Wednesday, December 7, 2011

Chapter 9 Part 3

అధ్యాయము 9
కర్మఫల మీమాంస - భాగము 3

అంతట నేనిట్లంటిని. "అయ్యా! నాకొక సందేహము కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చినారు గదా! వాటికి నియమ ఉల్లంఘనము కాకుండా శ్రీపాదుల వారు కర్మధ్వంసము నెట్లు చేసెదరు?"

సద్గురువులకు, సత్పురుషులకు, యోగులకు చేసిన దానధర్మముల ఫలితము

తిరుమలదాసు యిట్లనెను. "శ్రీకృష్ణుడు కర్మఫలితములను అనుభవింపవలెననే చెప్పెను గాని జాగ్రదావస్థలోనే వానిని అనుభవింపవలెనని చెప్పలేదు. వాని స్వప్నావస్థలో కూడా అనుభవింపవచ్చును. భౌతికముగా శరీరముతో అనుభవించవలసిన పది సంవత్సరముల కర్మమును మానసికక్షోభవలననో, స్వప్నములలోని మానసిక బాధలవలననో, కొద్ది ఘడియలలో అనుభవించి రాహిత్యమును పొందవచ్చును. సత్పురుషులకు, యోగులకు దానధర్మములు, సేవలు చేయుటవలనను, దేవతా కైంకర్యములు చేయుట వలనను కూడ పాపకర్మ క్షయమగును. దేవతామూర్తులు పుణ్య స్వరూపములు. వాటికి కైంకర్యములు చేయుట వలన మనపాపము వాటికి ఆపాదింపబడి, వాటి పుణ్యము మనకు ఆపాదింపబడును. పున్యమూర్తులకు దానధర్మములు, సేవలు చేయుటవలన ధ్యానశక్తి మధ్యమమున బదలాయింపు జరుగుచుండును. సద్గురువు తన శిష్యుని నుండి సేవలను గైకొని, ఆ సేవామధ్యమమున శిష్యుని పాపకర్మలను తానూ స్వీకరించి తన తపఃఫలమును శిష్యునికి సంక్రమింపజేయును. పాపఫలమును ఎవరో ఒకరు అనుభవింపక తప్పదు. అయితే దేవతామూర్తులు, అవతారపురుషులు మహాతేజోమూర్తులు గనుక, వారు అగ్ని స్వరూపులు కనుక, తాము స్వీకరించిన పాపకర్మములను వారు దగ్ధము కావించగలుగుదురు. వారికి మనము పత్ర, ఫల, పుష్పాదులు సమర్పించిన కూడా మన పాపకర్మములు, వారి పుణ్యరాశి పరస్పరము బదలాయింపు జరుగుచుండును. మన ఆర్తి, భక్తి, శరణాగతి ఎంత తీవ్రముగ నుండిన యీ బదలాయింపు కూడ అంత తీవ్రస్థాయిలో జరుగుచుండును. ఒక్కొక్క పర్యాయము తన ఆశ్రితుల పాపకర్మములను నిర్జీవ పదార్ధములయిన రాళ్ళు, రప్పలు మొదలగు వానికి శ్రీపాదుల వారు బదలాయించుచుందురు. ఆ రాళ్ళు, రాప్పాలను కొట్టుట ద్వారాను, రకరకముల చిత్రమార్గాముల ద్వారాను వారు ఆ కర్మఫలమును ధ్వంసము చేయుచుందురు. దీనికి నీకు ఒక చిన్న దృష్టాంతమును చెప్పెదను. శ్రద్ధగా వినుము.

శ్రీపాదులవారు పుట్టినప్పటి నుండి వారికి పాలసమస్య ఉండెడిది. సుమతీమహారాణికి తన బిడ్డకు కావలసినంత క్షీరధారలు లేకుండెను. వారి యింట ఒక ఆవు ఉండెడిది. వారింటనున్న కాలాగ్నిశమనదత్తునకు నైవేద్యముగా పెట్టుటకు స్వల్ప క్షీరము మాత్రము అవసరమగుచుండెడిది. ఆ ఆవు కేవలము ఆ స్వల్ప క్షీరమును మాత్రమే ఇచ్చుచు, గోవత్సమునకు మాత్రము సంపూర్తిగా క్షీరము నిచ్చుచుండెను. అదియొక వింత ప్రవృత్తిగానుండెను.

కాలాగ్నిశమన దత్తునికి నైవేద్యముగా నుంచిన ఆ స్వల్ప క్షీరమును, ఒక్కొక్కపరి శ్రీపాదులవారు నైవేద్యమునకు ముందే రహస్యముగా పూజా మందిరమున చొరబడి త్రాగెడివారు. అట్టి దినమున శ్రీ అప్పలరాజశర్మ గారు దత్త ప్రభువునకు బెల్లం ముక్క నైవేద్యము నిడి నిరాహారముగా నుండెడిది. ఒకవేళ నైవేద్యము పర్యంతము వరకు ఆగిన యెడల శ్రీపాదుల వారే ఆ క్షీరమును త్రాగెడివారు. తమ వంశములోని ఇంతటి అపూర్వ దివ్యశిశువునకు చాలినంత క్షీరమును కూడా యివ్వలేని స్థితిలో నున్నందుకు తల్లిదండ్రులు ఎంతయో విచారించెడివారు. సమృద్ధిగా క్షీరమును యివ్వగల ఆవును శ్రీ అప్పలరాజుశర్మ గార్కి యివ్వవలెనని వెంకటప్పయ్య శ్రేష్ఠియు, నరసింహవర్మయు అనేక ప్రయత్నములు చేసిరి. కాని అవి అన్నియునూ వ్యర్ధమాయెను. అప్పలరాజుశర్మ ఎత్తి పరిస్థితులలోను దానమును స్వీకరించరు. అది ఆయన వ్రతము. దాన స్వీకరణమువలన పాపము చుట్టుకొనునని వారి అభిప్రాయము. వారు వేదపండితులు గనుక వేదసభలేమయినా జరిగినచో వేదసంభావనను మాత్రమే స్వీకరించెడివారు. వారికి పౌరోహిత్యమువలన రాబడికూడా తక్కువ. వారు కేవలము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికిని, నరసింహవర్మ గారికిని మాత్రమే పౌరోహిత్యము చేసెడివారు. వారిరువురూ, సామాన్యముగా పురోహితులకు ఇచ్చు ద్రవ్యముకంటె ఎక్కువగా యిచ్చెడి సాహసముచేసిన అప్పలరాజుశర్మ గారు కోపగించుకొనువారు. అప్పలరాజుశర్మగారు తమ మామగారైన సత్యఋషీశ్వరులనుండి కూడా ఏమియునూ స్వీకరించెడివారు కారు. కార్తీకపౌర్ణమి నాడు సుమతీమహారాణి పుట్టినరోజు. ఆ రోజున మాత్రము బాపనార్యుల యింట భోజనము చేసెడివారు. అట్లే తమ జన్మదినమైన వైశాఖ శుద్ధతదియ తోజున మామగారింట  భోజనము చేసెడివారు. కాలక్రమమున శ్రీపాద జయంతి అయిన గణేశ చతుర్ధినాడు కూడా బాపనార్యుల యింట భోజనము చేసెడివారు.

కుటుంబము యొక్క యీ దు:స్థితిని తలంచుకొని సుమతీ మహారాణి ఒకనాడు భర్తతో, "నాథా! మా పుట్టినింటివారు స్థితిపరులే కదా! పైగా వారు కూడా నిష్టాగరిష్ఠమైన శ్రోత్రియసంస్కారముల వారు. శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవునొకదానిని స్వీకరించుటలో నాకు దోషమేమియును కనబడుటలేదు. శ్రీపాదునికి కడుపునిండుగా క్షీరమును కూడా యివ్వలేని స్థితిలో నున్నాము. మీరు సావధానముగా ఈ విషయమును ఆలోచించవలసినదిగా నా మనవి." అనెను. అంతట అప్పలరాజుశర్మ యిట్లనెను. "సౌభాగ్యవతీ! నీవు చెప్పేది విషయము బాగుగనే యున్నది. సత్య ఋషీశ్వరులు పాపరహితులు కావున వారి నుండి గోవును స్వీకరించుట వలన దోషమేమియు నుండనేరదు. కాని ఈ విషయమున ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యావశ్యకము. శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలా మంది తెలిపియున్నారు. శ్రీపాదుని జననమునకు పూర్వము నుండియూ యిప్పటివరకు అత్యంత ఆశ్చర్యకరమయిన విషయములు నడచుచున్నవి. ఇది దత్తుని యొక్క నవావతారమే అయిన యెడల మనయింటనున్న గోమాతయే సమృద్ధిగా క్షీరము నీయవచ్చును గదా, లేదా నీకు క్షీర సమృద్ధి కలుగజేయవచ్చును గదా. అదియును గాక పెద్దవాడయిన శ్రీధరరాజశర్మ అంధుడిగాను, చిన్నవాడయిన రామరాజశర్మ కుంటివాడు గానూ ఉన్నారే! శ్రీపాదుడు వారిద్దరునూ అంగవైకల్యము నుండి విముక్తులుగా చేయవచ్చును గదా. నీవు ఈ విషయము నీ నాయనతో చర్చిన్పుము, లేదా శ్రీపాదుడనే అడుగుము. వచ్చి వచ్చి నా నియమము ఉల్లంఘింపబడి తీరవలసిన విషమ సమస్యను దైవము నాకు సృష్టించుట ఉచితముకాదు."

సుమతీ మహారాణి యీ విషయమును తన తండ్రికి నివేదించెను. బాపనార్యులు మందహాసముతో యిట్లనిరి. "అమ్మణీ! ఇది అంతయును శ్రీపాదుని విలాసమే. శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించుటలోనే గాక సమస్యలను సృష్టించుటలో కూడా నేర్పరి. శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగదృష్టితో గమనిన్చితిని. మనయింట గోసమృద్ధి యున్నది. గోవునిచ్చుటకు నాకు సమ్మతమే గాక మహదానందప్రదము. దత్తప్రభువునకు గోక్షీరము అత్యంత ప్రీతిపాత్రము. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రము యొక్క ఆమోదము ఆవశ్యకమే! ఆహా! ఏమి విధివైపరీత్యము! మామ నుండి సొత్తును ఏ విధముగా చేజిక్కించుకొనవలెనోయని పరిపరివిధముల ప్రయత్నించు జామాటలు లోకమున లెక్కకు మిక్కుటముగానున్నారు. అయిననూ నా అల్లుడు మాత్రము అగ్నిహోత్రముతో సమానము. అతని నియమమును భంగపరచయత్నించిన మనము వెఱ్ఱివాళ్ళమగుదుము. సృష్టియందలి పంచభూతముల నుండి స్పష్టమైన ఆమోదము లభించినగాని నీ భర్త యీ గోదానమును స్వీకరింపడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరినీ అంగవైకల్యము నుండి విముక్తులను చేసినచో మీ కుటుంబముతో తనకున్న ఋణానుబంధము తెగిపోవును. ఋణవిముక్తుడైన దత్తుడు మీ యింట బిడ్డగానుండజాలడు. జగద్గురువై లోకమునుద్ధరించుటకు బయల్వెడలెను. అందువలన పొరబాటున కూడా నీవు శ్రీపాదుని, వారి సోదరుల అంగవైకల్యము పోగొట్టుమని కోరకుము. సర్వమునూ కాలాధీనమైయున్నది. ఆ కాలము శ్రీపాదుని అధీనమై యున్నది. శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీరసమృద్ధి కలిగితీరును. అయితే శ్రీపాదునితో నీకు ఋణానుబంధము నశించును. ఋణవిముక్తుడైన యీ దత్తప్రభువు మన కుటుంబములకు పరిమితుడుగాక విశ్వగురుత్వము వహింప గృహము నుండి పలాయనము చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీరసమృద్ధమై, తన వింత ప్రవృత్తిని విడనాడి క్షీరము నొసంగును. అప్పుడసలు యీ సమస్యయే తలెత్తదు. కావున నీవు కొంతకాలము ఓరిమి వహించుము. దత్తుడు కల్పించిన యీ విషమసమస్యను దత్తుడే పరిష్కరించును." అని తెలిపెను. 

అంతట శంకర భట్టు "అయ్యా! శ్రీపాదుల వారి అన్నలిద్దరునూ అన్గావైకల్యముతో జనించుటకు గల కారణమేమి? దానికి కుటుంబపరమైన కర్మదోషములున్నవా?" అని ప్రశ్నించెను.

అంతట తిరుమలదాసు యిట్లనెను. "నాయనా! శ్రీ దత్తాత్రేయులవారు సాయంసంధ్యలో అవతరించిరి. శ్రీపాదులవారు ఉషఃకాలమున అవతరించిరి. రాబోవు శ్రీ నృసింహ సరస్వతి అవతారము మిట్టమధ్యాహ్నము అభిజిలగ్నమునందు జరుగును. దత్తలీలలు అగాధములు. సాయంసంధ్య తరువాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో నుందురు. కావున దత్తావతారము యోగసాధనలలోని పరిణామక్రమములో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖనిద్ర పుచ్చినది. ఎటు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో, పరిణామము యొక్క ఏ దిశలో కదలవలెనో జీవులకు అంతుబట్టని గాఢ అంధకారము. జీవులకు తెలియకుండగనే వారిలో పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నమును చేయకయే లేదా స్వల్ప ప్రయత్నము చేతనే వారికి తెలియని రీతులలో అంతశ్చైతన్యము యొక్క అగాధ లోతులలోనుంచి పరిణామము వైపునకు పయనించిరి. ఇది కేవలము ఒక్క భూమండలమునకే పరిమితము కాదు. 

శ్రీపాదుల వారి ఆగమనము ఉషఃకాలమున జరిగినది. ఉషస్సునందు సూర్యభగవానుని సమస్త శక్తులును ఒక్కసారి విజ్రుంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మా సూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములయిన శక్తులు జాగృతమై వివిధ గతులలో నాట్యమాడుచూ అనంత వైవిధ్యములో పరిణామము నొందుటను ఇది సూచించును. మధ్యందిన మార్తాండుడు చండ ప్రచండమైన స్వరూపము. ఆత్మసూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదజల్లుచూ జీవులను జాగృతము చేయుట నృసింహ సరస్వతి అవతార ప్రయోజనము. ఈ విషయములు వారియొక్క విశ్వవ్యాప్త చైతన్యమునకు సంబంధించిన విషయములు. 

దత్తావతారమునకును, శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు మధ్య సమయమున కాళరాత్రి నడచినది. అది కేవలము మహా అంధకార స్వరూపము. దానికి ప్రతీకగా పెద్దన్నగారయిన శ్రీధరరాజశర్మ జన్మించిరి. ఆ రాత్రి గడచిన తదుపరి ఉన్న స్థితి సంశయములు, నాస్తిక వాదములు, కుతర్కములు, వక్రభాష్యములు వగైరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నన్నగారయిన శ్రీరామరాజశర్మ జన్మించిరి. ఏ జీవి అయిననూ, మహాంధకార సదృశమైన తమస్సును విడనాడి, కుతర్కములు, శంకలు, వక్రభాష్యములు మొదలయిన వాటితో కూడిన మనశ్చాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము పొందగలరు. ఇదియే దీనిలోని రహస్యవిషయము. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. 

(ఇంకా ఉంది..)               

Chapter 9 Part 2

అధ్యాయము 9 
కర్మఫల మీమాంస - భాగము 2 
శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన వారి దర్శనము లభించును.

మూడు అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచూ, వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యులను చేసెదరు. మానవుడు పతనమగుటకు లక్ష మార్గములననుసరించిన యెడల, వానిని ఉద్ధరించుటకు దైవము పదిలక్షల మార్గముల ననుసరించును. శ్రీదత్తప్రభువు తన అంశావతారములచేతను, సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధులద్వారాను ఈ సృష్టిపాలనము చేయుచుందురు. 

పూర్వయుగములందలి శ్రీదత్తులవారేనా ఈ శ్రీపాదులవారు అను స్వల్పసంశయము నీ మనసులో బీజరూపమున ఉన్నది. దానిని నివారణ చేయుటకే శ్రీపాదులవారు నైవేద్యరూపముగానున్న శనగలను లోహపు శనగలుగా మార్చిరి. అనసూయా మాత లోహపుశనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమీ అలనాటి దత్తుడనేనని గుర్తుచేయుటకే వారిట్లు చేసిరి. దీనిలో ఇంకొక రహస్యార్ధము కూడ ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బుస్థానములోనున్నాడు. గురుగ్రహమునకు శనగలతో సంబంధమున్నది. గురుగ్రహము వలన నీకు సంభవింపదలచిన విపత్తులు బీజరూపములో నున్నవనియు, వాటిని ఎంతమాత్రము మొలకెత్తుటకు వీలులేని లోహస్వరూపముగా మార్చితిననియు, శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియజేసినారు. శ్రీపాదుల వారు తమ దివ్యమానసములో వీక్షించని వస్తువు ఏదియూ ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్యమానసములో వీక్షించనిజీవి ఏదియూ ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమసత్యము. సత్యవస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్టితమై యుండుట వలన ఆ జ్ఞానమును పొందినవారందరూ ఈ లోకమునుండి అంతర్థానమైననూ నష్టము వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చునపుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులయిన మునులు, అవతారపురుషులు అందరునూ అవినాశ తత్త్వమునకు చెందినవారు. మానవులు వినాశతత్త్వమునకు చెందినవారు. అవినాశతత్త్వము యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధముగా ఉండితీరవలెననెడి నియమమేదియునూ లేదు. య్యది స్వేచ్చాతత్త్వము. అది పరిపూర్ణము. అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంతనవీనము. కారణములేని కార్యము జరుగుటకు వీలులేదు. సర్వకారణములకునూ, సర్వకార్యములకునూ ఏకైకతత్త్వమే ఆధారము. అది అన్నింటికినీ అతీతము. అదియే దత్తతత్త్వము. ఆ దత్త ప్రభువు తన సంపూర్ణకళలతో కలియుగమున ప్రప్రథముగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురములోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు వేయిశిరస్సులు కలిగిన ఆదిశేషునకు కూడా అసాధ్యము. 

నాయనా! శ్రీపాదవల్లభులు తరచుగా తాము శ్రీనృశింహ సరస్వతిగా అవతరించెదమని సెలవిచ్చి యున్నారు. హిరణ్యకశపుడు అతి విచిత్రములయిన వరములను పొందెను. వాడు మరణించుట అసాధ్యమని అనిపించును. అయినాను ఇచ్చిన వరములకు భిన్నముకాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీ నరసింహావతారము హిరణ్యకశ్యపుని హతమార్చినది. పరమభక్తుడయిన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభములో కోడా తన స్వామీ ఉన్నాడని వచించెను. స్వామీ స్తంభము ద్వారా ప్రకటితమయ్యెను. అసలు దైవము ఉన్నాడా? లేడా? అను సంశయములు కలియుగములో మెండుగా నుండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదమునణచుటకును, ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకును శ్రీదత్తప్రభువు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని ఋజువు చేయుట నరసింహావతార విశిష్టత, దైవదూషణ చేయువారి మదమునణచుట, దైవభక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట - అను రెండు ప్రధాన ఉద్దేశ్యములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులునూ, శ్రీ నృశింహ సరస్వతియునూ, శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు ఏమియూ లేవు. 

తిరుమలదాసు యీ విధముగా చెప్పుచుండగా నా మనసున ఒక సందేహము వచ్చినది. నేను భూర్జపత్రములమీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును వ్రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వాటిని వ్రాయుదురో గదా! శాలివాహన శకములో ప్రస్తుతము వ్యవహారము జరుగుచున్నది. భవిష్యత్తులో హూణశకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదులవారు శలవిచ్చిరట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? యీ కలియుగము ఏ రోజున ఎన్ని ఘటికల, ఎన్ని విఘటికలకు ఆరంభమైనది. భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణనము ప్రకారము, భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రము మీద శ్రీపాదులవారు ఏ విషయములను వ్రాసియిచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవల దత్తవతారముగా నమ్మెదను.

నాలోని ఈ సందేహములను తిరుమలదాసుకు చెప్పకుండగా నేను మధ్యమధ్యలో వారు చెప్పుదానిని ఆలకించు భంగిమలను కనపరచుచూ, చిరునవ్వును నవ్వుచూ ఆ లోహపు శనగల వైపు చూచుచుంటిని. 

ఇంతలో తిరుమలదాసు గొంతుక బొంగురు పోయెను. మాట మాట్లాడుటకు శక్తి లేకపోయెను. శ్రీపాదులవారి చరిత్రము నాలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని. ఆ భయంకర ధ్వనిని విన్న తరువాత నాకు ఏ శబ్దములునూ వినలేనంతటి బ్రహ్మచెముడు సంప్రాప్తించినది. 

ఆహా! క్షణములో నేను చెవిటివాడు గాను, తిరుమలదాసు మూగవాడు గాను మారిపోయితిమి. తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్ననూ మాట వచ్చుటలేదు. నేను వినదలచుకొన్ననూ ఎంతటి చిన్నధ్వని కూడా వినిపించుటలేదు. అపుడు నేనిట్లు నా మనసులో చింతించితిని. "రాకూడని సంశయము నాకు వచ్చినది. పర్యవసానముగా చెముడు సంప్రాప్తించినది. కొంపదీసి ఇది నాకు శాశ్వతముగా వచ్చిన బధిరత్వముగాని కాదుగదా! హా! హతవిధీ! యిపుడేమి చేయవలెను?"

ప్రసాదముగా ఉంచబడి లోహపుఖండములుగా మారిన శనగలు 
"శ్రీపాద రాజం శరణం ప్రపద్యే" అను ఆకారములో నిల్చుట 

ఇంతలో నైవేద్యము కొరకు ఉంచబడి లోహఖండములుగా మారిపోయిన శనగలు ఆంధ్రభాషలో "శ్రీపాద రాజం శరణం ప్రపద్యే" అను ఆకారములో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్నపత్రము కానవచ్చెను. మేము చూచుచుండగనే అది పెద్దదగుచుండెను. అది దీర్ఘచతురస్రాకారముగా తయారయ్యెను. భూర్జపత్రము కంటె చాలాచాలా తక్కువమందము కలిగియుండెను. అది ముట్టుకొనినపుడు మృదువుగానుండెను. నలుపురంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరముగా లిఖింపబడుచుండెను. అవి యీ రకముగా లిఖింపబడెను. లిపి తెలుగుభాషలో నున్నది. "శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వము 3102 వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 18 వ తేదీన రాత్రి సమయమున 2 గంటల 27 నిమిషముల 30 సెకండ్లు. ఇది ప్రమాదినామ సంవత్సర చైత్రశుద్ధపాడ్యమి, శుక్రవారము, అశ్వినీ నక్షత్రము. శ్రీకృష్ణ నిర్యాణానంతరము కలి ప్రవేశించినది."

నాకు ముచ్చెమటలు పోయసాగినవి. నా శరీరమునందలి నీరంతయునూ స్వేదరూపమున బయటకు వచ్చుచుండెను. శరీరము కంపము తీవ్రముగానున్నది. శ్రీపాదులవారు అదృశ్యముగా యిచ్చటనేయున్నారని నాకు రూడీయైనది. నా మనమున "ఏమి నా దురదృష్టము? నేను కురవపురమునకు చేరుట కలలోనిమాట! శ్రీపాదుల వారు నరసింహావతారమును ధరించి నన్ను సంహరించిననూ ఆశ్చర్యపోనవసరము లేదు. వస్త్రమును ఉతికి ఆరవేసిన విధముగా శంకరభట్టును ఉతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించిన నేనేమి చేయగలను? ప్రభువు ఆజ్ఞాపించినచో తిరుమలదాసు నన్ను ఖచ్చితముగా బండకేసికొట్టి ఉతికి ఆరవేయును." అని చింతించితిని. ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొను కొంతమంది గురువులు సాధారణంగా, బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములను తమ శిష్యపరమాణువులకు బోధించుచు, ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులనే ఫలానా గురువుచేత ప్రశంసింపబడినాను అను అహముతో శిష్యుడు సంచరించును. ఇట్టి గురుశిష్యులు ఉభయులూ దోష భూయిష్టులే! బ్రాహ్మణ కుల సంజాతుడనైన నాకు, రజక కుల సంభవుడైన తిరుమలదాసుచే బ్రహ్మజ్ఞానమును బోధింపజేయుట శ్రీపాదుల వారి చమత్కారము. పరిసరములనున్నవారు తమ రజకవృత్తిలో నిమగ్నమై ఉన్నవారే గాని యిటువంటి గహనతమమైన విషయములు చర్చించువారు గాని, అవగాహన చేసుకోన గలుగువారు గాని కారు. ఏది ఏమయిననూ నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యము. 

నేను తిరుమలదాసు వంక చూచితిని. అతని ముఖము ప్రసన్నముగా నుండి బ్రహ్మవర్చస్సుతో వేలుగొందుచుండెను. అంతట నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని, మాలిన మనస్కుడయిన నేను రజకుడనని తోచెను. 

నైవేద్యముగా ఉంచబడి లోహరూపమున మారియున్న శనగలు క్రమముగా యధారూపమును పొందినవి. శ్రీపాదులవారు నన్ను మన్నించారని అర్ధము చేసుకొంటిని. మరికొంతసేపటికి తెల్లటిరంగులో నున్న ఆ పత్రము అంతర్ధానమాయెను.

తిరుమలదాసు యిట్లనెను. "నాయనా! శంకరభట్టూ! ఈ కలియుగము లోహయుగము. ఇదంతయునూ కల్మషములతో కూడినయుగము. శ్రీపాదులవారి ఆజ్ఞ మేరకు, నేను శరీరమును చాలించిన తరువాత కొంతకాలము  హిరణ్యలోకమున ఉండి ఆ తదుపరి తిరిగి మరాఠదేశమున శరీరధారిని కాక తప్పదు."

"అయ్యా! శ్రీపాదులవారు మిమ్ములను కూడా శరీర పతనానంతరము మరియొక జన్మకు రావలసినదని ఆజ్ఞాపించిరా? ఆ వృత్తాంతమును శలవిచ్చి నన్ను ధన్యుడచేయవలసినది." అంటిని.

తిరుమలదాసు యిట్లనెను. "ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల యింటికి ఉతికినబట్టలను తీసుకోనిపోయితిని. సుమతీమహారాణి మేనమామ అయిన శ్రీధరావధాన్లు గారు శ్రీపాదులవారినెత్తుకొని ఆడించుచుండిరి. దత్తదిగంబర! దత్తదిగంబర! దత్తదిగంబర అవధూతా! అని వారు పాడుచుండిరి. అపుడు శ్రీపాదులవారు రెండు సంవత్సరముల బాలుడు. వారు కేరింతలుకొట్టుచూ ఆడుచుండిరి. ఆ దృశ్యము నయనమనోహరముగా నుండెను. అంతట నేను శ్రీపాదవల్లభ దత్త దిగంబర! అంటిని. శ్రీధరావధాన్లు నా వైపు చూచిరి. అంతట శ్రీపాదులవారు నృసింహ సరస్వతి దత్త దిగంబర! అనిరి. తాము సాక్షాత్తు దత్త ప్రభువులుగా గతములో అవతరించితిమనియు, ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపై నున్నామనియు, తెరమరుగయిన తరువాత నృసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదులవారు తమదయినా శైలిలో ఈ విధముగా బోధపరచిరి.

సమర్థ సద్గురువే షిరిడీ సాయిబాబాగా అవతరించుట 

శ్రీపాదులవారు, "తాతా! నేను నృసింహ సరస్వతిగా మరాఠదేశమున అవతరించదలచితిని. తిరుమలదాసును కూడా మరాఠదేశమునకు రమ్మనుచుంటిని." అనిరి. శ్రీధరావధాన్ల వారి నోట మాటరాలేదు. అంతట తిరుమలదాసు, "నేను ఎప్పుడు ఏ రూపములో ఏ జన్మములో ఎచ్చటనున్ననూ, నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ." అంటిని. అపుడు శ్రీపాదుల వారు "తిరుమలదాసూ! నీవు మరాఠదేశమున గాడ్గేమహారాజ్ అను పేరుతో రజకకులమున జన్మించెదవు గాక! దీన దళిత దుఃఖితుల సేవలో పునీతుడవయ్యెదవు గాక! ధీశిలానగరమున 'సాయిబాబా' నామమున యవనవేషమున నా యొక్క సమర్ధ సద్గురు అవతారము రానున్నది. నీవు తప్పక యవనవేషమున నున్న నా సమర్ధ సద్గురు అవతారము యొక్క అనుగ్రహమును పొందెదవు గాక! నీకు బాలకృష్ణుని రూపమునందు మక్కువ గనుక 'గోపాలా! గోపాలా! దేవకినందన గోపాలా!' అను నామమును జపించెదవు గాక! నీ మనోనేత్రమునందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను. నీవు ఈ శరీర పతనానంతరము కొంతకాలము హిరణ్యలోకము నందుండి ఆ పైన గాడ్గేమహారాజ్ గా లోకహితార్ధము చేయుము. ఇదే నీకు నా వరము! నా అభయము!" అని నన్ను దీవించిరి.

శ్రీధరావధాన్లు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చిరి. వారికి యిదంతయునూ అయోమయముగా నుండెను. ఇంతలో సుమతీమహారాణి వారి మేనమామను పిలిచెను. వారికి పూర్తిగా మాయ క్రమ్మివుండుటచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలెనే భావించిరి. 

(ఇంకా ఉంది...)                    

Tuesday, December 6, 2011

Chapter 9 Part 1

అధ్యాయము 9 
కర్మఫల మీమాంస - భాగము 1 

ఆనాడు గురువారం. సూర్యోదయ సమయం. గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమలదాసును, నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నటి సూర్యకాంతి కిరణరూపంలో మా గదిలో ప్రవేశించినది. ఆశ్చర్యంలో కెల్లా ఆశ్చర్యం! ఆ సన్నటి సూర్య కిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల రూపాన్ని ఇద్దరమూ చూసినాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగనే మేము ధ్యానము నుండి ప్రకృతిస్థులమైనాము. పరమ పూజనీయము, అత్యంత మంగలప్రదమును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి పదునారు సంవత్సరముల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమప్రభువుల అవ్యాజ కారుణ్యముచేత మాత్రమే! క్షణకాలము దర్శనమిచ్చి ఆ దివ్య మంగళరూపము కనుమరుగైనది. 

శ్రీ ప్రభువుల వారికి నైవేద్యముగా ఉంచిన శనగలు మాత్రము ఆ కిరణ ప్రసారముచే లోహఖండములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యకరమును, బాధాకరముగను కూడా ఉన్నది. శ్రీప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకమనుకొనిన, శనగలు లోహఖండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా? అని మనసులో మధనపడసాగితిని. 

అప్పుడు శ్రీ తిరుమలదాసు యిట్లు చెప్పనారంభించెను. "నాయనా! శంకరభట్టూ! ఈ రోజు మధ్యాహ్నము నా ఆతిధ్యమును స్వీకరించి నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును. శ్రీదత్త ప్రభువుల అనుజ్ఞ అయినది. గురువారము మిట్టమధ్యాహ్న సమయమందు దత్త క్షేత్రములందు దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలము." అంతట నేనిట్లంటిని. "అయ్యా! ప్రతిరోజూ శ్రీదత్తప్రభుని స్మరణతోను, దత్తకథాప్రసంగములతోనూ గడుపుచుంటిమి. ఈ రోజున నైవేద్యము కొరకు ఉంచిన శనగలు లోహఖండములుగా మారుట బాధాకరముగానున్నది. నా సంశయములను బాపి కృతార్థుని చేయ ప్రార్థన.

శ్రీ తిరుమలదాసు యిట్లు చెప్పదొడంగెను. "నాయనా! కొన్ని శతాబ్దముల తరువాత కలియుగము ముదిరిన తరువాత నాస్తికత్వము ప్రబలును. నాస్తికత్వము నిర్మూలించి, ఆస్తికత్వమును తిరిగి నెలకొల్పుటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమయిన లీలలద్వారా జీవులను అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్తప్రభువులు చేయబోవు ధర్మసంస్థాపనా కార్యక్రమములన్నింటికి బీజరూపమును యీ శ్రీపాద శ్రీవల్లభ అవతారములో వారు అనుగ్రహించెదరు. "

ఖనిజములో చైతన్యము నిద్రాణస్థితి. ఖనిజస్థితిలో అంతర్లీనముగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణములో మానసము అంతర్లీనముగా నుండును. ప్రాణరూపములో చైతన్యము అర్ధనిద్రాణస్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టముగా చూడగలవు. మత్తుపదార్థము తీసుకొన్న మనుజుడు తన శరీరమునందు యీ స్థితిని అనుభవించును. ప్రాణశక్తిరూపమున అభివ్యక్తమైన తత్త్వము పరిణామము చెంది వికాసముచెందిన దశలో మనస్సుద్వారా పనిచేయుటను నేర్చుకొనును. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తి వికాసముచెందిన దశలో మనుష్యుదానిపించుకోనును. మనస్సు తనయొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సులో మనస్సునకతీతమైన అతి మానసముండును. అది అంతర్లీన స్థితిలో నుండును. మానవుడు యోగాముద్వారా పరిపూర్ణ మానవుడగును. అతడు మూలాధారమున పడియున్న చైతన్యమును సహస్రారమునకు కొంపోయి సవికల్ప, నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీ గురునితో తాదాత్మ్య స్థితి ననుభవించుచుండును. ఆ స్థితిలో అనిర్వచనీయ ఆనందమును పొండుచుండును. అయితే అతడు మహా సంకల్పముననుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మబంధములంటావు. ఆ మహాసంకల్ప స్వరూపము మాత్రము అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగము కలది. అతిమానసము కేవలము శ్రీ ప్రభువుల వారిది. ప్రతిక్షణము కోట్లకొలది ప్రార్థనలను శ్రీ ప్రభువులు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చెదరు. బాధా నివారణ చేసెదరు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలము చేసెదరు.మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన, వారి అతిమానసము యొక్క వేగము మహాప్రచండము, ఊహాతీత వేగము అయినది. కాన్తిస్వరూపము వేగము కూడా వారి అతిమానస వేగామునకు సరికాదు. మానవుడుగాని, మరేప్రాణిగాని చేయు ఏ చిన్న ప్రార్థన అయిననూ అసంఖ్యాకములయిన వారి తేజః పుంజములను చేరి తీరవలసినదే! సమస్త దృశ్యాదృశ్య శక్తులకునూ వారే ఆధారము. వారి లోకమునందుండు ప్రకాశము వారి తేజోమయ శరీరమునుండి వెలువడే కిరణపుంజమే గాని వేరు కాదు. అది కోటికోటి సూర్యప్రకాశము. అనేక కోటి బ్రహ్మాండముల వెలుగుచున్న కోటానుకోట్ల గ్రహనక్షత్రాదుల సమూహము యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తెజస్సునండు సూర్యుని ముందు దివిటీవలె నుండును. నాయనా! ఇదే శ్రీపాద శ్రీవల్లభ వారి అసలుసిసలు తత్త్వము. అనంతశక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ, నిరాకారస్వరూపము సృష్టియందు తనకుగల అవ్యాజ అనంత కరుణతో సాగున, సాకారముగా మనుష్య రూపములో శ్రేపాదుల వారి రూపములో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వము సిద్ధించవలెను. 

శ్రీపాద శ్రీవల్లభుల దివ్యస్వరూపము 

మానవునిలో దైవము వైపునకు పరిణామము అనివార్యమయినటులనే, దైవము కూడా తనయొక్క అనంత పరిమితులను కుదించుకుంటూవచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగివచ్చుచుండును. దీనినే అవతరణమని అందురు. ఇది నిరంతరముగా జరుగు ఒకానొక యోగప్రక్రియ. సత్యము ఒక్కసారి సృష్టిలో ప్రతిష్టించబడిన యెడల అది స్వతస్సిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయుచుండును. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్టించ సంకల్పముతో వచ్చిన దివ్యభావ్య అవతారము. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతట నేనిట్లంటిని. "అయ్యా! మీతో మాట్లాడుకొలదిని ఎన్నియో కొత్త కొత్త సంగతులు తెలియుచున్నవి. శ్రీ గురుస్వరూపము అంతుచిక్కుటలేదు. వారి యీ దివ్యభవ్య  చరిత్రను ఎట్లు లిఖింపవలెనో, ఏ వ్యాఖ్యానములతో వ్రాయవలేనో తెలియుటలేదు. మీరు సత్యమును ప్రతిష్టించుట అని చెప్పిరి. నేను విగ్రహ ప్రతిష్టలగురించి వింటిని గాని, సత్యమును ప్రతిష్టించుటను వినలేదు. నా యందు దయ ఉంచి వివరించ ప్రార్థన." అంతట తిరుమలదాసు యిట్లనెను. "అయ్యా! శంకరభట్టూ! నీవు శ్రీవారి దివ్యచారిత్రను వ్రాయుటకు సంకల్పింపబడినవాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను, వారు చెప్పు విషయములను లిఖించును. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రము శ్రీవారే శ్రీ లేఖిని ద్వారా వ్రాయించుకొందురు. ఇంతకుమించి నీవు ఆలోచించుట వ్యర్థము."

మానవుడు రకరకముల భోజనపదార్థములను తీసుకోనును. అవి వాటంతట అవియే జీర్ణమై, మానవునికి శక్తి నిచ్చుచున్నవి. ఈ ప్రక్రియయందు మానవుని ప్రమేయముగాని ప్రయోజకత్వముగాని లేవు. మానవుడు భోజనము సంపాదించుకొనుట వరకే వాని బాధ్యతా, ఆ తరువాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరము యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకొనుట అనునది నీకు విధించబడిన కర్తవ్యము. తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించుట శరీరముయొక్క కర్తవ్యము. మానవునికి మనస్సు ఉన్నది గనుక ఎక్కువ స్వాతంత్ర్యము అనుభవించుచున్నాడు కావున తప్పు, ఒప్పు రెండూ చేయు అవకాశమున్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛలేదు. అది తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించవలసినదే! ఇది తిన్నవానికి ఇష్టమున్ననూ, లేకున్నను ప్రయత్నరహితముగా జరిగిపోవు ఒకానొక స్వతస్సిద్ధకార్యము. అనగా శరీరమునకు విధి నిర్ణయించబడినది. దానికి సంబంధించిన సత్యము ప్రతిష్టించబడినది.  సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగను, మన సంకల్పముతో ప్రమేయము లేకుండగను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు, ప్రతిచర్యలు సత్యమును ఆధారముగా చేసుకొని జరుగుచుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహనక్షత్రాదుల గతులు యీ రకముగా జరిగి తీరవలసినదే! ఇది అనుల్లంఘనీయమైన శాసనము. అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్ర్యము వాటికి యీయబడలేదు. సర్వవ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టియందలి ప్రాణులయందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళము చేయుచుండును. కృతయుగమునందు సర్వమునూ సంకల్పమాత్రమున సిద్ధించుచుండును, త్రేతాయుగమున యగ్నయాగములు చేయుటవలన సిద్ధించుచుండును, ద్వాపరయుగమున మంత్ర, అస్త్రప్రయోగమున సిద్ధిన్చుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రములవలన సిద్ధించుచుండును. యుగధర్మములను బట్టి సరళీకరణము కావించబడినది. మానవుల శక్తియుక్తులు తగ్గుచున్నకొలదియూ సరళీకరణ విధానము నిర్ణయించబడినది.

(ఇంకా ఉంది..)