Tuesday, March 19, 2013

Chapter 19 Part 1

అధ్యాయము 19
గురుచరణునితో సమాగమము- భాగము 1

వల్లభేశ్వరశర్మ దంపతులు, నేను, సుబ్బణ్ణశాస్త్రి, శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరపుబంధువు అయిన లింగణ్ణశాస్త్రి యనునతడు వచ్చెను. అతడు వేదవేదాంగ పారంగతుడు. లింగణ్ణశాస్త్రి యీ విధముగా చెప్ప నారంభించెను. "నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చితిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైననూ, ధనవంతుడైననూ బహుపిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములనూ, ధర్మసూక్ష్మములనూ వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకొనువారు. పితృదేవతల తృప్తికొరకు చేయబడు దశవిధ దానములను 'యథాశక్తి' అను సూత్రముతో వక్రముగా అన్వయించుకొని వారు అత్యంత స్వల్పద్రవ్యముతో ఆ తంతు అయినది అనిపించుకొనెడివారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధకర్మలయందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చుబెట్టబడుచున్నదనియూ భోక్తలు యిదే అదున్ని భావించి మిక్కుటముగా భోజనము చేయుచున్నారనియూ, తన యిల్లు గుల్ల అగుచున్నదనియూ అంతర్మథనము చెందెడివాడు. కాలము తీరగా మా తాతగారు చనిపోయిరి. మా నాయనకూడా తండ్రి అడుగుజాడలలోనే నడచెను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబళించెను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువగాని, ఎక్కువగాని కాకుండ యధాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుచుంటిని.

ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండెను. కారణములేమియు లేకుండగనే సద్యః కలహములు వచ్చుచుండెను. పరమశాంతులయిన బంధుమిత్రులు మాయింట అడుగు పెట్టిన కొలదిసేపటికే రౌద్ర స్వభావము పొంది జగదములకు దిగగా అది కలహాల నిలయమాయెను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పరుండినపుడు నా కుమారుడు నా ఛాతిపై కూర్చొని తన రెండుచేతులతో నా పీక పిసిగివేయతలంచెను. నా కోడలు, నీ వయసు వారు చాలామంది వల్లకాటికి చేరియున్నారు. నీవంతు ఎప్పటికి వచ్చునోకదాయని తిట్టిపోసేడిది. నా కూతురు, నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మములో నేనెంత పాపము చేసుకొంటినో కదాయని పరుష వాక్యములాడెడిది. నా అల్లుడు, మా యింటిలో సరియైన సేవకులు లేరైరిరి. దుక్కలాగున ఉన్నావు. మా యింటికి వచ్చి యిల్లూ వాకిలి ఊడ్చుట, గొడ్లచావడిలో గోసేవచేయుట, అవసరమైనపుడు బ్రాహ్మణార్ధమునకు పోయి తిలదానము పట్టుట మొదలయిన పనులు చేయవచ్చును గదా! మేము పస్తులుండి అయిననూ నీకు బకాసుర భోజనము సిద్ధము చేయగలవారము. నీవే వంటావార్పు చేసి నీవు తినగా ఏమయినా మిగిలినచో మాకు కూడా ఒక కబళము భోజనము పెట్టవచ్చును గదా! అని వ్యంగ్యోక్తులతో హింసించెడివాడు.

నాకు జీవితము కంటకప్రాయమైనది. ప్రతీ జీవికినీ, జీవించుటయందు ఆసక్తి కలిగి, జీవించుటలో మాధుర్యమున్నదని తోచును. అయితే నా విషయములో జీవిన్చుటలో మాధుర్యము లేదని తేలిపోయినది. అయినచో బలవంతముగా ఆత్మహత్య చేసుకొని మరణించుదమన్న పిశాచజన్మ లభించునేమోయని భయము. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరుగవని నాకు స్పష్టముగా తోచినది. ఒకనాడు నేను మా యింటిలో నున్న గొడ్లచావడిలో నాకు అప్పజెప్పబడిన పనులను అన్నింటినీ పూర్తిచేసుకుని భోజనము చేయుటకు ఉద్యుక్తుడనయితిని. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నమును పెట్టినది. అది దుర్వాసన కలిగియున్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసియున్న నాకు, మిక్కుటముగానున్న క్షుద్భాధ మరింత హింస కలిగించినది. కన్నీళ్లు కార్చుదమన్ననూ ఓపికలేని స్థితిలో నుంటిని. దుర్వాసనతో కూడియున్న అన్నమును తినజాలను. ఆకలిబాధకు తట్టుకొనజాలను. కడున్గాడు దైన్యస్థితిలో నున్న నాకు యీ లోకము, యీ జనులు, యీ బాంధవ్యములన్నియూ సత్యములేనా? లేక యిదంతయునూ ఒక యింద్రజాల మహేంద్రజాలమా? అని మనసులో శంక కలిగినది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు మొద్దుబారిపోయినది.

ఇటువంటి విశామపరిస్తితిలో ఒక అవధూత నేనున్న గొడ్లచావడిలో నాకు దర్శనమిచ్చెను. కరుణారసము మహాప్రవాహము వలె అతని కండ్ల నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణము పసిబాలునివలె వెక్కి వెక్కి ఏడ్చితిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరములనుండి తెలియుననెడి జ్ఞానము కలిగినది. నేను ఆ అవధూత దివ్య శ్రీచరణముల పైబడి ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకొంటిని. ఆ అవధూత తన దివ్య హస్తములతో ఆ అన్నమును స్పృశించెను. కంచములోని ఆ అన్నము అదృశ్యమాయెను. ఆ కంచములో 'హల్వా' అని పిలువబడు తీపిపదార్థముండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్పభాగమును స్వీకరించి మిగిలినది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టిగా తింటిని. నాలో జవసత్వములు పుంజుకొనినవి. ఆ అవధూత నన్ను ఒక గునపముతో ఈశాన్యమూల త్రవ్వుమనెను. నిలువెత్తుగొయ్యి తీసిన తదుపరి దానిలో రెండు కుక్కల అస్థిపంజరములు బయల్పడినవి. వాటిని నేను అవతల పారవైచితిని. అవధూత నావద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పూడ్చితిని. అంతట ఆ అవధూత యిట్లు సెలవిచ్చెను. నీకు పిశాచబాధా నివృత్తిని చేసితిని. నీ గృహమునకు యిప్పుడు స్థలశుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునుండి నీకు పిలుపువచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పీఠికాపురములో కలుసుకొందుము."

నేను కట్టుబట్టలతో పీఠికాపురమునకు పయనమైతిని. ఇంటిలోని వారెవరికినీ చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంతదూరము పోవుసరికి సాయంసంధ్య సమీపించుచుండెను. ఒక మామిడితోట గుండా ప్రయాణము చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అనునతడు నన్ను మిగుల ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రికి తన యింత ఆతిథ్యమును తీసుకొనవలసినదని బ్రతిమాలేను. నేను సరే యంటిని. ఉదయము నేను స్నానసంధ్యలు నేరవేర్చుకొనిన తదుపరి నాకు వస్త్రదానమొనర్చి, కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే సక్రమముగా ఏర్పాట్లు జరుగుచుండుటను గమనించిన నాకు ఆశ్చర్యము కలిగెను. అంతట ఆ రైతు "అయ్యా! నిన్న మధ్యాహ్న సమయము నందు ఒక అవధూత స్వప్నదర్శనమిచ్చి సాయంసంధ్య యందు సద్బ్రాహ్మణుడొకడు పాదచారియై తోటమార్గమున బోవుచుండుననియూ, అతనికి ఆతిధ్యమిచ్చి, ఆ మరునాడు వస్త్ర దానము చేసి, దక్షిణ కూడా యీయవలసినదనియూ, అతనికి భుజించుటకు మామిడి పండ్లను యీయవలసినదనియూ చెప్పెను. తమ దర్శనభాగ్యము కలిగినది. మీకు సేవచేసుకొను అదృష్టము కూడా కలిగినది. ధన్యుడనయితిని." అని సంబరముగా చెప్పెను.

ఈ వృత్తాంతమును బట్టి ఆ అవధూతలో అతీతశక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమయినది. నేను వేదమునందలి ఋచలను వల్లెవేసుకొనుచూ ప్రయాణము చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదమును వల్లెవేసుకొనుచూ పోవుచుండగా నాలోని నరనరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించితిని. ఆ విద్యుత్ ప్రవాహమువలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేదపండితుడు వడివడిగా వచ్చుటను గమనించితిని. అతడు వేదమునందలి సావిత్రిపన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపితిని. అంతట ఆ వేదపండితుడు "సావిత్రిపన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజమహర్షి సవితృకాఠక చయనము చేసెను. అది కూడా పీఠికాపురములోనే చేసెను. ఆ దత్తప్రభువు ఏనాడో యిచ్చిన వాగ్దానము ననుసరించి నేడు పీఠికాపురము శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠిoచు అధికారము బ్రాహ్మణులకే యీయబడిననూ వేదములను అధ్యయనము చేయు అధికారము మాత్రము సర్వ వర్ణముల వారికినీ యీయబడినది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీక్రిష్ణుడో ? బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్ళను నెత్తిపై జల్లుకొనువాడు. పీఠికాపురము నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు. " అని పలికెను.

నేను వారిని అయ్యా! శ్రీపాదశ్రీవల్లభులననెవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేదపండితుడు "నాయనా! శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వపాపక్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురము. పూర్వయుగములందలి మహాత్ములు అవసరము ఏర్పడినపుడు అవతారపురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగము నందు సుశీల, విష్ణుదత్తుడను పుణ్యదంపతులుండెడివారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయమాతతో తాదాత్మ్యస్థితినందుండెడిది. దత్తజయంతి రోజున ఆమె ప్రసవవేదనను అనుభవించెడిది. విష్ణుదత్తుడు తన సాధనావిశేషములతో అత్రిమహర్షులవారితో తాదాత్మ్యస్థితినొందెడివారు. ఈ తాదాత్మ్యస్థితి అనునది అభౌతికము, అప్రాకృతిము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతీమహారాణి, అప్పలరాజశర్మగా జన్మించిరి. వారి తపఃఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానముగా జన్మించిరి. వారు కృష్ణయజుర్వేడులు, ఆపస్తంభసూత్రులు, భారద్వాజ గోత్రీకులు, పూర్వయుగము నందలి లాభాద మహర్షియను వైశ్యముని, వాసవీకన్యకా అవతారమునందు భాస్కరాచార్యునిగానూ, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతీ మహారాణికి తండ్రియైన బాపనార్యులుగానూ జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్యవంతులను దర్శనము చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును, దక్షిణను యిచ్చిన రైతు పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠియను వారివద్ద పూర్వజన్మ నందు పాలేరుగా ఉండెడివాడు. పరమ పవిత్రులయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యమువలన అతడు భూస్వామియై సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును శ్రీపాదులవారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారియందు వాత్సల్యభక్తి మెండు." అని వివరించిరి.

తదుపరి నేను "అయ్యా! కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బన్ధములని గమనించితిని. యజ్ఞము చేయునపుడు పవమానఘటము బ్రద్దలైనయెడల ఆ ఘటముతో బాటు అధ్వర్యుని శిరస్సు గూడ వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలములోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరబాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదయినా ప్రమాదవశాత్తు బ్రద్దలైనచో అధ్వర్యుని శిరస్సు బ్రద్దలగుట లేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు, శుభములను కలిగించునవి గాని, అశుభములను కలిగించునవి గాని, సంభవింపకపోవుట చేతనే నాస్తికులు వేద శాస్త్రములను అవహేళనము చెయుచున్నారు." అని వారినడిగితిని.

దానికి ప్రతిగా ఆ మహామహులిట్లు వచించిరి. "నాయనా! ప్రస్తుత కాలములో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్ధములు లెవు. యజ్ఞమును నిర్వహించు అధ్వర్యుడు గొప్పసాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా నుండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయినవాడు అధ్వర్యుడై యజ్ఞమును చేసినయెడల సద్యఃఫలితము గల్గి లోకశ్రేయస్సు కలుగును. అట్లుగాక నామ మాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలోనిచ్చే దక్షిణలలో 16, 116, 1116 అనెడి సంఖ్యా భేదములకు కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనునది పితృసంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంతవరకూ మార్పుచెందినది. సాపిండ్యమనునది మాతృసంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు, ధనము అను రెండు ఫలములు గలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీయనెడి అగ్ని ముఖ్యముగా కావలెను. గుణభేదమే లేని శ్రీపాదులవారికి కులభేదము లెట్లుండును. వారు భావాద్వైతమును బోధించుచున్నారు. కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదులవారు పక్షపాతరహితులు. ఆదిశంకరులు హేమవిద్యను సత్వగుణప్రధానులైన బ్రాహ్మణులకుపదేశింపక, రజోగుణ ప్రధానులును, పరోపకార పరాయణులునగు కల్లుగీసుకొని జీవించు గౌడకులస్థులకుపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్ణ, వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపజేతురు. ఆదిశంకరుల వారు హేమవిద్యను బ్రాహ్మణులకుపదేశించిన వారు లోభులై, ధన వ్యామొహాదులందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరిచిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనెడు యీ  ఎనిమిదింటిని జడ ప్రకృతులందురు. చిత్ప్రకృతితో కలిపిన యెడల యివి తొమ్మిదగును. ఒకటి అనునది చిత్ప్రకృతికి ప్రతీకము. రెండు నుండి తొమ్మిది వరకు ఉన్న యీ ఎనిమిది అంకెలు ఎనిమిది జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనునది బ్రహ్మతత్త్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన తొమ్మిది అంకెలవలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమైయున్నది. శ్రీపాదులవారు రెండు చపాతీల కోసము 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ' అని హాస్యముగా భిక్ష అడుగుచుండెడివారు. ఇది 2498 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతీకదలికలోనూ, వాక్కులోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల, సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోనుకాని బ్రహ్మతత్త్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదులవారు అర్థనారీశ్వరులు."


(ఇంకా ఉంది.. )        

Sunday, October 7, 2012

Chapter 18 Part 3 ( Last Part)

అధ్యాయము 18
రావిదాసును గురించి వర్ణనము - భాగము 3
శ్రీపాదుల విరాట్ స్వరూపము

కొంతసేపైన తదుపరి కండ్లు తెరువవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. తదుపరి శ్రీపాదులవారు "మా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగదు. సృష్టివిధానము చిత్రవిచిత్రముగా ఉన్నది. నిరాకారుడనయిన నేను నరాకారముగా మీ ముందునకు వచ్చుట కడుచోద్యము. నిర్గుణుడనయిన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులు, అవధులు లేని నేను పరిమితులతో, అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింతను గొలుపు విషయము. సర్వశక్తులునూ నా కరస్ధమయి ఉన్నవి. ఈ అనంతకోటి బ్రహ్మాండము నందలి ప్రతీ అణువు అణువు లోనూ ఉన్నవాడిని నేనే. అణువణువునూ కలిపి ఉంచెడి సంకల్ప స్వరూపము నేనే! అణువణువునూ విడగొట్టగలిగి నూతన సృష్టిరచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే! ఇది జ్ఞానమని, ఇది అజ్ఞానమని మీకు బోధచేయుచూ సర్వజీవులనూ అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచూ, ఆర్తితో పిలిచినపుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకొని సంరక్షించు అనాది తత్త్వమును నేనే! అన్ని జీవులలోనూ 'నేను' 'నేను' అని తోచుచున్న అసలుసిసలైన 'నేను'ను నేనే! అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకున్నయెడల మీరు ఆశ్చర్యపోవలయునే కాని, అవి మీకు  వ్యక్తమై అనుభవము నిచ్చుచున్నపుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది?" అని శలవిచ్చిరి.

పరబ్రహ్మస్వరూపులైన శ్రీ గురుదేవులు యీ ప్రకారముగా చెప్పుచుండ ఎచ్చటినుండియో ఘంటానాదము వినబడినది. అందరునూ ఆశ్చర్యపడుచుండగా ఆ ఘంట శ్రీచరణముల మ్రోలవాలినది. కొద్దిక్షణముల అనంతరము అందరునూ చూచుచుండగా అది అంతర్హితమైనది.

స్త్రీల యందు శ్రీపాదుల వారి మాతృభావన 

శ్రీపాదులిట్లనిరి. "ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యః ఫలములను ప్రసాదించు మహావతారము. మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడనూ పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగవిఘ్నములను జయించలేడు. ఓయీ! వల్లభేశా! వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలముచేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేకరకముల అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే! వారి సంతానము కూడా నీ యందు వైరభావమును కలిగియున్న విషయము కూడా మాకు అవగతమే! చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి, నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసినయెడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో ముగ్గురు దొంగలను వధించెదము. నాలుగవ వాడు స్వల్పదోషి గనుక విడిచిపెట్టెదము."

శ్రీపాదుల వచనములను విని వల్లభేశుని భార్య కండ్లనీరు పెట్టుకొనుచున్నది. అంతట శ్రీపాదులిట్లనిరి. "అమ్మా! శ్రీపాద శ్రీవల్లభుడైన నేను ప్రతీ స్త్రీయందును నాకు జన్మనిచ్చిన అఖండసౌభాగ్యవతి సుమతీ మహారాణినే చూచుచుందును. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికినీ పసిబిడ్డనే! నీవు దుఃఖింపకుము. నేనిచ్చెడి యీ పసుపుకోమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించెదవు. మా శాసనము శిలాశాసనము. యీ సృష్టిలోనే ఏ శక్తికి కూడ దానిని మార్చుటకు సాధ్యము కాదు.

నాకు గాయత్రీ మంత్రోపదేశమును చేసిన నా మొదటిగురువైన మా తండ్రిగారి పేరు చిరస్థాయిగా చేయదలంచితిని. అందులకు మా తండ్రిగారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నృశింహ సరస్వతి అను పేరా మా తదుపరి అవతారము ఆవిర్భవించనున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపమును గూడ చిరస్థాయిగా చేయదలంచితిని. దానికి ప్రతిగా నృశింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తులా మా తాతగారి రూపమునే పోలియుండును. మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేదవిద్యను గ్రహించితిని. మీరిప్పుడు చూచిన యీ ఘంట ఒకప్పుడు మా తాతగారింటనుండెడిది. అది నా సంకల్పమున సాధకులననుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలిపొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమి పైపొరలలో  నుండి కూడా ప్రయాణించగలదు. శంకరభట్టూ! నీవు రచించెడి శ్రీపాద శ్రీవల్లభ చరితాంరుతము తెలుగు ప్రతిలోని జయసంఖ్యారూపమైన పదునెనిమిదవ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ ఘంట తిరిగి పీఠికాపురము చేరును. ఈ ఘంట అనేక ఆకారములు మారి, పరిమాణములు మారి నా సంకల్పము ప్రకారము నడచుకొనును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థాన మేర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయజయధ్వానరూపమైన ఘంటను పీఠికాపురము పంపించెదను."

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

Sunday, September 2, 2012

Chapter 18 Part 2

అధ్యాయము 18
రావిదాసును గురించిన వర్ణనము - భాగము 2
భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు

కురుంగడ్డ వైపునకు రావిదాసు పడవనడపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడొకడుండెను. తాను బ్రహ్మజాతికి చెందినవాడయిన కారణమున యితరులు తనపడవలో ఎక్కిన యెడల స్పృశ్యతాదోషము కలుగుననియూ, అందుచేత తననొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవలయుననియూ ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యము చెల్లించవలసియుండునని రావిదాసు పలికెను. నేను మహాపండితుడను. శ్రీపాదులవారి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన యెడల నా విద్వత్తును గమనించి భూరిసంభావననిచ్చును. అద్దాని నుండి నీకు మూల్యమును చెల్లించెదనని ఆ పండితుడు పలికెను. రావిదాసు సరే అనెను. పడవ ప్రయాణము సాగుచుండెను. మాటల సందర్భమున రావిదాసుకు పురాణేతిహాసముల గూర్చి కూడ ఏమియునూ తెలియదని పండితుడు గమనించి, ఓయీ! నా జన్మ చరితార్ధము. పురాణేతిహాసముల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానము లేని నీ జన్మ నాలుగింట మూడు వంతులు వ్యర్ధమనెను. రావిదాసు మిన్నకుండెను. నదీప్రవాహము మిక్కుటముగానుండెను. దానికి తోడు పడవలో రంధ్రముపడి నీళ్ళు పడవలోనికి రాసాగెను. అయ్యా! మీకు ఈతవచ్చునా? అని రావిదాసు అడిగెను. పండితుడు ఈత రాదనెను. అంతట రావిదాసు, నాకు ఈతవచ్చును, మీకు ఈతరాదు అందువలన మీ జీవితము నూటికి నూరుపాళ్ళు వ్యర్ధమే అనెను. రావిదాసు శ్రీపాదవల్లభుల నామమునుచ్ఛరించుచూ నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీమధ్యమున గోచరించెను. అది అంతయునూ శ్రీపాదులవారి మహిమయని రావిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్యహస్తమేదో ఆ నీటినంతనూ బయటకు పారబోయుచుండెను. ఇద్దరునూ శ్రీపాదులవారి దర్శనమునకు వచ్చిరి. రావిదాసు యింతకు పూర్వము శ్రీపాదులవారికి ఎప్పుడు నమస్కరించిననూ వారు నిర్లక్ష్యధోరణితో తిరస్కరించుచుండిరి. కాని యీనాడు మాత్రము రావిదాసు నమస్కరించినపుడు ప్రసన్నవదనముతో మందహాసము చేసిరి. రావిదాసుతో వచ్చిన పండితుని మాత్రము నిర్లక్ష్యముగా చూసిరి. శాస్త్రచర్చను కోరిన పండితుడు నోటిమాటరాక నిలుచుండెను. శ్రీపాదుల వారు, "ఓరీ! పాండిత్యగర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడవై యుండి, సద్వంశమున జన్మించి పుణ్యమును సముపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టు కొనుచుంటివి. కట్టుకున్న మహాయిల్లాలును క్షోభపెట్టితివి. సుఖముగా కాపురము చేసుకొనుచున్న ఒకానొక రజకుని ఇల్లాలిని భర్తనుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడుగత్తిగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడుగత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించిననూ మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునేయున్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టుబండ లయినందులకు మానసికముగా చెప్పరాని క్షోభనొందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను యీ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించితిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడియున్నది. నీకు ప్రస్తుతము మరొక మూడు వర్షములు ఆయుష్షును ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయినయెడల నీ కర్మకు నిన్ను వదిలివేసెదను. నీవు పండితుడవే! సందేహము లేదు, నీ విద్వత్తునకు సంభావన నీయమందువా? లేక మరో మూడు వర్షములు ఆయుష్షును యీయమందువా? తక్షణమే సమాధానమీయవలసినది." అని అడిగిరి. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదులవారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటి మాటరాక మూగవానివలె నుండెను. వాని హృదయములో తన ఆయుష్షును పెరుగవలెననెడి కోరిక యుండెను. కాని నోటమాటరాలేదు. శ్రీపాదుల వారే "నీ హృదయమునందలి కోరికననుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను. నీవు ఉంపుడుకత్తెగా చేసుకున్న రజకవనిత వచ్చే జన్మములో నీ భార్య కావలసి ఉన్నది. కాని యీ జన్మములోనే ఆమెను నీ దానిగా చేసుకుంటివి. ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమమును ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములనుభవించెదరు. నీవు నపుంసక జన్మనొంది ఆ రజకవనితకు సేవలు చేయుచూ కర్మఫలముననుభవించెదవు. నీవు యీ మూడు వర్శములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్నవస్త్రములకు లోటులేకుండా రజకవనిత వద్ద సేవచేసుకొనెదవు. దుష్కర్మలనాచరించిన రజక దంపతుల సేవచేయుచూ శ్రమకు తగ్గ ఫలితము లేక నానా యాతనలను అనుభవించెదవు. మరణము నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రావిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాద్దత్తావతారమైన నన్ను సేవించు కొనగలడు. నీవు శీఘ్రముగా ఈ పుణ్యభూమినుండి వైదొలగవలసినది." అని ఆజ్ఞాపించిరి. ఆ పండితుడు వెడలిపోయెను. రావిదాసు శ్రీపాదులవారి దుస్తులను ఉతుకుటయూ, ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరచుటయూ మొదలగు సేవలను చేసుకొను చుండెను.

శ్రీపాదులవారు నదీస్నానానికి వచ్చినప్పుడల్లా రావిదాసు శ్రీగురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసుకొనెడివాడు. శ్రీపాదులవారు ప్రసన్నవదనముతో వాని నమస్కారములను స్వీకరించెడివారు. రావిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదులవారు సర్వాంతర్యామి గనుక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందలమంది చేత నమస్కరించబడెడి మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పియుండెను. అయితే యీ నమస్కారములను వారు అంగీకరించినపుడు మాత్రమే ఈ మహాయోగము కలుగుననికూడా తన తండ్రి చెప్పియుండెను. రావిదాసు తన నమస్కారములను శ్రీపాదులవారు అంగీకరించుటవలన అమితానందముతో నుండెను.

రావిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతీజనముతో కలసి జలక్రీడలాడుటను గాంచి తను గూడా మహారాజు జన్మనెత్తిన బాగుండునని మనస్సున తలంచెను. శ్రీపాదులవారు నదీ స్నానమునకు పోవునపుడు వారితో సంభాషించు సందర్భమున ఈ విషయము చర్చకువచ్చి, రావిదాసునకు యవనవంశమందు వైడూర్యనగరమున జన్మించునట్లు వారు వరదానమొసంగిరి. తాము నృశింహ సరస్వతీ అవతారమందు వానికి దర్శనభాగ్యమి చ్చెదమని అభయమొసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రావిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రములకు అగుపడెడి యీ వింతదృశ్యములను చూచుచూ నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని.

నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదులవారు నా వంకచూసి మందహాసము చేసిరి. క్షణక్షణ లీలావిహారి అయిన శ్రీగురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము?

ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులయిన తమ భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమయిన వరులను కోరి అచ్చటికి వచ్చిరి. వారందరికీ శ్రీగురుదేవులు పసుపుకొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరునూ మహాదానందముతో అచ్చట నుండి వెడలుచుండిరి.

వల్లభేశునకు శ్రీపాదుల కృపతో అక్షయపాత్ర అనుగ్రహము

ఇంతలో ఒక యువబ్రాహ్మణుడు అచ్చటికి వచ్చెను. ధూళిదూసరిత దేహముతో నుండెను. అతడు కాశ్యపస గోత్రీకుడు. ఆపస్తంబసూత్రుడు. వల్లభేశ్వరశర్మ అనునది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారము నుండి వచ్చినవాడు. శ్రీపాదులవారు పీఠికాపురమునందలి తన ఆత్మీయులను పేరుపేరునా అడిగి వారి క్షేమసమాచారములను తెలిసికొనెను. సర్వజ్ఞులయినవారికి యిది ఒకరకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్నభిక్షకు ఎందరెందరో భక్ష్యభోజ్యములను తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తమ దివ్యహస్తములను పైకిచాచిరి. ఒక పెద్ద వెండిపాత్ర నిండుగా 'ఖీర్' అనబడు పాయసమందుండెను. అచ్చట సమావిష్టులయిన శిష్యగణములకు దాని పంచిపెట్టవలసినదని శ్రీపాదులవారు నన్ను ఆదేశించిరి. ఎంతమందికి పంచిననూ పాత్రయందు పాయసము మాత్రము నిండుగానే ఉండెను. తనశిష్యులు తెచ్చిన భక్ష్యభోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించిరి. ఈ కార్యము రావిదాసుకు అప్పగించబడెను. నదిలోని జలచారములకు కూడా స్వామిప్రసాదము వితరణ గావించబడెను. శ్రీపాదులు వల్లభేశుని తమదగ్గర కూర్చొనమనిరి. వల్లభేశుని ప్రక్కనే నేను కూర్చొంటిని. నా ప్రక్కన సుబ్బణ్ణశాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చొండెను. ఒక బీదబ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధమును కుదర్చమని స్వామిని ప్రార్థించెను. అంతట శ్రీపాదులవారు "నేనుండగా నీకు భయమెందులకు? పాపము ఉన్నచోటనే భయముండును. ఈ వల్లభేశుడే నీకు అల్లుడు. సుబ్బణ్ణశాస్త్రి పౌరోహిత్యము వహించును. వల్లభేశుని పితృదేవతలు చాలా ఆగ్రహముగా నున్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాదికర్మలు, సభక్తికముగా చేసెడి పిండప్రదానములు మాత్రమే వారికి చేరును. అన్యధా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహమంత్రములను చదువవలెను. మాంగల్యభాగ్యము కొరకు పసుపుకొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మీకండిన ప్రసాదము మహాదుర్లభమైనది. పీఠికాపురమునందలి మల్లాదివారు, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు, వత్సవాయివారు నాకు నైవేద్యముగా పాయసమును చేసిరి. దానినే నేను మీకు పంచితిని. బ్రహ్మరాక్షసులు, మహాపిశాచాములు, అను మహాదుష్టశక్తుల వలన పీడింపబడువారికి తక్షణమే యీ ప్రసాదము వలన బాధానివృత్తి కలుగును. దారిద్ర్య దుఃఖములో మ్రగ్గెడివారికి యీ ప్రసాద స్వీకరానంతరము సంపద అభివృద్ధి చెందును." అని తెలిపిరి. ఈ దివ్యభాషణము చేయుసందర్భమున శ్రీపాదులవారి చెక్కిళ్ళ నుండి అశ్రువులు జాలువారినవి. డగ్గుత్తిక చెందిన గొంతుతో శ్రీపాదులవారు "మల్లాదివారి, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి, వత్సవాయి వారి వంశములతోను నాకున్న   ఋణానుబంధము కాలాతీతము. వారి వాత్సల్యభక్తికి నేను పరవశించెదను. నాకేదయినా తినుటకు దొరకునేమోయని నేను వారి వంటయిళ్ళలోనికి సూక్ష్మరూపములో యధేచ్ఛగా పోవుచుందును. వారే కాదు! ఎవరయిననూ సరే నన్ను వాత్సల్యభక్తితో ఆరాధించిన వారి యిండ్లయందు నేను పసిబాలుడనై తిరుగుచుందును. నా అడుగుల సవ్వడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళలయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరునూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచాములు మహా ఆర్తితో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మ్రింగివేసి వాటికి నవ్యములయిన విముక్తదేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్యశక్తులు, మహాపదార్ధమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందు కొరకై వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధులలో నున్న మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు. మీరు ఆనందముగా ఏరు దాటిపోవలసినది. నా ఆజ్ఞ అనుల్లంఘనీయము." అని ఆజ్ఞాపించిరి.

మేము ఏరుదాటి యీవలి ఒడ్డున ఉన్న పల్లెను చేరితిమి. కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బణ్ణశాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహమంత్రములే తెలియునుగాని, ప్రేతసంస్కారకర్మల గురించి, ఆయామంత్రముల గూర్చి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి విననూలేదు, కననూలేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బణ్ణ బ్రహ్మ స్థానమున కూర్చుండెను.అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను. అది సుబ్బణ్ణకే ఆశ్చర్యము! ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహమంత్రములతో వారికి వివాహము జరిపించబడెను. మంగళసూత్రమునకు బదులుగా పసుపుకొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు. వరుడు కూడా నిర్ధనుడే. వివాహసందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధముగా జరుగక పోవుటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేశునకు తల్లియు తండ్రియు కూడ లేరు. కన్య తల్లిదండ్రులును, వరుడును, పురోహితుడును, నేనును కలిపి అయిదుగురుము మాత్రమే! ఆ తరువాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదులవారి దర్శనమునకు పోయితిమి. శ్రీస్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందపరచిరి. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసినదని వారు శలవిచ్చిరి. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేశుని భవిష్యత్తు గోచరించెను. వల్లభేషుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చిన యెడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేషధనమును సంపాదించెను. అయితే మ్రొక్కు తీర్చుటకు వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదులవారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్తరూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రమున్నవి. అతడు ధనమును తీసికొని కురుంగడ్డకు వచ్చుచుండగా నలుగురు దొంగలు యాత్రికులవేషమున యితనితో కలసి వచ్చి వల్లభేశుని వధించినారు. అతడు తన తల నరకబడు సమయములో శ్రీపాద వల్లభులను స్మరించెను. శ్రీపాడులవారు త్రిశూలధారి అయిన యతిరూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించెను. నాలుగవవాడు తానెన్నడు దొంగతనం కూడా చేయలేదనియూ, ఈ ముగ్గురు దొంగలును మార్గమధ్యంలో తనని కలిసినారనియూ, ప్రలోభపరచెడి వారి మాటలకు లోనయి వారితో కుమ్మక్కయినాననియు, తనను రక్షించవలసినదనియూ, వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి, కొంచెం విభూతిని ప్రసాదించి, వల్లభేశుని శరీరంపై చల్లమనియూ, వాని తలనూ, మొండెమునూ అతికించ వలసినదనియూ  ఆజ్ఞాపించిరి. శ్రీవారి అమృతదృష్టి వలన వల్లభేశుడు పునరుజ్జీవితుడయ్యెను. ఆ దొంగావలన జరిగిన వృత్తాంతమంతయునూ వల్లభేశుడు తెలిసికొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శనభాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేశుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేశుడు తన తప్పు తాను తెలిసికొనెను. వేయిమ్రంది బ్రాహ్మణ్యమునకు అన్నసంతర్పణ చేయుశక్తి తనకు చాలాకాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్థోమతలో నాలుగువేల మందికైననూ సునాయాసముగా అన్నసంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి యిక్కట్లను కొనితెచ్చుకొన్నందులకు ప్రతిగా నాలుగువేల మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్నసంతర్పణ చేయించెను.

(ఇంకా ఉంది...)