Sunday, June 22, 2014

Chapter 21 Part 3 (Last Part)

అధ్యాయము 21 భాగము-3
దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట

శ్రీపాదులు షోడశ కళాప్రపూర్ణులు

నాయనా! శంకరభట్టూ! ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినపుడు ఒక్కొక్క శకలము శూన్యమే కదా అగునది. ఇటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే గదా పరిమితమయిన ఆకారము కలుగునది. అందువలన శివకేశవులిరువురును అభిన్నులని ఎరుగుము. దశాంశాభాగహారము నందు పదింటిచే భాగింపగా మిగిలిన ఆరు దశాంశల నుండి, అయిదు దశాంశాంకల మొత్తము విష్ణుప్రతీకగా గ్రహింపబడినది.  పంచభూతాత్మకమయిన సృష్టి అంతయునూ విష్ణుస్వరూపముగా భావింపబడినది. దక్షయజ్ఞమును విధ్వంసము చేసిన వీరభద్రునితో, "మూలప్రకృతి ఈశ్వరునకు భోగము నిమిత్తము పార్వతిరూపముగాను, రాక్షసయుద్ధ సమయమున దుర్గారూపము గాను, కోపావస్థలో కాళికాదేవి రూపముగాను, పురుషవేషమున నా వీరభద్రుని రూపముగాను ఉన్నది. శ్రీపాదుల వారు షోడశకళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశ్యమిదియే!" అని విష్ణువు చెప్పెను. 16 సంవత్సరముల వయస్సులోనే వారు పీఠికాపురమును వదలి వెళ్లిపోయిరి. వారు బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపులగుటచే వారిని షోడశ కళాప్రపూర్ణులుగా తెలిసికొనవలెను.

దేవతల వివిధ స్వరూపములు

ప్రకృతి విష్ణుస్వరూపమగుటచే అయిదు దశాంశలు విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశరూపుడాయెను. కారణము సుస్పష్టమే! చేతనస్వరూపుడయిన శివుడు ప్రధానుడు. మిధ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశరూపుడు. ఇట్టి దశాంశరూపబ్రహ్మకు ఏకాంకము ప్రతీకము. ఇటువంటి ఏకాంకము రెండు మొదలుకొని తొమ్మిది వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించియున్నది. అందుచేత బ్రహ్మకు నవప్రజాపతి స్వరూపము సిద్ధించెను. పదహారు, నూరు, వెయ్యి అనెడి మూడు పదములలో చివర రెండు పదములు ముక్తానుబంధరీతిగా గణింపబడి 116, 1116 అనెడి రూపము నందినవి. వీటిని పదిచే భాగించిన యెడల సృష్టి యందలి వివిధ వస్తుసముదాయములు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 11 అను రెండు పూర్ణాంకములు, బ్రహ్మకు 111 అను మూడు పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు. త్రిదక్షిణము దానము చేయువారికి బ్రహ్మజ్ఞానము కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణము దానము చేయుట వలన శరీరము, ధనము, మనస్సు అను మూడింటిని దానము చేసినవాడగును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యమగు ద్రవ్యమును దానము చేయుట గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది. పిండాండదానము జగత్తునకు ప్రతీకము. మన శరీరము సవనత్రయమే రూపముగా గలది. ప్రాతస్సవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అనునది గాయత్రీ - త్రిష్టుప్ - జగతీ ఛందస్సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24, త్రిష్టుప్ నకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన యీ పిండాండదానము (శరీర దానము) వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్య దానఫలము లభించును.

సవితృ కాఠక చయన ఫలితమే శ్రీపాదుల అవతారము

సర్వబుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించునది సవితృమండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు. అదే గాయత్రీమాత. ఆమె 24 కు ప్రతీక. 9 అనునది బ్రహ్మ స్వరూపము. 8 అనునది మాయా స్వరూపము. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృకాఠక చయనము చేయుట వలన ఆనాడు యిచ్చిన వాగ్దానము ప్రకారము ఈనాడు పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఆవిర్భవించినది. శక్తి స్వరూపమును, శాక్త స్వరూపమును అర్థనారీశ్వరము నొంది జీవుల  యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మమార్గమున ప్రవేశపెట్టుటకు వచ్చిన మహావతారమే తానని తెలియజేస్తూ 'దో చౌపాతీ దేవ్ లక్ష్మి' అని భిక్షనడిగిరి. వారి వాక్కులకు, లీలలకు, బోధనాపద్ధతులకు ఉన్న వ్యాకరణమును ఎవరునూ ఎరుగజాలరు. ఈ నవ్య వ్యాకరణమునకు వారే  కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణము. 

కృష్ణదాసు వలన నేను ఎన్నియో విషయములను వింటిని. మరెన్నో క్రొత్త సంగతులను తెలిసికొంటిని. పాండిత్య జనిత  అహంకారము కలిగిన వారు ఎంత మాత్రమూ శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలరు. 

కృష్ణదాసు యిట్లు చెప్పనారంభించెను. "శ్రీపాదులవారు పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపించి యున్నారు. ఒకసారి నరసింహవర్మ గారి పొలములో శ్రీపాదులవారితో వర్మగారు విశ్రాంతి తీసుకొనుచుండిరి. అచ్చటకు ఎన్నో త్రాచుపాములు వచ్చినవి. శ్రీపాదులవారు విచిత్రముగా ప్రతీ త్రాచుపామునకు దాని మొండెము నుండి తలను విడదీసిరి. వాటినన్నిటినీ గుట్టలు గుట్టలుగా ప్రక్కకు వేచిరి. చాలా పెద్ద చీమలు, యిదివరకు ఎవరూ కనీ విని ఎరుగనివి  అక్కడకు చేరినవి. వర్మగారు నిద్రావస్థలో నున్నారు. వారికి నిద్రాభంగము కలుగకూడదని ఆ చీమల నన్నిటినీ శ్రీపాదుల వారు చంపి వేసిరి. ఇంతలో వర్మగారు మేల్కాంచిరి. చచ్చి పడియున్న చీమలను చూసి జాలిపడిరి. శ్రీపాదుల వారు చిరునవ్వుతో యిట్లనిరి. "రాజు తన సేవకుని రక్షించి తీరవలెను. ఇది ప్రకృతిలోని నియమము. ఈ విచిత్ర పిపీలికములకు వింతరాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వచ్చుచున్నాడు చూడమనిరి." ఇంతలో వింతకాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చినది. అది ఆ చీమలన్నింటికీ ప్రదక్షిణము చేసినది. వెంటనే ఆ చీమలన్నియునూ బ్రతికినవి. శ్రీపాదుల వారు మందహాసముతో, "ఈ చీమలరాజునకు సంజీవినీ శక్తి ఉన్నది. ఆ శక్తితో తన వారిని అది రక్షించుకొన్నది. ఇటువంటి వింతవింతలు యీ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాతా! నీవు కోరితే ప్రతీ క్షణక్షణము ఈ రకమయిన లీలలను ఎన్నయినా చూపగలను." అనిరి. 

ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిపడి ఉన్న నాగుబాములను చూసి ఆశ్చర్యము నొందిరి. ఇది కూడా శ్రీపాదుల వారి పనేనని గమనించిరి. అంతట శ్రీపాదుల వారు ఒక నాగుబాము మొండెమునకు వేరొక నాగుబాము తలను చేర్చి తమ దివ్యహస్తములతో నిమిరిరి. వెంటనే అవి పునరుజ్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణము చేసి వెడలిపోయినవి. 

ఆ నాగుబాములు ఎందుకు వచ్చినవో, వాటికి శ్రీపాదుల వారు ఎందుకు అట్లు చేసిరో ఎవరికెరుక ? ఈ విషయమును నేను శ్రీపాదుల వారినడిగినపుడు యిట్లనిరి. "రాహుగ్రహబలం చాలనపుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకములు ఎదురయి కొండచిలువ బంధములలో ఉన్నట్లు అనుభవమగును. దీనినే కొంతమంది కాలసర్పయోగమందురు. రాహువు సర్పములకు అధిదేవత. ఆ రకములయిన ఆటంకములను కలుగజేయు సర్పములు మన కళ్ళకి కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును యీ రకంగా పరిహరించి నా భక్తులకు సుఖసంతోషములను కలుగజేయుచుంటిని."

మేము కురుంగడ్డకు క్షేమముగా చేరుకొంటిమి. శ్రీపాదుల వారు మమ్ములను చిరునవ్వుతో ఆశీర్వదించిరి. 

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 21 సమాప్తం)        

No comments:

Post a Comment