Monday, June 23, 2014

Chapter 22 Part 1

అధ్యాయము 22 - భాగము 1

గురుదత్తభట్టు వృత్తాంతము 

జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులోక్కరే 

గురుచరణుడును, కృష్ణదాసును, నేనును శ్రీపాదులవారి సమక్షమున తెలియరాని ఆనంద పారవశ్యమున ఉంటిమి. గురుదత్తభట్టు అనెడి జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థము వచ్చియుండెను. శ్రీపాదుల వారు అతనిని ఎంతయో ఆదరించిరి. ఒకానొక ప్రశాంతస్థలమున కూర్చొని సత్సంగము చేయవలసినదిగా మమ్ములను ఆదేశించిరి. మా యొక్క సంభాషణ జ్యోతిషశాస్త్రము వైపునకు మరలినది. నేను శ్రీ భట్టు మహాశయుని, "అయ్యా! జ్యోతిషశాస్త్రము నందు చెప్పబడిన ఫలములు ఖచ్చితముగా జరుగునా ? లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా ? మానవ జీవితమూ పూర్వ కర్మ నిర్దేశితమా ?లేక మానవ ప్రయత్నా నిర్దేశితమా ?" అని ప్రశ్నించితిని. అంతట శ్రీ భట్టు మహాశయులు, " 'భ' చక్రమనగా నక్షత్రక కక్ష్య. దీని ప్రారంభ స్థానము అశ్వినీ నక్షత్రము. ఈ నక్షత్రము ఉండవలసిన స్థానమునకు 8 కళలు తక్కువ గల స్థానములో నుండుటచే అది గ్రాహ్యము కాదు. అశ్వినీ నక్షత్రగోళమును గుర్తించుట కష్టము గాన దానికి 180 అంశలలో నున్న చిత్తా నక్షత్రము ఒకే గోళముగాను, ప్రకాశవంతముగాను, స్ఫుటముగాను ఉండుటచే దానికి 6 రాసులు కలిపిన యెడల అది అశ్విని యగును గాన చైత్రపక్షము గ్రాహ్యమయినది. అశ్వినీ నక్షత్రము 'తురగ ముఖాశ్వినీ శ్రేణి' అని మూడు గోళములుగా నిరూపించబడినది. శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రములో జన్మించుటకు కూడా విశేషకారణమున్నది. మూడు గోళములు ఒకే నక్షత్రముగా నున్న అశ్విని కూడా వారి స్వరూపమే. అదియే 'భ' చక్రమునకు ప్రారంభము. అది వారి దత్తాత్రేయ స్వరూపము. కలియుగమున వారి ప్రప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. ఇది అశ్వినీ నక్షత్రమునకు సరిగా సరళ రేఖలో నుండు 180 అంశల దూరములో నుండు వారి జన్మనక్షత్రమైన చిత్తానక్షత్రము. 180 అంశల దూరములో ఏ నక్షత్రము యొక్క గాని, గ్రహము యొక్కగాని శక్తి కేంద్రీకరింపబడుచుండును. మానవులు వారి పూర్వజన్మకృత ప్రారబ్ధమునకు గణితపరముగా యోగ్యమయిన గ్రహసంపుటిలో జననమందెదరు. గ్రహములు మానవుల యెడల ప్రేమభావమును గాని, ద్వేషభావమును గాని కలిగియుండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు, వివిధ స్పందనలు ఆయా కాలములలో, ఆయా ప్రదేశములలో, ఆయా జీవులకు సంఘటనలను కలిగించుటకు సశక్చమై ఉండును. అనిష్ట ఫలముల బారి నుండి తప్పించుకొనుటకు, ఆ కిరణములను, స్పందనలను నిలువరించి నిర్జించగల స్పందనలను, కిరణములను మనము కలిగి యుండవలెను. దీనిని మంత్ర తంత్రముల వలన గాని, ధ్యానము, ప్రార్థన మొదలయిన విధానముల ద్వారా గాని, లేదా తన స్వకీయమయిన యోగశక్తి ద్వారా గాని సాధించగలము. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమై యున్న, పైన చెప్పిన విధానములు ఏమియునూ పనిచేయవు. అట్టి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతలను మార్చి వ్రాయగలరు. ఆ విధముగా వారు మార్చివ్రాయుటకు మన వలన యీ లోకమునకు ఏదయినా ఒక మంచి ప్రయోజనము ఒనగూడు పరిస్థితి ఉండి ఉండవలెను. సాధారణ పరిస్థితులలో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపములోను, కర్మదేవతల కార్యకలాపములోను శ్రీపాదుల వారు అనవసరముగా కలుగజేసుకొనరు. అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదలించును. శ్రీవారి హృదయము నుండి ఉప్పొంగిన ప్రేమ, కరుణ అను మహాప్రభావముల ధాటికి కర్మదేవతలయొక్క శక్తి నిర్వీర్యమయిపోవును. కర్మ జడమైనది. శ్రీపాదుల వారి చైతన్యస్వరూపులు. తనకి అవసరమని తోచినపుడు వారు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనాఘటన సమర్థతను ప్రదర్శింతురు. ఇది వారికి అత్యంత సహజమైన విషయము." అని వివరించిరి. 

నేను అజ్ఞానదశలో జ్యోతిషములో మహాపండితుడని భ్రమించెడివాడను. నేను కన్నడ దేశీయుడను. తెలుగుభాషను అంతబాగుగా మాట్లాడలేను. సంస్కృతమున ధారాళముగా వ్యవహరించగలను. నా అదృష్టవశమున నేను పీఠికాపురమునకు పోవుట తటస్థించెను. కర్ణాకర్ణిగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి వింటిని. మా కులదైవము దత్తాత్రేయులవారు. నేను పాదగయాక్షేత్రమున కుక్కుటేశ్వర దేవస్థానమందున్న స్వయంభూదత్తుని దర్శించితిని. భక్తిశ్రద్ధలతో వారిని అర్చించితిని. నేను ధ్యానములో కూర్చునియుండగా నాకు, "ఓరి! మూర్ఖుడా! నీవు చచ్చి ఎంతసేపయినది? నీవు నా భక్తుడనని బీరములు పలుకుచున్నావు? ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులు కొట్టుచున్నావు. పాదగయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తమును కళ్ళజూచుటకేనా యిచ్చటకు వచ్చినది? " అని అంతర్వాణి స్పష్టముగా వినిపించినది. ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగెను. నేను జ్యోతిషపండితుడనగుటచే నా జాతకమును లెక్క గట్టితిని. నేను ఏ  రోజున ఎన్ని ఘడియలకు యీ శరీరమును వదిలివేయవలసి ఉన్నదో సరిగా అదే సమయమున పాదగయాక్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షమున నుంటిని. నేను నా నాడీ స్పందనమును చూచితిని. నాడి కొట్టుకొనుట లేదు. హృదయస్పందనమును చూచితిని. గుండె కూడా పని చేయుట లేదు. నా ముఖమును అద్దములో చూచుకొంటిని. దానిలో జీవకళకు బదులుగా ప్రేతకళ ఉట్టిపడుచుండెను. నేను నవ్వునప్పుడు నా ముఖమును అద్దములో చూచుకొంటిని. ఏమున్నది గర్వకారణము ? వికృతమైన ప్రేతకళతో చచ్చిపోయిన మనిషి పిశాచత్వము నొంది నవ్వుచున్నట్లుండెను. స్వయంభూదత్తుని ఆలయములోని పూజారి బహు ధనాశాపరుడు. అతని సూక్ష్మశరీరమును చూడగలిగితిని. నా కంటెను అత్యంత వికారకళలతో వాని సూక్ష్మ శరీరమున్నది. నాలో ఏ మూలనో దాగియున్న వివేకము మేల్కొనినది. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము చేసిన గాని నా దురవస్థ తొలగదని తెలిసికొంటిని. దేవతలు ఆనందమయ స్వరూపులు. వారిది హృదయ స్పందనము, నాడీ స్పందనము లేకపోయిననూ ఆనందముగా ఉండెడి ఉన్నత స్థితి. నా స్థితి చాల అధ్వాన్నముగా నున్నది. నా ఆత్మకు ఆనందము ఎంతమాత్రమూ లేదు. పైపెచ్చు దుఃఖభారముగా నున్నది. ఆత్మ శరీరమును వీడినపుడు శరీరబాధలంతరించును. అయితే నా ఆత్మ శరీరమును వీడలేదు. అయితే జీవించి ఉండవలసిన నిర్బంధస్థితిలో హృదయస్పందనను నిలుపుదల చేసి, "శిలగా నున్న స్వయంభూదత్తుడే ఘండికోట వారింట అవతారమెత్తెనంట. మరి శిలకు నాడీస్పందనము, హృదయ స్పందనము ఉండవు గదా ? మరి శ్రీపాదునికి నాడీస్పందనము, హృదయస్పందనము కలవు  కదా? మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమపవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించెనట. వారే దత్తాత్రేయులట. ఆ మహాప్రభువే మల్లాది వారి ద్రౌహిత్రుడిగా జననమాయెనట. ఏమి విడ్డూరము! ఎంతటి దగా! ఎంతటి వంచన!" అని పరమ నికృష్ఠులు, పాపాత్ములు అయినవారు పలికెడి మాటలను విని, నేను ఎంతో మోసపోయి, ఫలితముగా అనర్ఘరత్నమైన శ్రీపాదుల వారిని పోగొట్టుకొనుచున్నాననెడి వింత పరిస్థితిని శ్రీ గురుదేవులు నాకు కల్పించిరి. 

నేను శ్రీపాదుల వారింటికి వేగముగా పరిగెత్తుకొనిపోయితిని. పది సంవత్సరముల వయసు గల శ్రీపాదుల వారు వీధిలోనికి వచ్చి, "రారా! భడవా! రా! బ్రతికి ఉన్నట్లుగా నటిస్తూ, చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చుదద్దమ్మలకు, మానవరూప పిశాచాలకు సద్గతులు కలిగించడం కోసం, మీరు చేసే అకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోరబాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం, అవధూత వేషధారియై మహాలయ అమావాస్యనాడు ఈ పవిత్ర గృహము నుండి భిక్ష యాచించడానికి  వచ్చినది ఎవరో తెలుసా ? దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా ? నేనే! ఎవరి పేరు చెబితే రాక్షస పిశాచగణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడను నేనే! నిన్ను శిలగా మార్చాను గాని ఆకలిదప్పులను ఉంచాను. ప్రాణం తీశాను గాని బ్రతికున్నవాడిగా లోకానికి కనిపింపజేస్తున్నాను. నేను దత్తుడనో, కాదో అనునది తరువాత తేలుద్దాం. ముందు యీ  విషయం చెప్పు. నువ్వు నిజంగా చచ్చినవాడివి. కావున బ్రతికి ఉన్నవాడుగా మోసం చేయవచ్చునా ?" అని నన్ను గద్దించి ప్రశ్నించుసరికి నేను గజ గజ వణికిపోతిని. ఇంతలో సుమతీ మహారాణి వీధిలోనికి వచ్చినది. ఆమె నన్ను చూచి భయపడిపోతూ, "కృష్ణ కన్నయ్యా! నిండుగా ప్రేతకళ ఉట్టిపడే యీ అఘోరీ ఎవ్వరు? నువ్వు లోపలికి రా! కాస్త దిష్టి తీసి వేసెదను." అని కేకలేసినది. అంతట శ్రీపాదులవారు "అమ్మా! ఇతడు అఘోరీ ఇంకా కాలేదు. అఘోరిగా శవాల్ని కాల్చుకుని తినే జన్మ రానున్నది. రాబోయే ఆ జన్మకు ముందుగా ఇపుడు ఇతడు నా వద్దకు వచ్చాడు. మన యింటిలో కాస్త చద్ది అన్నము ఏమయినా ఉంటే పెట్టు అమ్మా!" అని తల్లిని బ్రతిమిలాడిరి. 

శ్రీపాదుల వారికోసం వారి జనని అఖండలక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి కొలదిగా చద్ది అన్నము అనగా తరవాణీ అన్నము అట్టే పెట్టినది. శ్రీపాదులవారు ఆ తరవాణీ అన్నమును నాకు పెట్టి తొందరగా ఆ స్థలమును వీడి పొమ్మనిరి. నేను కుక్కుటేశ్వరాలయమునకు ఎదురుగానుండు ఖాళీస్థలములో ఆ తరవాణీ అన్నమును తింటిని. తిన్న వెంటనే నాకున్న దురవస్థ సర్వస్వము తొలగిపోయినది. నేను మరల శ్రీపాదుల వారి దర్శనార్థము పోయితిని. అయితే శ్రేష్ఠిగారు శ్రీపాదులవారిని తమ యింటికి తీసుకొనిపోయిరి. శ్రీపాదులవారు శ్రేష్ఠిగారి పచారీ కొట్టునందుండిరి. వారు స్వయముగా వరహాలను తీసుకొని గల్లాపెట్టెలో వేయుచుండిరి. శ్రేష్ఠిగారు స్వయముగా జొన్నలను, బియ్యమును కొలచి యిచ్చుచుండిరి. శ్రీపాదులవారు, తాతా! ఈ రోజు దస్త్రము కదా! నాన్నగారికి ఎంత దక్షిణ ? నాకెంత దక్షిణ? అని శ్రేష్ఠిగారిని అడిగిరి. అంతట శ్రేష్ఠిగారు, "కన్నయ్యా! నన్నగారికిచ్చెడిది పండిత బహుమానము. నీకిచ్చెడిది వేంకటేశ్వరస్వామి వారి ముడుపు. మనిద్దరికీ బేరసారములు లేవు. నీకు కావలసినది నీవు తీసుకొనవచ్చును. నాకు కావలసినది నీవు యీయవలెను." అని శ్రీపాదులతో ముచ్చటించిరి. ఆ దృశ్యము ఎంత మనోహరము? శ్రీపాదుల వారు కొంచెము బెల్లంముక్క తీసుకొని నోటిలో వేసుకొనిరి. ఒక బెల్లంముక్క నాకు ప్రసాదముగా యిచ్చిరి. తాతా! నేను చేయించెడి గణేశపూజ అయిపోయినది. గణేశుడు బెల్లంముక్క నైవేద్యమును నోటిలో కూడా వేసుకొన్నాడు. నీకు రుజువు కావలెనన్న నా నోరు చూడుము, అని తన వాదన గహ్వరమును చూపించెను. దానిలో శ్రేష్ఠిగారు ఏ మహాదృశ్యములను చూచిరో మనకు తెలియదు గాని కొంత సమయమైన తరువాత శ్రేష్ఠిగారు, "బంగారుకన్నా! గణేశునికి ఆకలయినపుడు మనల్ని అడుగకుండగనే తనకి కావలసినంత బెల్లమును నైవేద్యముగా స్వీకరించవచ్చును." అని చెప్పుమని శ్రీపాదులవారితో అనిరి. ఇంతలో అఖండలక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగన స్నానము చేయించుటకు తీసుకొని వెళ్ళినది. 

(ఇంకా ఉంది.)
            

No comments:

Post a Comment