Thursday, June 19, 2014

Chapter 21 Part 2

అధ్యాయము 21 భాగము 2

దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట

మోహము నశించుటతో మోక్షము

పీఠికాపురములో అబ్బన్న అనునతడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచూ జీవించుచుండెడివాడు. నాగస్వరమును ఊదుకొనుచూ అతడు బాపనార్యుల యింటికి వచ్చెను. శ్రీపాదులవారు వేదఘోషను ఆపుచేయమనిరి. అబ్బన్నకు కడుపునిండుగా అన్నము పెట్టబడెను. శ్రీపాదులవారు అబ్బన్నను పిలిచి, "ఓయీ! ఇచ్చట నుండి నీ ముంత నిండుగా జలమును తీసుకొని కుక్కుటేశ్వరాలయమునకు పొమ్ము. దత్తప్రభువు యొక్క అవతారము కరచరణాద్యవయవములతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురమున సంచరించుచుండగా, అకారణ నిందచేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయమున నున్నారు. వారికి చిత్రగుప్తులు వారు మరణానంతరము పిశాచజన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాపపరిహార ఉపాయము చేయుచున్నాను. భూమాత కూడా అనుగ్రహించినది. నీవు అచ్చటికి వెళ్లి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనమునకు రాదలచినవారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలము ప్రోక్షింపవలసినది. చాటింపువేసిన మాదిగ సుబ్బయ్య యింటికి వెళ్ళి వానిని తోడ్కొని వాని ముంతలోని పెరుగు అన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినది." అనిరి. అబ్బన్నయునూ, సుబ్బయ్యయునూ అచటికి వెళ్లి, వారందరిని బాపనార్యుల యింటికి తీసుకొనివచ్చిరి. శ్రీపాదులవారు ఉగ్రస్వరూపమున, "ఓయీ! దండిస్వామినని ఎంత గర్వించితివి? నీవు ఆరాధించు దత్తుడే యిక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరుంగలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అనునట్లు నీకు తోడుగా శిష్యగణమొకటి. పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణమొకటి. నీవు నన్ను ఏమి చేయగలవు? సమస్త సృష్టినీ శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వమెంత? నీ సామర్థ్యమెంత? దైవదూషణ చేయుటవలన నీకూ, నిన్నాశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకొన్నది. మిమ్ములనందరిని కొన్ని వందల సంవత్సరములు పిశాచజన్మలో ఉండవలసినదిగా చిత్రగుప్తులవారు నిర్ణయించిరి. అవ్యాజకరుణతో నేను దానిని రద్దుపరచితిని. మానవజన్మకు వచ్చినపుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి కడగండ్లు పడవలెనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించితిని. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశ్యమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదములకు దారితీయును. నా మాయయునూ, నేనునూ అభిన్నస్వరూపులమై ఉండగా మోక్షమనునది ఏమో ఆలోచించుము. మోహము క్షయమగుటయే మోక్షము. ఏ జీవుడయినా సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలెనని కోరిన యెడల, వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహింతును. దివ్యానంద పారవశ్యముతో మాయకు అతీతముగా సుఖస్వరూపముగా ఉండవలెనని కోరిన, అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు, సగుణ సాకారమునక, మోక్షమునకు, బంధనమునకూ వ్యత్యాసమేమి యుండును. ప్రతీ క్షణముననూ అసంఖ్యాకములయిన నూతన లోకములు సృష్టి, స్థితి లయముల నొందుచుండును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు గాని, ఉన్నత ఆనందభూమికలకు గాని, పరిమితి గాని, హద్దులు గాని లేవు. మరణానంతరము నా వద్ద రాగోరువారు తప్పక రాగలరు. వారు ఎన్ని వందల దివ్య వర్షములు ఆయా స్థితులలో ఉండవలెనో, ఏయే లోకములకు తిరిగి పంపబడవలెనో, నా సంకల్పము నిర్ణయించును. కపటనాటక సూత్రధారినయిన నేను ప్రస్తుతము నరాకారముగా మీముందున్నాను. మీరు నన్ను చూచుచున్నారు. ఈ ఆకారము లేనిస్థితిలో కూడా నేను మిమ్ములను సదా చూచుచునే యుందునని తెలియజేయుటకు మాత్రమే నరాకారములో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగి వచ్చినది. మహా యోగుల యొక్క యోగశక్తులన్నియునూ లోకకళ్యాణము కొరకే వినియోగింపబడవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు. నీ కంటే తక్కువ స్థితిలో నున్న నిస్సహాయ జీవులకు సహాయము చేయుట నీ ధర్మము. నేను ధర్మమార్గమును, కర్మమార్గమును, యోగమార్గమును, భక్తిమార్గమును, జ్ఞానమార్గమును బోధించుటకే అవతరించునది. నేను సర్వసత్యములకునూ మూలమైన ఏకైక సత్యమును, సర్వధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును. సర్వకారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పములో లేనిది యీ సృష్టిలో కానరాదు. నేను లేనిదే యీ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు. సృష్టి యున్నది. ఇంతకంటే సత్యమును ఏ విధముగా తెలుపమందువు? నీవు హిమాలయములకు పోయి నిస్సంగుడవై తపమాచరింపుము. శిష్య జంఝాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయిననూ, ఉద్ధరింపబడక పోయిననూ సృష్టికి గాని, నాకు గాని కలిగెడి నష్టమేమియునూ లేదు. సృష్టిలోని కార్యక్రమములు యధావిధిగా నిర్వర్తింపబడుచునేయుండును. ఇదీ అసలు ఉన్న విషయము. పీఠికాపురమున నూతనముగా ఏర్పడిన శిష్యగణము నీకు తోడుగా కదలి వచ్చుట, ఒంటెల వివాహమునకు గాడిదల సంగీత కచేరి వలె నున్నది. ఒంటెల అందమును గాడిదలు పొగడుచుండగా, గాడిదల సంగీత మాధుర్యమును ఒంటెలు పొగడుచున్నవి. పరస్పరము యీ విధముగా ప్రశంసించుకొన్ననూ యదార్థము మాత్రము వేరుగా నున్నది." అని హితబోధ చేసిరి. 

అరుంధతి వశిష్టుల సంబంధము 

అరుంధతీ మాత ఛండాలవంశము నందు జన్మించెనని వింటిని. అట్లయిన ఆమెను వశిష్టమహర్షి ఎట్లు పెండ్లాడెనని నేను గురుచరణుని అడిగితిని. అపుడు గురుచరణుడు, "పూర్వము వశిష్ఠుడు వేయి సంవత్సరములు తపమాచరించెను. ఆ సమయమున అక్షమాల అను ఒక ఛండాలకన్యక వశిష్ఠునకు తాను చేయుటకర్హమైననట్టి ఉపచారములను చేసెను. సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదయినా కోరుకొనమనగా ఆమె వశిష్ఠుల వారినే భర్తగా కోరుకొనెను. నేను బ్రాహ్మణుడను. నీవు ఛండాలజాతి స్త్రీవి. మన యిద్దరికి భార్యాభర్తల సంబంధము ఎట్లు యోగ్యమయినది అగును ? అని వశిష్ఠుడు ప్రశ్నించగా, వరమును కోరుకొమ్మంటివి, కోరితిని. వరమిచ్చిననిమ్ము, లేనియెడల నేను మరలిపోవుటకు అనుజ్ఞనిమ్ము అని ఆమె అనెను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి, అట్లయినచో నీ దేహమును నా యిష్టానుసారము చేసుకొనుట నీకు సమ్మతమేనా? అని ఆమెనడిగెను. ఆమె వల్లెయనెను. ఆ మహర్షి ఆమెను భస్మముగా చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు ఏడు పర్యాయములు చేసెను. ఏడవ జన్మలో ఛండాలజాతి దోషమంతయునూ హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలాయెను. అంతట వశిష్ఠుడు ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలో ఇసుమంత పనిని కూడా వద్దని అడ్డు పెట్టలేదు గనుక ఆమె అరుంధతి యను పేరుతో ప్రసిద్ధి నొందెను. ఈ విషయమును ప్రసంగ వశమున వశిష్ఠ గోత్రోద్భవులయిన నరసింహవర్మతో శ్రీపాదులు సెలవిచ్చిరి. శూద్ర క్షేత్రము నందు బ్రాహ్మణుని వలన పుట్టినవానికి 7వ జన్మలో ఉపనయనమును చేసి బ్రాహ్మణజాతిలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారును వారి వారి గుణ కర్మ విభాగములననుసరించి నడుచుకొనుట శ్రేయస్కరము. బ్రాహ్మణుడు తానాచరించెడి దుష్కర్మల వలన క్రమశః పతనము నొంది శూద్రుడవవచ్చును. శూద్రుడు సత్కర్మాచరణ వలన క్రమశః ఉన్నతిని పొంది బ్రాహ్మణుడవవచ్చును. అయితే దత్తప్రభువు నందు అచంచల విశ్వాసము నుంచువారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారము శీఘ్రముగా పొందగలుగుదురు. తన భక్తుడు ఏ కులములో జన్మించిననూ, ఏ పరిస్థితులలో ఉండిననూ సుఖమయ జీవితమునకు కావలసిన ఆయురారోగ్యఐశ్వర్యములను పొందునట్లు దత్త ప్రభువు అనుగ్రహించగలరు. జన్మజన్మల కర్మబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల." అని వివరించెను. 

దత్తభక్తులకు శ్రీపాదుల వారి అభయము 

మేము శ్రీపాదుల వారి మహిమా విశేషములను పరస్పరము తెలియజేసుకొనుచూ మాంచాల గ్రామమును చేరితిమి. మాంచాల గ్రామదేవత మాకు దివ్యదర్శనమిచ్చి, మమ్ము తరింపజేసి, తన దివ్యహస్తములతో మా చేత ప్రసాదమును తినిపించి, "పూర్వము ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నున్నారు. శ్రీపాదుల వారి సంకల్పము అనూహ్యము. రాబోయే శతాబ్దములలో ప్రహ్లాదుడు గురుసార్వభౌముడుగా అవతరించుననియూ, యీ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియూ, శ్రీపాదుల వారే స్వయముగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యమూ తుంగభద్రాజలమును స్వీకరించువారు. మీకు శుభము కల్గును గాక." అని చెప్పుచూ ఆమె పూర్వరూపము లోనికి మారిపోయినది. మేము అచ్చట నుండి కదలబోవు సమయములో కృష్ణదాసు అను మాలదాసరియొకడు వచ్చెను. మాంచాల గ్రామదేవత కృష్ణదాసునకు కూడా ప్రసాదము పెట్టి పుష్పమాలికను ఒక దానిని తన అనుగ్రహ సూచకముగా నిచ్చి కురుంగడ్డకు ప్రయాణము కావలసినదని చెప్పెను. 

మేము ముగ్గురమూ కురుంగడ్డకు ప్రయాణమైతిమి. దత్తభక్తులందరిదీ ఒకే కులము. వారికి దత్త ప్రభువుల ప్రసాదము ఏ కులము వారు సమర్పించిననూ అది స్వీకరీయమైనదే. మాతో పాటు కృష్ణదాసు చేరికతో నూతనోత్సాహములు  కలిగెను. ప్రసంగవశమున కృష్ణదాసు, "యజ్ఞాదికర్మలలో నిచ్చెడి దక్షిణలకు 16, 116, 1116 అనెడి సంఖ్యాభేదములు ఎందున్నవో తెలిసిన యెడల శ్రీపాదులవారి సంఖ్య అయిన 2498 అను దానికి బోధపడగలదు. " అని చెప్పెను. 

ఆత్మయందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధముగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహసమయమందు వరుడు అగ్నిహోత్రుని ప్రార్థించుచూ, "ఓ అగ్నిహోత్రుడా! నీవు నాకు యీ వధువునందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము." అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా పదిమంది పిల్లల వరకూ కనుట ధర్మసమ్మతమే. ఆ తరువాత తన భార్యను తల్లిగా భావింపవలెను. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలియవలెను. దశాంశరూపులగు 10 మంది కలసిన పూర్ణాంకరూపుడగు తండ్రి అగుచున్నాడు. శివుడు ఆత్మరూపుడగుటచే పరిపూర్ణుడు. కావున దశాంశల రూపుడు 16 దశాంశలను పది సంఖ్యచే భాగించగా పూర్ణాంకము అనగా 1 అనునది శివప్రతీకముగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపము కలిగిన మూలప్రకృతిరూపుడు. ప్రకృతి అనునది పురుషునిలో అర్థభాగమే కదా! అందుచేత పదిలో సగము అయిదగుటచే మనకు శేషముగా వచ్చి ఆరును అయిదుచే భాగించగా విష్ణువు ప్రతీకముగా 1 పూర్ణాంకముగా వచ్చినది. అయితే శేషముగా 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతానరూపుడైన, బ్రహ్మ వారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషముగా మిగిలిన 1 ని 1 చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు 1 పూర్ణాంకము ఫలముగా వచ్చెను. శేషము ఏమియునూ మిగులలేదు. 

పూర్ణము అనగా సున్న అనునది నిర్గుణము కనుక అది రుద్రస్వరూపము సమస్తమునూ లయించినపుడు మహాశూన్యమే కదా విద్యమానమగునది. మహాశూన్యము నందు మాత్రమే సమస్తమును లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపము అనునది అనంతత్వ ధర్మమును కలిగియున్నది. సృష్టి యొక్క స్థితి స్వభావము నందు అనంతత్వము అనివార్యము. 

(ఇంకా ఉంది ..)       

No comments:

Post a Comment