Wednesday, March 28, 2012

Chapter 15 Part 2

అధ్యాయము 15
బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 2
జీవులకు వివిధ యోనుల యందు కలుగు యాతనల వివరణ

అంతట నేను "అయ్యా! జీవమున్నప్పుడే కదా బాధగాని, సుఖముగాని అనుభవమయ్యేది? అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండుట ఎట్లు సాధ్యపడును?" అని ప్రశ్నించితిని. అంతట బంగారప్ప, "జీవాత్మ, పరమాత్మలో కలిసియున్నప్పుడు బ్రహ్మానందమును అనుభవించును. అది వాక్కులో వివరించుటకు వీలుకానిది, మనస్సులో తెలియరానిది. అదే విధముగా జీవాత్మ, శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైన మహా దుఃఖమును అనుభవించును. అది కూడా వాక్కులో వివరించుటకు సాధ్యము కానిది, మనస్సులో తెలియరానిది, అనగా ప్రాణమనునది లేనపుడు అనుభవింపబడే మహాదుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచూ, తెలియరాని, ఊహించరాని, ప్రాణరహితమైన మహాదుఃఖములను అనుభావిన్చుచూ లోహములో ప్రవేశించును. నానావిధ లోహములలో అది సంచరించుచూ నిద్రాణస్థితిలోనున్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహముపై, దాని సరిపడని విషపూరిత పదార్థమును పోసినావనుకొనుము. దానిలో నున్న ప్రాణము నిద్రాణస్థితిలోనే బాధననుభవించి ఆ లోహమును విడచి మరియొక లోహములోనికి ప్రయాణించును. లోహజాతులలో తాదాత్మ్యము నొందిన ఆత్మ పరిణామక్రమములో వృక్షములో ప్రవేశించును. ఇదివరకు నిర్జీవ పదార్థముగా నున్నపుడు నిద్రాణమైయున్న ప్రాణము యిప్పుడు చైతన్యవంతమై నితారుగానో, వాలుగానో ఉండవలెననెడి సంకల్పమును కలిగి యుండును. అయితే ధృడత్వమునకు ఏర్పాటైన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొనిపోయి దాని పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఈ విధముగా అనేక రకముల వృక్ష జాతులలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుచూ సగము జీవనసహితముగను, సగము జీవనరహితముగను ఉండెడి స్థితి నుండి వెలువడి క్రిమికీటకములుగా పరిణతి చెందును. ఈ దశలో చలనము కావలెననెడి దాని సంకల్పము నెరవేరును. ఈ విధముగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచూ మత్స్య రూపమును పొందును. ఆ తర్వాత పక్షిరూపమును పొందును. అనేక రకముల పక్షుల రూపములలో అనుభవము పొందిన తదుపరి నాలుగు కాళ్ళు కలిగిన జంతువులుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందును. మానవులకు తల్లివలె క్షీరమునొసంగుట చేత తనకు తెలియకుండగనే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహారధాన్యముల ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సముపార్జితమగును. తరువాత జన్మమునందు మానవ శరీరమును పొందును. సంస్కారముల వలన ఆలోచనలు కలుగును. అవి చేతలుగా మారును. ఈ విధముగా పుణ్య కర్మలు, పాపకర్మలు చేయబడుచుండును.

సాధన పథమున సప్తభూమికల విచారణ

మానవుడు తన పరిణామక్రమములో సప్తభూమికలందుండును. మొదటి భూమికయందు స్థూల దేహేంద్రియములు, సూక్ష్మ దేహేంద్రియములు ఏకకాలములో ఉపయోగించబడును. రెండవ భూమికయందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవమును పొందుచూ చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందును. మూడవ భూమిక యందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతములకు ప్రయాణము చేయగల శక్తిని పొందును. మూడు, నాలుగు భూమికల మధ్య వశీకరణ కేంద్రమొకటి ఉన్నది. వశీకరణకు లోనయినప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాల దిగ్భ్రాంతికి లోనయింది. అపుడు ఆమె తాను శిలా చైతన్యములో నున్నట్లు భావించుకొన్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము వరకు అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే మూడు, నాలుగు భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రములో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగనే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజస్థితిని పొందినది.

నాలుగవ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగాశాక్తులు లభించును. తమ యోగశక్తులను లోకకళ్యాణార్థము అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితిలోనికి పోయే వీలుంటుంది. అట్లుగాక పాపకార్యముల నిమిత్తము, తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం యీ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలాచైతన్యములోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలనెత్తిన గాని మానవజన్మలోనికి అడుగు పెట్టే అవకాశం ఉండదు. అయిదవ భూమికలో నున్నవారు సంకల్పజ్ఞానులు. ఆరవ భూమికలో నున్నవారు భావజ్ఞానులు. సంకల్పజ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపములను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస చాల తక్కువగా ఉంటుంది. ఏడవభూమికలో నున్నవారు పరమాత్మ యందుండే అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందగలుగుతారు." అని తెలియపరచెను.

అవతార పురుషులకు, సాధకులకు గల వ్యత్యాసము 

బంగారప్ప చెప్పిన మాటలను ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకొను నిమిత్తం యిట్లు ప్రశ్నించితిని. "అయ్యా! జీవులకు మాత్రమే పరిణామ క్రమముండునా? లేక అవతారములకు కూడా యివి వర్తించునా? " అంతట బంగారప్ప "అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన యెడల సమర్థ సద్గురువని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన యెడల అవతారమనబడును. మత్స్యము నీటిలో వడిగా పరిగెత్తగలదు. కూర్మము నీటిలోనూ, భూమిమీద వాడిగా ఉండగలదు. వరాహము అనగా ఖడ్గమృగము, భూమిమీద వాడిగా పరిగెత్తగల జంతువు. నారసింహము, మృగములలో శ్రేష్ఠమైన సింహపు ముఖాకృతితోను, మిగిలిన భాగము మనుష్య రూపముతోను ఉన్న అవతారము. యాచనాప్రవృత్తిని గల తమోగుణ ప్రధానముగా వచ్చినది వామనావతారము. రజోగుణ ప్రధానముగా వచ్చినది పరశురామావతారము. సత్త్వగుణ ప్రధానముగా వచ్చినది రామావతారము. త్రిగుణములకు అతీతమైన నిర్గుణ తత్త్వ ప్రధానముగా వచ్చినది శ్రీకృష్ణావతారము. కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారము. సమస్త సృష్టిలోని ఏకత్వము నందలి అనేకత్వమును, అనేకత్వము నందలి ఏకత్వమును తన యందె నిలుపుకొనివచ్చిన అత్యంత అద్భుతమైన, అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారము. శ్రీపాదుల వారికి ఋణానుబంధము లేని యోగసంప్రదాయములు గాని, మతములు గాని, ధర్మములు గాని సృష్టిలో లేనేలేవు. శ్రీపాదులవారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరము కానిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములునూ, అన్ని సంప్రదాయములును వారి యందు సమన్వయము చెందును. ఈ సృష్టికంతటికినీ ఆది బిందువు, అన్త్యబిండువు వారే. స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారము నంతయునూ పర్యవేక్షించునది, సంకల్పించునది, గతి నొందించునది వారే. ఇది నిగూఢమైన దైవ రహస్యము. సప్త ఋషులకే అంతు పట్టని వారి స్థితిని నేనేమని వర్ణించగలను? నాయనా! శంకరభట్టూ! నీవు ధన్యుడవు! వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు, అన్యజీవులు వ్యర్థజీవులు." అని చెప్పెను.

సత్కర్మ, దుష్కర్మల ఫల వివరణ 

"అయ్యా! నాకొక సందేహము కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినపుడు లోకములో కొందరిని మంచివారు గానూ, మరికొందరిని చెడ్డవారుగాను పుట్టించనేల? అని నేనడిగితిని.

దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, "నాయనా! నీవు మంచి ప్రశ్ననే అడిగిటివి. సృష్టి యంతయునూ ద్వంద్వముల సాయము చేతనే ఏర్పడినది. మృత్యు భయము లేకపోతే కన్నతల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనే అర్థములో వాడబడినది. అంతేగాని పురుషాధిక్యతను సూచించు అర్థములో కాదు. మానవధర్మములకు, జంతుధర్మములకు ఎంతటి వ్యత్యాసము కలదో మానవ ధర్మములకు, దేవతా ధర్మములకు కూడా అంతటి వ్యత్యాసముండును. ద్వంద్వములే లేకున్న వికాసముగాని, పరిణామముగాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడనిన యెడల, అన్నియునూ మంచిశక్తులు మాత్రమే వారియందు కలవని అర్థము కాదు. నీవు యీ ప్రపంచములో చూచేది మోసము, దగా, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖము కోరుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానము లేనిదే సుఖానుభవము అనునది తెలియరాదు. మనము చూచెడి యీ కోటానుకోట్ల నక్షత్ర రాశులన్నియు మొట్టమొదట అస్త్యవ్యస్తముగా ఏర్పడినవే! అవి పరస్పరము డీకొని మరికొన్ని నక్షత్ర రాశులేర్పడినవి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతము మనకు దృగ్గోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్రరాశులు ఏర్పడినవి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధృవుడు ఆధారము. ఈ రకముగా పరస్పర ఆకర్షణ వికర్షణలలో సృష్టి నడుచుచున్నది. పరమాత్మ యందు ఆకర్షణ కలిగినవాడు ఆస్తికుడై, సత్కర్ముడగుచున్నాడు. వికర్షణ కలిగినవాడు నాస్తికుడై, దుష్కర్ముడగుచున్నాడు. ఆస్తికులకునూ, నాస్తికులకునూ వారే ఆధారము. సత్కర్ములకునూ, దుష్కర్ములకునూ వారే ఆధారము. ఈ సృష్టిలీలలో ఏదియునూ స్థిరము కాదు. నీవు యీనాడు ఎవరిని సత్కర్ములుగా ననుకొనుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలనాచరించిన వారే! అందువలననే యీ జన్మలో ధర్మతత్పరులైయున్నను వారికి దుఖములు తప్పుటలేదు. అటులనే దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా వారి పూర్వజన్మకృత పుణ్యఫలానుభవము కాని వేరు కాదు. సామాన్య పాపముకాని, పుణ్యము కాని వెంటనే ఫలితముల నీయవు. అయితే తీవ్రమైన పాపముగాని, మహాపుణ్యముగాని చేసిన యెడల శీఘ్రముగనే ఫలించును. మానవుడు ఏ విధముగా నడుచుకొన్నయెడల సుఖముగా జీవింపవచ్చునో సద్గ్రంథములు తెలియజేయుచున్నవి. మంచి పని చేయుటకుగాని, చెడుపని చేయుటకుగాని వానికి పరిమితమైన స్వేచ్ఛ యీయబడినది. అధర్మము మితిమీరి ధార్మికులు దిక్కు తోచని స్థితిలో నున్నపుడు పరమాత్మ తన మాయచేత అవతరించుచున్నాడు. చావు, పుట్టుకలు లేని దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్యనుండుట అద్భుతమైన విషయము." అని చెప్పిరి.      
 
(ఇంకా ఉంది..)  

Tuesday, March 27, 2012

Chapter 15 Part 1

అధ్యాయము 15
బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 1

నేను శ్రీ దత్తానందులస్వామి వారినుండి శెలవు తీసుకొని నా ప్రయాణాన్ని కొనసాగించుచున్నాను. దారిలో దప్పిక అగుటవలన అక్కడకు దగ్గరనే ఉన్న ఒక బావి వద్దకు వెళ్ళితిని. అచట నీరు చేదుకొనుటకు ఒక చేద కూడా కలదు. నేను నూతిలోపలికి తొంగిచూద్దును గదా! ఒక వింత దృశ్యం కంట పడినది. నూతి ఒరల మధ్య భాగము నుంచి మొలిచిన ఒక చెట్టు కొమ్మను ఆధారముగా చేసుకొని తలక్రిందులుగా ఒక వ్యక్తి వేలాడుచుండెను. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో, శంకరభట్టూ! అని పిలిచెను. ఆశ్చర్యముతో నా పేరు మీకెట్లు తెలిసిందని అడిగితిని. అందులకతడు, "నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు కురుంగడ్డ వెడుతున్న విషయం కూడా నాకు తెలియును. నిన్ను కలుసుకునే నిమిత్తమై మాత్రమే నేను వేచియున్నాను." అని చెప్పెను.

అతడిని నూతిలోనుండి బైటకు తీయుట ఎట్లా అని నేను ఆలోచించసాగితిని. చేదకున్న త్రాడు బలహీనమైనది. నా ఆలోచనను పసిగట్టిన ఆ పుణ్యపురుషుడు "ప్రాపంచిక బంధములతో సంసార కూపమున బడిన మానవుడవు నీవు. బంధరహితుడనై యీ విచిత్ర యోగప్రక్రియలో ఆత్మానందమున ఉన్నవాడను నేను. నన్ను నీవేమి లేవనెత్తగలవు? నా యంతట నేనే లేచేడను. మనకు శక్తి చాలనపుడు శ్రీపాదులవారు దయతో శక్తి ననుగ్రహించెదరు." అని అనెను. అట్లనుటయే తడవుగా కనురెప్ప పాటులో నా ప్రక్కన ఉండెను. నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని. అతడిట్లు చెప్పసాగెను. "నా పేరు బంగారప్ప. నీవు దాహము గొనినట్లున్నావు. నేను నీ దప్పిక తీర్చెదను." అని పలికి తక్షణమే చేదతో నీతిని తోడి తానూ గడగడ త్రాగుచుండెను. విచిత్రముగా నా దాహము కట్టబడెను. నేను ఆశ్చర్యపోయితిని.

అంతట మేమిద్దరమును కలిసి ప్రయాణము చేయసాగితిమి. అతడిట్లు చెప్పసాగెను. "నేను స్వర్ణకార కుటుంబమునకు చెందినవాడను. మంత్ర తంత్రములలో ప్రావీణ్యమును సంపాదించినవాడను. నాకు అయిష్టులయిన వారిని మంత్ర తంత్ర ప్రయోగాములతో చేతబడి చేసి చంపగల సామర్థ్యమును సంపాదించితిని. భూత ప్రేత పిశాచములతో సన్నిహితత్వమును కూడా పొందితిని. శ్మశానములలో వివిధములయిన కార్య కలాపములను చేసెడివాడను. నా పేరు వినినంతనే జనులు గడగడలాడెడివారు. నేను ఏ గ్రామమునకు పోయిననూ, అచ్చటి జనులు నేను భూతప్రేతములను ప్రయోగించుటద్వారా వారికి ఏ విధమైన కష్ట నష్టములను కలిగించెదనో అను భయముతో నాకు విశేషముగా ధనము నిచ్చెడివారు. వారొసంగిన ధనములో ఎక్కువ భాగము సదా నన్ను ఆశ్రయించి యుండు భూతప్రేతముల బలులకు ఉపయోగింపబడెడిది. సకాలములో బలులు సమర్పింపని యెడల ఆ భూతములు నాకే తీవ్ర హానిని కలిగింపగలవు. నా ముఖములో సాధారణ మనుష్యులకుండవలసిన ప్రసన్నత్వము లోపించి భూతప్రేతములకుండు వికృత కళలను, క్రూర స్వభావ లక్షణములను పెంపొందినవి. నా సంచారములలో ఒకసారి పూర్వ పుణ్యవశమున పీఠికాపురమునకు వచ్చితిని.

దత్తప్రభువుల అవతారముచే పవిత్రమైన యీ నగరమందు క్షుద్రములయిన కుతంత్రములకును, పరస్పర కలహములకును కూడ లోటులేదు. నేను శ్రీ బాపనార్యులవారి గురించి, శ్రీపాదులవారి గురించి కర్ణాకర్ణిగా చిత్రవిచిత్రములయిన విషయములను వింటిని. మునుముందుగా నేను బాపనార్యులవారిని సంహరింపదలచితిని. నేనొక కొలను వద్దకుపోయి దోసిళ్ళకు దోసిళ్ళు నీటిని త్రాగుచుంటిని. నేను ఎవరినయినా చంపదలచుకొన్నపుడు నా వద్ద అనేక రకములయిన ప్రక్రియలుండెడివి. అందులో ఒకటి నేను చంపదలచుకున్న మనుష్యుని రూపమును ధ్యానించుచూ నీటిని త్రాగినచో, నేను త్రాగిన నీరంతయునూ ఆ మనుష్యుని పొట్టలో చేరును. నీటితో పొట్ట నిండిపోగా ఆ వ్యక్తి పొట్టపగిలి చచ్చును. శ్రీపాదుల వారి లీలావిశేషములు అనూహ్యములు. నేను కొలనులో నీరు త్రాగు సమయమున బాపనార్యుల వద్ద శ్రీపాదులుండిరి. శ్రీపాదుల వారు ప్రేమతో బాపనార్యుల పొట్టను నిమిరిరి. నేను ఎంత నీరు త్రాగుచుండిననూ అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరియై పోవుచున్నది. నీటిని త్రాగి త్రాగి నేనే అలసిపోయితిని. కాని బాపనార్యులవారు మాత్రము నిక్షేపముగా నుండిరి. నా యీ క్షుద్రవిద్య ఎందులకు యీ రోజున విఫలమయ్యెనాయని ఆవేదన చెందితిని. కారణము తెలియరాకుండెను.

శ్రీపాదులు క్షుద్రోపాసకుల పీడ తొలగించుట

నా వద్ద సర్పమంత్రమొకటుండెడిది. అది పఠిoచినచో వెంటనే నేను మనస్సులో ధ్యానించిన వ్యక్తి యింటివద్దకు ఎక్కడెక్కడి సర్పములు వచ్చిచేరి వానిని కాటు వేయును. నేను బాపనార్యులను ధ్యానించి ఆ సర్పమంత్రమును పఠించితిని. అపుడు అనేక సర్పములు బాపనార్యుల యింట చేరినవి. అయితే అవి ఆ యింటనున్న ఒక పందిరిపైకి ఎగబ్రాకి పొట్లకాయలవలె వ్రేలాడినవి. రెండు ముహూర్తముల కాలము గతించిన తరువాత ఆ సర్పములు ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి తిరిగి వెళ్లిపోయినవి. ఈ విధముగా నా రెండవ ప్రయత్నము కూడా విఫలమైనది. నా వద్ద నున్న భూతప్రేతములు బాపనార్యుల యింటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షగా చెప్పినవి. ఇదంతయునూ శ్రీపాదుల వారి చమత్కారమని లీలగా నాకు అర్థమైనది. నాలో యింకనూ రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానమునకు పోయి శ్రీపాదులవారి పిండిబొమ్మను చేసి, దానికి 32 స్థానములలో 32 సూదులను గ్రుచ్చితిని. ఈ మారణప్రక్రియ వలన శ్రీపాదులవారి శరీరములో ఆయా స్థానములలో రుగ్మతలు కలిగితీరవలెను. అంతేగాక ఆ సూదులు ద్రవరూపమును పొంది శ్రీపాదుల వారి శరీరములోకి యింకిపోయి శరీరమంతయును విషపూరితమై మరణము కలిగితీరవలెను. నా యీ ప్రయత్నము కూడా విఫలమయ్యెను. విచిత్రముగా ఒకానొక అర్థరాత్రి సమయమున నా పొట్టలో నీరు అధికముగా చేరుచున్నదను అనుభవము కలిగెను. నాకు ప్రాణాంతకముగా నుండెను. నా సర్పమంత్ర ప్రభావమునకు బాపనార్యుల యింట చేరిన సర్పములన్నియును పీఠికాపురములోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటువేసినవి. శ్రీపాదులవారి పిండిబొమ్మకు ఎక్కడయితే నేను సూదులను గుచ్చితినో నా శరీరమునందు సరిగా అదే ప్రదేశములలో బాధ కలుగజొచ్చెను. ఈ విధముగా నా దుష్ట చర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరమునందే అనుభవింప సాగితిని. నరకయాతననుభవించితిని. చనిపోయిన బాగుండునని తోచినది. అయితే నాకు చావు రాకుండెను. నరకబాధలు ఎట్లుండునో చనిపోయిన గాని తెలియవు. కాని నేను ఆ రాత్రి బ్రతికుండగనే నరకబాధాలను చవిచూసితిని. భరించలేని బాధలు కలిగినపుడు ఏ మానవుడైననూ దైవము వైపునకు తిరుగక మానడు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనస్సులోనే శరణుజొచ్చితిని. నా మనోనేత్రమునకు శ్రేపాదుల వారి రూపము గోచరించి, "బంగారప్పా! నీవొనరించిన మహాపాపములకు నీవు అనేక సంవత్సరములు యిహలోకములో బాధలు అనుభవించిన తదుపరి నరకములో కూడా బాధలను అనుభవింప వలసియున్నది. అయితే నీయందు కృప వహించి యీ ఒక్క రాత్రిలో నీవు పడెడి యాతనలద్వారా నీ పాపకర్మను ధ్వంసము చేయుచున్నాను. నీ యొక్క క్షుద్రవిద్యలు అన్నియూ నశించును. అయితే ఎవరయినా దాహము గొనియున్నవారు నీ మనోనేత్రములకు గోచరించినపుడు నీవు నీరుత్రాగి దప్పిక తీర్చుకున్నయెడల వారెంతటి దూరములో నున్నను వారు దాహార్తి తీరినవారగుదురు. తలక్రిందులుగా వ్రేలాడుట అను ఒకానొక యోగప్రక్రియ కలదు. దానిని అభ్యసించినచోనీవు ఆనందప్రాప్తిని పొందగలవు. నేటినుండి సాత్వికప్రవృత్తి ననుసరించి జీవింపుము. మా మాతాపితరుల గృహమునందు గాని, బాపనార్యుల వారి గృహమునందు గాని అడుగిడుటకు ఎన్నియో జన్మల పుణ్యము కావలెను. నీకు యీ జన్మమునందు అంతటి అదృష్టము లేదు. అదృష్టమనునది ఆకస్మాత్తుగా లభించునది కాదు. దురదృష్టమనునది విచక్షణారహితముగా యివ్వబడునది కాదు. పూర్వజన్మములోని పుణ్యకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చునపుడు అదృష్టమని అందురు. పాపకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చునపుడు దురదృష్టమని అందురు. ప్రాణము నొసంగునది పరమేశ్వరుడు గనుక ప్రాణము తీయు అధికారము కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు. మాతాపితలు జన్మదాతలు గనుక వారు పరమపూజ్యులు. వారిని వృద్ధాప్యములో అనాదరము చేసినవారి యందు నా కటాక్షము ఉండదు. నీవు క్షుద్రవిద్యలతో ఎందరో అమాయకులను అకాలమరణమునకు గురిచేసినావు. ఆ పాపఫలము నీకు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు కనుపించునంతవరకు ఉండును. అతడు దప్పిగొనియున్నపుడు నీవు నీ విద్యనుపయోగించి అతని దప్పికను తీర్చుము. అప్పుడు నీ పాపము నిశ్శేషమగును. ఆ శంకరభట్టు అనునతడు నా చరిత్రమును వ్రాయును." అని చెప్పిరి. ఈ సంఘటన జరుగునాటికి శ్రీపాదులవారి వయస్సు ఏడెనిమిది సంవత్సరములుండును. నాయనా! శంకరభట్టూ! ఆ రోజు నుండి నీ కోసమే నేను వేచియున్నాను. నేడు నాకెంతయో సుదినము! అని బంగారప్ప అనెను. నాకు యీ గాధ అంతయునూ అయోమయముగా నుండెను. అంతట నేనిట్లంటిని. అయ్యా! మీరు నీరు త్రాగిన యెడల మరియొకరి దప్పిక ఎట్లు తీరును? ఇందలి మర్మమును నాకు విశదపరచవలసినదంటిని. దానికి బంగారప్ప, "నాయనా! అన్నమయకోశము నందుండు జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచములో అనుభవములను పొందుదురు. ప్రాణమయకోశము నందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగియుందురు. మనోమయకోశము నందలి జీవులు మానసిక ప్రపంచముతో సంబంధమును కలిగియుందురు. విజ్ఞానమయకోశము నందలి జీవులు దానికి సంబంధించిన ప్రపంచముతో సంబంధమును కలిగియుందురు. ఆనందమయ కోశము నందలి జీవులకు ఆనందానుభవముండును. ప్రాణమయశక్తిని ఒకానొక యోగప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయశక్తితో అనుసంధానమొనరించెదను. తద్వారా, యీ తాదాత్మ్యభావము వలన యిది సాధ్యమగును. ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా పూర్వకాలమున వాలి, తన ఎదురుగానున్న వానికంటె రెట్టింపు బలమును, శక్తిని పొందుచుండెను. అందువలననే రాముడు వాలిని చెట్టు చాటు నుండి వధించెను. విశ్వామిత్రమహర్షి రామ లక్ష్మణులకు బల అతిబల అను రెండు పవిత్ర మంత్రములనుపదేశించెను. ఈ మంత్రముల స్పందనలకు అనుగుణముగా ప్రాణశక్తిని సిద్ధపరచుకొనినయెడల విశ్వాంతరాళమునందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకొన వీలుకలుగును. శరీరము పరిశుద్ధమైనది గానిచో, ఆ శక్తి మన శరీరములోనికి ప్రవేశించునపుడు విపరీతమైన బాధ కలుగుటయే గాక ఆ శక్తిని నిలుపుకొనలేక మరణము కూడా సంభవించును. పరిశుద్ధతాక్రమములో మానవ శరీరములు 12 దశలలో కలవు. శ్రీరాముని శరీరము 12 వ దశకు చెందినది. శ్రీదత్తుని శరీరము 12 వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులయిన శ్రీపాదులవారియందు అనంతశక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధముగా నుండును." అని చెప్పెను. అంతట నేను "అయ్యో! గౌతమమహర్షి శాపము వలన అహల్య శిలారూపమును పొందెననియూ, శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యెనని అందురు గదా! ఆమె నిజముగా శిలారూపమును పొందెనా? లేక యిందులో ఏదయినా రహస్యార్థమున్నదా?" అని ప్రశ్నించితిని.

అంతట బంగారప్ప, "మంచి ప్రశ్ననే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధమును కలిగియుండెను. ఈ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను 'శిల'కమ్మని శపించెను. అంతట అహల్య గౌతముని, ఓ తెలివిమాలిన మునీ! ఎంతపని చేసితివి? అనెను. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్యస్థలములను దర్శించుచూ శివానుగ్రహమున స్వస్థత నందెను. చైతన్య పరిణామక్రమములో 'శిల' ప్రథమ స్థానము లోనిది. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో నుండును. శిలలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములను పొందుచున్నది. ఆ అనుభవముల తర్వాతా మరియొక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగానున్న ప్రథమశిలలో మరియొక ఆత్మ ప్రవేశించును. ఏ ఆత్మ ఏ శిలలో ఎంత కాలము ఉన్నదనుట కేవలము యోగదృష్టి కలవారికి మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా, ఆ శిల రెండుగా ఖండించబడెననుకొనుము. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా, మరియొక ఖండములో మరియొక ఆత్మ ఉండి కొన్ని అనుభవములను పొందును. అవి ఏ రకమయిన అనుభవములు పొందుచున్నవో వాటికే తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నపుడు ఆ ఆత్మ అపరిమితమైన బాధను అనుభవించును. వాటికి జీవము లేదు గాని బాధా అనుభవము మాత్రముండును." వివరించెను.


(ఇంకా ఉంది..)                  

Saturday, March 10, 2012

Chapter 14 Part 5 (Last Part)

శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయ వాక్యములు 

శ్రీపాదులవారు దత్తదాసుని యింట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము.

1 . నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోట నేను సూక్ష్మ రూపమున ఉందును.
2 . మనోవాక్కాయకర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలె కాపాడుచుందును.
3 . శ్రీ పీఠికాపురమున నేను ప్రతి నిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవరహస్యము.
4 . సదా నన్ను ధ్యానించువారి కర్మలను, అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవి అయిననూ వానినన్నింటినీ భస్మీపటలము గావించెదను.
5 . అన్నమో రామచంద్రా అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యెదను.
6 . నేను శ్రీపాద శ్రీవల్లభుడను! నా భక్తుల యింట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును.
7 . నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును.
8 . నీవు ఏ దేవతాస్వరూపమును ఆరాధించిననూ, ఏ సద్గురువును ఆలంబనముగా చేసికొన్ననూ నాకు సమ్మతమే!
9 . నీవు చేయు ప్రార్థనలన్నియునూ నాకే చేరును. నీవు ఆరాధించు దేవతాస్వరూపము ద్వారాను, నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందచేయబడును.
10 . శ్రీపాద శ్రీవల్లభుడనిన పరిమితమయిన యీ నామరూపము మాత్రమే కాదు. సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు.
11 . నాది యోగసంపూర్ణ అవతారము. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరునూ నాయొక్క అంశలే.
12 . నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న యెడల నేను నీకు ధర్మమార్గమును, కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.