ఆమెను పొందవలెనని మాయోపాయమును పన్నును. కోడి రూపమును ధరించి కొక్కొరోకో అని అరిచేను. వేకువ జాముఅయ్యెనని అనుష్ఠానము కొరకు గౌతముడు బయల్వెడలెను. మహాపతివ్రత అయిన అహల్యను అతడు తాకజాలడు. దేవేంద్రుడు దేవతాశక్తులు  కలవాడు గనుక అహల్య వ్యామోహమున నున్న అతని తీవ్రమనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోలిన స్త్రీ రూపము ఆవిర్భవించెను. మాయా అహల్యా రూపముయోక్క శరీరమునందలి జీవాణువులన్నియు దేవేంద్రుని తీవ్ర మనశ్శక్తి వలన మాత్రమే ఏర్పడెను. మాయా అహల్యతో సంగమించిన ఇంద్రుని చూచి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరినీ శపించెను. అంతట అహల్య, "ఓ తెలివిమాలిన మునీ! ఎంత పని చేసితివి?" అనెను. అహల్య గౌతముని కంటెనూ అధ్యాత్మికముగా ఉన్నత స్థితి యందుండెను. అహల్యా శాపము వలన గౌతముడు 12 సంవత్సరములు మనశ్చాంచల్యమునొంది శివార్చనమున స్వస్థుడాయెను. అహల్య మనశ్శక్తి జడత్వమొందెను. దానితో ఆమె శరీరము కూడ జడత్వమునొంది పాషాణమయ్యెను, శ్రీరాముని పాదధూళి వలన అహల్యకు శాపవిమోచనము కలిగెను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహించుము.

శాపగ్రస్తుడైన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించెను. అయిదు రూపములయిననూ, అయిదు మనస్సులు ఉన్ననూ, వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒక్కటియే! ఇదియొక విచిత్రమైన విషయము. శచీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండమున ఆవిర్భవించెను. ఆమె అయోనిజ.

అసలయిన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయాసీతను రావణుడు లంకకు కొనిపోయెను. సీత అగ్నిప్రవేశము చేసినపుడు యిద్దరు సీతాలు వెలుపలికి వచ్చిరి. కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలియుము.

భూచక్రమునందలి 12 రాశులలోను 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించెను. ఆమె నిండు యౌవనవతిగా నుండగా గురుబ్రహ్మ అభిమాన దేవతయైన బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెను. వృద్ధుడైన పతి నిండు యౌవనవతిని సంతృప్తి పరచజాలడు. ఇది ధర్మవిరుద్ధమైన విషయము. వివాహ సందర్భమున చేసిన ప్రమాణములను ఉల్లంఘించుట క్షంతవ్యము కాదు. తారాదేవికి బృహస్పతిని చూచినపుడు భర్తృభావమే కలిగెడిది కాదు. ఆమెలో తన యెడల భర్తృభావమును కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు. సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించెను. తారాదేవి శరీరమునందలి జీవాణువులు ఆమె మనః ప్రవృత్తికి అనుగుణముగా అనేక మార్పులను చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపము నిలచియుండెను. ఆమె హృదయము చంద్రాధీనమై యుండెను. ఈ విధముగా పరిణామస్థితి నొందిన తారాదేవి, పూర్వము బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంతమాత్రము కాదు. అందువలన తారచంద్రుల కలయిక ధర్మవిరుద్ధము కాలేదు. సృష్టినియమముల ప్రకారము 27 నక్షత్రములను చుట్టివచ్చుట చంద్రుని ధర్మమూ. అది గురుగ్రహ ధర్మము కాదు. ఆ విధముగా గురుగ్రహము సంచరించిన ధర్మవిరుద్ధమగును. ధర్మవిరుద్ధమైనది ఏదీ విచ్చిన్నము కాక తప్పదు. కావున 27 నక్షత్రముల అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెందుటయే ధర్మము. నాయనా! ఈ ధర్మసూక్ష్మము ననుసరించి తారాదేవి మహాపతివ్రత.

భీష్ముడు అంపశయ్యపై నుండగా ధర్మరాజునకు హితోపదేశము చేసెను. 'చెడు జరుగునపుడు సాధ్యమైన యెడల దానిని నిరోధింపవలెను. దానిని నిరోధింపవలెను లేదా ధర్మవిరుద్ధమైన పని జరుగు ప్రాంతము నుండి వైదొలగవలెను.' అని చెప్పుచుండెను. అది వినిన ద్రౌపది ఫక్కున నవ్వెను. అంతట భీష్ముడిట్లనియె. 'ద్రౌపదీ దేవికి మానభంగము జరుగు సందర్భమున నేను మిన్నకుంటిని. అప్పట్లో దుర్యోధనాదుల భోజనమును నేను చేయుచుంటిని. అందువలన నా బుద్ధి భ్రష్టుపట్టిపోయెను. ఆ చెడు రక్తమంతయును యిప్పుడు శరీరము నుండి బయల్వెడలినది. ఇప్పుడు నా బుద్ధి కల్మష రహితముగా నున్నది. సత్యము బోధపడినది. ' అనెను.

జీవి పరిణామదశలో అనేక జన్మలెత్తుచుండెను. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడుగాను కూడా జన్మింపవచ్చును. మానవజన్మ లేకుండా పశుపక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మలో పురుషుడుగా జన్మించెను. ఆ జన్మమందు ఆమెకు చంచలస్వభావురాలైన ఒక భార్య, దుష్టప్రవృత్తిగల ఒక భార్య, మృదుస్వభావముగల ఒక భార్య ఉండిరి. చంచల స్వభావురలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించెను. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జన్మించెను. మృదుస్వభావముగల భార్య విభీషణుడుగా జనించెను. కల్పాన్తరము నందు వీరు మువ్వురునూ, మండోదరి పురుషుడుగా జనిన్చినపుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మమున మండోదరి వాలికి భార్యకాగా అంగదుడు జనించెను. తదుపరి రావణునికి భార్యగానయ్యెను. రావణ వధానంతరము విభీషణునికి పట్టపురాణి అయ్యెను. వాలికి భార్యగా నున్నపుడున్న జీవాణువులు, రావణుని భార్యగా నున్నపుడున్న జీవాణువులు, విభీషణుని పట్టపురాణిగా నున్నపుడున్న జీవాణువులు వేరువేరుగా నున్నవి. అందువలన మండోదరి కూడా మహాపతివ్రతయే! "

అప్పుడు శంకరభట్టు ఇట్లడిగెను. "అయ్యా! స్త్రీలకూ ఒకే భర్తతో నుండవలెననియూ, పురుషులు ఏకపత్నీ వ్రతులాయి ఉండవలెననియూ చెప్పుదురు గదా! బహు భార్యత్వము కాని, బహు భర్తృత్వము గాని నిందనీయములు కాదా?"

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment